Monday, September 14, 2009

హేతువాదం.....


హేతువాదులు--16


క్రియలూ, యోగాలూ : --2  


పాణిని అనేవాడు సంస్కృత వ్యాకరణం వ్రాశాడు--దానికి చక్కని భాష్యం వ్రాశాడు పతంజలి--ఇది ప్రజల వాక్శుద్ధి కోసం.  


రోగాలకి చికిత్సల గురించి వ్రాశాడు--చరకాచార్యుడు తన చరక సం హితలో--ఇది ప్రజల ఆయుష్షు పెంచడానికి.  


శరీరం, మనస్సూ శుభ్రంగా వుంచుకోడానికి--యోగ శాస్త్ర భాష్యం వ్రాశాడు పతంజలి.  


చరకుడూ, పతంజలీ ఒకడే అని చాలామందికి తెలియదు!  


ఇక ప్రస్తుతం లో అనేక యోగా లూ, బోళ్ళుమంది యోగా 'గురూ' లూ--త్రికోణ యోగా, చతురస్ర యోగా, పంచముఖ యోగా, అష్టదళ యోగా, పిరమిడ్ యోగా--ఇలా రకరకాల షేపుల్లో అనేక యోగాలు! పాతకాలపు 'కుండలినీ యోగా' లాంటివి యెలాగూ వుండనే వున్నాయి.  


మూలాధార చక్రం నించీ, అనాహత వగైరా చక్రాలద్వారా నిద్రలేపిన కుండలినీ శక్తిని సహస్రారం దాకా చేర్చి, (కపాల) మోక్షం చెందినవాళ్ళెవరైనా వున్నారా?  


ఈ కుండలినీ యోగానికీ, గాయత్రి కీ ముడి పెట్టి, మంగేష్ లాంటివాళ్ళు యేమైనా సాధించారా?  


ఇక ధ్యానం, జపం, తపం ఇలాంటివి కూడా వున్నాయి.  


'ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస' అని చక్కగా నిర్వచించాడో మహానుభావుడు. నిజం. (దీన్నే పూర్వం ప్రాణాయామం అనేవారనుకుంటా!) నిపుణులే చెప్పాలి.  


వీళ్ళు చెప్పేది 'పూర్తిగా శ్వాశ తీసుకొని, కుంభించగలిగినంతసేపు బిగబట్టి, తీసుకోడానికి పట్టిన సమయానికి రెట్టింపు సమయం లో తిరిగి బయటికి వదలాలి' అని. ఇది కేవలం శ్వాసని క్రమబధ్ధీకరించడానికే! మన బుర్రలో తిరుగుతున్న ఆలోచనలని బట్టి శ్వాస క్రియ 'ఇర్రెగ్యులర్' గా వుంటుంది. నిద్రపోవడానికి ముందు ఇలా చేస్తే, శ్వాస క్రమబధ్ధీకరింపడి, చక్కగా నిద్ర పడుతుంది.  


ఆలా అని పిల్లికీ, బిచ్చానికీ ఒకే మంత్రం కాదు.  


ఇప్పుడు 'ఫిజియో థెరపిస్టు 'లు 'ఒకేసారి వేగంగా వూపిరి తీసుకోండి--తీసుకోడానికి పట్టిన సమయం లో సగం సమయం లోనే, నోటి ద్వారా వదలండి' అని చెపుతారు--ఆపరేషన్లు చేయించుకున్నవాళ్ళకి!  


అలా చెయ్యడంవల్ల, ఛాతీలో (వూపిరితిత్తుల్లో) ఇన్ ఫెక్షన్లు రావు! మరి ఇదేమి యోగం? ధ్యానం? ఈ 


యోగాలూ, ధ్యానాలూ--వీటి ప్రచారం--  


ఇవన్నీ యెందుకు?

Sunday, September 13, 2009

హేతువాదం.....


హేతువాదులు--15


క్రియలూ, యోగాలూ : --  


శరీరాన్ని మనసునీ మలినాలనించి దూరం గా వుంచుకోడానికి, మన పూర్వీకులు కొన్ని క్రియలూ, యోగాలూ ప్రవేశపెట్టారు.  


