Tuesday, December 27, 2011

జనలోక్ పాల్ పై………


ప్రభుత్వ “దొంగాటకం”

అయ్యవారిని చెయ్యబోతే, కోతి అయ్యింది అని సామెత. ఇక్కడ సందేహమల్లా, అయ్యవారిని చెయ్యబోతున్నట్టు నాటకమాడి, అసలు కోతినే చేయ్యబోయారా? అన్నది.
రాజ్యాంగ సవరణ వీగిపోవడంతో, జోక్ పాల్ కాస్తా చివరికి “కార్టూన్ పాల్” అయిపోయింది.
ఆ సవరణని నెగ్గించుకొనే సంఖ్యాబలం మీకు లేదు అని సుష్మా స్వరాజ్ చెపుతూంటే, సోనియా, మన్మోహన్, ప్రణబ్ ల ముఖాలు వెలా తెలా పోయాయట! మరి ఆ లెఖ్ఖల పండితులకి చిన్న చిన్న లెఖ్ఖలు రావనుకోవాలా? అలా అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే!
వాళ్ల వుద్దేశ్యం మొదటినుంచీ, అన్నా సవాలుని యెదుర్కొంటున్నామని జనాలని నమ్మిస్తూ, “బిల్లు ప్రవేశ పెట్టడం తో” మా కర్తవ్యం నెరవేర్చాము, అది చట్టం కాకపోతే, పార్లమెంటుది తప్పు అని చేతులు దులిపేసుకోవాలనే. అంతేగానీ, ఎంపీల వేషాలకి అడ్డుకట్ట వేసి, సమగ్రమైన, పటిష్ట జన లోక్ పాల్ ని తీసుకు వద్దామని కాదు.
రేపు రాజ్యసభలో కూడా మొత్తం బిల్లులన్నీ వీగిపోతే, “మహిళా రిజర్వేషన్” లాగే అవి కూడా ఇంకో శతాబ్దంపాటు రోకలి నానేసినట్టు వుండి పోవాలనే వాళ్ల ఆంతర్యం.
102 డిగ్రీల జ్వరంతో అన్నా దీక్ష కొనసాగిస్తున్నాడంటే, ఆయన వుక్కు సంకల్పానికి జన మద్దతు వుంది గనకే!
యెవరో నాయకుడు పార్లమెంట్ లో చెప్పినట్టు, లోక్ పాల్ ప్రసక్తి వచ్చినప్పుడల్లా, పార్లమెంట్ రద్దు అయిపోయింది గత 16 యేళ్లుగానో యెంతో!
ఈప్పుడు జరగబోయేది అదే అని చెప్పడానికి యే నోస్ట్రడామసో అఖ్ఖర్లేదు. “జనమే జవాబు చెపుతారు (కాంగీలూ, భాజపాలూ అన్నట్టు)!”
సత్యమేవజయతే.

Saturday, December 24, 2011

ప్రిజుడిస్ అనే………


……పక్షవా(పా)తం

దాదాపు ఓ దశాబ్దంగా “పిల్” లూ, “జ్యుడిషియల్ ఏక్టివిజం” లాంటి మాటలు తరచూ వినబడుతున్నాయి. మీడియాలోకూడా చర్చలు జరుగుతున్నాయి. కొంతవరకూ బాగానే వుంది.



రానురానూ, పిల్ దాఖలు అవగానే, లేదా, మీడియాలోనో యెక్కడో ఒకవిషయం రేగగానే, న్యాయమూర్తులు వాటిని, కొండొకచో, సువో మోటో గా స్వీకరించడం, తరవాత ప్రథాన న్యాయమూర్తి అనుమతి లేకుండా స్వీకరించారని వారు ఆగ్రహించడం లాంటివి కూడా జరుగుతున్నాయి.



కానీ, కొందరు న్యాయమూర్తులు, తమ “ప్రిజుడిస్” అనే జాడ్యాన్ని నిస్సిగ్గుగా ప్రదర్శిస్తున్నారు. అందుకే అన్నా జనలోక్ పాల్ పరిధిలోకి జ్యుడీషియరీని కూడా తీసుకురావాలంటున్నది.



ఇప్పుడు, “తాంబూలాలిచ్చేశాం, తన్నుకు చావండి” అన్నట్టు, ఓ జోక్ పాల్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టేశాం, ఇంక ఆ విషయంలో మహాఘనతవహించిన పార్లమెంటు సభ్యులు యే నిర్ణయం తీసుకొంటే అదే అమలు జరగాలి, ఇంకెవరైనా, యేదైనా మాట్లాడితే…..ఖబడ్దార్! అంటున్నారు.



ఆయనే వుంటే మంగలాడెందుకన్నట్టు, మన ఎంపీలు సరైనవాళ్లయితే ఈ తిప్పలన్నీ యెందుకు? ములుగర్రతో పొడుస్తేగానీ వాళ్ల మందమైన చర్మాలు స్పందించడం లేదాయే!



మహాఘనతవహించిన లల్లూ ప్రసాద్, ములాయం సింగ్ యాదవ్, వీరప్పమొయిలీ, పిచ్చిదంబరం, కపిల్సిబల్, లాంటివాళ్లు ఆ బిల్లుని గట్టెక్కకుండా తమ మోకాళ్లూ, మెదళ్లూ శాయశక్తులా వొడ్డుతున్నారు. పైగా, దానికి అష్టావకృడి రూపం ఇవ్వడానికి, సభ్యుల్లో రిజర్వేషన్లూ, అపాయింట్మెంట్ కమిటీల్లో రిజర్వేషన్లూ, మాజీ ఎంపీల మీద చర్యలూ అంటూ వూదరగొడుతున్నారు.



ఇదీ బాగానే వుంది.



కానీ, ముంబాయిలో నిరాహారదీక్ష చేపట్టడానికి అనుమతికోరితే, ఓ పదో పాతికో లక్షలు చెల్లిస్తేగానీ అనుమతి ఇవ్వం అనడమేమిటీ, దానికోసం కోర్టుకి వెళితే, ఆ న్యాయ కొక్కులు, రాజకీయ కొక్కులకి మద్దతు ఇస్తున్నట్టుగా వేళాకోళం మాటలు మాట్లాడడం యేమిటి? అనుమతి ఇస్తారా లేదా అన్నది ప్రక్కనపెట్టి (ఇంతకీ అనుమతిచ్చేది ఆ కోర్టు కాదు!), అనుమతి ఇస్తే, పార్లమెంటు హక్కులకి భంగం కాదా? చేసుకొంటే మీ ఇళ్లలో, పెరళ్లలో ఆందోళన చేసుకోండి. గాంధీగారు కూడా ఇలాంటి ఆందోళనలు చేశారో లేదో మాకు తెలియదు! అంటూ తమ పక్షవా(పా)తాన్ని (దాంతో కూడిన అజ్ఙానాన్ని) ప్రకటించుకోవడం యేమిటి?



రాజకీయ కొక్కులకి న్యాయ కొక్కులు మద్దతు ప్రకటిస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం యేమి కావాలి?


ఆలోచించండి మరి!

Monday, November 14, 2011

వుత్సవాలు.....3



......వైభవంగా

.......జరుగుతున్నాయి--రాష్ట్రమంతటా. 

మా చిన్నతనంలో, మా మేష్టార్లు చెప్పేవారు--"జాతీయ దుబారా" (నేషనల్ వేస్ట్); "నేరమయ దుబారా" (క్రిమినల్ వేస్ట్)--ల గురించి. 

పగటిపూట ఎలెక్ ట్రిక్ లైటు వెలిగించినా, యెవరూ లేనిచోట ఫాన్ తిరుగుతున్నా--అవి "అలాంటి వేస్ట్"లు అని.

మనం ప్లగ్ పాయింట్ల స్విచ్చులు కట్టేసినా, టీవీలూ వగైరా "స్టాండ్ బై"లో పెట్టినా, యెంతో కొంత కరెంటు "కాలుతుంది" అనీ, వుత్తమ విధానం ఆ ప్లగ్ పిన్స్ ని తొలగించడమేననీ శాస్త్రఙ్ఞులు చెపుతున్నారు. 

మన ఎస్పీ బాలు కూడా చెపుతున్నాడు!

మనందరం ఇంత "జాగ్రత్తగా" కరెంటు వాడుకుంటూంటే.......

అనేక "గుళ్ల"లో, "దేవాలయాల"లో, "పందిళ్ల"లో, ఇవేకాకుండా పర్యాటక స్థలాల్లో, పుట్టినరోజు, సమర్త లాంటి ప్రైవేటు ఫంక్షన్లలో--ఇలా ప్రతీ చోటా "సీరియల్ లైట్లు" దండలు దండలుగా వెలిగించడం, పేపర్లలో "వైభవంగా...." అంటూ వార్తలు రావడం (వ్రాయించుకోవడం) లాంటివి జరుగుతున్నాయి.....ప్రతీరోజూ చూస్తున్నాం.

మరి, వీటన్నింటికీ అయ్యే "కరెంటు ఖర్చు" యెవరిస్తున్నారు? యెవరిచ్చినా, అదంత అవసరమా? 

కరెంటు దీపాల్లేనిరోజుల్లో, గుళ్లెక్కడున్నాయో ప్రజలకి తెలియదా? వాళ్లు పూజలూ, వ్రతాలూ, అభిషేకాలూ చేసుకోలేదా? 

ఇదంతా యెవడబ్బ సొమ్ము?

భక్తి పేరుతో, ఆ "లైటింగు"వాళ్లు బాగుపడడానికి (వృధ్ధిరేటులో వాళ్లూ భాగమేకదా!), "జాతీయ దుబారా" కోసం, కాక ఇవేమిటి? (వాళ్లూ బ్రతకాలిగా?!).

అందుకే.......భక్తి వ్యాపారులూ జిందాబాద్!

Sunday, November 13, 2011

వుత్సవాలు.....2




......వైభవంగా

.......జరుగుతున్నాయి-- రాష్ట్రమంతటా. 

కొన్ని కొత్త కొత్త వుత్సవాలూ, పూజలూ, నోములూ వగైరాలగురించి మొదటిసారి వింటున్నాము.

వాటిలో ఒకటి--వివాహమైన మొదటియేడాది వచ్చే కార్తీక పౌర్ణమికి--11అరటిపళ్లున్న హస్తాన్ని, బూడిదగుమ్మడి పువ్వు, పిందె, సూరే గుమ్మడి కాయ, పసుపు మొక్క, కంద మొక్క, చెట్టునుంచి చేతితో (క్రిందపడకుండా) అందుకున్న కొబ్బరికాయల గెల--శివాలయంలో నైవేద్యంగా నివేదిస్తే శుభాలు సమకూరతాయని--"పదకొండు కాయలున్న అరటిపళ్ల హస్తానికి" గిరాకీ పెరిగి, ఒక్కోటీ రూ.150/- కి అమ్మారట!

వేదమంత్రోశ్చ/శ్చారణ అని వ్రాస్తున్నారు! అది వుచ్చారణ అని వ్రాయాలి. పునశ్చరణ అన్నట్టు కాదు. 

మనకి అర్చకులూ, పూజారులూ, పండితులూ తెలుసు. కానీ ఈ మధ్య కొత్తరకం పండితులు పుట్టుకొచ్చారు--వేదపండితులు, దీపాలంకరణ సేవా పండితులు, అభిషేక పండితులు....ఇలా! 

వేదాలు చదవడానికీ, ఆశీర్వచన పనసలు చెప్పడానికీ వేదాల్లో పాండిత్యం అఖ్ఖర్లేదు. అయినా, వాళ్లకి ఇంకో మాటలేక, వేదపండితులు అని వ్యవహారంలోకి వచ్చింది. సరే. మరి అభిషేక పండితులూ, దీపాలంకరణ పండితులూ యెవరు? పేపర్లవాళ్లు ఇస్తున్నారా ఆ బిరుదులు? ఇంకెవరైనా అలా వ్రాయిస్తున్నారా?

దీపాలంకరణ అంటే గుర్తొచ్చింది. ఇదివరకు గృహస్థులు ప్రతీరోజూ దీపారాధన చేశాక మాత్రమే భోజనం చేసేవారు. అలా సంవత్సరంలో యే కొన్ని రోజులైనా, యే అస్వస్థత లేదా ఇతరకారణాలవల్లనో దీపం పెట్టలేకపోయి వుంటే, దానికి ప్రత్యామ్నాయంగా కార్తీక పూర్ణిమరోజున శివాలయంలో "ఒక దీపం" వెలిగిస్తే సరిపోతుందనేవారు. 

ఇప్పుడు యెవరూ ప్రతీరోజూ దీపాలు వెలిగించడంలేదు కాబట్టి, "పండితులు" ఆ రోజున 365 దీపాలు వెలిగించమంటున్నారట! బాగుంది. మరి "సహస్ర" దీపాలమాటేమిటి? అలా అందరూ యెగబడి ఒక్కోళ్లూ 365 చొప్పున పెట్టుకొంటూ పోతే, సహస్ర యేమి ఖర్మ.....లక్షల్లో పెట్టినా చాలవు!

పైగా, ఇది వరకు కిరాణా షాపుల్లో నూనెలు తూచడానికి ఓ పళ్లెం లంటిది కాటాలో పెట్టుకొని, అందులో మన సీసానో, డబ్బానో వుంచి, పడికట్టి, వాళ్ల డొక్కులతో నూనె పోసేవారు. ఆ సమయంలో కొంతనూనె ఆ ట్రేలో పడేది. కొట్టు కట్టేసేప్పుడు ఆ ట్రేలో పడిన అన్నిరకాల నూనెల మిశ్రమాన్ని వేరే డబ్బాలోపోసి, నిల్వ చేసేవారు. దాన్ని దీపావళికి "దీపాల నూనె" పేరుతో చవగ్గా ఇచ్చేవారు. 

ప్రమిదలో దీపం పెట్టాలంటే ఆముదం వుపయోగించాలి. ఆ పొగ, కళ్లకి మంచిది. వాసన కూడా ఆరోగ్యం. మిగిలిన యే నూనె అయినా, కళ్లు మండుతాయి. పొల్యూషన్ పెరుగుతుంది!

ఇంకా, మనదేశం వార్షిక వంటనూనెల దిగుమతి బిల్లు కొన్ని వందలకోట్ల లో వుంటోంది! నూనెలని దుబారా చేస్తే పుణ్యం వచ్చేస్తుందా?

ప్రమాదాల సంగతి సరేసరి. మొన్న మావూళ్లో ఓ గుళ్లో, సహస్ర దీపాలకోసం ప్రమిదల్లో నూనెపోస్తూంటే, అక్కడే ఆడుకొంటున్నపిల్లలు పొరపాటున నూనె వంపేశారు. మైకులో "నూనె వలికింది....జాగ్రత్త" అని హెచ్చరిక చేస్తున్నా, ఒకావిడయెవరో జర్రున జారి, ప్రక్కామెమీద పడడం, పేకమేడలో పేకల్లా ఒకళ్లమీద వొకళ్లు పడిపోయడం జరిగిపోయాయి. అదృష్టవశాత్తు పెద్ద దెబ్బలూ, ఫ్రాక్చర్లూ జరగలేదెవరికీ!

టీవీలో విశాఖపట్నంలో అనుకుంటా ఒకావిడ చీర అంటుకోవడం, ఆవిడ కెవ్వు కెవ్వుమని అరుస్తూ వుండడం, చుట్టుప్రక్కల ఆడవాళ్లు దూరంగా పారిపోతూంటే, కొందరు చీర విప్పెయ్యమనీ, కొందరు క్రిందపడి దొర్లమనీ సలహాలిస్తూండడం చూశాము!

ఇవన్నీ అంత అవసరమా?


Saturday, November 12, 2011

అధిష్టాన తె'లంగా'నం



విస్తృత సంప్రదింపులు

మనదేశంలో కాంగీవాళ్లూ, మీడియా వాళ్లూ 'ఓ ప్రత్యేకజాతిగా' గుర్తించినవాళ్ల (ప్రపంచ వ్యాప్తంగా వున్న ఓ మతానికి సంబంధించిన.....కాదు!) పండుగ తరవాత, ఓ నిర్ణయం వస్తుంది అని వూదరగొట్టారు--బొచ్చె లాంటివాళ్లు. 

గులాం నబీయేమో, తాంబూలాలు ఇచ్చేశాను....కోర్ కమిటీవాళ్లే తన్నుకు చస్తారు--అనేశాడు. 

మధ్యలో మాయ వేసిన బ్రేకు లో పడి, "రెండో ఎస్సార్సీ" అన్నారొకడో, ఇద్దరో! 

"ఆమాటన్నవాడి నాలుక చీరేస్తాం. గొంతుక కోసేస్తాం" అనలేదు బక్కన్న. 

ఇంతకీ, రోకలి తన పన్నుతోసహా నానిందా? 

అప్పుడేనా! 

ఇవాళ మన నీలం పాగా గడ్డపోడు "విస్తృత సంప్రదింపులు జరుగుతున్నాయి, ఆ పనిమీదే వున్నాం" అన్నాడు. 

మాయమ్మేమో, "నా రాజ్యానికివచ్చినప్పుడే నీ నోరులేస్తోందేమి బిడ్డా? ఢిల్లీ లో నీతల్లికి సమ్‌ఝాయించు బే!" అని గర్జించింది. 

గజం మిధ్య, పలాయనం మిధ్య!   

Wednesday, November 9, 2011

వుత్సవాలు.....



......వైభవంగా

మన పండగల సంఖ్య పెరిగిపోతోంది. 

కార్తీక మాసంలో ప్రతీరోజూ "అతి పవిత్రమైనదే"నట. 

ఇంక "మాసములలో నేను మార్గశిరమును" అన్నాట్టెవడో! అందుకని, మార్గశిరమాసంలో "అన్నీ" పవిత్ర దినాలేనట. 

మరి పుష్య మాసంలో, ధాన్య్హ లక్ష్మి ఇంటికి వస్తుంది కాబట్టి, అన్నీ పవిత్ర దినాలే. పశుపూజలతో సహా, ఆయుధ పూజలతో సహా! బాగుంది. 

