Monday, December 31, 2012

తెలుగుని........! - 3



తెలుగులోనే మాట్లాడదాం....

రెండోరోజు పొద్దున్న "నష్ట నివారణ" చర్యగాననుకుంటా--ఓలేటి పార్వతీశం గారిచేత ఒకళ్లిద్దరిని అడిగించి, యేర్పాట్లు చాలా బాగున్నాయి, మాకు యే కష్టం తోచకుండా "పిల్లలు" (స్వయం సేవకులు) మంచినీళ్లూ భోజనాల దగ్గరనుంచీ చక్కగా చూసుకుంటున్నారు--అంటూ చెప్పించారు. (మర్నాడు పేపర్లలో వచ్చింది--గట్టి బందోబస్తు యేర్పాటు చేసి, టోకెన్లు జారీ చేసి, అవి వున్నవాళ్లకే భోజనాలూ వగైరా అందించారని! మరి ముందే ఆ తెలివి యెందుకు లేకపోయిందో?)

ఇంకా "ప్రథాన వేదిక" కీ, దానిమీద రా నా ల తొంబకీ ఇచ్చిన ప్రాథాన్యం మిగిలిన వేదికలకి ఇవ్వలేదు అని తెలుస్తూనే వుంది. (వారు కొన్ని ప్రసారం చేశారేమో గానీ కరెంటు కోత పుణ్యమా అని కొన్ని నేను చూడలేకపోయీ వుండొచ్చు అనుకున్నాను).

సంతోషం కలిగించిన విషయం యేమిటంటే, మహామహుడు నేరెళ్ల వేణుమాధవ్, మొత్తం సమయం తానే తినెయ్యకుండా, ఆయన శిష్యులచేత ప్రదర్శన ఇప్పించడం!

అవధాన వేదిక మీద యేమి జరిగిందో, తెలీదు. సినీకళాకారుల ప్రదర్శనా, వాళ్లకి సన్మానాలూ బాగానే జరిగాయి అని పేపర్లో వచ్చింది. 

అనేకమంది "ఇవి గందరగోళ మహాసభలు" అనీ, ఆహ్వానితులకి ఆదరణలేదు అనీ, యెందుకు పిలిచారో, యెక్కడికి వెళ్లాలో, యెవరిని కలవాలో, పత్రాల సమర్పణ యెవరు యెక్కడ యెప్పుడు చెయ్యాలో తెలీదనీ, బోళ్లు దూరాల్లో వున్న ఇతర చోట్లకికూడా రవాణా సౌకర్యం యేర్పాటు చెయ్యలేదు అనీ, వసతి గురించి అంతా వట్టి మాటేననీ వాపోయారట--అనేకమంది ముఖ్యులు కూడా.

ఇంక మంత్రి పార్థసారథి, వంటకాలు వాసన వస్తున్నాయి అని ఫిర్యాదు వస్తే, రుచి చూసి, "సంబంధిత గుత్తేదారు మీద చర్య తీసుకుంటాం, తప్పులు తేలితే నగదు చెల్లింపులో కోత విధిస్తాము" అన్నారట. శాసన సభ్యుడు మల్లాది విష్ణు అయితే, తినలేక, పళ్లాన్ని విసిరేసి వూరుకున్నారట. కొంతమంది ప్రముఖులు, రాత్రి మిగిలిన చద్దన్నాన్ని పులిహోర చేసి పెట్టేస్తున్నారు అని బాధపడ్డారట! 

.........ఇంకొంత ఇంకోసారి.

Friday, December 28, 2012

తెలుగుని........! - 2



తెలుగులోనే మాట్లాడదాం....

ప్ర తె మ లు మొదలయ్యాయి. 

కార్య నిర్వాహకుల కష్టం యేమిటో తెలిసింది. అదెంత వృధా అయిందో కూడా తెలిసింది. 

మధ్యాహ్నం 12.00 గంటలకి మొదలవుతాయన్నారు. టీవీలో యెక్కడా అలికిడిలేదు.  విసుగొచ్చి కట్టేసి, మళ్లీ నాలుగింటికి పెడితే, మన దూర దర్శన్--సప్తగిరిలో కి కు రె రాసుకొచ్చిన ఉపన్యాసం చదువుతున్నాడు. ఆయన మాటలకీ, పెదాల కదలికకి సంబంధం లేదేమిటా అనుకుంటుంటే, అది ఇంకెవరి గొంతో అని తెలిసింది! 

అప్పటికే తెలుగుతల్లి విగ్రహానికి దండవేసి, నివాళులు అర్పించేసి, అదేదో యాత్రని జెండావూపి ప్రారంభించేశారనీ, వార్తల్లో దృశ్యాలు చూపించారు తరవాత.

ఇంక దేశాధ్యక్షులవారి ఉపన్యాసం--బెంగాలీ లోనో, ఇంగ్లీషులోనో వ్రాసిస్తే, చాలా కష్టం మీద సహస్రాబ్దాల, శతాబ్దాల తెలుగు చరిత్రని వల్లెవేయించారు.

తరవాత గవర్నరుగారు. పూర్తిగా తెలుగులోనే, తడువుకుంటూ సాగింది......చాంగుబళా అంటూ.

రాష్ట్రపతిగారు అదేదో కట్టబోయే సమావేశమందిరానికి మీటనొక్కి శంఖుస్థాపన చేశారు. (తీరా ఆ ఫలకం ఇంగ్లీషులోనే వుంది!)

తరవాత ప్రముఖులకి "సత్కారాలు"--అధ్యక్షులవారి చేతులమీదుగా--"అకారాదిగా పిలుస్తాను" అంటూ అక్కినేనిని పిలిచారు. తరవాత మాత్రం అకారాది పాటించలేదు!