క్రియల్లో ముఖ్యమైనవై--జలనేతి, వస్త్రధౌతి. (ఇంకా కొన్ని క్రియలు వున్నాయేమో--నాకు గుర్తు లేదు)  


జలనేతితో మన ముఖ భాగం--నాసిక, శ్వాశనాళం పుర్రెలో ఖాళీగా గాలి నిండి వుండే భాగాలూ (సైనసెస్ వంటివి) శుభ్రం గా వుండడానికి ప్రవేశపెట్టబడింది.  


ఈ క్రియలో, ఒక కొమ్ముచెంబులో నీరు నింపి, వూపిరి బిగబట్టి, ఒక నాసికా రంధ్రం లో ఆ నీటిని పోస్తూ, వూపిరి వదులుతూ రెండో నాసికా రంధ్రం లోంచి బయటికి వెళ్ళేలా చేస్తారు.  


ఇది బాగా సాధన చెయ్యాలి--నీరు పూర్తిగా బయటికిపోకుండా ఒక్కచిన్న చుక్క మిగిలినా, మనం వూపిరి తీసినప్పుడు నేరుగా శ్వాసనాళానికి అడ్డుపడే, వూపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదాలు వున్నాయి.  


ఇప్పుడు ఓ యాభైమందో, వందమందో ఒక మీటింగుకో, శిక్షణకో, సెమినార్లకో వచ్చేచోట, నిర్వాహకుల్ని పట్టుకొని, ఒక వుపన్యాసం యేర్పాటు చేయించుకొని, పదిరూపాయలు కూడా చెయ్యని ప్లాస్టిక్ కొమ్ము చెంబుల్ని పాతికా, ముఫ్ఫై రూపాయలకి అమ్ముకుంటున్నారు కొంతమంది యోగా 'గురూ' లు. (పాపం కొంతమంది అన్నట్టు భుక్తి కోసమే!)  


ఇక వస్త్ర ధౌతి అంటే, ఓ రెండంగుళాలు వెడల్పు, పదో పదిహేనో అడుగుల పొడవూ వున్న శుభ్రమైన గుడ్డ పీలికని, ఒక చివర నోటిలో పెట్టుకొని, క్రమంగా మింగుతూ, మొదటి కొస కడుపులోకి వెళ్ళేవరకూ, అక్కడ మూటలా అయ్యేవరకూ మింగుతారు. రెండో చివర నోటి చివర జాగ్రత్తగా పట్టుకొని, నీళ్ళు తాగి, కడుపుని క్రమపధ్ధతిలో కదపడం ద్వారా, జీర్ణాశయాన్నీ, వీలైతే ప్రేవులనీ శుభ్రం చేస్తారు--తరవాత జాగ్రత్తగా ఆ గుడ్డ పీలికని బయటికి లాగేసి, పడేస్తారు!  


'వీటివల్ల నాకు మంచి జరిగింది ' అని ఇంతవరకూ చెప్పినవాళ్ళు లేరు. పోనీ యెవరైనా వీటివల్ల నాకు యెప్పుడూ జలుబు చెయ్యలేదు, నాకు కడుపు నెప్పి రాలేదు అన్నారా అంటే అదీ లేదు!  


నాకు తెలిసిన ఒకాయన స్కూళ్ళలోనూ, కాలేజీల్లోనూ ఈ క్రియల్ని ప్రదర్శిస్తూ వుండేవాడు--ఓ పెద్దాయనెవరో వీటి గురించి వుపన్యాసం దంచాక!  


చాలా రిథమిక్ గా రకరకాల ఆకారాల్లో కడుపుని కదిపేవాడు--సంగీతానికి అనుగుణం గా. ఆహా! మనం కూడా రేపణ్ణించి అలా నేర్చుకొంటే బాగుండును అనిపించేది చూసేవాళ్ళకి!  


ఆయన పాపం యేదో 'ఉదర సంబంధ వ్యాధి ' (అల్సరో, కేన్సరో) తో మరణించాడన్నారు--తరవాత కొన్నేళ్ళకి.  


ఇవన్నీ యెందుకు?



Wednesday, September 9, 2009

హేతువాదం......


