Tuesday, June 28, 2011

తెలంగాణ భాషా........


......."తెలుగు భాష" వేరా?

"తెలుగు భాష" కు అక్షరములెన్నీ? అవి యేవి? (యే ఆరో క్లాసు తెలుగు పరీక్షాపత్రంలోనో ఆ ప్రశ్న వచ్చిందనుకోండి--ఇప్పటి తెలివైన విద్యార్థులు "తెలుగు భాషకు అక్షరములు యేబదియారు (56). అవి 'అ మొదలు ఱ ' వరకూ--అని ఠక్కున చెప్పేస్తారు). 
 
ఓ వెయ్యి సంవత్సరాల క్రితం (అప్పటికి ఆరో క్లాసు లేదనుకోండి), సమాధానం వేరేగా వుండేది. ఓ ఐదువందలేళ్ల క్రితమైతే వేరే సమాధానం వచ్చేది. ఇంక, మూడు వందలా, రెండువందలా, వంద సంవత్సరాల క్రితం కూడా వచ్చిన సమాధానం, ఇప్పటి తెలివైన తెలుగు విద్యార్థులు చెప్పేదేననుకుంటా. యెందుకంటే, మొదట్లో తెలుగు భాషకి "అచ్చులూ, హల్లులూ" అనే విభజన లేదు. భాష అవసరం ఓ వ్యక్తి భావాలని యెదటివాడికి తెలియజెయ్యడానికే కదా? అలా తెలియజెయ్యడం ప్రక్రియలో భాగం, "వ్రాయడం" కదా? అప్పట్లో అంత "స్పష్టత" అవసరం లేకపోవడంతో, అచ్చులే లేవు. 
 
వుదాహరణకి, "బాటసారియొకడు దన యూరినుండి బయలుదేరి, వేరొక జోటికి బయనమైనాడు. దారిలోనొక భయంకరమైనయడవియున్నది. కష్టములకోర్చి యాతడు దానినధిగమింపదలచినాడు....." ఈ కథలో అచ్చుల అవసరం యేమి వుంది? 
 
11వ శతాబ్దం వాడైన నన్నయ, 13వ శతాబ్దం వాడైన తిక్కన, 14వ శతాబ్దం వాడైన యెర్రన, నన్నయ "వాగనుశాసనుడు"గా ప్రవేశపెట్టిన వ్యాకరణాన్నే అనుసరించారు. తరువాతెప్పుడో, "ఇతరుల వస్తువులని దొంగిలించడంలో నిపుణుడు (శ్రేష్టుడు)--అంటే, "పరవస్తు చిన్నయ సూరి" బాల వ్యాకరణం వ్రాసాక, తన పంచతంత్రం వ్రాశాక, తెలుగు భాషకు అక్షరములు యేబదియారు......అని పుట్టింది. ఆయనే అచ్చులూ, హల్లులూ, వుభయాక్షరములూ--అని ప్రవేశపెట్టాడు(ట). అంతక్రితం మన భాష "ఆన్‌ధ్రము". (వుభయాక్షరాలు లేవు.) ఇంకా, "తలకట్టు" స్థానంలో వచ్చే "అకార, ఇకార, ఉకార....." వగైరాలు లిపిలో నిర్దేశించబడ్డాయి. వుదాహరణకి, "క; కి; కు; కృ; కే; కై" ల దాకా. కొ వ్రాయాలంటే, క కి ఎ కారం ఇచ్చి, ప్రక్కన ఉ కారం ఇచ్చేవారు! "కౌ" వ్రాయాలంటే, "కవు" అని వ్రాసేవారు. (ఇప్పటికీ, "మొహం" అంటే, మ కి ఎ కారం ఇచ్చి, ప్రక్కన ఉ కారం ఇస్తాం. "మోసము" అని వ్రాయాలంటే, మ కి ఎ కారం ఇచ్చి, ప్రక్కన ఊ కారం ఇస్తాము. అలాగే, ఇదివరకు "నోటిసు" అని వ్రాయాలంటే, న కి ఎ కారం ఇచ్చి, ప్రక్కన ఊ కారం ఇచ్చేవాళ్లు! కానీ ఇప్పుడు న కి ఓ కారం డైరెక్టుగా ఇచ్చేస్తున్నాము! "కౌలు" అని వ్రాయాలంటే, క కి ఎ కారం ఇచ్చి, ప్రక్కన ఊ కారం ఇచ్చేవారు. ఇప్పుడు క పైన డైరెక్టుగా ఔ కారం ఇచ్చేస్తున్నాము. అవీ భాషా, లిపి పరిణామాలంటే.

