Friday, August 19, 2011

కేరళలోని......4



......ఆలయాలూ, ఆచారాలూ

"గురువాయూరప్పా! అనువగు తెరువే ఇదియప్పా! దినము దినమునా ఈ యుగమందున తిరునాళ్లేనప్పా! గురువాయూరప్పా....." ఇది ఓ నలభై యేళ్లక్రితం భక్తిరంజనిలోననుకుంటా మన ఆకాశవాణిలో నాకు వినిపించిన పాట. స్వామి అయ్యప్ప కన్నా ముందు, పళని స్వామి కన్నా ముందు, ఈ యాత్ర వుండేదిట. 

అలాంటి గురువాయూరు దర్శించడం ఓ మంచి అనుభూతి! 

ద్వాపర యుగాంతంలో ద్వారక సముద్రంలో మునిగిపోయినప్పుడు, శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని యెలా కాపాడాలా అని అలోచించిన "గురువు" అంటే బృహస్పతి, వాయువుని వేడుకొన్నాడట. వాయువు వొప్పుకొని, శ్రీకృష్ణుడి విగ్రహాన్ని మోసుకొంటూ వచ్చాడట. ఆ విగ్రహాన్ని యెక్కడ పెట్టాలి అనే మీమాంసలో, గురువు వెతుక్కుంటూ దక్షిణాదికి వచ్చి, ఓ కొండమీదున్న శంకరుణ్ణి వేడుకొన్నాడట--నువ్వు కొండ దిగితే, ఇక్కడ కృష్ణుణ్ని పెట్టుకొంటాం--అని. శంకరుడు వొప్పుకోగానే, అక్కడ శ్రీకృష్ణుణ్ని వెలిపించారట! అందుకనే ఆ గుడికి "గురు-వాయు" ఊరప్ప అని పేరు వచ్చిందట. ఆ గుడిని ఖాళీ చేసిన శంకరుడు, కొండ క్రింద "మైమ్మాయూర్" (మహిమ వల్ల యేర్పడ్డ వూరు) కి చేరాడట. గురువాయూరు దర్శించుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో ఈ శంకరుణ్ని దర్శించుకుంటారు. 

గురువాయూరు పెద్ద దేవస్థానం. కాంప్లెక్స్ చాలా విశాలంగా వుంటుంది. సీజన్లో (దేవుళ్లకి కూడా సీజన్లు వుంటాయి!) ఆవరణ అంతా ఇసకేస్తే రాలనంత మంది భక్తులు వుంటారట. కారు పార్కింగ్ కి వెతుక్కుని, అక్కడ ధోతీ, కండువా లోకి మారి, (పేంట్లూ చొక్కాలూ బనీన్లూ విప్పేసి) గుడి ఆవరణలోకి, అనేక షాపులూ, హోటెళ్లూ వగైరాలు దాటుకుంటూ, వెళ్లి క్యూలో నిలబడాలి. 

అదృష్టమేమిటంటే, ప్రతీరోజూ సాయంత్రం 6 గంటలకి, సీనియర్ సిటిజెన్లకి ఓ ప్రత్యేక క్యూ వుంటుంది. 

మా డ్రైవెర్ కం గైడ్ "సంతోష్" పుణ్యమా అని, మాకు ఈ సంగతి తెలిసింది. తనుకూడా, అధికారులదగ్గర ప్రత్యేక అనుమతి తీసుకొని మరీ మమ్మల్ని ఆలయ ప్రవేశం చేయించాడు ఆ క్యూలో!

....మరోసారి.

కేరళలోని......3



......ఆలయాలూ, ఆచారాలూ

చొట్టాన్నికర--ఇదొక దేవీ ఆలయం. తమిళనాడులోని మూకాంబికలా ప్రఖ్యాతం (ట). 

ఓ ప్రాచీనాలయం వుంది--క్రిందకు దిగి వెళితే. ముందు క్రొత్త ఆలయం వుంటుంది. చక్కగా ఆలయం చుట్టూ చెక్కతో వరసలు యేర్పరిచి, వాటిమీద ప్రమిదల్లో నూనె దీపాలు వెలిగిస్తారు. చీకటిపడే టైముకి అన్ని దీపాలూ వెలిగిపోతాయి--అలా యేర్పాటు చేశారు. ముందు ఓ గణపతి గుడీ, దాని ముందు దీప స్థంభం (ఓ స్థంభానికి అరలు అరలుగా ప్రమిదలు బిగించి, ఓ ఫౌంటేన్ లా దీపాలు వెలిగిస్తారు).