హేతువాదులు--14


ఆచారాలు, సాంప్రదాయాలు : --  


యెప్పటినుంచో ప్రాచీన వైష్ణవాలయాల్లో దేవుడికి అష్టోత్తర పూజా, సహస్ర నామార్చనా జరిపించడం ఆచారం.  


మొన్న వినాయక చవితి నాడు, కాణిపాకం వినాయకాలయం లో జరుగుతున్న పూజని తి తి దే భక్తి చానెల్ వారు ప్రత్యక్ష ప్రసారం చేశారు. 


మంత్రాలు చదువుతున్నవాళ్ళు చదువుతూండగా, పాపం పూజ జరుపుతున్న బ్రాహ్మడు అష్ట కష్టాలూ పడ్డాడు!  


మొదట కూర్చొని, పసుపు వినాయకునికి పూజ చేశాడు. బాగానే వుంది. ఇక పెద్ద విగ్రహం ముందు నించొని, వ్రతకల్పం ప్రకారం పూజ మొదలు పెట్టాడు. 


షోడశోపచార పూజా, సర్వాంగార్చనా, గరిక పూజా--ఇలా సుమారు ఓ గంట గడిచింది.  


తరవాత, మంత్రాలు చదివే ఆయన 'యేక వింశతి పూజా' అని, ఓ లావాటి పెద్ద సైజు పుస్తకాన్ని--కొత్తగా ప్రింట్ అయినట్టు తళతళా మెరుస్తోంది--తెరిచి, నామాలు చదవడం మొదలు పెట్టాడు! వాటిలో చాలా మటుకు పది పదిహేను పదాల సమాసాలే!  


యేక వింశతి అంటే, 21 అనుకుంటా--పంచ వింశతి అంటే 25 కదా! మరి ఆ నామాలు 21 వందలో, 21 వేలో తెలియదు--యెంతకీ తరగవు! అసలు ఆయన ప్రతీ నామానికీ ముందు ఒకటీ, వెనుక ఒకటీ 'ఓం' లు చేర్చి చదువుతున్నాడు--'ఓం వక్రతుండాయ నమహ్ ఓం' 'ఓం శూర్పకర్ణాయ నమహ్ ఓం'--ఇలా!  


అన్నినామాలూ అవుతుండగా, పూజ చేసే బ్రాహ్మడు పాపం అలాగే నిలబడి, తనకి పక్కనించి అందించేవాళ్ళు ఇస్తున్న పుష్పాలూ, పత్రీ, గరికా, అన్నీ ఒక్కొక్కటీ అవగొడుతూ చాలా కష్టపడ్డాడు.  


ఈ లోపల అక్కడి మహిళా యెమ్మెల్యేనో, మంత్రో భర్తా, పరివారం సహితంగా ప్రవేశించేశారు! మంత్రాలు చదువుతున్నాయన ఒక్కడే కూర్చుని చదువుతున్నాడు--మైక్ అంతయెత్తే వుంది కాబట్టి కావచ్చు! మిగిలినవాళ్ళు యధేచ్చగా విగ్రహం ముందునించీ, ఆ ప్రాంతమంతా కలయతిరుగుతూండగా, పాపం విడియో తీసేవాడు మేఘాలనీ, ధ్వజ స్థంభాన్నీ చూపించాడు!  


తరవాత మెమెంటోలూ, ప్రసాదం సంచీలూ పంచిపెట్టడం బలవంతంగా వీడియో వాడి చేత కవరు చేయించారు--వాళ్ళ తైనాతీలు!  


అంతసేపూ, ఆయన నామాలు చదువుతూనే వున్నాడు, ఈయన పూజ చేస్తూనే వున్నాడు! నాకు విసుగొచ్చి టివీ కట్టేశాను!  


ఇక కొత్తగా, లక్ష కుంకుమ పూజలూ, లక్ష గరిక పూజలూ--ఇవేమిటో! లక్ష అనేది సంఖ్యా వాచకం కదా? లక్ష పత్రి అంతే, లెఖ్ఖపెట్టి లక్ష ఆకుల్ని పూజ చెయ్యచ్చు, లక్ష వత్తులంటే, లెఖ్ఖపెట్టి లక్ష వత్తుల్నీ వెలిగించవచ్చు--మరి లక్ష 'కుంకుమనీ, లక్ష 'గరికనీ యెలా లెఖ్ఖిస్తారు?  