రాబోయే రోజుల్లో, అన్ని మాసాల్లోనూ, అన్ని రోజులూ, వివిధ కులాలవాళ్లకీ, మతాలవాళ్లకీ "పవిత్రమైనవే" అవుతాయి. యెటొచ్చీ, ఆ పవిత్రతకి అర్థాలు మరిపోతాయి. అంతే. 

నేను పుట్టి బుధ్ధెరిగాక, గత యాభై యేళ్లలోనూ వినని......అంతెందుకూ......గత సంవత్సరం కూడా వినని....కొన్ని క్రొత్త క్రొత్త కథనాలు వింటున్నాము! 

దీపావళీ, నరక చతుర్దశీ మన చిన్నప్పణ్నించీ వింటున్నవే. 

వుత్తరదేశ వ్యాపారుల పుణ్యమాని, "ధన్ తేరాస్" (ధన త్రయోదశి) పుట్టుకొచ్చింది. ఓకే! 

ఓ ప్రబుధ్ధుడు దానికి యెక్కడనుంచి  క్రొత్తగా "లింకు" పెట్టుకొచ్చాడో చూడండి! "ధన్" అంటే  "ధన్వంతరి"ట. ఆయన పుట్టినరోజట అది. సరే. 

ఆయన "వైద్యం"లో యెన్నెన్నో ప్రయోగాలు చేసి, 'కొత్త కొత్త మందులు కనిపెట్టాడట, కట్టాడట '. బాగుంది. 

వాటిల్లో "సువర్ణ భస్మం" ఒకటిట. అందుకని, ఆ రోజున అందరూ యెంతో కొంత "స్వర్ణాన్ని" కొనాలట! 

(ఇంకా నయం.....వెంటనే దాన్ని భస్మం చెయ్యాలని ఇప్పటివరకూ చెప్పలేదు. ముందు ముందు అదీ చెప్తారేమో.....మూఢ జనులు ఆపనీ చేసి, మళ్లీ మళ్లీ బంగారం కొంటూనే వుంటారేమో! వాళ్ల వ్యాపారాలు ఇంకా వృద్ధి చెందుతాయేమో!) 

ఇంతకు ముందు "విష్ణుచిత్తుడికి ఓ పాప దొరికితే, ఆమెకి 'సూడి కుడుత్త నాచ్చియార్ ' అని పేరు పెట్టుకున్నాడు" అని రాసిన పెద్దమనిషే......ఈ కథనం కూడా వ్రాసింది! బాగానే వుంది. తెలుగు పాఠకులు వీపీలు (వట్టి పిచ్చాళ్లు)! 

ఇంకో క్రొత్త కథనం పుట్టుకొచ్చింది....నరకాసురుడు భూమి పుత్రుడు కాబట్టి, "దళితు"డట. వాణ్ని "ఆర్యులు" ఓ విలన్‌గా చిత్రీకరించి, కృష్ణుడి విజయంగా (ఆయన బీసీ!) ఈ పండగని ప్రవేశపెట్టారట! అందుకని, ద్రవిడుడైన నరకుణ్ని దేవుడిగా పూజిస్తారట! 

(ఇది వ్రాసిన మేతావులు కమ్మీనిస్టులని కొంతమంది చెవులు కొరుక్కొంటున్నారు....నిజానిజాలు పైవాడికే తెలియాలి!). 

ఓ యాభై యేళ్ల క్రితమే, తమిళనాడు (ద్రావిడ ప్రదేశ్ అంటే వొప్పుకొంటారా?) లో "పెరియార్ రామస్వామి నాయకర్" అనే పెద్దాయన, "ఆర్యులకి" వ్యతిరేకంగా పెద్ద వుద్యమాన్ని నిర్వహించాడు. ఆ చెట్టు కొమ్మలే నేటి ద్రావిడ పార్టీలు.....ద్రవిడ కజగం; ద్రవిడ మున్నేట్ర; అన్నా ద్రవిడ....ఇలా! 

ఇంతకీ ఆయన చేసిందేమిటి? అంత గులగావుంటే, రావణుణ్ని పూజించుకోవచ్చుకదా? వూఁహూఁ! రాముణ్ని చెప్పులదండలేసి, పెంట విసురుతూ, చెప్పులతో కొడుతూ, "వూరేగించాడు"! 

చూస్తూంటే ఇలాంటి "వుద్యమాలు" తెలుగునాడు లో కూడా విజృంభిస్తాయేమో! 

నందో రాజా భవిష్యతి కదా?

......మరోసారి.

మన దేవుళ్లు



అంటూ.....సొంటూ

మన పెద్దలు విధిగా పాటించేవారు వీటిని. 

"పచనం" చేసిన యే పదార్థమైనా....అంటే "వండబడిన"......(వుడకబెట్టినా, వేయించినా, నానబెట్టినా....ఇలా) పదార్థాలు, తినుబండారాలు యేవైనా "అంటు". ఈ పదంతోనే "అంట్లు తోముకొనైనా బతకొచ్చు" లాంటి నానుడులు పుట్టాయి. 

ఇంతకీ అంటు అంటే యేమిటి? ఆ పదార్థాన్నిగానీ, అవి వండబడిన పాత్రని గానీ "చేత్తో" ముట్టుకోకుండా వుంటే మంచిది. ఒకవేళ ముట్టుకున్నా, వెంటనే చెయ్యి కడుక్కోవాలి! కారణం? 

సైన్స్ చెపుతోంది.....పచనం చెయ్యబడ్డ యే పదార్థమైనా, మామూలు "రూమ్ టెంపరేచరు" కి వేడి తగ్గగానే, "సూక్ష్మ జీవులు" విజృంభిస్తాయి. ఆ పదార్థాలమీద "కాలనీలకి కాలనీలు" నిర్మించుకొని, వాటిపని అవి చేసుకుపోతాయి (ఆ పని.....ఆ పదార్థాన్ని 'శిథిలం ' చెయ్యడం!). ఆ క్రమంలో మనం  పదార్థాని/పాత్రని ముట్టుకుంటే, మనచేతికి ఆ సూక్ష్మజీవులు అంటుకొని, మళ్లీ కాలనీలు నిర్మించడం ప్రారంభిస్తాయి! దానివల్ల మన ఆరోగ్యానికి హాని జరగొచ్చు. 

ఈ మధ్య మా స్నేహితుడొకడు నలభై యేళ్ల తరవాత కలిశాడు. హైదరాబాదులో, ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో 2096 ఫ్లాట్లు వున్నదాంట్లో, ఓ బ్లాకులో, 19వ అంతస్థులో ఫ్లాట్ కొనుక్కొని, దాంట్లో నివశిస్తున్నాడట.....హాయిగా! 

మనమే అన్నన్ని నివాసాలు కట్టించుకోగలుగుతున్నాము. 

చీమలు, తమ అపార్ట్మెంట్ బ్లాకుల్లొ (పుట్టల్లో), కొన్ని వేల కాలనీలనీ, కొన్ని లక్షల "అపార్ట్మెంట్ బ్లాకులనీ/బిల్డింగులనీ", కొన్ని కోట్ల నివాసాల్నీ యేర్పాటు చేసుకొంటాయి. 

మరి సూక్ష్మజీవులు? కొన్ని లక్షల కాలనీల్లో, కొన్ని కోట్ల బ్లాకుల్లో, కొన్ని శతకోట్ల నివాసాలు యేర్పరచుకొంటాయి! అందుకు వాటికి పట్టే సమయం, కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే! 

ప్రకృతిలో మనకి ప్రసాదింపబడ్డ అనేక ఓషధులూ, రసాయనాలూ వగైరాలు అత్యంత శక్తివంతమైనవి, ప్రభావశీలమైనవి. 

తెల్లటి "పాలరాయి" మధ్యలో నల్లటి చారలూ, వలయాలూ యేర్పడ్డానికి కారణం అవే. 

నీటికి వున్న శక్తి యేమిటి? కొండల్లోని పెద్ద పెద్ద రాళ్లని కరిగించుకొంటూ వస్తూ, చిన్న చిన్న రాళ్లని దొర్లిస్తూ, వాటిని గులకరాళ్లుగా, గరుకు ఇసుకగా, మెత్తటి ఇసుకగా, సిలికాన్ వగైరాలున్న సూక్ష్మ ఇసుకరేణువులుగా మారుస్తుంది కదా?  

మరి, తెల్లని పాలరాయితో చెక్కిన దేవుళ్ల విగ్రహాలు కొన్నాళ్ల తరవాత, ప్రతీరోజూ "నీళ్లతో" అభిషేకాలు చేస్తున్నా, నల్లటి మచ్చలు యేర్పరచుకుంటూండడానికి కారణం యేమిటి? 

మరదే! 

ఈ సోదంతా యెందుకు......అసలు యేం చెప్పదలచుకున్నావు? ..... అనడుగుతారా ..... వస్తున్నా ..... అక్కడికే వస్తున్నా! 

మొన్నోరోజు మా జిల్లాలో ఓ "ఆలయం"లో......51 కిలోల బియ్యంతో వండిన పెరుగన్నంతో ఈశ్వరుడికి అభిషేకం చేశారట! (అభిషేకం చేసి వూరుకున్నారా? లింగం అంతా పెరుగన్నం మెత్తి, చంద్రవంకా, త్రిశూలం, మొహమ్మ్మీద బొట్టూ, జటాజూటం, గంగా వగైరాలని కూడా ఆ పెరుగన్నంతొనే టిర్చిదిద్ది, పేపర్లో ఫోటో వేయించుకున్నారు!) 

అరసవిల్లిలో, తెప్పోత్సవంలో, "......లూ, అరటిపళ్లూ విసురుతూ" భక్తులు అత్యుత్సాహంగా......"తరించారు"ట! 

(మావూరి చుట్టుప్రక్కల, అలా రథమ్మీదకి కొబ్బరిచిప్పలు విసరగా, అవి కణతకి తగిలి మరణించిన అర్చకుల దాఖలాలున్నాయి. 

ఓ నదిమీద రైలు వెళుతుంటే, కిటికీల్లోంచి డబ్బులు (కాయిన్లు) విసిరేసి, దణ్నం పెట్తుకుంటున్నారంటే, దానివల్ల యెవరికీ హానిలేదు.....ఒళ్లు కొవ్వెక్కి, వాళ్ల డబ్బులు నదిలో పారవేస్తున్నారు....అనుకోవచ్చు. మరి ఆహార పదార్థాలమాటో?) 

ఇంతకీ నే చెప్పొచ్చేదేమిటండయ్యా అంటే, "మూఢ భక్తులారా! తెలివి తెచ్చుకోండి! మూర్ఖ పూజారులారా! ఇలాంటివి ప్రోత్సహించడం మానండి! దేవుళ్లని "అంట్ల" పాలు చెయ్యకండి! 

వింటారా? 

Wednesday, November 2, 2011

ప్రశాంతి.......ప్లెబిసైట్



కాశ్మీర్ వ్యవహారం

"కాశ్మీర్ సమస్యకి పరిష్కారం అక్కడ 'ప్లెబిసైట్' నిర్వహించడమే" అన్నాట్ట ప్రశాంతి భూషణ్! (నిజంగా అవే మాటలన్నాడోలేదో నాకు తెలీదు). 

అందుకని, సుప్రీం కోర్టులో ఆయన కార్యాలయంలో ఆయనని క్రిందపడేసి, తొక్కేసి, చొక్కా అవీ చింపేసి, నానా హంగామా చేశారట కొందరు "దేశ భక్తులు"! బాగుంది. 

వివిధ ప్రముఖ పత్రికల్లో అనేకుల వ్యాసాలూ, ఖండన మండనలూ, "యెట్టి పరిస్థితుల్లోనూ దానికి వొప్పుకోం!" అనే హెచ్చరికలూ....."రాచకీయ రక్తులకి" పండగే పండగ! 

అందులోనూ ఆయన "అన్నా బృందం" వాడాయే! ఇంకేమి కావాలి? 

అంతేగానీ, ఆయన ఆ మాట అని వుంటే, "దాని పొడుగెంత, యెలడుపెంత, దాన్సిగతరగ! లోతెంత?" అని యే (అ)వివేకి అయినా మాట్లాడాడా? వూహూ! 

చరిత్రలోకి వెళితే, స్వాతంత్ర్యం వచ్చాక, పాకిస్థాన్ కాశ్మీరు ఆక్రమణకి భారత్ మీద యుధ్ధం ప్రారంభిస్తే, కొంత భాగాన్ని "ఆక్రమిస్తే", జనరల్ కరియప్ప "మూడో నాటికల్లా వాళ్లని తరిమేసి, మన భూభాగం స్వాధీనం చేసుకొంటాం" అని హామీ ఇచ్చినా, నెహ్రూ "వద్దు! వద్దు! మనం శాంతి కాముకులం" అంటూ, అప్పటికి క్రొత్తగా సమర్తాడిన ఐక్యరాజ్య సమితి మోజులో, సమస్యని అక్కడ దాఖలు చేస్తే, ఆ సమితి యేమని తీర్మానం చేసింది? "కాశ్మీర్లో ప్లెబిసైట్ నిర్వహించాలి. తీర్పు యెలావస్తే అలా రెండు దేశాలూ అమలు చేయాలి" అని! 

కానీ మన దేశంలో "సెంటిమెంటల్ ఫూల్స్" అరవ "సియార్" (హిందీలో గుంటనక్క!) అనబడే రాజగోపాలాచార్యులు లాంటివాళ్లు దానికి అడ్డుపడ్డారు. భారత్ 'వెనుకంజ" వేసింది. అక్కడితో మొదలు రావణ కాష్టం. 

తరువాతకూడా, చైనా "ఆక్సాయ్ చిన్" ఆక్రమిస్తే, నెహ్రూ "అక్కడ గడ్డిపరక కూడా మొలవదు.....దానికోసం మనకి అంత అవసరమా?" అంటే, ఆ సియారే "నీ బట్టతలమీదకూడా యేమీ మొలవదు కాబట్టి అది కూడా......?" అని వెక్కిరించాడు. దాంతో మరో రావణ కాష్టం!

ఇందిరాగాంధీ సైతం, 1965లోనూ, 1971లోనూ, ఆ తరవాతా, మన సైన్యం యుధ్ధాల్లో గెలుచుకున్న అపారమైన పాకిస్థాన్ భూభాగాలని యే షరతులూ లేకుండా తిరిగి వారికి అప్పగించేసిందేగానీ, వాళ్లతో బేరం పెట్టలేకపోయింది! మన మిగ్ (MIG) విమానాలతో అమెరికన్ నాట్ (GNAT) విమానాలని ఈగల్లా నలిపేసిన మన సైనికులూ, స్క్వాడ్రన్ లీడర్ "ట్రెవర్ కీలర్" లాంటివాళ్ల త్యాగాలని అర్థంలేనివిగా చేసేసింది! 

నిన్నో మొన్నో, మన్మోహన్ బంగ్లాదేశ్ తో యేదో వొప్పందం చేసుకొని, భారతీయులు, భారత పౌరులు కానివారు వుంటున్న దీవులని, తీసేసుకొని, బంగ్లా పౌరులు, అక్కడ పౌరసత్వం లేనివాళ్లు వుంటున్న దీవులని వాళ్లకి ఇచ్చేశాడు. ఇదెంత బాగుంది? (అక్కడక్కడా తింగరాళ్లు యెవరో విమర్శలు చేసినా, దేశం మొత్తమ్మీద యెవరూ వ్యతిరేకించలేదు దీన్ని!) 

మరి, అలాంటి సూత్రాన్నే కాశ్మీర్ సమస్యకీ, చైనా సమస్యకీ వర్తింపచేస్తే, తప్పేముంటుంది? ప్రశాంతి అన్నదాంట్లో తప్పేముంది? 

మాజీ ఐయేయెస్, లోక్ సత్తా అధినేత సైతం, కాశ్మీర్లో "రిఫరెండం" అంటాడు! ప్లెబిసైట్ కీ, రిఫరెండం కీ తేడా తెలీదు అనుకోవాలా? 

ఇలాంటివి అన్నీ "ప్రజాభిప్రాయ సేకరణలే" అయినా, దేశాల మధ్యా, దేశంలోనూ, ప్రాంతాల మధ్యా.....ఇలా అన్నింటికీ వేరే వేరే మాటలున్నాయి. 

ఈ కాంగీలని తెలంగాణా గురించి రాష్ట్రం మొత్తమ్మీద "రిఫరెండం" నిర్వహించమనండి! అబ్బే! అలా చేస్తే సమస్య అంతరించిపోదూ! సమస్య అంతరిస్తే, మన పార్టీ, మన నాయకులూ, మన అధిష్టానాలూ, మన గుత్తేదార్లూ, మన వృధ్ధి రేటూ, మన .......అవీ ఇవీ అన్నీ.....యేమయిపోవాలి? 

అందుకే, ప్రశాంతి ని తన్నుదాం, కేజ్రీవాల్ ని కేసుల్లో ఇరికించేద్దాం, కిరణ్ బేడీని తీహార్ జైలుకి పంపిద్దాం......చివరికి అన్నా మౌన దీక్ష భగ్నం అయ్యేవరకూ వాళ్ల సంఘ సభ్యులందర్నీ యేదేదో చేసేద్దాం! 

"భలే మామా, భలే! అదే మన తక్షణ కర్తవ్యం!"   

Wednesday, October 12, 2011

తెలుగోళ్లూ..........!



......యెన్నాళ్లీ 'అరవ' వూడిగం?

"తిరు" అని వింటేనే, నా చెవుల్లో యెవరో "తిరి" పెట్టినట్టవుతుంది నాకు! 

అరవ వైష్ణవులు, తెలుగు వైష్ణవులకన్నా యేవిషయంలో గొప్ప? అని ఇదివరకే క్రొశ్నించాను నేను. యెవరూ సమాధానం చెప్పలేదు. 

మా నరసాపురంలోని "ఆదికేశవ యెంబెరుమన్నారు" కోవెలని, ".........యెంబెరుమనార్" అని యెందుకు మార్చారు అనీ, ఈనాడువారు "యెంబెరుమానార్" అని యెందుకు అంటున్నారు అనికూడా క్రొశ్నించాను. సమాధానం లేదు! 