దర్శనానికి టిక్కెట్టు లేదు. పంచె నిబంధన లేదు గానీ, చొక్కా, బనీను విప్పేసి, చేతిమీద వేసుకోవాలి. గర్భగుడిలోపల మాత్రం ఫోటోలు నిషిధ్ధం. 

ఆ ప్రక్కనుంచి నడుచుకుంటూ వెళితే, ప్రాచీన ఆలయం వుంది. అక్కడకూడా పై నిబంధనలే. ప్రత్యేకత యేమిటంటే, మంగళ, శుక్ర వారాల్లో "గురిది" అని జరుగుతుందట. ఘటాలని ధరించి, డప్పులూ వగైరాలతో జరిపిస్తారట. భక్తులకి పూనకాలు వస్తాయట. మానసిక రోగులని సంకెళ్లు వేసి కూడా తీసుకొస్తూంటారట. ఇతర వికలాంగులకి కూడా నయం అయిపోతుందని నమ్మకమట. రాత్రి 9 దాటాక మొదలవుతుంది అన్నారు. మేము వుండలేదు.

Tuesday, August 16, 2011

కేరళలోని......2




......ఆలయాలూ, ఆచారాలూ

(ఇంతకు ముందటి నా టపాలో ఓ చిన్న పొరపాటు దొర్లింది. అప్పటికి మైనరుగా వున్న మహారాజు మహారాణిగారి మేనల్లుడు కాదు. అంతకు ముందటి మహారాజు మేనల్లుడు. యెందుకంటే అప్పట్లో "మాతృస్వామ్యం" అమలులో వుండేది.)

కాలడి--జగద్గురు శంకరాచార్యులు పుట్టిన వూరు. పెరియార్ నది శాఖ ప్రక్కనే వుంది. ఆయన తరువాతివాళ్లలో ఒకరైన ఓ శృంగేరీ పీఠాధిపతి పరిశోధన చేసి, కాలడి లోని శంకరుల తల్లి సమాధిని కనుగొన్నారట. ఆ ప్రక్కనే వున్న ఇంట్లోనే శంకరుని జననం జరిగిందని నిర్థారించి, శంకరుడికి కూడా ఓ గుడి నిర్మాణం జరిగింది. ముందు శారదాంబ గుడి, తరువాత శంకరుని తల్లి సమాధి (అప్పటిలో పాతిన ఓ శిలా దీప స్థంభం ఇప్పటికీ వుంది), గణపతి ఆలయం, శంకరుని ఆలయం వున్నాయి ఆ ఆవరణ లో. దర్శనానికి టిక్కెట్టులేదు. కారు పార్కింగుకి, చెప్పులకి టిక్కెట్లు లేవు. అర్చనకి మాత్రం 10 రూపాయలనుకుంటా టిక్కెట్టు. పంచె, చొక్కా నిబంధన లేదు. ఫోటోలూ వీడియోలూ నిషిధ్ధం. అలా అని అవన్నీ డిపాజిట్ చేసెయ్యమనలేదు. శంకరుని గుడి ముందు మంటపం లోపల చుట్టూ శంకరుని జీవిత ఘట్టాల వర్ణ చిత్రాలు ప్రదర్శించారు. అక్కడ ఓ వీడియో కెమేరా, ఫ్లాష్ లైట్లూ తో హడావిడి కనిపిస్తే, యేదైనా సినిమా షూటింగా అని అడిగాను. కాదు--మఠం వాళ్లు తీయిస్తున్నారు అని చెప్పారు. అదన్నమాట సంగతి.

అలువ (అల్వేయి) లో, పెరియార్ నది ప్రక్కనే ఓ ప్రసిధ్ధ శివాలయం వుంది. మేము వెళ్లేసరికి సమయం మించిపోయింది. బయటనుంచే ఫోటో తీసుకొని వచ్చేశాము.

ప్రత్యేకత యేమిటంటే, ఆలయాలూ, రాజ ప్రాసాదాలూ వగైరాలు చాలా మటుకు నాలుగు వైపులా షెడ్డుల్లా నిర్మించి, పై కప్పుని కలపతోనూ, బంగాళా పెంకుతోనూ నిర్మించారు. కేరళలో వర్షపాతం యెక్కువ, కలప విరివిగా దొరుకుతుంది అనే కారణాలతో అయి వుండొచ్చు. గాలి గోపురాలూ, గర్భ గుడిపైన విమానాలూ వుండవు. మనవాళ్లకి కొంచెం ఆశ్చర్యంగా వుంటుంది.


