Friday, October 30, 2009

పూజలు


పుష్పాలు


.....అవే 'మన్మధ బాణాలు'! 


'చూత, కేతకీ........' మొదలైన పుష్పాలని యే పుష్ప బాణాన్ని యే సందర్భం లో యెవరి మీద మన్మధుడు ప్రయోగిస్తాడో కూడా మన కవులు వ్రాశారు. ఈ పువ్వులనే స్త్రీలు తమ సిగలో తురుముకుంటారు! మరందుకే గదా వాటిని మన్మధ బాణాలన్నది!


ఈ పుష్పాలు కాకుండా దేవుని పూజలకి కొన్ని ప్రత్యేకించారు--ఆయా దేవుళ్ళ ప్రీతి ప్రకారం. వీటిని స్త్రీలు సిగల్లో తురుముకోరు! అవన్నీ మన దృష్టిలో సువాసనలేని పూలు. కామవికారాలు కలిగించని పూలు. దేవుళ్ళని పూజించడం లో మన వుద్దేశ్యం వాళ్ళకి కామవికారాలు కలిగించాలని కాదు కదా? అవన్నీ అనవసరం, నేను ఆ సువాసన పూలే పూజ చేస్తాను అని యెవరైనా అంటే, వాళ్ళకో నమస్కారం!  


విచిత్రమేమిటంటే, ఇప్పుడు 'మన్మధ బాణాలతో' దేవుళ్ళని అలంకరిస్తున్నారు--పుష్ప యాగాలు చేసేస్తున్నారు!  


పండగ వచ్చినా, కార్తీకం లాంటి కొన్ని ప్రత్యేక మాసాల్లోనూ, స్త్రీలు అలంకరించుకునే మల్లెలూ, కనకాంబరాలూ, చామంతులూ, రోజాలూ మొదలైన వాటి ధర ఆకాశం పైకి యెక్కి కూర్చొంటోంది! కారణం--జనాలు వేలం వెర్రిగా కొన్నైనా ఈ పూలు కొని, దేవుళ్ళ నెత్తిమీద పోస్తుండడం! వీళ్ళ పుణ్యం సంగతి దేవుడెరుగు--వ్యాపారులు బాగుపడ్డానికి దోహదం చేస్తోంది ఇది!  


నిజంగా పసుపు గన్నేరు, తెల్ల గన్నేరు, బిళ్ళ గన్నేరు, నాగ మల్లి, మందార, మంకెన, కరవీర, జిల్లేడు లాంటి పువ్వుల్నెవరూ అమ్మడం లేదు--యెవరూ కొనడం లేదు--దేవుళ్ళకి అర్పించడం లేదు! గుళ్ళలో పూజారులు మాత్రం, ఉదయాన్నే స్వాములకీ, అమ్మవార్లకీ వీటితోనే అర్చన ప్రారంభిస్తారు!  


పసుపు గన్నేరు--విష్ణువుకీ, తెల్ల గన్నేరు, బిళ్ళ గన్నేరు అమ్మవార్లకీ, నాగ మల్లి, మందార, మంకెన, కరవీరాలు శివుడికీ, జిల్లేడు గణపతికీ ప్రీతికరమైనవి. ఇక కలవలూ, తామరలూ చెప్పక్కర్లేదు.  


ఒక్క మొగలి పువ్వుకి దేవుళ్ళని పూజించే అర్హత లేదు--బ్రహ్మతరఫున అబధ్ధ సాక్ష్యం చెప్పినందుకు!  


ఇంకా, పొగడ పువ్వుకొక్కదానికే, నేల రాలినా, దేవుడి మస్తకం చేరే అర్హత వుందంటారు! మిగిలిన యే పువ్వుకీ లేదు. (ఇదెందుకో నాకు తెలీదు--తెలిసినవాళ్ళెవరైనా చెపితే సంతోషం.)  


మరి ఈ పుష్ప యాగాలూ, జనాలు నష్టపోవడం, వ్యాపారులు బాగు పడడం, ఇవన్నీ యెందుకు?