దేవులపల్లివారికి ఓ సందేహం వచ్చిందట--"మావి చిగురు తినగానే 'కోవిల ' పలికేనా? కోవిల గొంతు వినగానే, మావి 'చివురు ' తొడిగేనా? యేమో! యేమౌనోగానీ, ఆమని....ఈవని!" అని. బాగానే వుంది.....చెట్టు ముందా? విత్తు ముందా? అనడంలో ఓ వెరయిటీ. ఓ రోజు, కాకినాడ సూర్యకళా మందిరం లో ఆయనకి సన్మానం జరుగుతూంటే, ఓ 'పినాకొ ' ఆయన్ని "కోయిల; కోయెల; కోకిల--ఇలా అన్ని మాటలుండగా, "కోవిల" అని యెందుకు వ్రాశారు? అని ప్రశ్నించాడు, వ్రాతపూర్వకంగా. ఆయన కూడా వ్రాతపూర్వకంగానే జవాబిచ్చారుట--"మీరు మాట్లాడేది తెలుగు, నేను వ్రాసినది 'తెనుగు '!" అని. అదీ తేడా. 
 
అసలు "తెలుగు" యెలా వచ్చింది? "తెనుగు" యెలా వచ్చింది? "మా ఆరువేళ్ల" మేష్టారు శేషాచార్యులుగారు చెప్పినట్టు, "త్రిలింగ--అంటే మూడు లింగాల మధ్య వున్న దేశం, తెలుగు దేశం! వాళ్లది తెలుగు భాష!" "త్రి నగ దేశం--అంటే మూడు కొండల మధ్య వున్న దేశం--అదే "తెనుగు" దేశం!" (ఆ మూడు లింగాలూ, ఆ మూడు నగాలూ మీరే తెలుసుకోండి!)

మరి మధ్యలో, ఈ "తెలంగాణా భాష" యెక్కడనుంచి వచ్చిందీ?

........తరువాయి మరోసారి.       

Friday, June 17, 2011

నిరసనలూ, నిరశనలూ


దీక్షలు

చంటి పిల్లాడు కూడా, తనకి కావలసింది దొరకనప్పుడో, ఇష్టంలేనిది జరిగినప్పుడో, "నిరసన" ప్రకటిస్తాడు (తనకు తోచిన, తనకు చాతనయిన రీతిలో)! అది మానవ జాతికేకాదు, పశు పక్ష్యాదులన్నింటికీ, ప్రకృతికీ భగవంతుడిచ్చిన వరం! తనకి ఓ అన్యాయం జరిగింది, జరుగుతోంది, జరగబోతోంది అని నిరసన తెలపడం స్వతంత్ర దేశ పౌరులందరి రాజ్యాంగ ప్రసాదిత హక్కు. ఆ నిరసన తెలియజెయ్యడానికి యెవరికి తోచిన, చాతనైన మార్గం వారు అనుసరించడం జరుగుతూంది. ఈ నిరసనలు, సమస్యనిబట్టి, సామూహికంగా కూడా తెలపడం జరుగుతూంది.

ఈ నిరసన మార్గాలలో కొన్ని--గొంతెత్తి అరవడం, తిట్టడం, ప్రచురించే వాళ్లుంటే, ఓ జోకో, కార్టూనో, కవితో, కధో వెయ్యడం, ప్రచురించేవాళ్లు లేకపోతే, ఓ కరపత్రం ప్రచురించి పంచిపెట్టడం, పోలీసు ఫిర్యాదో, న్యాయపరమైన చర్యలో తీసుకోవడం, నిరాహార/నిరశన దీక్ష చెయ్యడం, సామూహికంగానైతే, వూరేగింపులూ, ర్యాలీలూ, ఘెరావోలూ, ధరణాలూ, హర్తాళ్లూ, బందులూ, రాస్తా/రైలు రోకోలూ, ముట్టడులూ, సామూహిక "రిలే" నిరాహార దీక్షలూ, గడ్డి బొమ్మల దహనాలూ, ఇంకా "వినూత్న" అంటూ, "అర్థ నగ్న" (మన అదృష్టం కొద్దీ ఒక సగమే!); "మోకాళ్లపై"; కొండొకచో తలక్రిందులుగా వగైరాలూ--ఇలా యెవరి వూహకందిన పధ్ధతిలో వారు తెలియజేస్తున్నారు.