Sunday, August 14, 2011

కేరళ లోని......



......ఆలయాలూ, ఆచారాలూ

అనుకోకుండానే మొన్న ఓ చిన్న పనిమీద  (ఆ పని విషయం వేరే టపాలో) కేరళ వెళితే, ఆ పని అయ్యాక, యెలాగూ వచ్చాముకదా అని, దేవాలయాలు చుట్టివచ్చాము--ఇతర ప్రదేశాలతోపాటూ.

తిరువనంతపురం లోని అనంత పద్మనాభ స్వామి ఈ మధ్య వార్తల్లోకి యెక్కాడుకదా--లక్ష కోట్లకి పైగా సంపదతో, బాలాజీని మించాడు అంటూ! వెళ్లి చూసి వచ్చాము--గుడినీ, దేవుణ్నీ మాత్రమే. (ఆ నేలమాళిగలూ వగైరా చూడనివ్వడం లేదు)

ఇక్కడ ఆచారం యేమిటంటే, మగవాళ్లు పైన చొక్కా, బనీనూ వగైరా లేకుండా, పెంచె మాత్రమే కట్టుకొని లోపలకి వెళ్లాలి. ఆడవారు చీరలూ, సల్వార్ కమీజు వేసుకోవచ్చుట. మోడరన్ డ్రెస్సులు మాత్రం నిషిధ్ధం.

చరిత్రలోకి వెళితే, అసలు ఈ ఆచారం యెలా యేర్పడింది? అనేదానికి సమాధానం వొక్కటే--జంధ్యం వేసుకొనే అగ్రవర్ణాలవారికి మాత్రమే ఆలయంలోకి ప్రవేశం వుండేది అప్పట్లో! అది స్పష్టంగా కనిపించడానికే ఈ యేర్పాటు.

1930 ల్లో గాంధీ గారు ఓ సభలో వుండగా, ఓ చిన్నపిల్ల ఆయనని అడిగిందట--ఆలయం చుట్టూ వీధుల్లో అందరూ స్వేచ్చగా తిరుగుతున్నారు, దేవుడి పనులు కూడా చేస్తున్నారు, మరి ఆలయంలోకి యెందుకు వెళ్లకూడదు అని ప్రశ్నించిందట. ఆయన అప్పటి ధర్మకర్త అయిన మహారాణివారిని ఆ ప్రశ్న ఆడిగాడట. దానికి ఆవిడ "అనాదిగా వస్తున్న ఆచారం" అని చెప్పిందట. 

అప్పటికి "మైనరు" గా వున్న మహారాజు (మహారాణిగారి మేనల్లుడు) ఆ క్షణంలోనే నిశ్చయం చేసుకొన్నాడట. తరువాత ఆయన మైనారిటీ తీరి, రాజు అవగానే పట్టాభిషేక సభలోనే "సర్వజనులకీ ఆలయ ప్రవేశం" ప్రకటన చేశాడట.

బిడ్డపోయినా.....అన్నట్టు, ఆ ఆచారం మాత్రం కొనసా....గుతోంది. 

పులిని చూసి......అన్నట్టు, ఆ రాష్ట్రంలో మిగతా ఆలయాలవాళ్లు అలాంటి ఆచారాలనే కొనసాగిస్తున్నారు--చిన్నా చితకా ఆలయాలతో సహా! కొన్నింటిలో ధోతీ నియమం లేదు--పేంటు ధరించవచ్చు. చొక్కా, బనీనూ మాత్రం విప్పేసి, చేతిమీద వ్రేళ్లాడేసుకొని, వెళ్లిపోవచ్చు.

ఇంక కెమేరాలూ, సెల్ ఫోనులూ నిషిధ్ధం. ఫోటోలు తీయడం నిషిధ్ధం. కొన్నిచోట్ల గర్భగుడిలో తప్ప, బయట ఫోటోలు తీసుకోవచ్చు. వీడియోలు నిషిధ్ధం! (టెర్రరిజం వంక వీటికి--పురాతన ఆచారాల ముసుగు! అక్కడికి దేవుడి ఫోటో తీస్తే ఆయన మహిమ తగ్గిపోతుందేమో మరి!)

అదీ సంగతి.