అప్పటిదాకా వేలాదిమంది భోజనాలు చెయ్యకుండా వుండిపోయినట్టున్నారు. నిర్వాహకులేమో, అయ్యో......చెప్పినట్టు తెలుగురుచులన్నీ వండేశాముకాదు....వృధా అయిపోయేవి.....అని ఆనందిస్తున్నట్టున్నారు. తీరా ఒక్కసారి అందరూ భోజనాలకి వెళితే, రకరకాల వంటకాలు కాదుకదా, అసలు అన్నమే లేదట చాలా మందికి!

మళ్లీ సాయంత్రం యెప్పుడో సప్తగిరివారు ప్రత్యక్ష ప్రసారం పెట్టారు. స్త్రీవాద రచయిత్రి అనూరాధ కవిత దగ్గరనుంచి చూశాను. 

తరవాత ఇంకో ఛానెల్లో అనుకుంటా, గజల్ శ్రీనివాస్, తనకి 7 నిమిషాలే సమయం ఇచ్చారు అంటూ రెండో మూడో గజల్స్ పాడాడు--సహజంగానే అతనికి యెవరూ సాటిలేరు అనిపించుకున్నాడు. 

తరవాత, సాహితీ వేదికపై, "త్రిభువ విజయం"--మహామహుడు బేతవోలు రామబ్రహ్మం "ఇంద్రుడు"గా, ప్రముఖులందరూ "కవులు"గా--"ఇంద్రుణ్ని పొగడద్దు. 3 నిమిషాల్లో ఒక్కొక్కరూ ముగించండి" అనడంతో అలరించింది. ఓక్క శ్రీనాధుడు--"నాకు సీసాలంటే ఇష్టమని, ఇంద్రుడు అందరికీ కాళ్లదగ్గర సీసాలు పెట్టించారు" అనడం, అక్కణ్నించీ సరసోక్తులన్నీ "సురాపానాన్ని" తలపిస్తూ సాగడం కాస్త వెగటు పుట్టించింది. 

.........ఇంకొంత ఇంకోసారి.

Tuesday, December 25, 2012

తెలుగుని “వుధ్ధరించొద్దు”!



తెలుగులోనే మాట్లాడదాం....

ప్ర తె మ ల సందర్భంగా అనేకమంది ఒకటే గోల—తెలుగుని వుధ్ధరించండి—అంటూ!

అసలు వుధ్ధరించడం యెందుకు? వున్నచోట వుండనిస్తే నష్టమా?

నిర్వాహకులు “ఇన్నికోట్లడిగాం, ఇన్నే ఇచ్చారు, మరిన్ని ఇస్తే ఇంకా బాగుంటుంది” ఇలా అంటున్నారు.

ఆ పేరుతో గత నెలరోజులుగా మండలాల్లోనూ, జిల్లాల్లోనూ, పట్టణాల్లోనూ, “తెలుగు భాషా—వర్థిల్లాలి, తెలుగు తల్లీ—జిందాబాద్” అంటూ ర్యాలీలూ అవీ చేసేసి, గొంతులు చించుకున్నారు.

తెలుగు సంస్కృతి వుట్టిపడేలా, హరిదాసుల వేషాలు వేయించీ, గంగిరెద్దుల వాళ్లా, కొమ్మదాసరులా, పిట్టలదొరలా వేషాలు వేయించీ, ముగ్గులు వేయించీ, గొబ్బిళ్లు పెట్టించీ, వంటలపోటీలు పెట్టించీ, బహుమతులిచ్చేసీ, యెప్పుడూ పట్టించుకోని రచయితలకీ, కవులకీ, కళాకారులకీ శాలువాలు కప్పేసీ, కేటాయింపులని “మమ” అనిపించేశారు.

ఆయనెవరో అన్నట్టు, “కాళ్ల చుట్టూ నేలని జీరాడే పంచెకట్టే” తెలుగుదనం అంటే, మరి తెలుగు గోచీపాతరాయుళ్లూ, అడ్డపంచెలవాళ్లూ తెలుగు వాళ్లు కాదేమో! కాయకష్టం చేసే వాడినుంచికాకుండా, పనీపాటాలేనివాడి నుంచి “తెలుగుదనాన్ని” నేర్చుకోవలసిరావడం అవమానం కాదా? అని ఆయన అడగడం సబబే అనిపిస్తుంది.   

ఇంక తిరపతిలో క్లైమాక్సే మిగిలింది.

ఇంక, ఈనాడు వాడైతే జనాల తలలకి రోకలి చుట్టేస్తున్నాడు.

ఇదివరకు యేమాత్రం కొరుకుడుపడని తెలుగు అనువాదపదాలని ప్రవేశపెట్టి, అధికారికంగా తెలుగు ని వృధ్ధిలోకి రాకుండా శాయశక్తులా పాటుపడ్డారు మన ప్రభుత్వం వారు. ఇప్పుడా కృషిని  ఈనాడు నెత్తికెత్తుకున్నట్టుంది.

హోం మంత్రి కి “అంతర్గత భద్రత మంత్రి” (గృహ మంత్రి అంటే నష్టమా?) అనీ, పబ్లిక్ సర్వీస్ కమీషన్—పీ ఎస్ సీ కి “ప్రజా సేవా సంఘం—ప్ర సే సం” (ఇది యేవిధమైన ప్రజాసేవా చేసే సంస్థ కాదు కదా?) అనీ, ఇంకా కొన్ని చిత్ర విచిత్రమైన మాటలని ప్రవేశపెట్టేస్తున్నారు. పోనీ, దాంతో సరిపెడుతున్నారా అంటే…….యెక్కడో జపాన్ లోని పార్టీలపేర్లని—డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ జపాన్ ని “జపాన్ జనస్వామ్య పక్షం—జ జ ప” అనీ, జపాన్ రెస్టొరేషన్ పార్టీ ని “జపాన్ పునరుధ్ధరణ పక్షం—జ పు ప” అనీ……ఇలా మొదలెట్టారు! ఇవన్నీ అంత అవసరమా?