చక్కగా తెలుగులో యేకాక్షర పదం "శ్రీ" వుండగా, ఆ "తిరు" దౌర్భాగ్యం యేమిటో నాకు అర్థం కాదు! 

"స్నపన తిరుమంజనం"ట! ఇదేభాషో? తెలుగులో స్నపనం అంటే, స్నానం చేయించడం అని అర్థం అయివుండొచ్చు. మరి "మంజనం" యేమిటి? అంజనం, భంజనం లా? సరే. 

అదేదో 'తొక్కలో' వాహనం అన్నట్టు ఒకడు "తొక్కళం వాహనం" అంటాడు. ఇంకోడు "తొళక్కం వాహనం" అంటాడు! 

ఇంక "ఇస్తెకఫాల్ స్వాగతం"; "మేల్ చాట్ వస్త్రం" లాంటి మాటలు యేభాషవో తెలీదు అని ఇదివరకే వ్రాశాను. యెవరూ తెలియజెప్పలేదు. 

ఇంకా, "చక్రత్తాళ్వారు"ట! అరవ్వాళ్ల "పన్నిద్దరాళ్వారు"ల్లోనే ఈ ఆళ్వారు లేడేమో! 

తిరుమలలో అంటే, అది తమిళనాడుకి దగ్గరగా వుంది కాబట్టో, కొన్నేళ్లక్రితం వరకూ అరవ పూజారులే వుండేవారు కాబట్టో ఆ వ్యవహారపదాల వాడకం ప్రసిధ్ధికెక్కిందనుకుందాం. (ఇప్పుడు రమణదీక్షితులూ, జీయంగార్లూ, శేషాద్రులూ అరవ్వాళ్లు కాదనుకుంటా). 

మరి రాష్ట్రవ్యాప్తంగా వున్న (ద్వారకా తిరుమలతోసహా) వేంకటేశ్వరాలయాల్లోనూ ఈ అరవ పడికట్టు పదాలనే వాడడం ఓ గొప్ప అనుకుంటున్నారా? మీడియావాళ్లు అలా ప్రచారం చేస్తున్నారా? యేమో. 

ఇప్పుడు మళ్లీ అడుగుతున్నా......తెలుగు వైష్ణవులు అరవ వైష్ణవులకి యెందుకు బానిసలుగా కొనసాగుతున్నారు? 

బాపిరాజూ! మీకు మహాభక్తీ, పరమభక్తీ అన్నీ వుండొచ్చు. బ్రహ్మోత్సవాల్లో "చిందులు" వేసుకో, "డోళ్లు" కొట్టుకో, "కోలాటాలు" ఆడుకో, ఇంకా భక్తి యెక్కువైతే, యేడుకొండలూ పొర్లుదండాలు పెడుతూ పైకెక్కి, దిగు--అంతేగానీ--యెప్పుడో 1970 ల్లో రిజిస్టర్ అయిన "అన్నదానం ట్రస్టు" ని కాదని, "అన్నప్రసాదం" అని మార్చడానికి మీకేమి అధికారం వుంది? 

మీకు చేతనయితే, తిరుమల తిరుపతిని "శ్రీగిరి శ్రీపతి" గా మార్చు! తెలుగువాళ్లు వచ్చే వెయ్యి సంవత్సరాలవరకూ మీకు కృతజ్ఞులై పడి వుంటారు! 

నేను పైన వ్రాసిన పేర్లన్నీ, యెవరైనా "తెలుగుమాటలే" అంటే, వాటి "వ్యుత్పత్యర్థాలని" తెలుగులో వివరిస్తే, నా ఈ బ్లాగుముఖంగనే, క్షమాపణలు వేడుతాను! 

ఇంక మీ ఇష్టం! 

వాకే???


Tuesday, October 11, 2011

తెలుగు గౌరవాలు.....



.....గౌరవ వాచకాలూ

శ్రీ, బ్రహ్మశ్రీ, మహారాజశ్రీ, పార్వతీ సమానురాలు, గంగాభాగీరథీ సమానురాలు--ఇలాంటివి పేరు ముందూ; గారు, అయ్యవారు లాంటివి పేరు తరవాతా వుపయోగించేవారు. వీటిని గౌరవాచకాలు అంటారు. 

(ఒకేసారి పేరుముందు వొకటీ, చివర వొకటీ వుపయోగించడం నిషేధం. అలాచేస్తే నిజంగా వారిని అగౌరవపరచినట్టు.) 

ఇంగ్లీషులో అయితే, Mr.,Mrs., Sir, His Highness, His Holiness, His Excellency, His/Her Majesty, వగైరాలూ (HH, HE లాంటి Abbreviation లూ), చివర్లో Esquire (Esq.) లాంటివీ వాడేవారు. ఇంగ్లీషులో కూడా పేరుకి ముందూ, తరవాతా ఒకేసారి గౌరవవాచకాలుంచడం నిషేధం. 

ఈ మధ్య, Gender Equality వుద్యమకారులు, Mr. అంటే వాడికి పెళ్లి అయిందో లేదో తెలీదుకదా, మరి ఆడవాళ్లకి పెళ్లయితే Mrs. అనీ, అవకపోతే Miss. అనీ యెందుకు వాడాలి? అంటూ Ms. అనేది ఒకటి కనిపెట్టారు. యేభాష అయినా, అతి గౌరవం పనికిరాదు అనే చెప్పారు. 

ఇదివరకో కవి ఓ రాజుగారిని "పూజ్యులు, కుబేరులు, నానావిధ సంపన్నులు......" ఇలా కొత్త కొత్త విశేషణాలు కనిపెట్టిమరీ పొగిడినట్టు కనిపిస్తూ, బూతులు తిట్టి మరీ కసి తీర్చుకున్నాడట. 

ఇంక ఇదివరకు వార్తా పత్రికల్లో అందరిపేర్లముందూ "శ్రీ/శ్రీమతి" తగిలించేవారు. ఓ వార్తలో ఓ పదిహేనుమందిపేర్లు వ్రాయవలసి వస్తే, 15 శ్రీలూ/శ్రీమతులూ కంపల్సరీ. తరవాత, ఇలాకాదు అని, ముందు "సర్వశ్రీ" అని వ్రాసి, తరవాత పేర్లు వరసగా వ్రాసేవారు. 

మా బ్యాంకులో 1972లో 63 రోజులపాటు చరిత్రాత్మక సమ్మె జరిగింది. బ్యాంకు స్థంభించింది. అప్పుడు అధికారుల సస్పెన్షన్ పర్వానికి తెరలేపుతూ, ఈ క్రింది అధికారులని సస్పెండు చేస్తున్నాము అంటూ "సర్వశ్రీ ఎ రామచంద్రరావు....."తో మొదలుపెట్టి, లిస్టు పూర్తిచేశారు. అప్పటినుంచీ ఆయన పేరు సర్వశ్రీ రామచంద్రరావు అయిపోయింది! 

ఇంగ్లీషు భాషలో ప్రతి సంవత్సరం "టైమ్" మేగజైన్ వారు కొన్ని సంస్కరణలు ప్రవేశ పెడతారు. కొన్ని క్రొత్త మాటలని భాషలో కలుపుతారు, కొన్ని మాటల వర్ణక్రమాన్ని మారుస్తారు--ముఖ్యోద్దేశ్యం మాత్రం, ప్రింటులో యెంత సొమ్ము పొదుపు చెయ్యగలం? అనేదే! 

ఇంతకు ముందోసారి రీసెర్చ్ చేసి కనిపెట్టిందేమిటంటే, "An American leaves his apartment by the elevator and enters his automobile to go to see a motion picture." Whereas, "An English, leaves his flat by the lift, climbs his car to go to  cinema!" ఇలా ఇంగ్లీషువాళ్లు కొన్ని బిలియన్ డాలర్లు పొదుపుచేస్తున్నారు--ప్రింటులో అని. 

అలాగే, Colour లాంటి మాటల్లో, 'ఓ' తరవాత వచ్చే 'యూ' ని తొలగించడం లాంటివి. కానీ యెందుకో 'క్యూ' తరవాత కంపల్సరీగా వచ్చే 'యూ' ని తొలగించడానికి మాత్రం జనాలు వొప్పుకోవడంలేదట! అదిమాత్రం ఇంతవరకూ చెయ్యలేకపోయారు. 

గమనించారోలేదూ, మన వార్తా పత్రికల్లో కూడా శ్రీలనీ, Mr. వగైరాలనీ వాడడం యెప్పుడో మానేశారు. తద్వారా బోళ్లంత పొదుపు చెయ్యడమేకాకుండా, మరిన్ని వార్తలనీ (ప్రకటనలనీ) ఇవ్వగలుగుతున్నారు! 

చెప్పొచ్చేదేమిటంటే, మనం వ్రాసేటప్పుడూ, మాట్లాడేటప్పుడూ యెవరిమీదైనా గౌరవం (అదంటూ వుంటే) ధ్వనిస్తే చాలు. అంతేగానీ, యెన్ని గౌరవవాచకాలు వుపయోగిస్తే, అంతగౌరవం అని వినేవాళ్లూ, చదివేవాళ్లూ అనుకుంటారనుకోవడం మూర్ఖత్వం! 

అదీ సంగతి.

Friday, October 7, 2011

తెలుగోళ్లూ......




తెలుగు ని ఖూనీ చెయ్యకండి!

ఓ బ్లాగరు ఓ టపా వ్రాశారు......శీర్షిక "వివేకానాందుడు యేమి చెప్పారు?"(ట).

వివేకానందుడు యేకవచనం. యేమి చెప్పాడు? అని అడగాలి. 

ఇంక, ఆయనమీద గౌరవం పొంగి పొర్లి కారిపోతుంటే, బహువచనంగా "వివేకానందులు" యేమి చెప్పారు? అని ప్రయోగించాలి! 

(దయచేసి దీన్ని 'కు'విమర్శగాతీసుకొని, రాధ్ధాంతం చెయ్యకండి!) 

తెలుగు భాషని సంకరం చేసేసి, ఖూనీ చెయ్యకండి!

వేయ్యీ 11 యేళ్ల తెలుగుభాషా! జిందాబాద్!

Saturday, October 1, 2011

డ్రామా....హై డ్రామా....హై హై డ్రామా! -- 8



విచారణలు

కొన్ని చిన్న చిన్న విషయాలని గమనించండి.

పొద్దున్నే 6-00 గంటలకి ఓ సీబీఐ చప్రాసీనో, గుమాస్తానో, ఇంకెవరో తలుపుకొట్టి, తలుపు తెరిచినవాళ్లని "జనార్దనరెడ్డి గారున్నారా?" అని అడిగి, వాళ్లు లోపలికి వెళ్లి యెవరో వచ్చారు అని చెప్పగానే, అయన లుంగీ బనీనుతో బయటికి వచ్చి "యెవడ్రా ఈ టైములో...." అంటూండగానే, తలుపు కొట్టినవాడు "మా జేడీ గారుకూడా వచ్చారండి" అంటే, ఆయన జేడీ గారిని "రండి రండి! ఇంత పొద్దున్నే......" అంటూండగానే ఆయన ముందుకు వచ్చి, "మీ ఇల్లు సోదా చెయ్యడానికొచ్చాం!" అంటే, ఈయన "అందుకు మీకు అధికారం యెవరిచ్చారు? అసలు వారంటు వుందా?" అని ఇంకా యేదో అనబోతే, ఆ "స్పర్ ఆఫ్ ది మూమెంట్"లో జేడీ "మీరు సహకరించకపోతే, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను" అన్నాడు.

ఈయన "వుండండి. మా ఆవిడకోమాట చెప్పి, డ్రెస్స్ వేసుకొని వస్తాను" అని లోపలికి వెళ్లి, వచ్చి, "సరే పదండి!" అన్నాడంటే......అది ఆయన అమాయకత్వం అనుకోను. చట్టం మీద ఆయనకున్న గౌరవం, తన పవర్ మీదా, డబ్బు మీదా వున్న నమ్మకం తో కూడిన అహంకారం మాత్రమే అయ్యుండాలి.

(నిజానికి ఆయన అంత కొంపలో, అన్ని గదుల్లో, అంత ఆవరణలో యెక్కడైనా దాక్కోవచ్చు, యెలాగైనా తప్పించుకొని బయటికి చెక్కేయచ్చు! ఆవూరు వాళ్లదీ, చుట్టూ మనుషులు వాళ్లవాళ్లు! కానీ యెందుకు పారిపోవాలి? వూరూ, ఆస్థులూ, అయినవాళ్లూ అందరినీ వదిలేసి?)

ఆయనకే గనక "మిరండా" హక్కులు చెప్పివుంటే, వాళ్లు హైదరాబాదు చేరేలోపల హైకోర్టులో బెయిల్ పిటిషన్ల వెల్లువ దాఖలైవుండేది!

(ఓ ప్రక్క డిసెంబరు 9 ప్రకటన వెలువడ్డాక, సీమాంధ్రలు భగ్గుమనగానే, హైకోర్టులో స్టే వెకేట్ అయ్యి, ఇనుప ఖనిజాన్ని పూర్తిగా తరలించగలిగాడని గుర్తు తెచ్చుకోండి!)

ఇంక, అంతకు కొన్నిరోజులు ముందే ఖాన్ బళ్లారి వెళ్లి దర్యాపు చేసి, వాళ్ల పనివాళ్ల జాతకాలతోసహా వివరాలు సేకరించారుకదా?

కోర్టులో ముద్దాయిని ప్రేశపెట్టేముందు, ఆ దర్యాప్తు వివరాలూ, పంచనామాలూ వగైరాలతో "పార్ట్-1 కేసు డైరీ" ని సమర్పించాలి. ఈ పార్ట్-1 సీడీ చాలా రహస్యమైనది. కోర్టు వారి పరిశీలన, రికార్డులకి మాత్రమే. పెద్ద పెద్ద లాయర్లు కూడా, కోర్టు సిబ్బందిని మంచి చేసుకొని దాన్ని పరిశీలించగలరు కానీ, నోట్సు కూడా తీసుకోలేరు! ఆ సీడీ లోని అంశాలపైనే అథారపడి డిఫెన్సు వాదనలూ, బెయిల్ కోసం వాదనలూ సిధ్ధం చేసుకొంటారు. (అవసరమైన వారికి ఆ సీడీల జెరాక్స్ కాపీలు కూడా యెలాగో అందుతూనే వుంటాయి అన్నది బహిరంగ రహస్యం!)

మరి ఈయన కేసులో సీడీ నే ఫైలు చెయ్యలేదు అని డిఫెన్సు వాదన! పంచనామా మీద యెవరూ సంతకాలు పెట్టలేదు అని కూడా సీబీఐ వాళ్లు చెప్పిందే! మరి ఇన్నాళ్లుగా ఆయన బందీగానే వున్నాడు అంటే.....అంతా "చట్టబధ్ధంగానే" జరుగుతోంది అని నమ్ముతారా?

ఇంకో వైపు, ఆండిముత్తు రాజా మీద దర్యాప్తు పూర్తి అయ్యింది అనీ, ఛార్జ్ షీటు దాఖలు చేశాము అనీ చెప్పారు. మళ్లీ కొన్ని కొత్త సెక్షన్లు కేసులో కలుపుతున్నాం కాబట్టి బెయిలు ఇవ్వద్దు అని సీబీఐ అంటే, "అసలు దర్యాప్తు పూర్తి అయ్యిందా, లేదా అనే విషయంలో వాళ్లని అఫిడవిట్ దాఖలు చెయ్యమనండి. అప్పటివరకూ నేను వాదించదలుచుకోలేదు!" అన్నాడట ఆయన లాయరు. యెంత బాగుందో చూశారా?

మా జిల్లాలో (ప గో జి) గత నాలుగురోజులుగా, జిల్లా కలెక్టరూ, అసిస్టెంట్ కలెక్టరూ, జాయింటు కలెక్టరూ--ఇలా ఆరు పోస్టుల బాధ్యతని ఎడిషనల్ జాయింట్ కలెక్టరు మిరియాల శేషగిరిబాబుకి మొత్తం బాధ్యతలు అప్పగించారు. నిన్న (30-09-2011 న)  ఆయన ఆరోగ్యం లోపించి, ఇవాళ పొద్దుణ్నించీ సెలవులో వెళ్లిపోయారుట. దాంతో, మొత్తం యేడు బాధ్యతలూ, ఓ మామూలు రెవెన్యూ అధికారికి అప్పగించారుట. ఆయన మొత్తం 8 బాధ్యతలూ నా శాయశక్తులా నిర్వహిస్తాను అని చెప్పాడు. (రాబోయే నాలుగు రోజులలో రెండురోజులు సెలవులు పోయినా, కనీసం రెండురోజులు ఆయన 8 బాధ్యతలూ వహించవలసిందే!

మరి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ దాదాపు పదికేసులు (అన్నీ కోట్ల రూపాయలూ, పెద్దపెద్దవాళ్లకి సంబంధించినవీ) ఒంటిచేత్తో నిర్వహిస్తున్నాడంటున్నారు! (ఆయనని మించిన మగాళ్లెవరూ సీబీఐలో లేరనుకోవాలా?) అయినా ఆయనకిమాత్రం అంత గాడిదల బరువు మోస్తూ, చాకిరీ చెయ్యవలసిన అవసరం యేమి/యెందుకు వచ్చింది? రేప్పొద్దున్న ఆయనకి యే బ్రెయిన్ హెమరేజో (పాపం శమించుగాక!) జరిగితే, సీబీఐకి దిక్కెవరో?

......మరోసారి.

Friday, September 30, 2011

డ్రామా....హై డ్రామా....హై హై డ్రామా! -- 7



విచారణలు

మామూలుగా మనం మన సినిమాల్లో వినే "యూ ఆర్ అండర్ అరెస్ట్" అనే మాటల తరవాత, అమెరికాలాంటి దేశాల్లో ఆ మాటలన్న పోలీసు అధికారి కొన్ని మాటలు చెపుతాడు--అలా చెప్పకపోతే, అది రికార్డుకాకపోతే, ఆ అరెస్టు చట్టవిరుధ్ధం! 

