Friday, December 31, 2010

కాంగీ పార్టీ

కొన్ని పచ్చి నిజాలు......కొన్ని.......లు

"కాంగ్రెస్" పార్టీ 125 యేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా, "కాంగ్రెస్....భారత జాతి నిర్మాణం" పేరిట ఓ పుస్తకాన్ని మొన్నటి ప్లీనరీలో ఆవిష్కరించారట.

దాంట్లోని కొన్ని పచ్చి నిజాలూ, కొన్ని అవాకులూ చెవాకులూ ఇలా వున్నాయిట.

ప.ని.లు:

1. అత్యయిక పరిస్థితి రోజుల్లో, ఇందిరాగాంధీ వద్ద ప్రభుత్వపరంగా, పార్టీపరంగా అపరిమిత అధికారాలు కేంద్రీకృతమయ్యాయి.

సాధారణ రాజకీయ ప్రక్రియలు, ప్రాథమిక హక్కులు రద్దయ్యాయి. పత్రికలపై నిర్బంధాలు విధించారు. న్యాయ వ్యవస్థ అధికారాలు తగ్గించారు.

2. ఆ సమయంలో సంజయ్ గాంధీ పలు ప్రభుత్వ విధానాల్ని నిర్హేతుకంగా, నిరంకుశంగా అమలు చేశారు.

ఆయన గొప్ప గుర్తింపుతో నేతగా యెదిగారు. ఆయన మద్దతుతోనే ప్రభుత్వం కుటుంబ నియంత్రణ కార్యక్రమాలని తీవ్రస్థాయిలో చేపట్టాలని నిర్ణయించింది.

ఆయన మురికివాడల తొలగింపు, వరకట్న వ్యతిరేకత, అక్షరాస్యత పెంపునకు కృషి చేశారు. కానీ నిర్హేతుక, నిరంకుశ విధానాలవల్ల వాటిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. 

3. రాజీవ్ గాంధీ....ప్రభుత్వంలో, పార్టీలో తన బృందాన్ని తరచూ మార్చేసేవారు, పార్టీలో సంస్థాగత సంస్కరణల విషయంలో విఫలమయ్యారు.

4. పీ వీ నరసిం హారావు, ప్రథానమంత్రి పదవిలో అయిదేళ్లు పూర్తి చేసుకున్న తొలి 'నెహ్రూ-గాంధీ కుటుంబేతర' వ్యక్తి. రాజీవ్ గాంధీ పార్టీనేతగా వున్నప్పుడు మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆర్థిక సంస్కరణల ప్రక్రియను కొనసాగించిన పీవీ ప్రభుత్వం 'విజయవంతమైంది'.  

5. భరత సహజ శత్రువైన పాకిస్థాన్ అమెరికా స్నేహంతో బలోపేతమయింది.

6. ఆర్థిక దిగ్గజంగా యెదిగిన చైనా ప్రస్తుతం వ్యూహాత్మకంగా, ఆర్థిక అంశాల్లో, భారత్ వైపు చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు.

7. యూపీయే-2 ప్రభుత్వానికి ధరల పెరుగుదలే ప్రథాన సమస్యగా మారింది. (ఇది ప్రణబ్ ముఖర్జీ ప్రత్యేక వ్యాఖ్యట.)

ఇంక ఇవాళ్టి ముఖ్య ఆర్థిక వార్త....ఆహార ద్రవ్యోల్బణం 14.44 శాతానికి పెరిగి, పదివారాల గరిష్ట స్థాయికి చేరిందిట--మొన్న 18వ తేదీనాటికి.

ప్రథాని అధ్యక్షతన సమావేశమైన ధరలపై యేర్పాటైన కేబినెట్ కమిటీ (సీసీపీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారట. అంతకు ముందే, ప్రణబ్ ముఖర్జీ 'కూడా' అందోళన వ్యక్తం చేశారట!

దానికి అనేక కారణాలు చెపుతున్నారు....మన "ఆశ్వయుజ, కార్తీక" లతో సహా!