కోర్టు ని “కోట్రు” అనీ, రోడ్డు ని “రోడ్రు” అని……ఇలా వ్యవహరించే మన తెలుగు సామాన్యులకి, “సర్వోన్నతన్యాయ స్థానం”, “రహదారి” (అసలు రహదారి అంటే, ఇంగ్లీషులో “థరో ఫేర్”. మరీ రోడ్డు అనకూడదు అనుకుంటే, బాట అంటే సరిపోతుంది!) అనీ వ్యవహరించమంటే భాషని వుధ్ధరించినట్టా?

“క్రిస్మస్" ని కూడా “కిసిమిశ్” అని తెలుగులో అనుకోవాలా? (కన్యాశుల్కంలో గురజాడ ఓపాత్ర చేత “కిసిమీశ్శెలవులు” అనిపించాడుమరి!) 

………ఇంకొంత మరోసారి.

Tuesday, November 27, 2012

కార్తీక మాసం--"అతి" పవిత్రం



(అతి సర్వత్ర వర్జయేత్!)

2011-12 నూనెల సంవత్సరం (నవంబరు నుంచి మళ్లీ అక్టోబర్ వరకూ) లో మొత్తం "వంటనూనెల" దిగుమతులు 1 కోటీ 19 లక్షల టన్నులకి చేరాయట. ఈ విషయంలో గత "పదేళ్ల" రికార్డులు బ్రద్దలయ్యాయట. 

దేశంలో వాటి ఉత్పత్తి 7 లక్షల టన్నులు తగ్గగా, వినియోగం 8 లక్షల టన్నులు పెరిగి, మొత్తం లోటు 15 లక్షల టన్నులు పెరిగి, దిగుమతులుకూడా అంతమేర పెరిగాయట. 

రాష్ట్రం లో డెయిరీలు "ఆవుపాలు" కొనుగోలు రేటు 2 నుంచి 3 రూపాయలు తగ్గించారట--ఓ రెండు మూడు రోజులు. తరవాత అసలు కొనడమే మానేశారట! యెందుకంటే--పాల నిలవలు యెక్కువయ్యి, డిమాండు లేకపోవడం ట.

ఇంక కార్తీక మాసం పుణ్యమా అని, టీవీ నిండా, పేపర్ల నిండా యే గుళ్లలో యెన్నిదీపాలు వెలిగించారో ఆ వార్తలూ, దృశ్యాలే!

మచ్చుకి--మాజిల్లాలోనే--భీమవరం లో డిసెంబరు 12 న "లక్ష" దీపాలు వెలిగిస్తారట. దానికోసం కొందరు భారీ విరాళాలు ఇస్తూంటే, ఓ తొమ్మిదిమంది 9 నూనె డబ్బాలు విరాళంగా ఇచ్చారట.

బజార్లో వంకాయలూ, బీరకాయలూ సైతం కిలొ 45 దాకా పెరిగాయి. త్వరలో 50 కి చేరినా ఆశ్చర్యపడక్కర్లేదు. "మొన్నటి వార్షాలవల్ల సరుకు రావడంలేదు" అంటున్నారు దుకాణాలవాళ్లు. 

(అన్నట్టు, ఈ మాసంలో చాలా మంది చేపలూ, మాంసాలూ తినడం మానేసి, కూరగాయలే తింటారట. సోమవారాలు ఉపవాసాలు చేసేవాళ్లక్కూడా, చపాతీలకీ వాటికీ కూరగాయలే కావాలి. ఉప్పుడు పిళ్లూ, చప్పిడి పిళ్లూ తినే రోజులు కావు కదా! ఉప్పుడు పిండికి కూడా పప్పుల రేట్లు చుక్కల్లో వుంటున్నాయి.) 

యేలూరులో అయ్యప్ప స్వామిని "వెయ్యి కిలోల" కూరగాయలతో శాకాంబరుడిగా అలంకరించారట ఓ రోజు!

బియ్యం రేట్లు మళ్లీ పెరిగిపోతున్నాయి. సర్కారువారు యేవేవో పథకాలు వేస్తున్నారు--మిల్లర్లు ఇంకా బలిసేందుకు. రేట్లు ఇంకా పెరుగుతాయంటున్నారు.

యేలూరులోనే, శివాలయంలో 100 కిలోలతో "అన్నాభిషేకం" చేశారట!

దీపావళి రోజునా, కార్తీక మాసంలో రోజూనూ, తాటాకులతో "గుమ్మటాలు" చేసి, అందులో "ఉమ్మెత్త" కాయలని సగానికి కోసి, గింజలు తిసేసి, ముచిక భాగాన్ని ఆ గుమ్మటాల్లో గుచ్చి వాటిని చూరుకి వ్రాలాడదీసీ, పై భాగాలని ప్రమిదల్లా నేలమీదా పెట్టి, వాటిలో ఆవు నెయ్యో, ఆముదమో (అదికూడా వంటాముదం కాదు) పోసి, దూది వత్తులు వేసి వెలిగించేవారు. 

అదీ శ్రేష్టమైన పధ్ధతీ, వ్యవహారమూ! 

(అప్పుడు ఆవుపాలు కొనకపోవడమూ, నెయ్యి దొరకకపోవడమూ, వంట నూనెల దిగుమతులు పెరగడమూ వుండవు కదా?)

Friday, November 16, 2012

మన భాష......