పూర్వం ఆడవాళ్ళలో పెద్దవాళ్ళు స్వయంగా తమ తీరిక సమయాల్లో 'లక్ష వత్తులూ' చేసుకొని, లక్ష సంఖ్య పూర్తి అవగానే, నోము నోచుకొనేవారు! (ఇప్పుడు ఫలానారోజు లక్షవత్తుల నోము చేసుకుంటున్నాం--మీరందరూ వీలైనన్ని వొత్తులు చేసి తీసుకురండి--అంటున్నారు!)  


నిన్ననే ఒకాయన వచ్చేనెలలో ఫలానా తేదీల మధ్య 'శతకోటి మహలక్ష్మీ యాగం' చేస్తాం--అందరూ పాల్గొని, తిలకించి, తరించాలన్నాడు!  


మరి ఇదేమి యాగమో? శతకోటి దేనికి సూచకమో?  


ఇవన్నీ యెందుకు?



Tuesday, September 8, 2009

హేతువాదం…..


హేతువాదులు--13


ప్రదక్షిణలు : --  


ఈనాడు దినపత్రికలో శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారన్నట్టు, దేవుడికి నైవేద్యం తరవాత, చివరగా ఆచరించేవి--ప్రదక్షిణం, నమస్కారం.  


మరి గుళ్ళోకి ప్రవేశించగానే, ధ్వజ స్థంభం దగ్గర మొదలుపెట్టి, గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి, ఒక్కో ప్రదక్షిణా అవగానే, తల ధ్వజస్థంభ పీఠానికి ఆనించి, అప్పుడు మంటపం లో ప్రవేశించి, గంట మోగించి, అప్పుడు దేవుడి దర్శనం చేసుకొని, అర్చించడం యెవరు ప్రవేశపెట్టారు?  


సాధారణం గా గుడిని నలుచదరం గా నిర్మించి, పైకప్పుని నలుచదరపు శంఖాకారం లో (శంకువు) నిర్మించి, గుడి మధ్యలో మూల విరాట్ ని ప్రతిష్ఠిస్తారు. ఒకవేళ 'స్వయంభువే' అయితే, మూలవిరాట్ చుట్టూ సమాన దూరం లో నలుచదరం గా గోడలు కట్టి, పైన కప్పుని శంఖాకారం లో కడతారు.  


శివాలయాల్లో తప్ప, వైష్ణవాలయాల్లో గర్భగుడి ప్రవేశం భక్తులకి నిషిధ్ధం. అంతేకాదు స్వామివారి ముందు ప్రమిదల్లో ఆముదం దీపాలుతప్ప మిగతా వెలుగులు నిషిధ్ధం.  


అయినా, గుడి ప్రవేశద్వారం కాక మిగిలిన మూడుపక్కలా చిన్న చిన్న రంధ్రాలు పెట్టేవారు--యెంతో కొంత వెలుగు స్వామివారిని చేరాలని--అంతేకానీ ప్రదక్షిణలు చేసేవారు తొంగిచూడడానికి కాదు!  


ఇక శివాలయాల్లో దర్శనమో అభిషేకమో అయ్యాక, బయటికి వస్తూ, నంది కొమ్ముల మధ్యనించి లింగదర్శనం చేస్తే పునర్జన్మ వుండదు అని ఓ నమ్మకం! (శ్రీశైలం లో క్రింద వున్న నంది కొమ్ముల మధ్య నించి శిఖరం చూడగలిగితే, పునర్జన్మ వుండదు--అంటారు.)  


మరి, ప్రదక్షిణాలు పూర్తి చెయ్యగానే, నంది ముఖమ్మీద కుంకం, పృష్ట భాగం మీద అరటిపళ్ళూ మెత్తేసి, స్థూల శరీరాలతో కూర్చొనో, పడుకొనో కొమ్ముల మధ్యనించి లింగాన్ని దర్శించడానికి అపసోపాలు పడడం యెవరు నేర్పించారు?  