అ.చె.లు:

1. (లోక్ నాయక్) జయప్రకాష్ నారాయణ్ వ్యక్తిత్వాన్ని తప్పు పట్టలేకున్నా, ఆయన సిధ్ధాంతమైన 'సంపూర్ణ విప్లవం' అస్పష్టం. ఆయన వుద్యమం 'రాజ్యాంగ విరుధ్ధం'. అప్రజాస్వామికం.

2. వుత్తరప్రదేశ్, తదితర రాష్ ట్రాల యెన్నికల్లో యువనేత రాహుల్ గాంధీ చొరవ ప్రశంసనీయం. 

3. మన్మోహన్ సింగ్ యూపీయే ప్రభుత్వానికి 'స్థిరత్వ' ఇమేజ్ కల్పించారు.

4. సోనియా ప్రథాని పదవి తృణీకరించి 'త్యాగమయి' అయ్యారు.

5. గత యెన్నికల్లో పార్టీ 29% వోట్లతో, 206 సీట్లు సాధించి, ప్రాంతీయ పార్టీల యెదుగుదలని 'కొంతవరకు' అడ్డుకుంది.

ఇక, కాంగీల పుస్తకం పై, పాయింట్లవారీగా నా వ్యాఖ్యలు మరో టపాలో.

Friday, December 17, 2010

భారద్దేశం

సెక్యులరిజం

నిన్న వైకుంఠ యేకాదశి. మహమ్మదీయుల మొహఱ్ఱం.

మా ఇంటిదగ్గర గుడిలో అర్చనలూ, పూజలూ జరుగుతున్నాయి......ప్రక్కనే రోడ్డు పై పీర్ వూరేగింపు వెళ్లింది. ఒకళ్లకొకళ్లు 'ముబారక్'లూ, శుభాకాంక్షలూ చెప్పుకోలేదు--ఆ 'అవసరాన్ని' ఫీల్ అవలేదు యెవరూ.

అదీ అసలైన 'సెక్యులరిజం' అంటే!

వీడియోలు చూడండి.



(గుడిలో వ్యాఖ్యానం చెపుతున్నది ప్రఖ్యాత 'చక్రావధానుల రెడ్డప్ప ధవేజీ')



(ఆకాశం మబ్బులు కమ్మి వుండడం వల్ల కొంచెం క్లియర్ గా రాలేదేమో....కొంచెం బ్రైట్ నెస్, కాంట్రాస్ట్ పెంచుకొని చూడండి--అవసరమైతే)

Tuesday, December 7, 2010

గుడీ-గుంపా

అవేవో యాగాలు

ద్వారకా తిరుమల లో ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకూ "త్రిషోడశ కుండాత్మక మహా సుదర్శన యాగం" నిర్వహిస్తున్నారట.

3 X 16 = 48 హోమగుండాలు సిధ్ధం అయ్యాయట. అందులో 4 ప్రధాన హోమగుండాలుంటాయట.

ప్రతీరోజూ "వైఖానస శాస్త్ర సమ్మతమైన" శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సుదర్శన 'మహామంత్రి పురశ్చరణాలూ', అద్భుత శాంతి హోమాలూ, 'మహామంత్రి హోమాలూ' నిర్వహిస్తారట.

ఇవన్నీ యేమిటో యెవరైనా చెప్పగలరా?

Friday, December 3, 2010

మూర్ఖత్వాలు.......

.......పరాకాష్టలు

చాలా వింతైన మహాఘోరమైన ఓ దరిద్రగొట్టు వార్త వచ్చింది--

01-12-2010 న, పగోజి ఏలూరు దగ్గర చాటపర్రు గ్రామం లో, "ప్రాథమిక పాఠశాల" విద్యార్థులు ఓ 90 మంది రోజూ మధ్యాహ్న భోజనం చేస్తుంటారట--సుమారు ఓ పదిహేనుమంది ఫోటోలు కూడా వేశారు--మధ్యాహ్న భోజన పథకం లో తమకి ఇన్నాళ్లూ వంటచేసి, రుచికరంగా భోజనం పెడుతున్న జి.రాణి అనే డ్వాక్రా మహిళ--వాళ్ల గ్రూపు తగాదాల కారణంగా వంటకి రాలేదని--'ప్రహరీ దూకి వెళ్లి, యెదురుగావున్న కిరాణా దుకాణం లో బ్లేడ్లని (సంగ్రహించి) వాటితో' తమ చేతులు 'రక్తాలు ఓడేలా' కోసుకొని, 'రాణి మాకు కావాలి' అంటూ కాగితాలపై వ్రేలి ముద్రలు వేశారు!