.......తెలుగు 

మన తెలుగు భాష గురించి మాట్లాడితే, అనేక తెలుగు పదాలని చాలా మంది మరిచిపోయారు అనీ, ఇప్పటివాళ్లకి అవేవో గ్రీక్ & లాటిన్ లా ధ్వనిస్తున్నాయనీ చెప్పాలి.

“కుర్సీ” అనేది హిందీలోంచి వచ్చింది. (కిస్సా కుర్సీ కా అనే సినిమా ఇందిరాగాంధీ ని మూడు చెరువుల నీళ్లుతాగిస్తే, ఆ నిర్మాతని ఆవిడ ఆరు చెరువుల నీళ్లు తాగించింది!). ఆ పదాన్ని మన తెలుగులో “కుర్చీ పీట” గా ప్రవేశపెట్టారు! క్రింద కూర్చోడానికి వేసుకునేవి పీటలు. ఇవి కుర్చీ పీటలు. ఇప్పుడందరూ వాటిని కుర్చీలు అనే అనేస్తున్నారనుకోండి.

ఇంకా, “ముక్కాలి పీటలు” వుండేవి. తలంట్లు పోసుకోడానికీ, చదువుకొనేటప్పుడు లాంతర్లు పెట్టుకోడానికీ వగైరాలకోసం వాడే వారు. గుండ్రని చెక్కకి మూడు కోళ్లు బిగించేవారు. అందుకనే అవి “ముక్కాలి” పీటలు.

కూర్చునే “బెంచీ” లు వుంటాయి కదా? బెంచ్ అనేది ఆంగ్ల పదం. దానికి తెలుగులో “కవాచీ బల్ల” అని ఓ పదం వుండేది. దానిమీద “రెడ్డికం” వేసుకొని కూచోడం, ఇంకెవరైనా వస్తే వాళ్లని ప్రక్కన కూర్చోమంటూ “రెడ్డికం తో సహా” ప్రక్కకి జరగడం—శ్రీపాదవారి పుస్తకాల్లో చదువుతాం.

పెద్దలు—“ముందు నాలుగువేళ్లూ నోట్లోకి పోయే విధానం చూసుకోరా!” అనేవారు. తృప్తిగా భోజనం చేస్తే, కుడిచేతి బొటనవేలు మినహా, మిగిలిన నాలుగు వేళ్లూ నోట్లోకి వెళతాయి! బయట హోటళ్లలోనూ అక్కడా సరే. బొటనవేలూ, చూపుడు, మధ్య వేళ్లతో కలుపుకొని, కెక్కిరిస్తూ తినేస్తారు—స్పూన్లూ అవీ వాడకుండా తినేవాళ్లు. అక్కడ “ఎటికెట్”లూ, “టేబుల్ మేనర్సూ” వుంటాయి. మరి, ఇంట్లో శుభ్భరంగా తినేప్పుడు ఈ నాజూకులెందుకు? యెవరైనా అలా తింటే వెంటనే కూకలేస్తాను నేను. మన తెలుగు పధ్ధతులు మరిచి పోవద్దని!

మన తెలుగు వాళ్లింకా “మార్జాలం” అంటే “బిడాలం” అనే అనువాదాల్లోంచి బయట పడడం లేదు. మా చదువుల్లో గణిత శాస్త్రం, భౌతిక, రసాయన శాస్త్రాలూ వగైరాలు చదువుకున్నాం. అవన్నీ తెలుగులోనే చక్కగా అందరికీ అర్థమయ్యేలా “పైథాగరస్ సిధ్ధాంతం” (ఆయన్ని “పిథోగోరాస్” అనాలట!), “ప్లవన సూత్రాలూ”, “ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు చేయుట” లాటి పాఠాలు వుండేవి. ఇప్పుడు చూద్దుమా—తెలుగు మీడియం విద్యార్థుల సౌకర్యం కోసం పండితులు సూచిస్తున్న పాఠాల్లో ప్రశ్నలు—అర్థం అవడం సంగతి తరవాత—అసలు కొరుకుడు పడడమే లేదు! మరింకేమి చదువులో!

మన తెలుగు వాళ్లకో పెద్ద జబ్బుంది. యెవరినైనా పేరు అడగండి—పీ ఎస్ రావ్ అనో, కే టీ శర్మ అనో, డీ వీ ఎస్ వర్మ అనో--ఇలా చెపుతారు! పూర్తి పేరు చెప్పాలంటే నామోషీ కాదుగానీ, “అంత అవసరమా?” అనే ఫీలింగు! ఇంక చిరునామా చెప్పమంటే నూటికి 99 మంది యేమాత్రమూ సరిగ్గా చెప్పరు! అదేం దౌర్భాగ్యమో! దానికి  తగ్గట్టు మనవాళ్ల ఇంటిపేర్లు చాలా చిత్రంగా వుంటాయి. అందుకని అసలు చెప్పరు. 

మా ట్రెయినింగ్ కాలేజీలో వచ్చే ఉపాధ్యాయులని నేను వాళ్ల పూర్తి పేర్లు అడిగేవాణ్ని. నాకదో హాబీ. ప్రముఖుల ఇంటిపేర్లతోసహా పూర్తి పేర్లు సేకరిస్తూ వుంటాను. ఏ పీ జే అబ్దుల్ కలాం పూర్తి పేరు చాలామందికి తెలియక మునుపే నేను “అవుళ్ పకీర్ జైనుల్లా ఉద్దీన్ అబ్దుల్ కలాం” అని సేకరించాను. వ్రాశాను. (ఆయన ప్రమాణస్వీకారం చేస్తూ, “….జైనుల్లా అబ్దీన్…..” అని చేశాడు! సరే పోనీ అనుకున్నాను. 