ఆ మాటలు--"ప్రపంచంలో యెవరికైనా వొక్క ఫోన్ కాల్ మాత్రమే చేసుకొనే హక్కు మీకు వుంది. ఇక్కడనుంచీ, యేమీ మాట్లాడకుండా మౌనంగా వుండే హక్కు మీకు వుంది. ఇకనుంచీ మీరు యేమి మాట్లాడినా, దాన్ని మీకు వ్యతిరేకంగా కోర్టులో వుపయోగించబడే అవకాశం వుంది......" ఇలా! 

ఇవి దశాబ్దాలుగా చెప్పబడుతున్న స్టాండర్డ్ మాటలు. వాటికి ఓ అందమైన పేరుకూడా వుంది! అలాంటి అరెస్టులెక్కడా? గాలి అరెస్టులెక్కడా?! 

నిన్ననో మొన్ననో మా జిల్లా ఓ వూళ్లో, ఒకతన్ని పోలీసులు "ప్రశ్నించడానికి" అని పిలిపించి, డైరెక్టుగా కోర్టులో దింపి, న్యాయమూర్తిని అడగ్గానే అయన రిమాండు విధించాడట అతనికి. 

"హాత్తెరీ! నన్ను ఇలా మోసం చేస్తారా....ముందు చెపితే నేను బెయిలుకి యేర్పాట్లు చేసుకొనేవాణ్ని కదా? నేను జైలుకి రాను" అంటూ ఓ మూడు నాలుగు గంటలు వీరంగం చేశాడట! ఊహుఁ! ఇలాంటివి మనదేశంలో చెల్లుతాయా! 

చట్టం ప్రకారం అన్నీ పుస్తకాల్లో వున్నాయి....కానీ అరెస్టు చేసినా 24 గంటలలోపు మేజిస్ట్రేటు ముందు హాజరు పరచకపోవడం, యే శనివారం సాయంత్రమో అప్పుడే అరెస్ట్ చేసినట్టు హాజరుపరిచి, బెయిలు యేర్పాట్లు చేసుకోడానికి అవకాశం ఇవ్వకుండా, రిమాండు విధింపజేసి, ఆ మర్నాడు సెలవు కావడంతో, వెంటనే సెంట్రల్ జైలుకి తరలించడం....ఇలాంటి చిన్నెలు చాలా చేస్తారు పోలీసులు! 

మొన్నీమధ్యనే, వరల్డ్ బ్యాంక్ ఛెయిర్మన్ అనుకుంటా అదేదో హోటల్లో ఆరోపణలు యెదుర్కొంటే, ఆయన్ని అరెస్టు చేశారు. తరువాత విచారణలో ఆ ఆరోపణలు తప్పని ఋజువు అవగానే, విడుదల చేశారు! అలా సరైన న్యాయ విచారణ పధ్ధతులకి యెవరూ అతీతులు కారు...సాక్షాత్తూ ప్రథాన మంత్రి అయినా, అధ్యక్షుడైనా! 

మన సీబీఐ వారు మాత్రం, ప్రతీరోజూ వివిధ కేసుల్లో తమ దర్యాప్తులని "ముమ్మరం" చేసుకుంటూ పోతున్నారు--కొన్ని రీముల కాయితాల రికార్డులని తయారుచేసుకొంటూ పోతూ....."ఇంకా చాలామందిని అరెస్టు చేసే అవకాశం వుంది" అనికూడా చెపుతున్నారు! 

యెన్ని కొండలని తవ్వుతారో, చివరికి యెన్ని యెలకలని పడతారో! 

చూద్దాం!

Thursday, September 29, 2011

డ్రామా....హై డ్రామా....హై హై డ్రామా! -- 6



విచారణలు

నాకో విషయం నవ్వొస్తూ వుంటుంది. గత నాలుగైదేళ్లుగా, ఈమెయిల్ వ్రాశాక ఓ తోక తగిలించడం ఓ ఫేషన్ అయిపోయింది--"అత్యవసరమైతేనే దీన్ని ప్రింటు తీసుకోండి--పర్యావరణాన్ని రక్షించండి" అనో యేదో! ఆహా! పర్యావరణమ్మీద హెంత మమకారం! అనుకోవాలి ఆ మెయిల్ చదివినవాళ్లు. 

తీరా చూస్తే, కంప్యూటర్లు వచ్చాక వాటికి సంబంధించిన చెత్త పెరిగిపోవడం సంగతి అటుంచి, రీములకి రీములు పేపరు వేస్ట్ అయిపోతూంది--యే ఆఫీసులో చూసినా! 

ఇంక ప్రభుత్వం చూస్తే, యెంత పేపరు దండగ అవుతూందో అంచనాలకి అందదు! 

వుదాహరణకి, "గాలి"కి బెయిలు ఇవ్వాలా వద్దా అనే అంశంపై సీబీఐ కోర్టులో ఓ వారం పైగా వాద ప్రతివాదనలు జరిగాయి అని విన్నాం. కోర్టుల్లో, న్యాయవాదులూ, జడ్జీలూ, ముద్దాయిలూ, సాక్షులూ యెవరేమి మాట్లాడినా, అవి రికార్డు చెయ్యబడతాయి. బెంచి క్లర్క్ కమ్ టైపిస్ట్ వెంట వెంటనే టైపు చేసేసి, రికార్డు చేసేసేవారు. ఇప్పుడు కంప్యూటర్లలో చేస్తున్నారేమో చాలా చోట్ల. మరి న్యాయవాదులు ప్రతీరోజూ చేసే వాదనలు యేరోజుకారోజు రికార్డు చెయ్యబడి, వాటిని సరిపోయినన్ని ప్రింట్లు తీసి, వలసినవారందరికీ అందజేస్తారు. అలా యెన్ని కాపీలు తీస్తారో వూహించుకోండి. 

ఇంక పాడిందే పాటరా అంటూ వారం రోజులపాటు, ప్రతీ రోజూ జరిగిన వాదనలని యెన్ని పేజీల, యెన్ని కాపీల ప్రింట్లు తీశారో వూహించుకోండి! 

వాదనలు ముగిసాక, తీర్పు.....వాదనల్లోని సారాంశాన్ని యథాతథంగా వుటంకిస్తూ, కొన్ని వందల పేజీలు వెలువరిస్తారు. మళ్లీ ఆ తీర్పుకి వలసినన్ని కాపీలు తియ్యలి. యెన్ని పేజీలు అవుతాయో వూహించండి!

ఇంకో వుదాహరణకొస్తే, సీబీఐ వారు విజయసాయిరెడ్డిని, దిల్ ఖుషా అతిథిగృహాన్ని తమ కార్యస్థానం చేసుకున్న రోజు నుంచీ, ప్రతీరోజూ వుదయం 9 నుంచి సాయంత్రం వరకూ, 23 రోజులుగా ప్రశ్నిస్తూనే వున్నారు అని చదివాము. ఇప్పటికి అది 30 రోజులు దాటిందేమో! 

ఆ ప్రశ్నించే విధానం యెలా వుంటుందంటే, ముందు ప్రమాణం తో మొదలవుతుంది. అక్కడనుంచి, ఓ ప్రశ్న అడగడం, దానికి ఆయన సమాధానం చెప్పడం, ఇవన్నీ తెల్లకాయితాలమీద 'రఫ్' గా రికార్డు చేస్తారు. ఆ రోజుకి పూర్తి కాగానే, అప్పటివరకూ తయారైన ప్రశ్న సమాధానాలని 'ఫెయిర్' గా తయారు చేసి, ప్రతీ పేజీమీదా ఆయన సంతకాలు తీసుకొంటారు! 

మధ్య మధ్యలో యే సిగరెట్టు కాల్చడానికో, పానో, బిస్కెట్లూ టీలకో కాస్త విరామం ఇచ్చినప్పుడు, అప్పటివరకూ వ్రాయబడ్డ రఫ్ నోట్స్ ఫెయిర్ చెయ్యడానికి వెళ్లిపోతాయి. బ్రేక్ తరవాత మళ్లీ ఓ ఫ్రెష్ కాయితం తో సిధ్ధం. 

ఆరోజు పూర్తైన ఫెయిర్ కాపీని ప్రశ్నించబడ్డవాళ్ల సంతకాలతో, వలసినన్నీ కాపీలు జెరాక్స్ తీయిస్తారు. 

ఇంకా, యెలాగైనా కావలసిన సమాధానాన్ని రాబట్టాలని, వేలికేస్తే కాలికీ, కాలికేస్తే వేలికీ వేస్తూ, అడిగిన ప్రశ్ననే అనేకవిధాలుగా మార్చి అడుగుతూ వుంటారు! మరి వీటన్నింటికీ రోజుకి యెన్ని "రీముల" కాయితాలు ఖర్చు అవుతున్నాయో వూహించగలరా?

పేపర్లో వచ్చే, ఫలానా కేసులో న్యాయమూర్తులు 8 వేల పేజీల తీర్పు ఇచ్చారు; ఫలానా కమిటీ 7 వేల పేజీల, 9 వాల్యూముల నివేదిక సమర్పించింది.....అని చదువుతాము కదా?  మరి అన్ని పేజీల/వాల్యూముల రిపోర్టులని యెన్ని పదుల/వందల కాపీలు తీస్తారో, అవి బుట్టదాఖలా అయి, ఇంకో తీర్పో, కొత్తకమిటీనో వేస్తే.....షరా మామూలే!

ఈ మెయిల్ తరవాత తోకని చూసి, హాయిగా, మనస్పూర్తిగా నవ్వుకోవడంలేదూ?

ఈ దేశాన్నీ, పర్యావరణాన్నీ బుర్రోవాదులనుంచి పరమాత్ముడే రక్షించుగాక!

Thursday, September 22, 2011

డ్రామా....హై డ్రామా....హై హై డ్రామా! -- 5



గాలి మీద దర్యాప్తులు

అన్నట్టు, మొన్న అమర్ సింగ్ కిడ్నీలూ అవీ నిజంగానే పాడయిపోయి, నిమ్‌స్ లో చేరాడట. పాపం అపార్థం చేసుకున్నాము!

ఇంక గాలి బెయిలు విషయంలో "రెండురోజుల" వాదనలు అని వ్రాశాను. కానీ, "ఐదు"రోజులు వాదనలు జరిగాయట!

తీరా కోర్టు, సీ బీ ఐ కస్టడీకి పంపిస్తూ, ఆయన్ని తన లాయర్ల సమక్షంలోనే విచారించాలి అని చెప్పారాయె. 

వాళ్లేమో, లోపాయకారీగా అదేదో స్టేషన్ లాకప్పు సెల్ లో పెట్టి, యే అర్థరాత్రో వాళ్ల బుర్రల్లో యేదో మెరిస్తే, వెంటనే వచ్చేసి, ప్రశ్నించేస్తున్నారట. 'యేమో, నాకు గుర్తులేదు, గుర్తు తెచ్చుకొని చెపుతాను....' అంటే, సహకరించడం లేదు.....అడ్డగోలు సమాధానాలు ఇస్తున్నాడు....డొంకతిరుగుడుగా మాట్లాడు తున్నాడు....మా సహనాన్ని పరీక్షిస్తున్నాడు.....ఇలా యాగీ చేస్తున్నారు! 

"అవసరమైతే", నార్కో యెనాలిసిస్ కోసం ప్రయత్నిస్తారట....దానికీ ఆయన పర్మిషన్ కావాలని మరిచిపోతున్నారు! అయినా "ట్రూత్ సీరమ్" (అనబడే సోడియం పెంటథాల్) ఇస్తూ మాట్లాడించడం, వాళ్లు మాట్లాడిందాన్ని, "బిట్వీన్ ది లైన్స్" చదువుకొని, నిర్ధారణలకి వచ్చెయ్యడం, తీరా ఆ సాక్ష్యాలు కోర్టుల్లో చెల్లకపోవడం....ఇదంతా ఇంకో ప్రహసనం!

ఇంక ప్రతిరోజూ, "దర్యాప్తు వూపందుకొంది"; "ముమ్మరమైంది" అని విశేషణాలతో వార్తలు! ఇంతాజేసి యేమి ముమ్మరం అయ్యింది అంటే, ఇంకా కొన్ని వందలమందికి నోటీసులు ఇచ్చాము, ఒక్కొక్కళ్లనీ కొన్ని గంటలపాటు "విచారణ" చేస్తున్నాము....అంటూ చెప్పడం! అదీ నడుస్తున్న డ్రామా! 

ఇంక బళ్లారిలో "గాలికి ఆకు కదిలినా" అది గాలి వల్లనే అని పుట్టించేస్తున్నారు. ఓ లారీ కేబిన్ పై, సంచులలో నింపిన కొన్ని కోట్ల డబ్బుని, టర్పాలిన్లు కప్పి, యెక్కడికో రవాణా చేసేస్తుంటే, (అది కూడా యెవరో ఆచూకీ చెపితే) ఆ డ్రైవరునీ, సంచులు పెట్టినవాడినీ అరెస్టు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారట! 

ఆ డబ్బు ఫలానా బ్యాంకులో డ్రా చేశారు అని చెపుతున్నారు. (ఇంకా విచిత్రం యేమిటంటే, కొన్ని కట్టలమీద "2009 వ సంవత్సరం" స్టాంపులు వుండడంతో, రెండు సంవత్సరాలనుంచీ ఆ డబ్బు యెక్కడ దాచారు? అంటూ పరిశోధనట! బ్యాంకుల గురించీ, నోట్ల కట్టల గురించీ వీళ్లకి కనీస పరిజ్ఞానం లేదనుకోవాలా మనం?!). ఆ డ్రైవర్లూ వాళ్లూ యేమి చెపుతారు? 

ఆ బ్యాంకు ఖాతాలో ఆ డబ్బు యెప్పుడెప్పుడు, యెవరెవరు డిపాజిట్ చేశారో యెదురుగుండా కనిపిస్తూనే వుంటుంది! ఆ మాత్రానికి ఈ డ్రామాలు యెందుకు? 

ఇంక, శ్రీనివాసరెడ్డిని మళ్లీ బళ్లారికి తరలించి, ఓ రోజంతా ఓ బ్యాంకులో దర్యాప్తు చేశారట! ఆయన బ్యాంకు లాకర్లు తెరిస్తే, 14 కిలోలో యెంతో బంగారం, కొన్ని కోట్లూ దొరికాయన్నారు. 

మర్నాడు, ఆ లాకర్లు ఇంకెవరి పేరుమీదో వున్నాయి అనీ, వాళ్లు ఈయనకి 'బినామీ'లు గా భావిస్తున్నారు అనీ ఇంకో వార్త! 

ఈలోపల కస్టడీ ముగిసేపోయింది! మళ్లీ చంచల్ గూడా జైలుకి తరలింపు....అక్కడ ఆయన గుళ్లలోనూ, ఆధ్యాత్మిక పుస్తకాలతోనూ కాలక్షేపం! "ప్రత్యేక" పూజలకి అవకాశం వుందా అని కూడా కనుక్కున్నారట! యేమో, చంచల్ గూడా శివుడికీ, ఇంకా అక్కడ దేవుళ్ల అదృష్టం బాగుంటే భవిష్యత్తులో వాళ్లకీ బంగారు కిరీటాలు అమరుతాయేమో! 

ఇలాంటి డ్రామాలవల్లా, దర్యాప్తులవల్లా, నిజాలు బయటికి వస్తాయి అంటే యెవరైనా నమ్ముతున్నారా?

Tuesday, September 13, 2011

డ్రామా....హై డ్రామా....హై హై డ్రామా! -- 4



గాలి అరెస్టు

ఇంక, అరెస్ట్ అయినవాళ్లిద్దరికీ బెయిలు ఇవ్వాలి అని వాళ్ల తరఫు న్యాయవాదులూ, ఇవ్వడానికి వీల్లేదు అని సీబీఐ న్యాయవాదులూ పూర్తిగా రెండురోజులు వాదించుకున్నారు. నిన్న (12-09-2011) ఐతే, వుదయం 11 నుంచి సాయంత్రం 6 వరకూ నడిచాయట. చివరికి రాత్రి 9 కి "తీర్పు రేపిస్తాం" అన్నారట.

(బెయిలు నిరాకరించి, 19 వ తేదీవరకూ సీబీఐ కస్టడీ విధించారు అనీ, వారు వెంటనే "ప్రశ్నల పరంపర" ప్రారంభించారు అనీ ఇవాళ (13-09-2011) వార్త. అందరూ వూహించినదే! "న్యాయం జరగడమే కాదు, 'జరిగినట్టు కనిపించాలి' కూడా" అన్నాట్ట వెనకటికెవడో! అందుకోసమే ఈ "డ్రామాలు"! లేకపోతే, రెండురోజులపాటు ఈ వాదనలెందుకు? కోర్టుల్లో కేసులు పేరుకుపోతున్నాయంటే.....పోవూ మరి!)

ఇంతకీ యెవరి వాదనల్లో "పస" వుందో మీరే ఆలోచించండి.

సీబీఐ వారి వాదనలు : 

  • లీజు పొందిన ప్రాంతాల్లో తవ్వకాలు జరపలేదు. కానీ ఆ పర్మిట్లతో ఇంకోచోట త్రవ్విన ఖనిజం యెగుమతి చేశారు.


  • త్రవ్వకాలగురించి సమాచారం యెవరూ ఇవ్వడం లేదు. ఆయనకి భయపడుతున్నారు. 


  • లీజు పొందిన ప్రాంతం లో లభించే ఖనిజం కన్నా, యెక్కువ నాణ్యమైన ఖనిజం యెగుమతి చేశారు. 


  • వుపగ్రహ చిత్రాలూ వగైరా సీడీలూ, డాక్యుమెంట్లూ సీల్డ్ కవర్లో సమర్పించాము.


  • సంవత్సరానికి 18 కోట్లు జీతం పొందారు. ఆస్తి అప్పుల పట్టీలో, డైరెక్టర్లుగా గాలి దంపతులే సంతకాలు చేశారు. జాతీయ సంపదని దోచుకున్నారు!