మన జాతిపితమీద ఓ పెద్ద విమర్శని వ్రాసి, స్వయంగా ఆయనకే చదువుకోడానికి ఇస్తే, ఆయన అది చదివి, ఆ కాయితాలకి గుచ్చిన గుండుసూదిని తీసుకొని, కాయితాలు తిరిగి ఇచ్చేశాడట. యేమని అడిగితే, "వాటిలో విలువైనది మాత్రమే నేను గ్రహించానుకదా?" అన్నాట్ట.

జాతి నిర్మాత, పార్లమెంటులో, "గడ్డిపరక కూడా మొలవని ఆక్సాయ్ చిన్ లాంటి ప్రాంతం చీనావాళ్లు ఆక్రమిస్తే, దానిగురించి ఇంత గొడవ చేస్తారేమిటి?" అని విసుక్కొంటే, ప్రతిపక్ష నాయకుడు "మీ బట్టతలమీద గడ్డి పరక మొలవదుకాబట్టి దాన్ని కూడా.....?" అనడిగాడట.

"నేను రక్షణ మంత్రిని అయ్యాను కాబట్టి, ఇంక యుధ్ధాలు వుండవు" అని కొత్తగా శాఖ మారిన మంత్రి ప్రకటిస్తే, "ఆ విషయం నాకు ఖచ్చితంగా తెలుసు" అన్నాడట ప్రతిపక్ష నాయకుడు. "యెలా?" అని అందరూ ఆశ్చర్యపోతుంటే, "ఇంతకు ముందు మీరు ఆహార మంత్రిగా వున్నారు--దేశంలో ఆహారం లేదు కదా?" అన్నాడట.

"యేమిటో! ప్రసంగించినంతసేపూ టోపీని ముందునుంచి వెనక్కీ, వెనకనుంచి ముందుకీ త్రిప్పడం తప్పిస్తే, దానివల్ల ప్రయోజనమేమిటో తెలియడంలేదు!" అని అపహాస్యం చేసిన ప్రతిపక్ష నాయకుడిని, మన ముఖ్యమంత్రి వొకడు "నా టోపీ తిరిగినంతసేపూ, మీ బుర్ర తిరుగుతూ వుండడమే నాకు వచ్చే ప్రయోజనం" అన్నాడట.

రెండో ప్రపంచయుధ్ధం ముందు, అప్పటికి కేవలం పార్లమెంటు సభ్యుడిగానే వున్న "చర్చిల్", ఓ కాలేజీలో బహుమతి ప్రదాతగా వెళ్లి, "సాధారణంగా, నాలాంటివాళ్లు తమ ప్రసంగం--'నేను చదువుకున్నప్పుడు నాకే ప్రైజులూ రాలేదు, నిజంచెప్పాలంటే, మా క్లాసులో అట్టాడుగున వుండేవాణ్ణి' అంటూ ప్రారంభిస్తారు! కానీ, నాకలా ప్రారంభించే అవకాశం లేదు--యెందుకంటే, నాకే ప్రైజులూ రాకపోయినా, నేను మా క్లాసులో 'అట్టడుగున' వుండే వాణ్ని కాదు....దానికి కొంచెం మాత్రమే 'పైన' వుండేవాణ్ని!" అని ప్రారంభించాడట.

ప్రపంచ ప్రఖ్యాతులైన వాళ్లు ఇలా తమమీద తామే జోకులేసుకొని, ఇతరులకి ఆ ఛాన్స్ ఇచ్చేవారుకాదు.

ప్రొద్దునే పేపర్లన్నీ చూసి, వాటిలోని కార్టూనులని చూసి, ఎంజాయ్ చేసి, కార్టూనిస్టులని మెచ్చుకొంటూ, వీలైనంతవరకూ తమ పంధా మార్చుకొంటామంటూ వుత్తరాలు కూడా వ్రాసేవారు!

తరాలు మారాయి.

ఇప్పుడు, ప్రభుత్వోద్యోగులు తమ నిరసనలో భాగంగా దిష్టిబొమ్మని దహనం చేస్తే, తరువాత చర్చలకు వచ్చిన వాళ్లతో, "నా బొమ్మని దహనం చేశారుగా? మళ్లీ యేమొహం పెట్టుకొని నా దగ్గరకి వచ్చారు?" అని రుసరుసలాడినవాడొకడు! (దహనం అవసరం లేకుండానే పోయింది వాడి దేహం!)