అలా, ఒక ఉపాధ్యాయుడిని క్లాసు అయిపోయి, యెవరికైనా యేమైనా “డౌట్స్” వున్నాయా అనడిగితే, నేను “మీ పూర్తి పేరు చెప్పండి సార్!” అని అడగడం, ఆయన చేతి మూడువేళ్లతో నుదుటిమీద పైనుంచి ముక్కుమీదకి వ్రాస్తున్నట్టు అభినయించి, “పంగనామాల గోవర్ధన రావు. నీకేమైనా అభ్యంతరమా?” అనడం, క్లాసులోవాళ్లంతా ఘొల్లుమనడం జరిగాయి. నాకేం అభ్యంతరం వుంటుంది మరి?

యేతావాతా చెప్పొచ్చేదేమిటంటే, తెలుగువాళ్లు తమ తెలుగు పేర్లనీ, ఇంటిపేర్లనీ, చిరునామానీ చెప్పుకోడానికి సిగ్గు పడఖ్ఖర్లేదు అని.

మీరేమంటారు?

Saturday, November 10, 2012

ఇదో రకం.....



......పరాకాష్ఠ

ఈ మధ్య జనాలకి భక్తి యెక్కువైపోతూంటే, అర్చకులూ వాళ్లకీ కూడా “సెట్టింగుల” వ్యసనం యెక్కువైపోయింది. గుడి మొత్తం ప్రహరీలతో సహా విద్యుద్దీపాలంకరణ, లోపల కరెన్సీ నోట్ల అలంకరణ లాంటివి సరే. కానీ వుత్సవ విగ్రహాలకీ, కొండొకచో మూల విగ్రహాలకీ, కృత్రిమ చేతులూ, కాళ్లూ కూడా తగిలించేస్తున్నారు. ఆఖరికి తిరుమలేశుడికీ, చిన్న వెంకన్నకీ కూడా తప్పడంలేదీపాట్లు. 

కంచిలో వరదరాజస్వామిని--అరచేతులు పైకిపెట్టి, చేతులు ముందుకు చాపిన గరుడుని విగ్రహం పై వూరేగిస్తారు. స్వామిని ఆయన భుజాలపై కూర్చోబెట్టి కాళ్లు రెండూ గరుడుని చేతుల్లో వుంచుతారు. (నిజంగా అలాంటి ఉత్సవ విగ్రహం వుందేమో నాకు తెలీదు).

మలయప్ప స్వామిని మాత్రం గరుడినిపై కూర్చొన్నట్టు నిలబెట్టి, రెండు కృత్రిమ కాళ్లు గరుడుని చేతుల్లో వుంచుతున్నారు. (ఈ విషయంలో నేను వ్రాసినది  తప్పయితే నాకు తెలియబరచండి—సంతోషిస్తాను.)  

ఇంక చినవెంకన్న (ద్వారకా తిరుమల)అయితే, ఓ రోజు అదేదో 'వుట్టి కొట్టుడు' అనో వెన్న దొంగ అవతారం అనో—పైన వుట్టిలో ఓ కుండ వ్రేలాడదీసి, క్రింద అటకలా పేర్చి, దానికి ఓ నిచ్చెన వేసి, స్వామి  రెండు కృత్రిమ కాళ్లలో యెడం కాలుని నిచ్చెన మీద పెట్టి, కుడికాలుని వ్రేలాడేశారు. ఆ కాళ్లకి రేకుతో చేసిన పాదాల ఆకారంలో సాక్సులాంటివి కూడా తొడిగారు. 

ఇంకోరోజు “బక సంహార” అవతారం అని ఓ ఇత్తడి కొంగ బొమ్మని నిలబెట్టి, ఓ చేత్తో దాని ముక్కును చీలుస్తున్నట్టూ, రెండో చేత్తో దాన్ని పట్టుకున్నట్టూ, కాళ్లు మామూలుగా వ్రేలాడేసి అలంకరించారు.

అమ్మవార్లకైతే, సరస్వతీ అవతారం కోసం, అప్పటికే ఆవిడకి వున్న నాలుగు చేతులలో రెంటిని కప్పేసి, కృత్రిమ చేతుల్లో వీణని నిలబెట్టేస్తున్నారు. 

అసలు ఇలాంటి వాటికోసం వేరు వేరు వుత్సవ విగ్రహాలని తయారు చేయించచ్చు కదా? అలా చేయించి ఇచ్చే దాతలకీ, భత్తులకీ కొదవ లేదు కదా?

యేమిటో!

అన్నట్టు, అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఒరిజినల్ గా రెండు చేతులు పైకీ, రెండు చేతులు క్రిందుగా ప్రక్కకీ వుంటాయి. వాటిలో వుండవలసిన శంఖు చక్రాలు, గదా కమలాలూ వుంటాయి. కానీ తరవాత వీరశైవులైన రాజులకి భయపడి, ఓ కృత్రిమ చేయిని తగిలించి, అది క్రిందకి వ్రేలాడేసి, ఆ చేత్తో ఓ పుష్పాన్ని క్రింద వున్న ఓ చిన్న శివలింగం మీద వుంచబోతున్నట్టు మలిచారట. నిజంగా కూడా, ఆ గుళ్లో ప్రస్ఫుటంగా కనపడేది  ఆ చెయ్యి ఒకటే. మిగతా విగ్రహాన్ని చూడడానికి మూడు గదుల్లోకీ కళ్లు చించుకోవాలి!

ఇప్పుడుగనక ఆ వీరశైవులు వుంటే, ఇప్పటి వాళ్లని దశావతారం సినిమాలో కమలహాసన్ ని వీపులో హుక్కులు గుచ్చి వ్రేలాడదీసినట్టు చేసి సముద్రంలో ముంచేసేవారేమో!