  • ఇంట్లో వుంచుకున్న 5 కోట్ల నగదుకీ లెఖ్ఖలు లేవని తేలింది. దాన్ని తాడిపత్రి బ్యాంకునించి తెచ్చారు. 


  • బెయిలు మంజూరు చేస్తే, పారిపోయే అవకాశం వుంది.


డిఫెన్స్ న్యాయవాదులు : 

  • లీజుకి సంబంధించిన ఫైళ్లన్నీ అందుబాటులో వున్నాయి. అధికారులెవరో వారికి తెలుసు. వాళ్లెవరినీ పిలిచి విచారించకుండా, వీళ్లని అరెస్ట్ చేసి, వివరాలు చెప్పమంటామనడం యేమిటి? కేసు నమోదు చేసి రెండేళ్లయినా, ఇప్పటిదాకా ఆధారాలు యెందుకు సేకరించలేదు? అరెస్ట్ ను సమర్థించుకోడానికే వివరాలు సేకరించాలని కస్టడీ అడుగుతున్నారు!


  • ముడుపులు తీసుకున్నారంటున్న అధికరులని యెందుకు వదిలేస్తున్నారు?


  • లీజు పొందినచోటకాకుండా, వేరేచోట (కర్ణాటకలో) తవ్వారంటున్నారు. ఆ భూమి కర్ణాటకలో వుందని, సరిహద్దు నిర్ణయం జరగకుండా యెలా నిర్ధారిస్తారు?


  • సరిహద్దు వివాదాలగురించి సుప్రీం కోర్టులో పలు కేసులున్నాయి. అవి తేలేదాకా యెందుకు ఆగలేదు? 


  • ఇప్పటికే ఆధారాలు (సీడీలూ, డాక్యుమెంట్లూ) వున్నాయంటూ, మళ్లీ కస్టడీ యెందుకు?


  • బ్యాంకు ఖాతాల్లో యెగుమతుల వివరాలు అన్నీ వున్నాయి కదా? కేసు డైరీ యెందుకు లేదు? అరెస్ట్ తరవాత, ఎఫ్ ఐ ఆర్ లో సెక్షన్లని సవరించారు.


  • వ్యక్తిగత స్వేచ్చ వుల్లంఘన జరిగింది.


(పేకాట ఆడేవాళ్లు ఓ సామెత చెప్పుకుంటారు--మన పేక మనం యెప్పుడైనా చూసుకోవచ్చు, ముందు ప్రక్కవాళ్ల పేకలని చూసి గుర్తు పెట్టుకోవాలి--అని. అలా, 'మన లీజులు మనం యెప్పుడైనా త్రవ్వుకోవచ్చు, ముందు.......' అనుకున్నాడేమో ఆయన!)

నిజానిక్కూడా, వీళ్లు "ఇంటరాగేట్" చెయ్యగానే, ఆయన అన్ని "నిజలూ" కక్కేస్తాడా....."మూడో డిగ్రీ" వుపయోగిస్తే తప్ప? రేపెప్పుడో కడుపునొప్పో, కాలునొప్పో అని హాస్పిటల్లో చేరతాడు. రోగీ పాలే కోరాడు, వైద్యుడూ పాలే ఇమ్మన్నాడు అన్నట్టు సరిపోతుంది. అమర్ సింగ్ నిన్న "నిమ్‌స్"లో చేరలేదూ?

......మరోసారి.

Monday, September 12, 2011

డ్రామా....హై డ్రామా....హై హై డ్రామా! -- 3



గాలి అరెస్టు

ఇంకెవరైనా చేస్తే నేరం, మనం చేస్తే అది వ్యూహం అన్నట్టుంది సీబీఐ వ్యవహారం. 

హోటళ్లలో గదులు బుక్ చేసుకోవాలంటే, మన ఫోటో ఐడీ అడిగి, దాని వివరాలు వాళ్ల రికార్డులో వుంచుకుంటున్నారు. 

అయినా, అలాంటిదేమీ లేకుండా, మారుపేర్లతో, కనీసం ఓ పది గదులు హోటళ్లలో బుక్ చెయ్యగలిగారంటే, లొసుగు యెక్కడ వుంది?

తమ అధికార హోదాని వుపయోగించో, ఇన్‌ఫ్లుయెన్స్ వున్న ఓ స్థానిక పెద్దమనిషిని బ్లాక్ మెయిల్ చేసో సాధించి వుంటారు. (సాధారణంగా హోటళ్లలో గదులు ఇచ్చే రిసెప్షన్ లో వుండే వుద్యోగులని యెవరూ "ఫలనా గది వాళ్లకే యెందుకు ఇచ్చావు?" అని ప్రశ్నించరు. తరవాత యేమైనా కొంప ములిగితే, వాళ్లని మూసేసి, వుద్యోగాలు పీకేస్తారంతే!) 

మరి అలా సీబీఐకే సాధ్యం అనుకుంటే, మనం మూర్ఖులమే! 

సామాన్య నేరస్థులనుంచి, తీవ్రవాదులవరకూ అందరికీ అది సాధ్యమే కదా? ఇంక మనవాళ్ల ఇంటలిజెన్స్ ఇలా యేడుస్తోంది అని తిట్టుకొని యేమి లాభం?

అందుకే తీవ్రవాదులు హైకోర్టునే కాదు, సుప్రీం కోర్టుని కూడా పేల్చేస్తాం అని బెదిరించగలుగుతున్నారు!

ఇంక సోదాలు చెయ్యడానికి అని చెప్పి వెళ్లినవాళ్లు, అరెస్టు చెయ్యవలసిన అవసరం యేమి వచ్చింది? 

సొదాలపేరుతో, బంగారం , వెండీ వస్తువులని స్వాధీనం చేసుకొని, కోర్టులో డిపాజిట్ చెయ్యడం యెందుకు?

ఒకవేళ ఆయన "అక్రమంగా" సంపాదించాడు అని రేప్పొద్దున్న కోర్టు నిర్ధారించి, ప్రభుత్వానికి జరిగిన నష్టానికిగానూ, ఆయన ఆస్తులని జప్తు చెయ్యండి అంటే--అప్పటికి ఆ ఆస్తులు అన్నీ కరిగిపోతాయనో, అన్నీ మూట కట్టుకొని, యే చైనాకో, జపాన్ కో పారిపోతాడని భయమా? అలా పారి పోవడానికి ఆయనేమైనా షా ఆఫ్ ఇరానా? ఇమెల్డా మార్కోసా?

నిజంగా ఖత్రోచీలనీ, యాండర్సన్లనీ మాత్రం గుట్టు చప్పుడుకాకుండా వాళ్ల దేశాలకి పారిపోనిస్తారా!

కార్లూ, హెలికాప్టరూ స్వాధీనం చేసుకోవాలా? లేకపోతే వాటిని స్వయంగా నడుపుకొంటూ, ఇతరదేశాలకి యెగిరిపోతాడా? అయినా అంత అవసరం ఆయనకి యేమిటి?

సత్యం రామలింగరాజు సంగతి వేరు. ఆయన జైల్లో కాకుండా బయట వుంటే, సాక్ష్యాధారాలని నిర్మూలించడానికి అవకాశం వుండేది.

గాలి విషయంలో, కొన్ని లక్షలు ఖర్చుపెట్టి సేకరించిన శాటిలైట్ ఇమేజస్ తో సహా అన్నీ రికార్డెడ్ గా వున్నాయంటున్నారు. వాటి ఆథారంగానే నిర్ణయానికి వచ్చామంటున్నారు--కేసులు కోర్టులో విచారణ చెయ్యడానికి!

ఇదంతా చూస్తుంటే, సీబీఐ అధికారులు వాళ్ల సొంత ఇమేజ్ ని పెంచుకోడానికో, లేక కొంతమంది రాజకీయులకి మేలు చెయ్యడానికో ఈ డ్రామాలన్నీ ఆడుతున్నట్టులేదూ?
  
......మరోసారి.

Saturday, September 10, 2011

డ్రామా....హై డ్రామా....హై హై డ్రామా! -- 2



గాలి అరెస్టు

ఇంక అరెస్టు యెలా జరిగింది?

సీబీఐ బృందం జగన్ అక్రమ ఆస్తులు, ఎమార్ ప్రాపర్టీస్ కేసులతో బిజీగా వుండడంతో, "గాలి" 'నాదాకా రావడానికి ఇంకా టైముందిలే' అనుకుంటూండగా, అదనపు ఎస్పీ ఖాన్ జేడీ ఆదేశాలపై కొద్దిరోజుల క్రితమే బళ్లారి చేరి, పరిస్థితులని అధ్యయనం చేసి, యెప్పటికప్పుడు సమాచారం జేడీ కి చేరవేశారట. 

జనార్దన్ రెడ్డి ఇంటి వాతావరణం, కుటుంబ సభ్యులు, పని మనుషులు తదితర వివరాలు సేకరించారట. ఆదివారం జనార్దన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఇళ్లలోనే వున్నారని నిర్థారించుకున్నారట. 

(ఇక్కడో చిన్న విషయం గుర్తొచ్చింది నాకు. పూర్వం రాజులు తమ కోటల్లో రహస్య మార్గాలనీ, నేల మాళిగలనీ వగైరాలు నిర్మించిన మేస్త్రీలని పని పూర్తవగానే చంపేశేవారట--ఆ రహస్యాలు బయటికి పొక్కకుండా. పాపం టిప్పు సుల్తాన్ తన కోటలో మురుగునీటి పారుదల మార్గాల్లో ఓ చోట అంతరాయం యేర్పడినప్పుడు దాన్ని బాగుచేసినవాడిని చంపడం మరిచిపోయాడో, సహాయం చేశాడు కదా అని కృతఙ్ఞత చూపాడో! బ్రిటీష్ నక్కలు వాణ్ని పట్టుకొని, ఆ మార్గం తెలుసుకొని, రాత్రికి రాత్రి కోటలో చేరి, వుదయమే టిప్పు బహిర్భూమికి వెళుతూండగా కాల్చి చంపేసి, "వాహ్యాళికి వెళుతుంటే చంపేశాము" అని చరిత్రలో రాసేశారు!)

ఆదివారం మధ్యాహ్నం జేడీ తన సిబ్బందితో బళ్లారి పయనమయ్యారట. బెంగుళూరు సీబీఐ డీఐజీ హితేంద్ర ని కూడా బళ్లారి వచ్చెయ్యమన్నారుట. 

అప్పటికే అక్కడవున్న ఖాన్--"వారందరికీ" మారుపేర్లతో హోటళ్లలో గదులు సిధ్ధం చేశారట!

ఆదివారం అర్థరాత్రి రెండు గంటల సమయానికి జేడీ బృందం బళ్లారి చేరిందట. అప్పటికే హితేంద్ర బృందం బళ్లారి పోలీస్ ఆఫీసర్స్ మెస్ లో దిగారట. అధికార వాహనాలు కూడా వాడకుండా మామూలు అతిథుల్లా ప్రవర్తించారట! అర్థరాత్రి బళ్లారి ఎస్పీ తో మాట్లాడి, పోలీసు రక్షణ యేర్పాటు చేసుకున్నారట. మహిళా సిబ్బందిని కూడా రప్పించారట. 

"ఒక గంట" మాత్రమే విశ్రాంతి తీసుకొని, నాలుగ్గంటలకల్లా అరెస్టు ప్రయత్నాలు మొదలెట్టారట. 

వుదయం ఆరుగంటలకల్లా, జేడీ జనార్దనరెడ్డి ఇంటితలుపూ, ఖాన్ శ్రీనివాసరెడ్డి ఇంటి తలుపూ తట్టారట. 

సీబీఐ నుంచి వచ్చాము, సోదాలు చెయ్యాలన్నారట. జనార్దనరెడ్డి తన భార్యతో మాట్లాడాక, ఆయన్ని అరెస్టు చేస్తున్నాము అని ప్రకటించారట. ఆటునుంచి శ్రీనివాసరెడ్డిని కూడా ఖాన్ తీసుకొచ్చారట.  ఇద్దరినీ తీసుకొని, జేడీ హైదరాబాదు బయలుదేరారట వెంటనే. 

దాడుల విషయం బయటికి పొక్కేలోపే, వాళ్ల బృందం బళ్లారి శివార్లు దాటేసిందట.

మీడియావాళ్లు వుదయం యేడున్నర గంటలకే విషయం తెలుసుకొని, కర్నూలు జాతీయ రహదారి పొడుగునా, టోలుగేట్ల దగ్గర కెమేరాలు పెట్టుకొని, వాళ్లని వెంటాడారట.

జనార్దనరెడ్డి ఇంట్లో మూడు కోట్లూ, శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఒకటిన్నర కోట్లూ నగదూ, బంగారు "నగలూ" స్వాధీనం చేసుకుని, ఇన్‌కమ్ టేక్స్ వాళ్లకి సమాచారం ఇచ్చి, మంగళవారం న్యాయ స్థానానికి అప్పగించారట! (ఈ బృందాలు యెప్పుడు యెలా హైదరాబాదు చేరాయో సమాచారం లేదు.)

జనార్దన రెడ్డి ఇంట్లో స్వాధీనం చేసుకొన్న (యెన్నో తెలీదు) కోట్ల ఖరీదైన కార్లని హైదరాబాదు తరలించడానికీ, జాగ్రత్తగా కాపాడడానికి యేర్పాట్లు చేస్తున్నారట.

హెలికాప్టరుని తరలించాలా వద్దా అని గుంపుతెంపులు పడుతున్నారట.

అదండీ వాళ్ల ఘనకార్యం!

(ఇదంతా ఈనాడు సెప్టెంబరు 7, బుధవారం పేపర్లో వచ్చింది మాత్రమే). 

......మరోసారి.

Thursday, September 8, 2011

గాలి అరెస్టు



డ్రామా....హై డ్రామా....హై హై డ్రామా!



గాలిని బంధించగలమా?

అదే సాధ్యమైతే, మన పూర్వ ఋషులు, అగస్థ్యుడో యెవరో సముద్రాన్ని తన కమండలంలో బంధించినట్టు, గాలిని కూడా బంధించి చూపించేవారే! తనంతటతాను వాయుదేవుడు స్థంభించిన దాఖలాలు మాత్రం వున్నాయి కొన్ని కథల్లో. అంతే.

గాలిని మనం బుడగల్లో బంధించి, బుడగనో, దాని మూతిని దారాంతోనో, ముడేసి, "ఆహా! గాలిని బంధించాం" అని ఆనందిస్తాం ! కానీ యెంతగట్టిగా ముడేసినా, తెల్లారి చూసేసరికి, చాలామటుకు గాలి అందులోంచి నిష్ క్రమించేసి వుంటుంది!

సరే....ఇలాంటి సరదా విషయాలు ప్రక్కన పెడితే, గాలి జనార్దన రెడ్డి ని సీబీఐ వారు "బంధించగలిగారు". యెలా? అనేక డ్రామాల తరవాత! 

అంత అవసరమా అంటాను నేను.

నా ప్రశ్న వొక్కటే....జేడీ లక్ష్మీనారాయణకి "గాలిని అరెస్టు చెయ్యమని" ఆయన పై అధికారుల్లో యెవరు ఆదేశాలు ఇచ్చారు? ఒకవేళ ఆదేశించి వుంటే, ఆ ఆదేశం "చట్టబధ్ధమేనా"?

(తొందరపడి నాది వితండవాదం అనెయ్యకండి. టపా పూర్తిగా చదివాక మాత్రమే అలాంటి వ్యాఖ అవసరమేమో ఆలోచించండి.)

జేడీ కి రాజకీయాలతో సంబంధం లేదు. ఆయన ఒక వుద్యోగి మాత్రమే! ఆయన కూడా ఆవిషయం మొన్ననే ప్రకటించవలసి వచ్చింది. వొప్పుకొంటారుగా? మరి ఆయనకి పై అధికారులూ వుంటారుగా?

జేమ్‌స్ బాండ్ కథల్లో సైతం, ఆయనని పిలిచి, వాళ్ల బాస్ "ఎమ్" ఫలానా కేసు పరిశోధించు. దానికోసం నీకు ఫలానా అధికారాలు ఇస్తున్నాము--అని కేసు అప్పగిస్తారు. కానీ బాండ్, తానే వెళ్లి ఫలానా పని చేస్తాను, మీరు అనుమతి ఇవ్వండి అని అడగడు!

మనదేశంలో యెమర్జన్సీ విధింపుకి ముందు, లోక్ నాయక్ జేపీ పోలీసులకి "చట్టవిరుధ్ధమైన ఆదేశాల అమలుకి తిరస్కరించండి" అని పిలుపు ఇచ్చాడు. దాంతోనే, ఆయన పోలీసులని "తిరుగుబాటు" చెయ్యమంటున్నాడు అనే వంకతో యెమర్జన్సీ విధింపు, తరవాత అరెస్టులూ జరిగాయి. అదంతా చరిత్ర.

వుద్యోగులు చెయ్యవలసింది, తమకిచ్చే జీతానికి సరిపడా, పనివేళల్లో, తమ వుద్యోగ నిబంధనలని అనుసరించి, విధి నిర్వహణ చెయ్యడమే!

"పావలా తీసుకొని, రూపాయి ఏక్షన్ చేసేస్తున్నాడు చూడండ్రా!" అంటారు సినిమా చూస్తూ. అలా చెయ్యాల్సిన అవసరం వుందా అంటారు అలా అనేవాళ్లు.