రేపు నిరసన తెలియజెయ్యడానికి కలెక్టరు అనుమతి ఇస్తే, ఇవాళ రాత్రే ప్రైవేటు గూండాలనీ, పోలీసులనీ మోహరించేసి, ప్రొద్దున్నే దొరికినవాళ్లని దొరికినట్టు బాదేసి, కాల్పుల్లో కొంతమందిని పొట్టనపెట్టుకొనే అమాత్య వర్యులు కొంతమంది.

ఓ వారం రోజులపాటు వూరుకొని, తరవాత "నిరసనలకి మీకు అనుమతి లేదు" అంటూ, ప్రత్యేక విమానాల్లో ముఖ్యులని తరలించే "ప్రథానీ", ఆయన తైనాతీలూ!

ఇదీ నేటి దృశ్యం!


మహాత్మా గాంధీ మనకిచ్చిన వరం "నిరాహార"/"నిరశన" దీక్ష! "సత్యాగ్రహం" ప్రకటించడానికి ఇదో తిరుగులేని అస్త్రం! (నిరాహారకీ, నిరశన కీ తేడా యేమిటి? అంటే--ఇప్పుడవన్ని యెవరైనా పాటిస్తున్నారో, లేదో గానీ--అశనము అంటే అన్నం. అది తప్ప, ఫలాహారాలూ, పాలూ, పళ్ల రసాలూ తీసుకొంటూ సాగించేది "నిరశన". అసలు యేవిధమైన ఆహారం (తినేవి) తీసుకోకుండా, ద్రవ పదార్థాలతో మాత్రమే కొనసాగించేది "నిరాహారం". నీళ్లలో వుప్పూ, కొద్దిగా నిమ్మరసం మాత్రమే స్వీకరిస్తారు వీరు. అందుకే వాళ్ల దీక్షని విరమింపచెయ్యడానికి, నీళ్లు కలపని నిమ్మరసం వుప్పుతో త్రాగిస్తారు!)

ఇప్పుడది "దుర్వినియోగం" అవుతున్న తీరు చూస్తూంటే, 'వజ్రాయుధం పదును పోయిందా?' అని సందేహం రాకమానదు.

ఈ దీక్షల్లో, 24 గంటల దీక్షలూ, 12 గంటల/6 గంటల/4 గంటల/టిఫినుకీ, భోజనానికీ మధ్య దీక్షలూ ప్రక్కన పెడితే, "ఆమరణ" అనేది ఇప్పటికీ వజ్రాయుధమే! కానీ ఆ వజ్రాయుధ ప్రయోగానికి కూడా కొన్ని పరిస్థితులు కలిసి రావాలి.

అలాంటి ఆయుధం పరువు తీసే, కేసీఆర్, లగడపాటి, జగన్ వగైరాల దీక్షలవల్ల ప్రయోజనం యేమిటి?

ఆ మధ్య "నెట్" లోనే చూశాను--ఒకావిడ, జర్నలిష్టు అనుకుంటా, ఈశాన్య రాష్ట్రాల్లో యెక్కడో కొన్ని నెలలుగానో, సంవత్సరాలుగానో తన "నిరశన దీక్ష" కొనసాగిస్తూందట. చట్టం ప్రకారం మూడు నెలలకు మించి ఆమెని నిర్బంధంలో వుంచడానికి వీల్లేకపోవడంతో, హాస్పటల్లో మూడు నెలలు ఆవిడ బ్రతికేలా చూసి, వదిలేస్తారట. బయటికి వచ్చినరోజే ఆవిడ నిరాహారంగా గడపడంతో, రాత్రి 12 అవగానే మళ్లీ ఆవిడని అరెష్టు చేసి ఆస్పత్రికి తరలించి, మళ్లీ ఓ మూడు నెలలు మరణించకుండా చూస్తారట!!! ఇలాంటి "ఒంటరి" పోరాటాలవల్ల ప్రయోజనం యేమిటి? వ్యక్తిగతంగా ఆవిడకి సానుభూతి తెలపడం తప్ప మనం చెయ్యగలిగింది యేముంది?