ఈ మధ్య కొన్ని సినిమాల్లో బ్రాహ్మణులని అవమానించారు అని ఆందోళన చెయ్యడానికి భ్రాహ్మణ సంఘాలు అన్నీ సంఘటితం అవుతున్నాయి. మంచిదే. ఓ పెద్దాయన్ని మోహన బాబు ఫోనులో “మీ బుర్ర పగల కొడతాం” అన్నాడు అనీ, “పగలకొడతాం” అనడానికి ఓ బూతు మాట వాడారనీ ఆయన స్వయంగా ఓ టీవీ ఛానెల్లో చెప్పారు! హౌ డేర్ హి? (అంటే ఆ చెప్పినాయన కాదు).

అయినా మనబంగారం మంచిదైతే…..అన్నట్టు, మొదటినుంచీ ఈ చైతన్యం వుంటే ఈరోజు ఈ స్థితికి వచ్చేదికాదు కాదా?

ఇప్పటికైనా వెర్రిమొర్రి “బండిపూజలూ, కారుపూజలూ, సినిమా కెమేరాలకీ, మెగాఫోన్లకీ పూజలూ, తిరుమలలో ప్రతిసినిమాకీ మొదటి రీలు పూజలూ, శంఖుస్థాపనలకి తాపీకీ, ఉలికీ పూజలూ" వగైరాలు మానేస్తే బాగుంటుంది. ముఖ్యంగా కడుపు కక్కుర్తికోసం వేలం వెర్రులని ప్రోత్సహించకుండా, ఒకరిని మించి ఒకరు ఒకరి పొట్ట వొకరు కొట్టుకోవడం మానేస్తే ఇంకా మంచిది.

బ్రాహ్మణులూ—ఆలోచించండి.

Wednesday, October 24, 2012

పురాణేతిహాసాలూ.....2



.....పుక్కిటి పురాణాలూ

ఇంకా ఆయన, "భగవద్గీతలో మొదటి అధ్యాయంలోనే కృష్ణుని మాటలు చదివితే, ఓ సినిమాలో విలన్ 'వాళ్ల బ్రతుకుల మీద నాకు విరక్తి పుట్టింది.....వాళ్లని చంపెయ్యండ్రా....!' అనడం గుర్తుకొస్తుంది.

పైగా ధర్మ యుధ్ధంలో అలా చంపెయ్యాలట. మామూలుగా విలన్లలాంటివాళ్లు అలా యెవరినిబడితే వాళ్లని 'విరక్తి' కలిగిందికదా అని చంపించెయ్యకూడదట. ఇలా అంటారు వ్యాఖ్యాతలు!"

........ఇలా చెపుతూ వుంటారు.

నన్నడిగితే, ఇలాంటి పురాణాలు పుక్కిటపట్టినవాళ్లు--విష్ణుచిత్తుడు తనకి దొరికిన పాపకి సూడికుడుత్త నాచ్చియర్ అని పేరు పెట్టాడు అనీ, యశోద కృష్ణుణ్ణి 'తిరగలి' కి కట్టేసింది అని ఈనాడు 'అంతర్యామి' కాలమ్‌లో రాసెయ్యచ్చు! (పాపం ఆ ఆర్టిస్ట్ రోలు బొమ్మనే వేశాడు--అతనికి ఈ పుక్కిటి పురాణాలు తెలియవేమో!)

ఇంకా అంటే, వికీపీడియాలో మనకి 'తెలిసినవన్నీ' వ్రాసెయ్యచ్చు--నేటి తరానికి 'నెట్' లో కనపడేవే అక్షర సత్యాలు మరి--పాతాళం పైన తలాతలం వుంది అని వ్రాసినా, ఇంకేవేవో వ్రాసినా!

ఇంకోటి గుర్తొచ్చింది. ఈ మధ్య అమీష్ త్రిపాఠీ అనేవాడొకడు శివుడి మీద ఓ "పుస్తకత్రయం" వ్రాస్తానని ప్రకటించి, ఇప్పటికే ఓ రెండు పుస్తకాలు ప్రచురించేసి, బోళ్లు డబ్బులు చేసేసుకున్నాడు.

మొదటిది అదేదో '.........మెలూహా' అని. అందులో దక్షుడూ, సతి, వీరభద్రుడూ, నందీ, భృంగీ, నీలకంఠ ఇలా అందరూ వుంటారు. ఆయుర్వతి అని ఓ డాక్టరు వుంటుంది. బృహస్పతి మందర పర్వతమ్మీద సోమరసం తయారు చేస్తూ వుంటాడు. నాగజాతివాళ్లు ఆ పర్వతాన్ని నాశనం చేసి, బృహస్పతిని చంపేస్తారు దక్షుడూ వాళ్లకి సోమరసం అందకుండా! అయినా ఓ పెద్ద యుధ్ధం చేసేసి, శతృరాజుని బంధించేసి అయోధ్యకో యెక్కడికో తీసుకొచ్చేస్తాడు నీలకంఠ. ఈ నీలకంఠ యెప్పుడూ నందీ వాళ్లతో 'గంజాయి చిలుం' పీలుస్తూ వుంటాడు. 
  
ఇంక రెండో 'సీక్రెట్ ఆఫ్ ది నాగాస్' నవల్లో, అంతకు ముందు నవల్లోనే చెప్పినట్టు నాగజాతివాళ్లందరూ వికలాంగులనీ, కాళీ మాతా (నల్లగా వుండి యెప్పుడూ నాలుక బయటికి వేళ్లాడుతూ వుంటుందనేమో), ఆవిడ కొడుకులాంటి గణేషుడూ (యేనుగుతలా, చిన్న చేతులూ కాళ్లూ, బానపొట్టా వుంటాయికాబట్టి)--ఇలా నాగజాతికి చెందినవాళ్లనీ, మళ్లీ నీలకంఠ ఇంకెవరిమీదో యుధ్ధానికి వెళ్లడానికి రాముడు తిరిగిన ప్రదేశాలన్నీ చుడుతూ, మధ్యలో పరశురాముడనే దోపిడీ దొంగని ఓడించడం, గోదావరీ తీరందాకా ప్రయాణించడం--ఇలా నడుస్తుంది.