మరిప్పుడు, ఆంజనేయస్వామి గుళ్ళోకి గానీ, సాయిబాబా గుళ్ళోకిగానీ ప్రవేశించగానే, ఒకటి నించి నూట యెనిమిది అంకెలు ముద్రించి వున్న చీటీ చేతికిచ్చి, గుడిలోపల విగ్రహం చుట్టు ఒక్కో ప్రదక్షిణా అయిపోగానే, ఒక్కొక్క అంకే కొట్టేసుకొని, మరిచిపోకుండా 108 ప్రదక్షిణాలు పూర్తిచేస్తే, ఆంజనేయస్వామి గుడి అయితే వెంటనే పెళ్ళి అవుతుందనీ, సాయిబాబా అయితే, మంచి మొగుడొస్తాడనీ, ఆడపిల్లలకి చెపుతున్నవారెవరు?  


ఇవన్నీ యెందుకు?



Sunday, September 6, 2009

హేతువాదం…..


హేతువాదులు-12


మంచిరోజులు : --  


ఈనాడు వార్తా పత్రిక 06-09-2009 నాలుగో పేజీ మధ్యలో, సంపాదకీయం పక్కన 'చైతన్య ' 'ప్రతిరోజూ ప్రశస్తమే' శీర్షిక క్రింద వ్రాసిన బిట్ చదవండి.  


ఇక వేరే చెప్పక్కర్లేదు నేను!

Friday, September 4, 2009

హేతువాదం…..


హేతువాదులు-11


కళ్యాణాలు : --  


కళ్యాణ చక్రవర్తి అని పేరున్న శ్రీ వేఙ్కటేశ్వరుడు--నిత్య పెళ్ళికొడుకు--ప్రతిరోజూ కళ్యాణాలు జరుగుతూనే వుంటాయి--కళ్యాణం జరిపించినవారికి మంచి జరుగుతుందని ఓ నమ్మకం!  


ఇక శ్రీ రాముడికి ప్రతీ శ్రీరామనవమకీ కళ్యాణం జరిపిస్తారు. అన్నవరం సత్యదేవుడికీ, సిం హాద్రి అప్పన్నకీ, ఇలా వైష్ణవాలయాలన్నింటిలో శ్రీవారికి ఆయా ముహూర్తాలకి కళ్యాణాలు జరుగుతూంటాయి.  


ఇక ఇప్పుడు శివుడికీ, గణపతికీ, ఆంజనేయుడికీ, గరుత్మంతుడికీ కూడా కళ్యాణాలు జరిపిస్తున్నారనుకోండి.  


మా చిన్నప్పటి నించీ, భద్రాద్రిలో శ్రీరాముడికి ప్రతీ యేటా జరిగే కళ్యాణాన్ని--అప్పట్లో టీవీలు లేవుకాబట్టి రేడియో లో ప్రసారమయ్యే, మహామహులు చేసే ప్రత్యక్ష వ్యాఖ్యానాలని వినడం, టీవీలు వచ్చాక, చూడడం యే సంవత్సరం మానలేదు!  


సీతమ్మవారికి స్వామి మంగళసూత్ర ధారణ చేసే సమయం లో మామూలుగానే 'మాంగల్యం తంతునానేన, మమ జీవన హేతునాం, కంఠే బధ్నామి, సుభగే--త్వంజీవ శరదాం శతం!' అనే చదివేవారు!  


తరవాత్తరవాత '..............శరదశ్శతం!' అని మారిపోయింది--దానికీ దీనికీ తేడా వుందో లేదో నాకు తెలియదు.  


ఇంక యెప్పుడు ప్రవేశపెట్టారో '........లోక కళ్యాణ హేతవే' అని మార్చారు--మమ జీవన హేతునాం స్థానం లో!  


ఇంకా తరవాత, నేను చూసిన ఆఖరి ప్రత్యక్ష ప్రసారం లో, '.........త్రైలోక్యం మంగళం కురు ' అని మార్చారు--త్వంజీవ శరదాం శతం కు బదులుగా! అలా చదివి, పక్కనున్న అర్చక స్వామి వంక చూసేసరికి, ఆయనకూడా, 'అవును--త్రైలోక్యం మంగళం కురు '. అన్నాడు.  