బ్యాంకులలో కూడా "విజిలెన్స్" విభాగాలుంటాయి. దాంట్లోకి కొంతమంది వుద్యోగులని బదిలీ చేస్తారు. అలాంటి కొందరు "జేయెమ్‌వన్"గాళ్లు--తమ పై అధికారులు--వుద్యోగి యెవరిమీదైనా ఫలానా విషయంలో "దర్యాప్తు" చెయ్యమంటే, వాళ్లు ఆ వుద్యోగుల ఇళ్లకి వెళ్లి, వాళ్ల ఆడవాళ్లనీ, పెద్దలనీ, పిల్లలనీ--మీవాడు తప్పు చేశాడు....మీరు నిజం చెప్పకపోతే, చాలా దూరం వెళుతుంది.....మేము సీ ఐ డీ నుంచి వచ్చాము. నేను డీ ఎస్ పీ రాంక్ వాడిని. "నాన్ బెయిలబుల్ అరెస్టు వారంటు" జారీ చేసేందుకు నాకు అధికారాలు వున్నాయి.....అంటూ బెదిరించి వాళ్లదగ్గర వీళ్లకి కావలసినట్టు వాఙ్ఞ్మూలాలు సంతకాలు పెట్టించేసుకునేవారు ఆ దౌర్భాగ్యులు! ఆ వుద్యోగి వీళ్లకన్న పెద్ద స్థాయి వాడు--యే స్కేల్ మూడో, నాలుగో అయినా సరే--వీళ్లే దర్యాప్తులు! 

అదీ పావలా తీసుకొని, రూపాయి ఏక్షన్ చెయ్యడం అంటే!

తరవాత ఎంక్వైరీలో డిఫెన్సువాళ్లు వాటిని అన్నీ ఖండ ఖండాలు చేసేసినా, ఎంక్వైరీ ఆఫీసర్లు (వీళ్లకి ప్రత్యేక ఆదేశాలుంటాయి) "గిల్టీ" అని తీర్పు ఇచ్చేస్తారు! 

పైగా, ఆ కేసులు వాదించిన విజిలెన్స్ విభాగం జేయెమ్‌వన్‌గాళ్లు--నేను చేపట్టిన కేసులన్నింటిలోనూ, అందరికీ శిక్షలు పడ్డాయి, యెవరూ తప్పించుకోలేదు--అని బోర విరుచుకునేవాళ్లు!

ఇలా వుంటాయి ప్రహసనాలు!    

......మరోసారి.

Friday, September 2, 2011

వుద్యమ.....



.....క్షేత్రాలు

అన్నా దీక్ష సఫలం తరవాత యేమిటి?
లోక్ పాల్ తరవాత 'జీవితం 'యేమిటి?
ఇంకా వుద్యమాల అవసరం వుందా?
వుద్యమాలని రాజకీయ పార్టీలతో అనుసంధానం చెయ్యాలా?

ఇలా అనేక ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. 

పుణ్య క్షేత్రాల్లో "పూల మాఫియా"; "ట్రావెల్ మాఫియా"; "హోటెల్ మాఫియా"--ఇలా వాపోతోందో ఛానల్.

నన్నడిగితే, లోక్ పాల్ కన్నా ముందు ఈ "క్షేత్ర నిర్వహణ" లకి వ్యతిరేకంగా చెయ్యాలంటాను--వుద్యమాలని.

(వాళ్లు 'మా క్షేత్రం--మా యిష్టం' అంటారేమో!)

మా చిన్నప్పుడు పుణ్యక్షేత్రాలంటే, తిరుపతి, కాళహస్తి, శ్రీశైలం, కంచి, మధుర, రామేశ్వరం--ఇలా చెప్పేవారు.

తరువాత, తి తి దే వారు తిరుచానూరుని వృధ్ధి చేశారు. 1970లలో అయ్యప్ప చేరాడు. తరువాత షిరిడీ. ఈమధ్య కాణిపాకం చేరింది. ఇంకా చాలా చేరుతున్నాయి.

అన్నట్టు, రాజుగారు టిఫిన్ డబ్బాల్లో పెట్టుకొని, నగలు యెత్తుకుపోతుంటే, ఓ వుద్యోగి చూశాడు అనీ, అందుకే ఆ వుద్యోగిని తొలగించారు అనీ, ఆరోపించాడు అచ్యుతానందన్.

అక్కడి వాడుక యేమిటంటే, రాజుగారు గుడి బయటికి వచ్చేముందు, కాళ్లకంటిన ఇసుక రేణువులని కూడా శుభ్రంగా దులిపేసుకొని బయటికి వాస్తాడు అని!

నిజానిజాలు అనంత పద్మనాభుడికే తెలియాలి మరి!

యేమంటారు?

Thursday, September 1, 2011

"విగ్నేస్వర.....



.....సుబాకాంక్సలు!"

"అందరికీ వినాయక చతుర్దశి షుభాకాంక్షలు!"

ఇప్పుడే, ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోడానికి, జోరుగా కురుస్తున్న వర్షాన్ని కూడా లెఖ్ఖచెయ్యకుండా వచ్చిన ఓ మహిళ ఓ టీవీ ఛానెల్లో చెప్పిన మాట!

ఈ లండాచోరీ అంతా మనకు తెలియని, రాని, చదవని, వ్రాయలేని "సంస్కృతం" వల్లే అని వొప్పుకుంటారా?

శుభ్రంగా "వినాయక చవితి" అనకుండా, "చతుర్థి" అనబోయి, "చతుర్దశి" అనడం యెందుకు?

తెలుగుభాషా పండితులూ....వెయ్యేళ్ల తెలుగు వారూ!....మీడియావాళ్లు చక్కని తెలుగునే మాట్లాడి, ప్రసారం చేసేలా కృషి చేస్తారా?

మీ యిష్టం మరి!

Friday, August 19, 2011

కేరళలోని......4



......ఆలయాలూ, ఆచారాలూ

"గురువాయూరప్పా! అనువగు తెరువే ఇదియప్పా! దినము దినమునా ఈ యుగమందున తిరునాళ్లేనప్పా! గురువాయూరప్పా....." ఇది ఓ నలభై యేళ్లక్రితం భక్తిరంజనిలోననుకుంటా మన ఆకాశవాణిలో నాకు వినిపించిన పాట. స్వామి అయ్యప్ప కన్నా ముందు, పళని స్వామి కన్నా ముందు, ఈ యాత్ర వుండేదిట. 

అలాంటి గురువాయూరు దర్శించడం ఓ మంచి అనుభూతి! 

ద్వాపర యుగాంతంలో ద్వారక సముద్రంలో మునిగిపోయినప్పుడు, శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని యెలా కాపాడాలా అని అలోచించిన "గురువు" అంటే బృహస్పతి, వాయువుని వేడుకొన్నాడట. వాయువు వొప్పుకొని, శ్రీకృష్ణుడి విగ్రహాన్ని మోసుకొంటూ వచ్చాడట. ఆ విగ్రహాన్ని యెక్కడ పెట్టాలి అనే మీమాంసలో, గురువు వెతుక్కుంటూ దక్షిణాదికి వచ్చి, ఓ కొండమీదున్న శంకరుణ్ణి వేడుకొన్నాడట--నువ్వు కొండ దిగితే, ఇక్కడ కృష్ణుణ్ని పెట్టుకొంటాం--అని. శంకరుడు వొప్పుకోగానే, అక్కడ శ్రీకృష్ణుణ్ని వెలిపించారట! అందుకనే ఆ గుడికి "గురు-వాయు" ఊరప్ప అని పేరు వచ్చిందట. ఆ గుడిని ఖాళీ చేసిన శంకరుడు, కొండ క్రింద "మైమ్మాయూర్" (మహిమ వల్ల యేర్పడ్డ వూరు) కి చేరాడట. గురువాయూరు దర్శించుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో ఈ శంకరుణ్ని దర్శించుకుంటారు. 

గురువాయూరు పెద్ద దేవస్థానం. కాంప్లెక్స్ చాలా విశాలంగా వుంటుంది. సీజన్లో (దేవుళ్లకి కూడా సీజన్లు వుంటాయి!) ఆవరణ అంతా ఇసకేస్తే రాలనంత మంది భక్తులు వుంటారట. కారు పార్కింగ్ కి వెతుక్కుని, అక్కడ ధోతీ, కండువా లోకి మారి, (పేంట్లూ చొక్కాలూ బనీన్లూ విప్పేసి) గుడి ఆవరణలోకి, అనేక షాపులూ, హోటెళ్లూ వగైరాలు దాటుకుంటూ, వెళ్లి క్యూలో నిలబడాలి. 

అదృష్టమేమిటంటే, ప్రతీరోజూ సాయంత్రం 6 గంటలకి, సీనియర్ సిటిజెన్లకి ఓ ప్రత్యేక క్యూ వుంటుంది. 

మా డ్రైవెర్ కం గైడ్ "సంతోష్" పుణ్యమా అని, మాకు ఈ సంగతి తెలిసింది. తనుకూడా, అధికారులదగ్గర ప్రత్యేక అనుమతి తీసుకొని మరీ మమ్మల్ని ఆలయ ప్రవేశం చేయించాడు ఆ క్యూలో!

....మరోసారి.

కేరళలోని......3



......ఆలయాలూ, ఆచారాలూ

చొట్టాన్నికర--ఇదొక దేవీ ఆలయం. తమిళనాడులోని మూకాంబికలా ప్రఖ్యాతం (ట). 

ఓ ప్రాచీనాలయం వుంది--క్రిందకు దిగి వెళితే. ముందు క్రొత్త ఆలయం వుంటుంది. చక్కగా ఆలయం చుట్టూ చెక్కతో వరసలు యేర్పరిచి, వాటిమీద ప్రమిదల్లో నూనె దీపాలు వెలిగిస్తారు. చీకటిపడే టైముకి అన్ని దీపాలూ వెలిగిపోతాయి--అలా యేర్పాటు చేశారు. ముందు ఓ గణపతి గుడీ, దాని ముందు దీప స్థంభం (ఓ స్థంభానికి అరలు అరలుగా ప్రమిదలు బిగించి, ఓ ఫౌంటేన్ లా దీపాలు వెలిగిస్తారు).

దర్శనానికి టిక్కెట్టు లేదు. పంచె నిబంధన లేదు గానీ, చొక్కా, బనీను విప్పేసి, చేతిమీద వేసుకోవాలి. గర్భగుడిలోపల మాత్రం ఫోటోలు నిషిధ్ధం. 

ఆ ప్రక్కనుంచి నడుచుకుంటూ వెళితే, ప్రాచీన ఆలయం వుంది. అక్కడకూడా పై నిబంధనలే. ప్రత్యేకత యేమిటంటే, మంగళ, శుక్ర వారాల్లో "గురిది" అని జరుగుతుందట. ఘటాలని ధరించి, డప్పులూ వగైరాలతో జరిపిస్తారట. భక్తులకి పూనకాలు వస్తాయట. మానసిక రోగులని సంకెళ్లు వేసి కూడా తీసుకొస్తూంటారట. ఇతర వికలాంగులకి కూడా నయం అయిపోతుందని నమ్మకమట. రాత్రి 9 దాటాక మొదలవుతుంది అన్నారు. మేము వుండలేదు.

Tuesday, August 16, 2011

కేరళలోని......2




......ఆలయాలూ, ఆచారాలూ

(ఇంతకు ముందటి నా టపాలో ఓ చిన్న పొరపాటు దొర్లింది. అప్పటికి మైనరుగా వున్న మహారాజు మహారాణిగారి మేనల్లుడు కాదు. అంతకు ముందటి మహారాజు మేనల్లుడు. యెందుకంటే అప్పట్లో "మాతృస్వామ్యం" అమలులో వుండేది.)

కాలడి--జగద్గురు శంకరాచార్యులు పుట్టిన వూరు. పెరియార్ నది శాఖ ప్రక్కనే వుంది. ఆయన తరువాతివాళ్లలో ఒకరైన ఓ శృంగేరీ పీఠాధిపతి పరిశోధన చేసి, కాలడి లోని శంకరుల తల్లి సమాధిని కనుగొన్నారట. ఆ ప్రక్కనే వున్న ఇంట్లోనే శంకరుని జననం జరిగిందని నిర్థారించి, శంకరుడికి కూడా ఓ గుడి నిర్మాణం జరిగింది. ముందు శారదాంబ గుడి, తరువాత శంకరుని తల్లి సమాధి (అప్పటిలో పాతిన ఓ శిలా దీప స్థంభం ఇప్పటికీ వుంది), గణపతి ఆలయం, శంకరుని ఆలయం వున్నాయి ఆ ఆవరణ లో. దర్శనానికి టిక్కెట్టులేదు. కారు పార్కింగుకి, చెప్పులకి టిక్కెట్లు లేవు. అర్చనకి మాత్రం 10 రూపాయలనుకుంటా టిక్కెట్టు. పంచె, చొక్కా నిబంధన లేదు. ఫోటోలూ వీడియోలూ నిషిధ్ధం. అలా అని అవన్నీ డిపాజిట్ చేసెయ్యమనలేదు. శంకరుని గుడి ముందు మంటపం లోపల చుట్టూ శంకరుని జీవిత ఘట్టాల వర్ణ చిత్రాలు ప్రదర్శించారు. అక్కడ ఓ వీడియో కెమేరా, ఫ్లాష్ లైట్లూ తో హడావిడి కనిపిస్తే, యేదైనా సినిమా షూటింగా అని అడిగాను. కాదు--మఠం వాళ్లు తీయిస్తున్నారు అని చెప్పారు. అదన్నమాట సంగతి.

అలువ (అల్వేయి) లో, పెరియార్ నది ప్రక్కనే ఓ ప్రసిధ్ధ శివాలయం వుంది. మేము వెళ్లేసరికి సమయం మించిపోయింది. బయటనుంచే ఫోటో తీసుకొని వచ్చేశాము.

ప్రత్యేకత యేమిటంటే, ఆలయాలూ, రాజ ప్రాసాదాలూ వగైరాలు చాలా మటుకు నాలుగు వైపులా షెడ్డుల్లా నిర్మించి, పై కప్పుని కలపతోనూ, బంగాళా పెంకుతోనూ నిర్మించారు. కేరళలో వర్షపాతం యెక్కువ, కలప విరివిగా దొరుకుతుంది అనే కారణాలతో అయి వుండొచ్చు. గాలి గోపురాలూ, గర్భ గుడిపైన విమానాలూ వుండవు. మనవాళ్లకి కొంచెం ఆశ్చర్యంగా వుంటుంది.


Sunday, August 14, 2011

కేరళ లోని......



......ఆలయాలూ, ఆచారాలూ

అనుకోకుండానే మొన్న ఓ చిన్న పనిమీద  (ఆ పని విషయం వేరే టపాలో) కేరళ వెళితే, ఆ పని అయ్యాక, యెలాగూ వచ్చాముకదా అని, దేవాలయాలు చుట్టివచ్చాము--ఇతర ప్రదేశాలతోపాటూ.

తిరువనంతపురం లోని అనంత పద్మనాభ స్వామి ఈ మధ్య వార్తల్లోకి యెక్కాడుకదా--లక్ష కోట్లకి పైగా సంపదతో, బాలాజీని మించాడు అంటూ! వెళ్లి చూసి వచ్చాము--గుడినీ, దేవుణ్నీ మాత్రమే. (ఆ నేలమాళిగలూ వగైరా చూడనివ్వడం లేదు)

ఇక్కడ ఆచారం యేమిటంటే, మగవాళ్లు పైన చొక్కా, బనీనూ వగైరా లేకుండా, పెంచె మాత్రమే కట్టుకొని లోపలకి వెళ్లాలి. ఆడవారు చీరలూ, సల్వార్ కమీజు వేసుకోవచ్చుట. మోడరన్ డ్రెస్సులు మాత్రం నిషిధ్ధం.

చరిత్రలోకి వెళితే, అసలు ఈ ఆచారం యెలా యేర్పడింది? అనేదానికి సమాధానం వొక్కటే--జంధ్యం వేసుకొనే అగ్రవర్ణాలవారికి మాత్రమే ఆలయంలోకి ప్రవేశం వుండేది అప్పట్లో! అది స్పష్టంగా కనిపించడానికే ఈ యేర్పాటు.

1930 ల్లో గాంధీ గారు ఓ సభలో వుండగా, ఓ చిన్నపిల్ల ఆయనని అడిగిందట--ఆలయం చుట్టూ వీధుల్లో అందరూ స్వేచ్చగా తిరుగుతున్నారు, దేవుడి పనులు కూడా చేస్తున్నారు, మరి ఆలయంలోకి యెందుకు వెళ్లకూడదు అని ప్రశ్నించిందట. ఆయన అప్పటి ధర్మకర్త అయిన మహారాణివారిని ఆ ప్రశ్న ఆడిగాడట. దానికి ఆవిడ "అనాదిగా వస్తున్న ఆచారం" అని చెప్పిందట. 

అప్పటికి "మైనరు" గా వున్న మహారాజు (మహారాణిగారి మేనల్లుడు) ఆ క్షణంలోనే నిశ్చయం చేసుకొన్నాడట. తరువాత ఆయన మైనారిటీ తీరి, రాజు అవగానే పట్టాభిషేక సభలోనే "సర్వజనులకీ ఆలయ ప్రవేశం" ప్రకటన చేశాడట.

బిడ్డపోయినా.....అన్నట్టు, ఆ ఆచారం మాత్రం కొనసా....గుతోంది. 

పులిని చూసి......అన్నట్టు, ఆ రాష్ట్రంలో మిగతా ఆలయాలవాళ్లు అలాంటి ఆచారాలనే కొనసాగిస్తున్నారు--చిన్నా చితకా ఆలయాలతో సహా! కొన్నింటిలో ధోతీ నియమం లేదు--పేంటు ధరించవచ్చు. చొక్కా, బనీనూ మాత్రం విప్పేసి, చేతిమీద వ్రేళ్లాడేసుకొని, వెళ్లిపోవచ్చు.

ఇంక కెమేరాలూ, సెల్ ఫోనులూ నిషిధ్ధం. ఫోటోలు తీయడం నిషిధ్ధం. కొన్నిచోట్ల గర్భగుడిలో తప్ప, బయట ఫోటోలు తీసుకోవచ్చు. వీడియోలు నిషిధ్ధం! (టెర్రరిజం వంక వీటికి--పురాతన ఆచారాల ముసుగు! అక్కడికి దేవుడి ఫోటో తీస్తే ఆయన మహిమ తగ్గిపోతుందేమో మరి!)

అదీ సంగతి. 