(వాడు ఇవన్నీ శివపురాణంలోనూ, దేవీ పురాణంలోనూ వున్నాయని చెప్పినట్టుకూడా గుర్తు నాకు.)

నిజంగా శోచనీయమైన విషయం యేమిటంటే, మన భారతదేశంలోని పాఠకులు ఇంగ్లీషునవలలకోసం మొహంవాచిపోయి వున్నారో, లేక ఇవే అసలైన పురాణాలని భక్తి పురస్సరంగా కొని చదివేస్తున్నారో! మరి లేకపోతే అవి "ఇండియన్ బెస్ట్ సెల్లర్ లిస్ట్" లో "టాఫ్" లో వున్నాయంటే........!

పైగా మన అగ్రహీరో "ఆ నవలలని సినిమాలుగా తియ్యాలంటే దమ్ముండాలి, డబ్బులుండాలి గానీ, తీస్తే సూపర్ హిట్లు అవుతాయి" అన్నారట.

తెలుగు సినిమా ప్రేక్షకులూ పాతాళానికి కాస్త దగ్గరగానే వున్నారని వాళ్ల అంచనా అనుకోవచ్చు మనం.

(మళ్లీ మరోసారి)

Monday, October 22, 2012

పురాణేతిహాసాలూ.....



.....పుక్కిటి పురాణాలూ

"ఆఁ! ఇవన్నీ పుక్కిటిపురాణాలు....." అంటూ చప్పరించేసేవాళ్లెప్పుడూ వున్నారు. 

నాకు తెలిసిన ఓ పెద్దాయన భారతంలో "భగవద్గీత" మొత్తం "ప్రక్షిప్తం" అంటాడు. అలా అనడానికి అనేక సమర్థనలు చూపిస్తూ వుంటాడు. 

ఆయన వాదనలో--"భగవద్గీతలో "యదా యదాహి ధర్మస్య........." అనే శ్లోకం చెప్పాడుగదా?

మామూలుగా నారాయణుడు "దశావతారాలు" యెత్తాడంటారు. భాగవతంలో పోతన అయితే, ఇప్పటికి 21 అవతారాలు యెత్తాడనీ, 22వ అవతారంగా "కల్కి" వస్తాడనీ అంటాడు.

కృతయుగం కొన్ని లక్షల సంవత్సరాలు కదా? త్రేతా యుగం దానికి రెట్టింపు. ద్వాపర యుగం మూడురెట్లు, కలియుగం నాలుగు రెట్లు కదా?

మరి దశావతారాల్లోని మొదటి ఐదు అవతారాలూ కృతయుగంలోనే యెత్తేశాడు. ఆరోది పరశురామావతారం కూడా ఆ యుగంలోనే యెత్తి, దుష్ట శిక్షణ చేసేశాడు. త్రేతాయుగంలో ఒక్క రామావతారమే యెత్తాడు. ద్వాపరంలో బలరామావతారం ఒక్కటే! ఇంక కలియుగంలో ఇప్పటివరకూ బుధ్ధావతారం ఒక్కటే. 

భాగవతం ప్రకారం అయితే, యేకంగా 17 అవతారాలు కృతంలోనూ; ఒకటి త్రేతాలోనూ; రెండుమాత్రం ద్వాపరంలోనూ; ఇరవైఒకటోదైన బుధ్ధావతారం కలిలో ఇప్పటివరకూ యెత్తాడు. 

అంటే, పురాణాల్లో చెప్పినట్టు "ధర్మ దేవత" కృతయుగంలో నాలుగుపాదాలతోనూ, త్రేతాయుగంలో మూడూ, ద్వాపరంలో రెండూ, కలిలో ఓకే పాదంతో నడుస్తుందంటారుకదా? 

మరి అవతారాలు చూస్తే, "దుష్టులు" కృతయుగంలోనే యెక్కువ అనీ, మిగిలిన యుగాల్లో బాగా తగ్గుతూ వస్తున్నారనీ అనుకోవాలా?"

.......ఇలా ఇంకా చాలా వాదిస్తారు!

(మళ్లీ మరోసారి)

Friday, October 12, 2012

తెలుగు ని బ్రతికించాలా?



.........బ్రతకనివ్వాలా?

మళ్లీ "ప్రపంచ తెలుగు మహా" సభలకి యెన్ని కోట్లో కేటాయించారట! (ప్ర. తె. మ. అని నామకరణం కూడా చేసేశాడు ఈనాడు వాడు.)

యే సభలు చూసినా యేమున్నది గర్వకారణం? 

భాషోధ్ధరణకల్లా మూలం బొకేలిచ్చి, మాలలు--కొండొకచో గజమాలలు వేసి, శాలువాలు కప్పడం, జ్ఞాపికలు అందించడం, ఫోటోలు పత్రికల్లోనూ, వీడియోలు టీవీల్లోనూ వచ్చేలా చూసుకోవడం! నిజంగా అద్భుతమైన భాషా సేవ!

మరి తెలుగు భాష యెలా బ్రతికి బట్టకడుతుంది? 

గురజాడ 150 వ జయంతీ, నన్నయ 500 వ నో యెన్నోనో జయంతీ, శ్రీకృష్ణ దేవరాయల ఫలానా పట్టాభిషేకోత్సవం, ప్ర. తె. మ. లూ, తానా, తంతా లాంటి సభలూ "ఘనంగా" జరుపుకొంటేనా?