తరవాత అధికారులు వచ్చి, "మండల విద్యా కమిటీ నిర్ణయం తీసుకొనేవరకూ" వాళ్లెవరూ (రాణితోసహా) వంట చెయ్యడానికి వీల్లేదని ఆదేశించారు(ట).

ఇక్కడ ప్రశ్న, రేపు ఈ పదేళ్ల లోపు చిన్నారులు పెద్దయి, తాము ప్రేమించినవాళ్లని మేదర కత్తులతో నరకడం, లేదా చేతులు కోసుకొని ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి చెయ్యకుండా వుంటారా? అని.

వీళ్లని ఈ చర్యకి ప్రేరేపించినవాళ్లు పెద్దవాళ్లయితే, వాళ్లని ఓ బెంచీమీద పడుకోబెట్టి కట్టేసి, రెండు చేతులనీ చెరో పక్కా వ్రేళ్లాడదీసి, మణికట్లదగ్గర ధమనులని బ్లేడుతో కోసేసి, నీళ్ల బకెట్లలో వదిలెయ్యాలని శిక్ష విధించాలి.

వాళ్లు మైనర్లయితే, ప్రభుత్వం వుచితంగా మానసిక చికిత్స చేయించాలి--అవసరమైతే పిచ్చాసుపత్రుల్లో చేర్పించి!

అందరూ యెలుగెత్తండి మరి!

పగోజి గుండుగొలనులో భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం లో నూతనంగా నిర్మించిన రాజగోపురానికి 'కలశ ప్రతిష్ట' చేశారట 01-12-2010 న. 

అంతకుముందు రెండురోజులుగా, 'శైవాగమన' (అగమ సిధ్ధాంతం అని ఈనాడు వారి కవిహృదయం) పండితులు వుల్లేటికుర్తి భోగేశ్వర శర్మ ఆధ్వర్యం లో వాస్తుహోమం........వగైరా వైభవంగా జరుగుతున్నాయట.

ఇక 'శైవన' మునీంద్రుడినో, 'శైవనో' మునీంద్రుడినో పుట్టించి గుళ్లు కట్టిస్తారేమో!

నిన్న 02-12-2010 న, తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలకి, అర్చకులు 'పాంచరాత్ర' ఆగమ శాస్త్రోక్తంగా పూజలను జరిపించారట.

ఇక 'పాంచరాత్ర' మునీంద్రుడికో, 'పాంచరాత్రో' మునీంద్రుడికో కూడా గుళ్లు కట్టేస్తారేమో!

చూద్దాం!

Thursday, December 2, 2010

వీర భక్తి

ఆచరణలూ

ఈనాడు 01-12-2010 'ఇదీ సంగతి' చూశారా? ముహూర్తాలమీదో మంచి కార్టూన్!

మొన్న ప గో జి తిమ్మరాజుపాలెం (నిడదవోలు) లో కోట సత్తెమ్మ ఆలయానికి 'బోనుమద్ది రామలింగ సిధ్ధాంతి' పర్యవేక్షణలో "వైదిక సువార్త ఆగమ" ఆచారం ప్రకారం "ధ్వజ స్థంభ" ప్రతిష్ట జరిగిందట.

బహుశా 'సువార్త' మహామునో, 'సువార్తో' మహామునో యేర్పరచి వుంటాడు ఈ ఆగమాన్ని. ఇక ఆ మహామునికి కూడా విగ్రహాలూ, ఆలయాలూ తరవాయి. యెవరు మొదలెడతారో మరి.

నరసాపురం లో సత్యసాయి ఆలయం లో ఆయన 85 వ జన్మదినోత్సవానికి 85 రకాల పిండివంటలతో 'మహా నివేదనం' చేసి, కేక్ కూడా కట్ చేశారట. పేదలకి దుప్పట్లు పంపిణీ చేశారట. 85 రకాల పిండివంటలు యెవరు తిన్నారో వ్రాయలేదు.