ఇక టీవీలు వచ్చాక, తలంబ్రాలు అయ్యాక, ఇద్దరు అర్చక స్వాములు ఓ కొబ్బరి కాయ తీసుకొని, వేదిక మీద యెదురుబదురుగా కూర్చొని, ఒకళ్ళవేపు ఒకళ్ళు దాన్ని దొర్లిస్తూండడం, దానికి వ్యాఖ్యాతలు 'స్వామివారూ, అమ్మవారూ బంతులాట ఆడుతున్నారు--తిలకించండి ' అని చెపుతున్నారు!  


గత కొన్నేళ్ళుగా ఇవన్నీ చూడడం మానేశాను! (వాటిని ఆపలేం కదా మరి?)  


ఇవన్నీ యెందుకు? జనం లో మూర్ఖత్వాన్ని పెంచడానికా?  


మా చిన్నప్పుడు, కాస్త కలిగినవాళ్ళ ఇళ్ళల్లో పిల్లల పుట్టిన రోజులకి కొత్తబట్టలు వేసుకొని, పెద్దవాళ్ళకి నమస్కరించి, ఫోటో స్టూడియోలకి పరిగెత్తేవారు!  


ఇప్పుడు మన సినిమాలు--హీరోయిన్ హీరోతో ప్రేమలో పడడానికి వీలుగా--'పుట్టినరోజు కదా, అలా గుడికి వెళ్ళిరామ్మా' అని ఆమె తల్లి డైలాగు! ఇది అందరికీ నేర్పించింది--పుట్టినరోజు గుడికి వెళ్ళడం!  


గ్రహణాలు వచ్చినప్పుడు, ఆలయాలని మూసెయ్యడం--హేతువాద సంఘాలవాళ్ళు--దేవాలయాలన్నీ తెరిచి వుంచండి, యేమీ కాదు అనడం!  


అసలు గ్రహణాలు 'రాహు కేతువుల ' వల్ల యేర్పడతాయని నమ్మితే, వాటిని 'అమృతం తాగుతున్న ' రాక్షసుణ్ణి మెడ నరికి గ్రహాలుగా యేర్పాటు చేసింది శ్రీ మహావిష్ణువేకదా? ఇక వాడికి వాళ్ళంటే భయం యెందుకు?  


సూర్య కిరణాలు నేరుగా మూలబేరం దగ్గరకి చేరే అవకాశం వున్న ఆలయాలని ఆ సమయం లో మూసేసి, గ్రహణం విడిచాక--సంప్రోక్షణ చేసి, మళ్ళీ దర్శనానికి అనుమతిస్తారు! యెందుకంటే, గ్రహణ సమయం లో కొన్ని జీవ, రసాయన క్రియల్లో మార్పులు చోటు చేసుకుంటాయి--వాటివల్ల భక్తులకి చెడు జరగకుండా ఈ ఆచారం ప్రవేశపెట్టారు!  


ఇక గ్రహణం విడవగానే, కొబ్బరికాయలు పట్టుకెళ్ళి--లైన్లో మూసివున్న గుడి తలుపులముందు గబగబా పగులకొట్టడం కూడా యెక్కువైపోయింది ఈ మధ్య--ఇదెవరు ప్రవేశపెట్టారో!  


ఇక గుడిముందునించి సైకిలుమీదో, మోటర్ సైకిలుమీదో వెళుతూ, చేతిని గుండెలమీదో, పొట్టమీదో వేసుకొని, గుడివంకే చూస్తూ--ప్రమాదాలని కొని తెచ్చుకుంటున్నారు. ఇంకొంతమంది, రోడ్డుమీదే చెప్పులు విడిచేసి, అదేదో సినిమాలో బ్రహ్మానందం లా చప్పట్లు చరుస్తూ, అరచేతులు ముద్దులు పెట్టుకుంటూ మళ్ళీ వాటిని కళ్ళకి తాకించుకుంటూ, రకరకాల భంగిమల్లో భక్తిని అనుభవిస్తున్నారు!  


ఒక్కసారి ఆలోచించండి--ఇవన్నీ అవసరమా? యెందుకు?