"నిరశన" దీక్ష సుదీర్ఘంగా కొనసాగిస్తూ "మరణించి", తన అభీష్టాన్ని నెరవేర్చుకొన్నవాళ్లలో ప్రథముడు మన "పొట్టి శ్రీరాములు" మాత్రమే. (చచ్చి సాధించాడు అంటారు చూడండి--అలాగ!)

అలా సాధించుకోలేకపోయిన వాళ్లలో, 72 రోజులపాటు దీక్షని కొనసాగించి, మరణించినవాడు "దర్శన్ సింగ్ ఫెరుమాన్"! ఆయన చండీగఢ్ ని పంజాబులో విలీనం చెయ్యాలంటూ దీక్ష సాగించాడు. ఇప్పటికీ అదే రికార్డు. ఆయన కోరిక తీరనే లేదు.

అప్పటిలో, ఆసుపత్రికి తరలించడాలూ, జీవన మద్దతు ప్రక్రియలు (లైఫ్ సపోర్ట్ సిస్టంస్) నిర్వహించడాలూ, వగైరాలు లేవు. (వుంటే ఆయన ఇంకెన్నాళ్లు కొనసాగించేవాడో....రికార్డు యెన్నిరోజులకి చేరునో!)

మొన్న, "రాందేవ్" యెనిమిది రోజులు సాగించాడు. (జరిగిన కథ అందరికీ తెలిసినదే!)

అదే రోజుల్లో, ఆయనకన్నా ముందునుంచీ, ఒకాయన తన దీక్షని కొనసాగిస్తున్నాడు--మీడియాగానీ, ప్రభుత్వాలుగానీ, ప్రజలు గానీ పట్టించుకోలేదు! చివరికి ఆయనని బలిపెట్టారు! (అప్పుడు కొంతమంది నిట్టుర్చారు!)

ఆయనే, "స్వామీ నిగమానంద"! హరిద్వార్ 'మాతృ సదనం ' ఆశ్రమానికి చెందిన 35 యేళ్ల ఈ సన్యాసి, మొన్న ఫిబ్రవరి 19 నుంచి, ఉత్తరఖండ్ ప్రభుత్వం హరిద్వార్ సమీపంలో గంగానది ప్రక్కన గనుల త్రవ్వకాలని నిషేధించి, గంగని కాపాడాలి అంటూ తన నిరశన దీక్షని కొనసాగించాడు. మొన్న ఏప్రిల్ 27న ఆయనని హరిద్వార్ జిల్లా ఆసుపత్రికి తరలించారట. అక్కడకూడా తన దీక్షని కొనసాగిస్తూ, మే 2న 'కోమా' లోకి వెళ్లిపోతే, ఇంకో పెద్దాసుపత్రికి తరలించి జీవన మద్దతు ప్రక్రియలని ప్రారంభించినా, 115 రోజుల తరవాత, జూన్ 14న మరణించాడు. ఆయన చుట్టూ మీడియా కెమేరాలు లేవు, పత్రికా ప్రతినిధులు లేరు, ప్రజలు లేరు, బంధు మిత్రులసలే లేరు! పైగా, ఆయన మరణించగానే, కాంగీవాళ్లు, ఆ రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రే దానికి బాధ్యుడు అంటూ గోల మొదలెట్టారట--మరి 115 రోజులపాటు యేమి చేశారో? వాళ్లతో గుంటనక్క జైరామ్ రమేష్ కూడా గొంతు కలిపాడట! ఆ స్వామికి సన్నిహితుడైన హరిద్వార్ ప్రజా సంఘం అధ్యక్షుడు "ఆసుపత్రిలో ఆయనకి విషం ఇవ్వడం వల్ల ఆయనకి గుండె పోటు వచ్చి చనిపోయాడు" అన్నాడట. మే 15నే పోలీసులవద్ద, మైనింగ్ మాఫియా ప్రోద్బలంతో ఆ ఆసుపత్రి డాక్టర్ ఆయనకి విషమిచ్చాడు అని ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేసినా, సహజంగానే యెవరినీ అరెష్టు చెయ్యలేదని మాతృ సదనం వాళ్లు అన్నారట!