Monday, October 26, 2009

పాదాభివందనాలు!



స్వామీజీలకి.....


21-10-2009--రాష్ట్ర అత్యున్నత పోలీసు అధికారి, డీ జీ పీ శ్రీ గిరీష్ కుమార్--ప్రకాశం జిల్లాలో చేవూరు వద్ద అయిదోనెంబరు జాతీయ రహదారిపై వున్న స్వామీజీ రామదూత పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశారట!  


ఆయన తన చొక్కా వూడిపోతూండగా, మోకాళ్ళునేలకాంచి, ఆ స్వామీజీ పాదాలపై చేతులూ, తలా ఆనించిన ఫోటో పత్రికల్లో ప్రచురించబడింది!  


ఆ స్వామితోపాటు, అభిషేక పూజల్లో ఇంకా కొంతమంది కూడా పాల్గొన్నారట! వాళ్ళందరికీ యేవో కారణాలుండవచ్చు--కానీ ఈ డీ జీ పీ కేం ఖర్మ రా బాబూ అనీ, అసలు ఈ రామదూత స్వామి యెవడూ? అనుకున్నాను!  


ఆ మర్నాడు పేపర్లో, ఆ స్వామీజీ బండారం బయటపెట్టబడింది--కొంతమందిచే!  


చేవూరులో రామదాసు అనే వ్యక్తి 'రామదూత స్వామి ' గా అవతరించి, సర్వే నెంబరు 883 లోని అటవీ భూమినీ, సర్వే నెంబరు 879 లోని చెరువు పోరంబోకు భూమినీ--దాదాపు 20 యెకరాలు ఆక్రమించి ఆశ్రమం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారట.  


గతం లో ఆ ప్రాంతం లో భిక్షాటన చేసుకునే వ్యక్తి ఈ రోజు దొంగస్వామిగా మారి, ఏ సీ కార్లలో విహరిస్తున్నాడట.  


14-7-2002న అప్పటి అటవీశాఖ మంత్రి ఆయ్యన్న పాత్రుడు ఈ దొంగ స్వామి భూ ఆక్రమణదారుడే అని ప్రకటించారట!  


8-7-2004న రాష్ట్ర అసెంబ్లీలో అప్పటి చిన్న నీటిపారుదల శాఖ మంత్రి చంద్రశేఖర్ దొంగస్వామి భూఆక్రమణ నిజమేనని ప్రకటించారట.  


భూమి తిరిగి స్వాధీనం చేసుకోనందుకు అప్పటి జిల్లా ఇన్ చార్జ్ మంత్రి డి శ్రీనివాస్ అధికారులపై మండిపడ్డారట కూడా!  


వీటన్నిటికీ దోహదం చేసిన అయ్యేయస్, ఐపీయస్ అధికారులెవరో, రాజకీయ నాయకులెవరో, పారిశ్రామికవేత్తలెవరో, ఈ డీజీపీకి ఆయనమీద అంతభక్తి వుండడమెందుకో, దాన్ని ఆయన అలా సిగ్గువిడివి ప్రదర్శించడమెందుకో--యెవరైనా అడిగారా!  


యెన్ని హేతువాద సంఘాలైనా, ఓపీడీఆర్లైనా, కమ్యూనిష్టులైనా--బుద్ధున్నవాళ్ళెవరైనా--ఈ మూర్ఖుల్నీ, వాళ్ళ మూర్ఖత్వాన్నీ పొగొట్టగలరని ఆశించగలమా?

Saturday, October 3, 2009

చతుష్షష్ఠి లో.......


భావ వ్యక్తీకరణ కళ


మనిషికే ప్రత్యేకం--మాటలద్వారా, వ్రాతలద్వారా భావ వ్యక్తీకరణ చెయ్యడం!  


వ్యక్తీకరణ సరే--మరి అది యెదుటి వారికి సరిగ్గా అర్థం అవుతుందని హామీ యెక్కడుంది?  


సామాన్యం గా అది వినేవాళ్ళ, చదివే వాళ్ళ 'మానసిక స్థితి' (మూడ్) మీద ఆధారపడి వుంటుంది!  