Saturday, July 9, 2011

అబధ్ధాలూ, పచ్చి అబధ్ధాలూ, మరియు గణాంకాలూ

మన ప్రభుత్వ గణాంకాలు

దువ్వూరివారు మొన్న వుండబట్టలేక అనేశాడు--మన ప్రభుత్వ గణాంకాలు సరైన దృశ్యం చూపించడంలేదు అనీ, వాటిని వివిధ రకాలుగా సవరించుకొని అర్థం చేసుకోవలసి వస్తూంది అనీ, వృధ్ధి రేటు, ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా దానికి అతీతం కాదు అనీ! (వెంటనే ప్రభుత్వ 'గణాంకులు ' ఆయనమీద 'వూచల్లా వుబ్బెత్తున ' లేచారు! అది వేరే సంగతి.)

బ్యాంకు వుద్యోగులకి, దశాబ్దాల ట్రేడ్ యూనియన్ పోరాటాల ఫలితంగా, ఆ నాయకుల దూర దృష్టి ఫలితంగా, 'కరువు భత్యాన్ని ' "వినియోగదారుల ధరల సూచీ--సీ పీ ఐ--కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్" ఆథారంగా లెఖ్ఖించడం ప్రవేశపెట్టారు. అంతేకాకుండా, ప్రభుత్వ, యాజమాన్యాల ప్రమేయం లేకుండా, సీ పీ ఐ మీద ఆథారపడి, కరువు భత్యం పెరిగేలా/తగ్గేలా యేర్పాట్లు చేశారు. (ఆ మహానుభావులు యేలోకానవున్నారోగానీ, ఇప్పటిక్కూడా, మా పెన్షన్లమీద దాని ప్రభావం చక్కగా వుంది!) నిజం చెప్పాలంటే, బ్యాంకు వుద్యోగులెప్పుడూ ద్రవ్యోల్బణం గురించి పెద్దగా బాధపడలేదు!

నేను బ్యాంకులో చేరినప్పటికి (1973) సీ పీ ఐ "బేస్" 1960 = 100. అంటే, 1960లో సీ పీ ఐ యెంత వుందో ఆ గణాంకాన్ని ఆథారంగా చేసుకొని, తరువాత సీ పీ ఐ యెంత పెరిగిందో దాన్ని బట్టి, ఆటోమేటిక్ గా, ప్రతీ ఫిబ్రవరి, మే, ఆగస్ట్, నవంబరు నెలల్లో కరువు భత్యాన్ని సవరించేవారు--అది పెరిగినా తగ్గినా. అందుకే, "బ్యాంకు వాళ్ల జీతాలు యెక్కువ!" అని యేడిచేవారు ఇతర వుద్యోగులూ, సామాన్యులూ.

రాను రాను, ఆంధ్రా బ్యాంకు వుద్యోగులచేత 61 రోజుల సమ్మె చేయించిన (కమ్యూనిస్టు పార్టీ సభ్య ట్రేడ్ యూనియన్) నాయకులు--ఆ సమ్మె సఫలం అయితే, కార్మికులకి చాలా మంచిది, విఫలం అయితే, ప్రభుత్వాలకి మంచిది!--ఇందిరాగాంధీ సూచనలమేరకు, అప్పటి రాజకీయ అవసరాల నిమిత్తం--వెన్నుపోటు పొడిచారు! సమ్మె విఫలం అయ్యింది. (చివరగా పార్టీ "క్లోజ్డ్ డోర్" మీటింగులో, మా నాయకుడు కామ్రేడ్ దువ్వూరి కృష్ణ మూర్తి తన చుట్ట నుశి దులిపేస్తూ, "మీరేమి నిర్ణయం తీసుకున్నా నాకు దీనితో సమానం" అని వాక్ అవుట్ చేశారట!). నిజంగా ఆయనెంత గొప్ప నాయకుడంటే, ఆ సమ్మె ఫలితంగా, వుద్యమం ఫలితంగా, వుద్యోగాలని కోల్పోయిన వాళ్లని సైతం, మళ్లీ వుద్యోగాలలో చేరేలా చేసి, ఏ ఒక్క వుద్యోగీ 'వెంట్రుక ' కూడా వూడకుండా, అందరినీ రక్షించారు--1975 మార్చి లోగా!

తరువాత, ట్రేడ్ యూనియన్లు కాంగీ తో కుమ్మక్కయి, అంతకు ముందు వున్న 'సెటిల్ మెంట్లనీ', వ్యవహారాలనీ కాలరాయడం ప్రారంభించాయి. (ఏమర్జెన్సీ పుణ్యమా అని, నాలుగేళ్లకోసారి జరిగే వేజ్ రివిజన్లు వెనకబడ్డాయి. కమూనిస్ట్ పార్టీలు ఎమర్జెన్సీని సమర్థించదమే దీనికి కారణం.) తరువాత, ఓ కొత్త విధానానికి తెరతీశాయి ఆ పార్టీలు. అదే "డీ యే మెర్జర్"! అంటే, 1960 బేస్ గా లెఖ్ఖిస్తున్న సీ పీ ఐ ని, బేస్ 1970 గా మార్చి, అక్కడివరకూ పెరిగిన పాయింట్లని "బేసిక్" లో కలిపెయ్యడం, డీ యే కోసం కొత్త లెఖ్ఖింపు ప్రారంభించడం. ఇప్పటికీ ఆ విధానం కొనసాగుతూనే వుంది.

చెప్పొచ్చేదేమిటంటే, 1960 బేస్ గా వున్న సీ పీ ఐ మీద యెంత పెరుగుదల వుందో, అంతా కరువు భత్యం ఇవ్వాలా వద్దా? మధ్యలో "బేస్" మార్చడం యెందుకు? ఇది సామాన్యులకి అర్థం కాదు!

అలాగే, ద్రవ్యోల్బణం సూచీలని--డబ్ల్యూ పీ ఐ--హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఆథారంగా లెఖ్ఖించడం (పరిగణనలోకి తీసుకొనే వస్తువుల్లో నట్లూ, బోల్టులూ వంటివాటి ధరలని పరిగణించడం తప్పు) అనీ, పైగా "బేస్" ని మార్చడం శుధ్ధ పొరపాటు అనీ, ఇప్పుడు ద్రవ్యోల్బణం, ఆహార ద్రవ్యోల్బణం "ఒక నెల క్రితం ఇదే తారీఖున" వున్న రేట్లని బేస్ గా గరహించడం పెద్ద బ్లండర్ అనీ--దువ్వూరివారే కాదు, యెవరైనా వొప్పుకోవలసిందే కదా?

ఈ లండాచోరీలు ఇలా వుంటే, వో ప్రక్కన మన దేశ కంపెనీలు, మనదేశంలో పెట్టే పెట్టుబడులు తగ్గిపోతున్నాయట! అవునుకదా? ఆంధ్ర లో తెలంగాణా; ఒరిస్సా కర్ణాటకల్లో పోస్కో; యూపీలో రాహుల్; ప. బెంగాల్లో మమత; గుజరాత్ లో సీ ఎం మీద అనేక కేసులూ, ఆరోపణలూ; ఛత్తీస్గఢ్, వుత్తరాఖండ్ లాంటి, ఈశాన్య రాష్ట్రాల్లాంటి చోట్ల మావిస్టులూ వగైరాలూ; పేట్రేగి పోతుంటే, (కాశ్మీరులోనైతే, 'మ్యూజిక్ షో'లు కూడా జరగట! మ్యూజిక్ షోలకి అనుమతి ఇస్తే, వ్యభిచారానికి యెందుకు ఇవ్వకూడదు? అనె ఫేస్ బుక్ మొత్తం నిండిపోయిందట! ఇంకా అక్కడ సినిమాలు గత మూడేళ్లుగా ప్రదర్శింపబడడంలేదట. సెల్ ఫోన్లవల్ల ఆడపిల్లలు చెడిపోతున్నారట, అందుకని వాటిని 'ఝీలం ' నదిలో పారెయ్యాలట! ఇంకా, ఓ సెకండరీ స్కూల్ లోని ఆడా, మగా పిల్లలందరూ, తమ ప్రథానోపాధ్యాయుల, ఇతర వుపాధ్యాయుల/వుపాధ్యాయినుల పర్యవేక్షణలో పిక్ నిక్ కి వెళ్లినా, అది తప్పట!) యేమి జరుగుతుంది?

ఇలాంటి పరిస్థితుల్లో, దేశంలో యెవరు పెట్టుబడులు పెడతారు? అని మేథావులని పట్టి పీడిస్తున్న ఓ సందేహం!

మీరేమన్నా జవాబు చెప్పగలరా? ప్రయత్నించండి!

2014 వరకూ ఆగాలా? అది కూడా చెప్పండి మరి!!!!!

Friday, July 8, 2011

యూపీయే ప్రభుత్వమూ

కాంగీల వ్యవహారం

రోకలి నానేసి, అది పూర్తిగా కరిగినప్పుడే "సరైన సమయం" అనీ, అప్పుడే "సరైన నిర్ణయం" అనీ జనాలని నమ్మిచడంలో వుద్దండులు కాంగీలు. లేకపోతే, 13 మంది ఎంపీల రాజీనామాలని పరిశీలించడానికి స్పీకరమ్మకి ఆగస్ట్ 1 వరకూ పడుతుందట. అప్పుడు తీరిగ్గా వాటిగురించి "మాట్లాడుతుందట"! గులాం నబీ అంటాడూ, "విస్తృత ప్రజాభిప్రాయం" సేకరించాలట. అన్ని కోట్లూ, అంత సమయం తగలెట్టి, శ్రీకృష్ణ కమిటీ చేసిందేమిటో? పిచ్చి 'దంబరం '--ఆ రెండు పార్టీలూ తమ అభిప్రాయం చెప్పాలి, అప్పటి వరకూ యేమీ చెయ్యలేము ' అంటాడు. ఆ రెండిట్లో ఒకటి తమ పార్టీయేనట! రెండోది తెలుదేశం. వాళ్లు ప్రణబ్ ముఖర్జీకి చెప్పినా, శ్రీ కృష్ణ కమిటీకి చెప్పినా, వాళ్ల ఎంపీలు కూడా రాజీనామా చేసినా, అది స్పష్టమైన అభిప్రాయం కాదట!

ఇంక పెట్టుబడిదారీ పత్రికల్లో, అనేక పరిష్కారాలు సూచించబడుతున్నాయి. అందులో ఒకటి, తెలంగాణా ఇచ్చేసి, హైదరాబాదుని మాత్రం "హాంకాంగ్" తరహాలో స్థానిక ప్రభుత్వం చేతిలోనే వుంచాలట. అప్పుడే సీమాంధ్ర వాళ్లకి నమ్మకం వుంటుందట! హాంకాంగ్ పరిస్థితి వేరు అనీ, అది రెండు దేశాల మధ్య తగాదాకి పరిష్కారం అనీ మరిచిపోతున్నారు! మరి అలా అయితే, మన దేశం లోనే 'చండీగఢ్' వుందికదా? దాన్ని పంజాబ్, హర్యాణా రెండు రాష్ట్రాలకి రాజధానిగా వుంచారు కదా? అదీ ఓ పరిష్కారమే కదా? అసలు సమస్య సృష్టించబడడానికి మూలం యేమిటీ, దాని పరిష్కారం అవసరమా, అయితే అదెలాగ అనేవి వొదిలేసి, యెందుకు విషయాన్ని జటిలం చెయ్యడం?

ఇదివరకు రెండుసార్లు ఇందిరాగాంధీ పరిష్కరించిన విధానం యెలాగూ అందుబాటులోనే వుంది. ఎస్ ఎల్ నరసిమ్హం గారు తమ అస్త్రాన్ని యెప్పుడో పదునుపెట్టి వుంచారు. అందుకనే, కాంగీ ఎంపీలు ముఖాలు వ్రేళ్లాడేసుకొని వెనక్కి వచ్చేశారు. కోదండరాం, కేసీఆర్ ప్రకటించిన వుద్యమ కార్యక్రమమే ఐకాస కార్యక్రమమని ప్రకటించినవాడు, మళ్లీ అన్నిపార్టీల అభిప్రాయం అంటూ కార్యక్రమాన్ని వాయిదా వేశాడు. (కేసీఆర్ యేమీ మాట్లాడడం లేదు--ఇప్పుడు అందరు నేతలూ "ఒకే తాటి" పైకి వచ్చారని ప్రకటించారు కాబట్టి, రేపటి నుంచి ఆ తాటిని ముక్కలు చెయ్యడం మొదలెడతాడు చూడండి!).

అసలు గొడవంతా, నేనే అధిష్టానం అని విర్రవీగిన కేకే, ఇతర సీనియర్లు అధిష్టానం దగ్గర వొకరిమీద వొకరు చెప్పుడుమాటలు చెప్పుకొన్న ఫలితంగా, సీ డబ్ల్యు సీ పదవి వూడగొట్టడంతో వచ్చింది--ఆవేశం కట్టలు తెంచుకోడం!

అయినా, అధిష్టానం లెఖ్ఖలు వాళ్లకున్నాయి మరి!

మరి పరిష్కారం అంటారా? రోకలి నానాలికదా?!

Tuesday, June 28, 2011

తెలంగాణ భాషా........


......."తెలుగు భాష" వేరా?

"తెలుగు భాష" కు అక్షరములెన్నీ? అవి యేవి? (యే ఆరో క్లాసు తెలుగు పరీక్షాపత్రంలోనో ఆ ప్రశ్న వచ్చిందనుకోండి--ఇప్పటి తెలివైన విద్యార్థులు "తెలుగు భాషకు అక్షరములు యేబదియారు (56). అవి 'అ మొదలు ఱ ' వరకూ--అని ఠక్కున చెప్పేస్తారు). 
 
ఓ వెయ్యి సంవత్సరాల క్రితం (అప్పటికి ఆరో క్లాసు లేదనుకోండి), సమాధానం వేరేగా వుండేది. ఓ ఐదువందలేళ్ల క్రితమైతే వేరే సమాధానం వచ్చేది. ఇంక, మూడు వందలా, రెండువందలా, వంద సంవత్సరాల క్రితం కూడా వచ్చిన సమాధానం, ఇప్పటి తెలివైన తెలుగు విద్యార్థులు చెప్పేదేననుకుంటా. యెందుకంటే, మొదట్లో తెలుగు భాషకి "అచ్చులూ, హల్లులూ" అనే విభజన లేదు. భాష అవసరం ఓ వ్యక్తి భావాలని యెదటివాడికి తెలియజెయ్యడానికే కదా? అలా తెలియజెయ్యడం ప్రక్రియలో భాగం, "వ్రాయడం" కదా? అప్పట్లో అంత "స్పష్టత" అవసరం లేకపోవడంతో, అచ్చులే లేవు. 
 
వుదాహరణకి, "బాటసారియొకడు దన యూరినుండి బయలుదేరి, వేరొక జోటికి బయనమైనాడు. దారిలోనొక భయంకరమైనయడవియున్నది. కష్టములకోర్చి యాతడు దానినధిగమింపదలచినాడు....." ఈ కథలో అచ్చుల అవసరం యేమి వుంది? 
 
11వ శతాబ్దం వాడైన నన్నయ, 13వ శతాబ్దం వాడైన తిక్కన, 14వ శతాబ్దం వాడైన యెర్రన, నన్నయ "వాగనుశాసనుడు"గా ప్రవేశపెట్టిన వ్యాకరణాన్నే అనుసరించారు. తరువాతెప్పుడో, "ఇతరుల వస్తువులని దొంగిలించడంలో నిపుణుడు (శ్రేష్టుడు)--అంటే, "పరవస్తు చిన్నయ సూరి" బాల వ్యాకరణం వ్రాసాక, తన పంచతంత్రం వ్రాశాక, తెలుగు భాషకు అక్షరములు యేబదియారు......అని పుట్టింది. ఆయనే అచ్చులూ, హల్లులూ, వుభయాక్షరములూ--అని ప్రవేశపెట్టాడు(ట). అంతక్రితం మన భాష "ఆన్‌ధ్రము". (వుభయాక్షరాలు లేవు.) ఇంకా, "తలకట్టు" స్థానంలో వచ్చే "అకార, ఇకార, ఉకార....." వగైరాలు లిపిలో నిర్దేశించబడ్డాయి. వుదాహరణకి, "క; కి; కు; కృ; కే; కై" ల దాకా. కొ వ్రాయాలంటే, క కి ఎ కారం ఇచ్చి, ప్రక్కన ఉ కారం ఇచ్చేవారు! "కౌ" వ్రాయాలంటే, "కవు" అని వ్రాసేవారు. (ఇప్పటికీ, "మొహం" అంటే, మ కి ఎ కారం ఇచ్చి, ప్రక్కన ఉ కారం ఇస్తాం. "మోసము" అని వ్రాయాలంటే, మ కి ఎ కారం ఇచ్చి, ప్రక్కన ఊ కారం ఇస్తాము. అలాగే, ఇదివరకు "నోటిసు" అని వ్రాయాలంటే, న కి ఎ కారం ఇచ్చి, ప్రక్కన ఊ కారం ఇచ్చేవాళ్లు! కానీ ఇప్పుడు న కి ఓ కారం డైరెక్టుగా ఇచ్చేస్తున్నాము! "కౌలు" అని వ్రాయాలంటే, క కి ఎ కారం ఇచ్చి, ప్రక్కన ఊ కారం ఇచ్చేవారు. ఇప్పుడు క పైన డైరెక్టుగా ఔ కారం ఇచ్చేస్తున్నాము. అవీ భాషా, లిపి పరిణామాలంటే.

దేవులపల్లివారికి ఓ సందేహం వచ్చిందట--"మావి చిగురు తినగానే 'కోవిల ' పలికేనా? కోవిల గొంతు వినగానే, మావి 'చివురు ' తొడిగేనా? యేమో! యేమౌనోగానీ, ఆమని....ఈవని!" అని. బాగానే వుంది.....చెట్టు ముందా? విత్తు ముందా? అనడంలో ఓ వెరయిటీ. ఓ రోజు, కాకినాడ సూర్యకళా మందిరం లో ఆయనకి సన్మానం జరుగుతూంటే, ఓ 'పినాకొ ' ఆయన్ని "కోయిల; కోయెల; కోకిల--ఇలా అన్ని మాటలుండగా, "కోవిల" అని యెందుకు వ్రాశారు? అని ప్రశ్నించాడు, వ్రాతపూర్వకంగా. ఆయన కూడా వ్రాతపూర్వకంగానే జవాబిచ్చారుట--"మీరు మాట్లాడేది తెలుగు, నేను వ్రాసినది 'తెనుగు '!" అని. అదీ తేడా. 
 