నాయకులకీ, ప్రజలకీ నా విఙ్ఞప్తి--బ్రతికి సాధించండి! పిల్లలకి మనం చెపుతామే--అపజయం విజయానికి తొలిమెట్టు, చచ్చి సాధించేదేమీ లేదు, ఆత్మహత్య మహాపాపం, ఆత్మహత్య అనేది పిరికివాళ్లు చేసే పని, బతికుంటే బలుసాకు తినొచ్చు, వూపిరుంటే వుప్పు అమ్ముకొని బతకొచ్చు--ఇలాంటి పిచ్చి పిచ్చి నీతులు? "ఈజిప్టు" తరహాలూ అవీ అంటూ మొదటికే మోసం తెచ్చుకోవద్దు. మీ వెనకాల కనీసం కొన్ని లక్షలమంది వుంటేనే, అదీ ఆఖరి అస్త్రంగానే ఇలాంటి దీక్షలు చేపట్టండి--అదీ డ్రామాలకో, ప్రభుత్వం వారు విరమింపచెయ్యకపోతారా అనే ధీమాతోనో వద్దు--అదీ, నిజంగా ఆత్మార్పణ ద్వారానైనా "లక్ష్యం" సిధ్ధిస్తుంది....తరువాతివాళ్లైనా దాన్ని సాధిస్తారు అని నమ్మకం వుంటేనే!

రాజకీయులూ! నిరసన కార్యక్రమాల్లో, ఘెరావోలూ, బందులూ, హర్తాళ్లూ మొదలైనవి సహజమరణం చెందినట్టే. ఇక రాస్తా/రైలు రోకోలు మానండి. ఇంకేమైనా ప్రత్యామ్నాయాలు--మిమ్మల్ని సమర్ధించే ప్రజలకి ఇబ్బంది కలగజెయ్యనివి--కనిపెట్టండి. లేదా, ప్రతీ శాసన సంస్థా, ప్రభుత్వ కార్యాలయం వగైరాల ముందు "నిరసన" కేంద్రాలు యేర్పాటు చేసేలా చట్టాలు చేసి, అక్కడకి వెళ్లి తన్నులు తినే కార్యక్రమాలకి శ్రీకారాలు చుట్టుకోండి!

మీకు అప్పుడే మా మద్దతు సంపూర్ణంగా వుంటుంది!

జై భారత్!

Tuesday, June 14, 2011

ఓ రకం పిచ్చోళ్లు


కళా "కారులు"



మా "బ్లూ మౌంటేన్" రాజుని అనేవాళ్లం...."కళాకారులండీమీరు" అని! (ఆయన వ్రాసింది యేదైనా, ఓ ఐదు నిమిషాల తరవాత ఆయనకే చూపిస్తే, "నేనే వ్రాశానా? యేమో....యేమి వ్రాశానో గుర్తు లేదు!" అనేవాడు.

కొపెర్నికస్, గెలీలియో, సోక్రటిస్ లాంటి మేధావులని "పిచ్చోళ్లు" అన్నారట ఆ రోజుల్లో! అని వూరుకోలేదు--శిక్షలు విధించారు(ట).

ఇంతకీ, లలిత కళల్లో ప్రముఖమైనవి నాట్యం, కవిత్వం, తరవాత చిత్రలేఖనం. కొత్తగా కవిత్వం చదివేవాడికి, యే కవిత చదివినా, "అద్భుతం!" అనిపిస్తుంది. కొంత వయసు వచ్చాక, ప్రముఖుల కవితలు చదివినా, "యేమిటో ఈ కవిత్వం!"....ఈమాత్రం నేను వ్రాయలేనా? అనిపిస్తుంది.

ఇక చిత్రలేఖనం! నిజంగా "అద్భుతమైన" కళ! సృష్టికి ప్రతిసృష్టి చేసినట్టు, కనిపించేదాన్ని యథాతథంగానూ, కనిపించనివాటిని వూహించి దానికో ఆకారం యేర్పరచి, అందరినీ "అవి" ఇలాగే వుంటాయి అని నమ్మించడం! అలా మనకి లభించినవే, ఛాయాగ్రహణం లేనిరోజుల్లో వుండే రాజులు, నవాబులు మొదలైనవాళ్ల "చిత్రాలు". అలాగే, రాజా రవివర్మ లాంటి వాళ్ల పుణ్యమా అని, మనం యెప్పుడూ చూడని మన దేవుళ్ల, దేవతల రూపాలూ, అకారాలూ, ఆహార్యాలూ మనకి లభించాయి! అదీ చిత్రలేఖనం అంటే!