అలా యెదుటివారికి సరిగ్గా అర్థం అయ్యేలా (మనం యే వుద్దేశ్యంతో మాట్లాడామో అది) చెప్పటాన్ని ఇంగ్లీషులో 'ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్' అంటారు.  


నిత్యమూ ప్రజానీకం తో సంపర్కం కలిగి వుండే వుద్యోగాల్లో వున్నవాళ్ళకి ఆయా సంస్థలు వీలైనంత తరచుగా శిక్షణ యేర్పాటు చేస్తాయి. అలాంటి శిక్షణ తరగతుల్లో, కొంతమంది నిపుణులు వచ్చి వీళ్ళకి వుపన్యాసాలిచ్చి, వాళ్ళు సరైన దృక్పథం కలిగి వుండేలా ప్రయత్నిస్తారు.  


నిజంగా వాళ్ళు చెప్పేవన్నీ సామాన్యం గా ప్రతీరోజు మనం చూసేవే, వినేవే--కానీ వాటిని కొత్తకోణంలో ఆవిష్కరిస్తారు--దాంతో సరైన ఫలితాలు సాధిస్తారు!  


అలాంటి వొకాయన చెప్పిన ఈ కథ--మీకోసం!  


కురుక్షేత్ర యుధ్ధం లో దుర్యోధనుడు కూడా మరణించాక, యుధ్ధభూమిలో స్త్రీల ఆర్తనాదాలు విని అశ్వథ్థామ 'నేను అపాండవం చేస్తాను' అని ప్రతిఙ్ఞ పట్టి, ఓ పొడవాటి కరవాలాన్ని చేబూని, రౌద్రంగా బయలుదేరాడట!  


ఈ లోగా, శ్రీ కృష్ణుడు పాండవుల్ని భూమిలో వాళ్ళకి సరిపడా గొయ్యి తవ్వించి, దాన్ని రాతి పలకతో పూడ్చే యేర్పాటు చేసి, దూర్వాస మహర్షి దగ్గరికి వెళ్ళి, 'మహర్షీ! పాండవులకి మీ సాయం కావాలి' అని అర్థించాడట.  


కృష్ణుడి ఠస్సాలు వూహించిన దూర్వాసుడు, 'నువ్వేమి చెప్పినా చేస్తాను కానీ--అబధ్ధం మాత్రం చెప్పను' అన్నాడట.  


దానికి కృష్ణుడు 'యెంతమాట! మీరు నిజమే--నిజం మాత్రమే చెప్పండి చాలు!' అని చెప్పి, ఆయన్ని తీసుకొచ్చి, పాండవులందర్నీ గోతిలో కూర్చోపెట్టి, రాతి పలక మూసేసి, దానిమీద దూర్వాసుణ్ణి కూర్చోపెట్టాడట.  


అంతలోనే రానే వచ్చాడు అశ్వథ్థామ! వచ్చి, 'మహర్షీ! పాండవుల జాడయేమైనా తెలుసునా?' అని ప్రశ్నించాడట!  


దానికి మహర్షి సహజ లక్షణంగా 'పాండవులా! నా ముడ్డి క్రిందున్నారు! చూసుకో!' అన్నాడట!  


పాపం అశ్వథ్థామ, ఇంకా యేమడిగితే ఆయనకి కోపం యెక్కువై యేమి శపిస్తాడో అని భయపడి, వెనుతిరిగి వెళ్ళిపోయాడట!  


ఇలా అడిగేవాడిబట్టీ, చెప్పేవాడి బట్టీ, వాళ్ళ 'మూడ్స్' బట్టీ, నిజాలు అబధ్ధాలుగా, అబధ్ధాలు నిజాలుగా అర్థం అవ్వచ్చు! అదీ 'భావ వ్యక్తీకరణ కళ' అంటే!  


ముఖ్యంగా బ్లాగులు వ్రాసేవాళ్ళకీ, చదివేవాళ్ళకీ ఇది ముఖ్యం అనుకుంటాను నేను!  


మీరేమంటారు?