అసలు "తెలుగు" యెలా వచ్చింది? "తెనుగు" యెలా వచ్చింది? "మా ఆరువేళ్ల" మేష్టారు శేషాచార్యులుగారు చెప్పినట్టు, "త్రిలింగ--అంటే మూడు లింగాల మధ్య వున్న దేశం, తెలుగు దేశం! వాళ్లది తెలుగు భాష!" "త్రి నగ దేశం--అంటే మూడు కొండల మధ్య వున్న దేశం--అదే "తెనుగు" దేశం!" (ఆ మూడు లింగాలూ, ఆ మూడు నగాలూ మీరే తెలుసుకోండి!)

మరి మధ్యలో, ఈ "తెలంగాణా భాష" యెక్కడనుంచి వచ్చిందీ?

........తరువాయి మరోసారి.       

Friday, June 17, 2011

నిరసనలూ, నిరశనలూ


దీక్షలు

చంటి పిల్లాడు కూడా, తనకి కావలసింది దొరకనప్పుడో, ఇష్టంలేనిది జరిగినప్పుడో, "నిరసన" ప్రకటిస్తాడు (తనకు తోచిన, తనకు చాతనయిన రీతిలో)! అది మానవ జాతికేకాదు, పశు పక్ష్యాదులన్నింటికీ, ప్రకృతికీ భగవంతుడిచ్చిన వరం! తనకి ఓ అన్యాయం జరిగింది, జరుగుతోంది, జరగబోతోంది అని నిరసన తెలపడం స్వతంత్ర దేశ పౌరులందరి రాజ్యాంగ ప్రసాదిత హక్కు. ఆ నిరసన తెలియజెయ్యడానికి యెవరికి తోచిన, చాతనైన మార్గం వారు అనుసరించడం జరుగుతూంది. ఈ నిరసనలు, సమస్యనిబట్టి, సామూహికంగా కూడా తెలపడం జరుగుతూంది.

ఈ నిరసన మార్గాలలో కొన్ని--గొంతెత్తి అరవడం, తిట్టడం, ప్రచురించే వాళ్లుంటే, ఓ జోకో, కార్టూనో, కవితో, కధో వెయ్యడం, ప్రచురించేవాళ్లు లేకపోతే, ఓ కరపత్రం ప్రచురించి పంచిపెట్టడం, పోలీసు ఫిర్యాదో, న్యాయపరమైన చర్యలో తీసుకోవడం, నిరాహార/నిరశన దీక్ష చెయ్యడం, సామూహికంగానైతే, వూరేగింపులూ, ర్యాలీలూ, ఘెరావోలూ, ధరణాలూ, హర్తాళ్లూ, బందులూ, రాస్తా/రైలు రోకోలూ, ముట్టడులూ, సామూహిక "రిలే" నిరాహార దీక్షలూ, గడ్డి బొమ్మల దహనాలూ, ఇంకా "వినూత్న" అంటూ, "అర్థ నగ్న" (మన అదృష్టం కొద్దీ ఒక సగమే!); "మోకాళ్లపై"; కొండొకచో తలక్రిందులుగా వగైరాలూ--ఇలా యెవరి వూహకందిన పధ్ధతిలో వారు తెలియజేస్తున్నారు.

మన జాతిపితమీద ఓ పెద్ద విమర్శని వ్రాసి, స్వయంగా ఆయనకే చదువుకోడానికి ఇస్తే, ఆయన అది చదివి, ఆ కాయితాలకి గుచ్చిన గుండుసూదిని తీసుకొని, కాయితాలు తిరిగి ఇచ్చేశాడట. యేమని అడిగితే, "వాటిలో విలువైనది మాత్రమే నేను గ్రహించానుకదా?" అన్నాట్ట.

జాతి నిర్మాత, పార్లమెంటులో, "గడ్డిపరక కూడా మొలవని ఆక్సాయ్ చిన్ లాంటి ప్రాంతం చీనావాళ్లు ఆక్రమిస్తే, దానిగురించి ఇంత గొడవ చేస్తారేమిటి?" అని విసుక్కొంటే, ప్రతిపక్ష నాయకుడు "మీ బట్టతలమీద గడ్డి పరక మొలవదుకాబట్టి దాన్ని కూడా.....?" అనడిగాడట.

"నేను రక్షణ మంత్రిని అయ్యాను కాబట్టి, ఇంక యుధ్ధాలు వుండవు" అని కొత్తగా శాఖ మారిన మంత్రి ప్రకటిస్తే, "ఆ విషయం నాకు ఖచ్చితంగా తెలుసు" అన్నాడట ప్రతిపక్ష నాయకుడు. "యెలా?" అని అందరూ ఆశ్చర్యపోతుంటే, "ఇంతకు ముందు మీరు ఆహార మంత్రిగా వున్నారు--దేశంలో ఆహారం లేదు కదా?" అన్నాడట.

"యేమిటో! ప్రసంగించినంతసేపూ టోపీని ముందునుంచి వెనక్కీ, వెనకనుంచి ముందుకీ త్రిప్పడం తప్పిస్తే, దానివల్ల ప్రయోజనమేమిటో తెలియడంలేదు!" అని అపహాస్యం చేసిన ప్రతిపక్ష నాయకుడిని, మన ముఖ్యమంత్రి వొకడు "నా టోపీ తిరిగినంతసేపూ, మీ బుర్ర తిరుగుతూ వుండడమే నాకు వచ్చే ప్రయోజనం" అన్నాడట.

రెండో ప్రపంచయుధ్ధం ముందు, అప్పటికి కేవలం పార్లమెంటు సభ్యుడిగానే వున్న "చర్చిల్", ఓ కాలేజీలో బహుమతి ప్రదాతగా వెళ్లి, "సాధారణంగా, నాలాంటివాళ్లు తమ ప్రసంగం--'నేను చదువుకున్నప్పుడు నాకే ప్రైజులూ రాలేదు, నిజంచెప్పాలంటే, మా క్లాసులో అట్టాడుగున వుండేవాణ్ణి' అంటూ ప్రారంభిస్తారు! కానీ, నాకలా ప్రారంభించే అవకాశం లేదు--యెందుకంటే, నాకే ప్రైజులూ రాకపోయినా, నేను మా క్లాసులో 'అట్టడుగున' వుండే వాణ్ని కాదు....దానికి కొంచెం మాత్రమే 'పైన' వుండేవాణ్ని!" అని ప్రారంభించాడట.

ప్రపంచ ప్రఖ్యాతులైన వాళ్లు ఇలా తమమీద తామే జోకులేసుకొని, ఇతరులకి ఆ ఛాన్స్ ఇచ్చేవారుకాదు.

ప్రొద్దునే పేపర్లన్నీ చూసి, వాటిలోని కార్టూనులని చూసి, ఎంజాయ్ చేసి, కార్టూనిస్టులని మెచ్చుకొంటూ, వీలైనంతవరకూ తమ పంధా మార్చుకొంటామంటూ వుత్తరాలు కూడా వ్రాసేవారు!

తరాలు మారాయి.

ఇప్పుడు, ప్రభుత్వోద్యోగులు తమ నిరసనలో భాగంగా దిష్టిబొమ్మని దహనం చేస్తే, తరువాత చర్చలకు వచ్చిన వాళ్లతో, "నా బొమ్మని దహనం చేశారుగా? మళ్లీ యేమొహం పెట్టుకొని నా దగ్గరకి వచ్చారు?" అని రుసరుసలాడినవాడొకడు! (దహనం అవసరం లేకుండానే పోయింది వాడి దేహం!)

రేపు నిరసన తెలియజెయ్యడానికి కలెక్టరు అనుమతి ఇస్తే, ఇవాళ రాత్రే ప్రైవేటు గూండాలనీ, పోలీసులనీ మోహరించేసి, ప్రొద్దున్నే దొరికినవాళ్లని దొరికినట్టు బాదేసి, కాల్పుల్లో కొంతమందిని పొట్టనపెట్టుకొనే అమాత్య వర్యులు కొంతమంది.

ఓ వారం రోజులపాటు వూరుకొని, తరవాత "నిరసనలకి మీకు అనుమతి లేదు" అంటూ, ప్రత్యేక విమానాల్లో ముఖ్యులని తరలించే "ప్రథానీ", ఆయన తైనాతీలూ!

ఇదీ నేటి దృశ్యం!


మహాత్మా గాంధీ మనకిచ్చిన వరం "నిరాహార"/"నిరశన" దీక్ష! "సత్యాగ్రహం" ప్రకటించడానికి ఇదో తిరుగులేని అస్త్రం! (నిరాహారకీ, నిరశన కీ తేడా యేమిటి? అంటే--ఇప్పుడవన్ని యెవరైనా పాటిస్తున్నారో, లేదో గానీ--అశనము అంటే అన్నం. అది తప్ప, ఫలాహారాలూ, పాలూ, పళ్ల రసాలూ తీసుకొంటూ సాగించేది "నిరశన". అసలు యేవిధమైన ఆహారం (తినేవి) తీసుకోకుండా, ద్రవ పదార్థాలతో మాత్రమే కొనసాగించేది "నిరాహారం". నీళ్లలో వుప్పూ, కొద్దిగా నిమ్మరసం మాత్రమే స్వీకరిస్తారు వీరు. అందుకే వాళ్ల దీక్షని విరమింపచెయ్యడానికి, నీళ్లు కలపని నిమ్మరసం వుప్పుతో త్రాగిస్తారు!)

ఇప్పుడది "దుర్వినియోగం" అవుతున్న తీరు చూస్తూంటే, 'వజ్రాయుధం పదును పోయిందా?' అని సందేహం రాకమానదు.

ఈ దీక్షల్లో, 24 గంటల దీక్షలూ, 12 గంటల/6 గంటల/4 గంటల/టిఫినుకీ, భోజనానికీ మధ్య దీక్షలూ ప్రక్కన పెడితే, "ఆమరణ" అనేది ఇప్పటికీ వజ్రాయుధమే! కానీ ఆ వజ్రాయుధ ప్రయోగానికి కూడా కొన్ని పరిస్థితులు కలిసి రావాలి.

అలాంటి ఆయుధం పరువు తీసే, కేసీఆర్, లగడపాటి, జగన్ వగైరాల దీక్షలవల్ల ప్రయోజనం యేమిటి?

ఆ మధ్య "నెట్" లోనే చూశాను--ఒకావిడ, జర్నలిష్టు అనుకుంటా, ఈశాన్య రాష్ట్రాల్లో యెక్కడో కొన్ని నెలలుగానో, సంవత్సరాలుగానో తన "నిరశన దీక్ష" కొనసాగిస్తూందట. చట్టం ప్రకారం మూడు నెలలకు మించి ఆమెని నిర్బంధంలో వుంచడానికి వీల్లేకపోవడంతో, హాస్పటల్లో మూడు నెలలు ఆవిడ బ్రతికేలా చూసి, వదిలేస్తారట. బయటికి వచ్చినరోజే ఆవిడ నిరాహారంగా గడపడంతో, రాత్రి 12 అవగానే మళ్లీ ఆవిడని అరెష్టు చేసి ఆస్పత్రికి తరలించి, మళ్లీ ఓ మూడు నెలలు మరణించకుండా చూస్తారట!!! ఇలాంటి "ఒంటరి" పోరాటాలవల్ల ప్రయోజనం యేమిటి? వ్యక్తిగతంగా ఆవిడకి సానుభూతి తెలపడం తప్ప మనం చెయ్యగలిగింది యేముంది?

"నిరశన" దీక్ష సుదీర్ఘంగా కొనసాగిస్తూ "మరణించి", తన అభీష్టాన్ని నెరవేర్చుకొన్నవాళ్లలో ప్రథముడు మన "పొట్టి శ్రీరాములు" మాత్రమే. (చచ్చి సాధించాడు అంటారు చూడండి--అలాగ!)

అలా సాధించుకోలేకపోయిన వాళ్లలో, 72 రోజులపాటు దీక్షని కొనసాగించి, మరణించినవాడు "దర్శన్ సింగ్ ఫెరుమాన్"! ఆయన చండీగఢ్ ని పంజాబులో విలీనం చెయ్యాలంటూ దీక్ష సాగించాడు. ఇప్పటికీ అదే రికార్డు. ఆయన కోరిక తీరనే లేదు.

అప్పటిలో, ఆసుపత్రికి తరలించడాలూ, జీవన మద్దతు ప్రక్రియలు (లైఫ్ సపోర్ట్ సిస్టంస్) నిర్వహించడాలూ, వగైరాలు లేవు. (వుంటే ఆయన ఇంకెన్నాళ్లు కొనసాగించేవాడో....రికార్డు యెన్నిరోజులకి చేరునో!)

మొన్న, "రాందేవ్" యెనిమిది రోజులు సాగించాడు. (జరిగిన కథ అందరికీ తెలిసినదే!)

అదే రోజుల్లో, ఆయనకన్నా ముందునుంచీ, ఒకాయన తన దీక్షని కొనసాగిస్తున్నాడు--మీడియాగానీ, ప్రభుత్వాలుగానీ, ప్రజలు గానీ పట్టించుకోలేదు! చివరికి ఆయనని బలిపెట్టారు! (అప్పుడు కొంతమంది నిట్టుర్చారు!)

ఆయనే, "స్వామీ నిగమానంద"! హరిద్వార్ 'మాతృ సదనం ' ఆశ్రమానికి చెందిన 35 యేళ్ల ఈ సన్యాసి, మొన్న ఫిబ్రవరి 19 నుంచి, ఉత్తరఖండ్ ప్రభుత్వం హరిద్వార్ సమీపంలో గంగానది ప్రక్కన గనుల త్రవ్వకాలని నిషేధించి, గంగని కాపాడాలి అంటూ తన నిరశన దీక్షని కొనసాగించాడు. మొన్న ఏప్రిల్ 27న ఆయనని హరిద్వార్ జిల్లా ఆసుపత్రికి తరలించారట. అక్కడకూడా తన దీక్షని కొనసాగిస్తూ, మే 2న 'కోమా' లోకి వెళ్లిపోతే, ఇంకో పెద్దాసుపత్రికి తరలించి జీవన మద్దతు ప్రక్రియలని ప్రారంభించినా, 115 రోజుల తరవాత, జూన్ 14న మరణించాడు. ఆయన చుట్టూ మీడియా కెమేరాలు లేవు, పత్రికా ప్రతినిధులు లేరు, ప్రజలు లేరు, బంధు మిత్రులసలే లేరు! పైగా, ఆయన మరణించగానే, కాంగీవాళ్లు, ఆ రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రే దానికి బాధ్యుడు అంటూ గోల మొదలెట్టారట--మరి 115 రోజులపాటు యేమి చేశారో? వాళ్లతో గుంటనక్క జైరామ్ రమేష్ కూడా గొంతు కలిపాడట! ఆ స్వామికి సన్నిహితుడైన హరిద్వార్ ప్రజా సంఘం అధ్యక్షుడు "ఆసుపత్రిలో ఆయనకి విషం ఇవ్వడం వల్ల ఆయనకి గుండె పోటు వచ్చి చనిపోయాడు" అన్నాడట. మే 15నే పోలీసులవద్ద, మైనింగ్ మాఫియా ప్రోద్బలంతో ఆ ఆసుపత్రి డాక్టర్ ఆయనకి విషమిచ్చాడు అని ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేసినా, సహజంగానే యెవరినీ అరెష్టు చెయ్యలేదని మాతృ సదనం వాళ్లు అన్నారట!



నాయకులకీ, ప్రజలకీ నా విఙ్ఞప్తి--బ్రతికి సాధించండి! పిల్లలకి మనం చెపుతామే--అపజయం విజయానికి తొలిమెట్టు, చచ్చి సాధించేదేమీ లేదు, ఆత్మహత్య మహాపాపం, ఆత్మహత్య అనేది పిరికివాళ్లు చేసే పని, బతికుంటే బలుసాకు తినొచ్చు, వూపిరుంటే వుప్పు అమ్ముకొని బతకొచ్చు--ఇలాంటి పిచ్చి పిచ్చి నీతులు? "ఈజిప్టు" తరహాలూ అవీ అంటూ మొదటికే మోసం తెచ్చుకోవద్దు. మీ వెనకాల కనీసం కొన్ని లక్షలమంది వుంటేనే, అదీ ఆఖరి అస్త్రంగానే ఇలాంటి దీక్షలు చేపట్టండి--అదీ డ్రామాలకో, ప్రభుత్వం వారు విరమింపచెయ్యకపోతారా అనే ధీమాతోనో వద్దు--అదీ, నిజంగా ఆత్మార్పణ ద్వారానైనా "లక్ష్యం" సిధ్ధిస్తుంది....తరువాతివాళ్లైనా దాన్ని సాధిస్తారు అని నమ్మకం వుంటేనే!

రాజకీయులూ! నిరసన కార్యక్రమాల్లో, ఘెరావోలూ, బందులూ, హర్తాళ్లూ మొదలైనవి సహజమరణం చెందినట్టే. ఇక రాస్తా/రైలు రోకోలు మానండి. ఇంకేమైనా ప్రత్యామ్నాయాలు--మిమ్మల్ని సమర్ధించే ప్రజలకి ఇబ్బంది కలగజెయ్యనివి--కనిపెట్టండి. లేదా, ప్రతీ శాసన సంస్థా, ప్రభుత్వ కార్యాలయం వగైరాల ముందు "నిరసన" కేంద్రాలు యేర్పాటు చేసేలా చట్టాలు చేసి, అక్కడకి వెళ్లి తన్నులు తినే కార్యక్రమాలకి శ్రీకారాలు చుట్టుకోండి!

మీకు అప్పుడే మా మద్దతు సంపూర్ణంగా వుంటుంది!

జై భారత్!