ఇంక శతాబ్దాల క్రితం నుంచీ పాశ్చాత్య చిత్రకారులు ప్రపంచ ప్రసిధ్ధి చెందినవాళ్లున్నారు కొంతమంది. మైఖేల్ ఏంజిలో, లియొనార్డో డా వించీ, రెనాయిర్ లాంటివాళ్లు. ఇంక "పాబ్లో పికాసో" అని అసలు పిచ్చోడు ఒకడుండేవాడు. మొదట చెప్పినవాళ్ల "పెయింటింగులు" చూసి, వాటిలో--మన వేదాలూ, సంస్కృతం ల లాగ, యెవరికి తోచిన అర్థం వాళ్లు చెప్పడం, కనపడని విషయాలని కూడా వూహించడం, వాటిమీద రీసెర్చ్ చేసి డాక్టరేట్లు తెచ్చుకోవడం, "ఆర్ట్ క్రిటిక్స్" అనబడేవాళ్లు ఇలా చేస్తూ, వాటి "ధరలని" విపరీతంగా పెంచడం, డబ్బున్న పిచ్చోళ్లు వాటిని కొనుక్కోవడం.....అదో ప్రపంచ వ్యాప్త వెర్రి!

మొన్నీమధ్య డా వించీ "మొనాలిసా" మీద రీసెర్చ్ చేసి, ఆయన తన మగ నౌఖరుకి ఆడవేషం వేసి, ఆ బొమ్మ గీశాడు అని తేల్చారట! ఇంక, ఓ రచయిత, "డా వించీ కోడ్" అనే తన నవలలో, ఆయన పెయింటింగులకి అర్థం చెపుతూ, క్రిస్టియానిటీకి సంబంధించిన రహస్యాలనేవో బయటపెట్టేశాడు అని ఆ పుస్తకం బ్యాన్ చేశారు కొన్ని దేశాల్లో!

పికాసో గురించి చెప్పాలంటే, మా "బ్లూ మౌంటేన్" రాజు లాంటివాడే! వాడేమి గీశాడో వాడికే కాదు, ప్రపంచంలో యెవరికైనా అర్థం అయితే వొట్టు! పైగా దానికి మోడర్న్ ఆర్ట్ అని ఓ పేరు! అదో ప్రత్యేకమైన "స్కూల్" అట!

అదే స్కూల్ లో బయలుదేరాడట మన దేశం లో ఒకాయన--ఎం ఎఫ్ హుస్సేన్ అని! బుడుగు బొమ్మలు వేసి, క్రింద "ఫది యెగురే పఛ్ఛులు"; "చీకట్లో వెళుతున్న రైలు" ఇలా వాటి పేర్లు వ్రాసినట్టు, యేవో పిచ్చి బొమ్మలు గీకేసి, క్రింద పేర్లు వ్రాయడంతో వచ్చింది గొడవంతా! ఆయనకి ఆడ పిచ్చి అనికూడా అంటారు ఆయన చిత్రాలు చూసినవాళ్లు. సరే! మనదేశంలో, కావలసినంత వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేఛా వున్నాయి. అలా అని, నగ్నంగా వున్న స్త్రీల బొమ్మలు వేసేసి, వాటి క్రింద "సరస్వతీ దేవి", "భారత మాత" లాంటి పేర్లు వ్రాసెయ్యడమేనా? పోనీ ఆ చిత్రాలకీ, మన వూహల్లో వున్న ఆ దేవీ దేవతలకీ యేమైనా పోలికలు వున్నాయా? అందుకే ఆయన్ని దేశం నుంచి తన్ని తగిలేశారు!

మొన్నీమధ్య ఆయన పై లోకాలకి వెళ్లిపోయాక, ఇన్నాళ్లూ మాట్లాడని సో కాల్డ్ "ఆర్ట్ లవర్స్ ఆఫ్ ఇండియా", వ్యాసాలమీద వ్యాసాలు వ్రాసేస్తున్నారు.....భారతదేశాన్నుంచి ఆయన్ని వెళ్లగొట్టడం పాపమనీ, హత్యచేస్తామని బెదిరించారు....ఇంకిప్పుడు యెలా హత్య చేస్తారు? అనీ....ఇలా వ్రాసేస్తున్నారు....తమ "కళాభిమానాన్ని" చాటుకుంటూ!

అలాంటి కళా"కారుడు" మన దేశం లో పుట్టడమే మన దౌర్భాగ్యం!

కళా"కారుల" అభిమానులూ.....ముర్దాబాద్!