తెలుగు సినిమాలకి ఇంగ్లీషు పేర్లు పెట్టి, పాటల్లో ఇంగ్లీషూ, హిందీ, ఇతర దేశ భాషలే కాకుండా, ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్, జపనీస్ లాంటి భాషల్లోని పదాలు వుపయోగించడం వల్లనా?

"యెక్కడి తెలుగుతల్లి? యెవడికి తల్లి?" అనడిగేవాళ్ల వల్లనా?

ప్రాథమిక విద్య నుంచీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు బోధించడం వల్లనా?

పోటీ పరీక్షల్లో ప్రశ్నల్లో పేపరు ఇచ్చేవాళ్ల "పాండిత్యం" వెలిబుచ్చేలాంటి చర్యలవల్లనా?

రాష్ట్రంలో యెక్కడా యే పేరైనా ఇంగ్లీషులోనో, ఇతర భాషల్లోనో (తెలుగు కాకుండా) వ్రాయడం వల్లనా?

ప్రభుత్వ, కచేరీల, వ్యవహారాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలూ, దస్త్రాలూ (తెలుగులో తప్ప) నిర్వహించడం వల్లనా? 

ఇంకా ఇలాంటివన్నీనా?

మనం, మిగతా రాష్ట్రాలు మాతృభాష విషయంలో మనకన్నా చాలా ముందున్నాయి అంటామనుకోండి, ఇక మంత్రులూ, అధికార్లూ స్విట్జర్ లేండూ, దక్షిణ ఆఫ్రికా, మాచు పిచ్చూ లాంటి చోట్లకి, వాళ్లు వాళ్ల భాషల్ని యెలా కాపాడుకొంటున్నారో తెలుసుకోడానికి "స్టడీ" టూర్లకి వెళతామంటారు--మన మాజీ రాష్ట్రపతి ప్రపంచం మొత్తం, బంధు మిత్ర పరివారంగా "సౌహర్ద్ర" పర్యటనలు చేసేసినట్టు!

ఆ మధ్య ఓ లబ్ధ ప్రతిష్టుడైన సినీ గీత రచయితని మామూలుగా విలేఖరులు "తెలుగు భాషని బ్రతికించుకోడం గురించి యేమి చెపుతారు?" అనడిగితే, "అసలు తెలుగు యెక్కడుంది? దాన్ని బ్రతికించుకోడం యెందుకు? తత్సమాలూ, తద్భవాలూ లేకుండా తెలుగు మాట్లాడండి యెవరైనా?" అంటూ మండి పడ్డాడు. (ఆయన చాలామటుకు ఇంగ్లీషు పదాలతోనే పాటలు రాస్తున్నట్టున్నాడు! పైగా భుక్తి కోసమో, తప్పదనో పాటలు ఛస్తే వ్రాయను--నా ఆత్మ సంతృప్తి కోసమే వ్రాస్తాను అని మరీ ఢంకా బజాయించాడు.)

తెలుగు భాషకి వచ్చిన ముప్పు ఇంగ్లీషు నుంచిగానీ--సంస్కృతం నుంచో, కన్నడ, తమిళ, మలయాళీ, ఉర్దూ, పార్శీ, మరాఠీ, హిందీ వగైరా భాషల వల్లా కాదు కదా? మరి ఆయన "కవి హృదయం" యేమిటో?  

మరి ఇంతకీ.....బ్రతికించాలా......బ్రతకనివ్వాలా? ఆ చేసేది యెవరంటారు?

Thursday, May 10, 2012

యజ్ఞమా? యాగమా?.........4



........యెవరికి లాభం? యెంత శాతం?

ఇంక ద్వాపరాంతంలో, కృష్ణ నిర్యాణానంతరం, కలియుగ ప్రారంభం.

యాగంలో, యజమానికి భార్య వుండడం కంపల్సరీ అనడానికి, "శ్రీనాధుడు" వర్ణించిన "అశ్వమేధ మఖ తంత్రం" చక్కటి వుదాహరణ. పెద్దలందరికీ తెలుసు--ఈ విషయం--కానీ యెవరూ పబ్లిగ్గా చెప్పరు! 

"యజమాన ప్రమదా వికస్వర భగ న్యస్తాశ్వ దీర్ఘ స్మర ధ్వజదండంబౌ నయ్యశ్వమేధ మఖ తంత్రంబున్నిరీక్షించి యక్కలిపురుషుడొత్తిలి నవ్వె!" (అర్థం తేటతెల్లమేగా?) 

బుధ్ధావతారం గురించీ, తరవాత భారత చరిత్ర గురించీ, అశోకుడి కళింగ యుధ్ధం గురించీ, రాబోయే "కల్కి" (ఇప్పటి కల్కి భగవాన్, అమ్మ భగవాన్ లు కాదండోయ్!) గురించీ అందరికీ తెలిసిందేగా?

మరి ఈ కలియుగంలో, యెవరికివారు యజ్ఞాలూ, యాగాలూ చేసేస్తూ, యెవర్ని వుధ్ధరిస్తున్నారో? 

Tuesday, May 8, 2012

యజ్ఞమా? యాగమా?.........3



........యెవరికి లాభం? యెంత శాతం?

హిరణ్యకశిపుడు (జయ విజయుల్లో రెండోవాడు) పేట్రేగిపోయినప్పుడు, సకల మునులూ, దేవతల కోరికపై 
"నరసింహావతారం" యెత్తాడు ఆయన. 

బలి చక్రవర్తి భరతం పట్టడానికి, మళ్లీ వాళ్లందరి కోరికపై, వామనావతారం యెత్తవలసి వచ్చింది.

అప్పటికి విష్ణువు సర్వసమర్థుడిగా, సర్వాధికారిగా ఎస్టాబ్లిష్ అయ్యేసరికి, మొదలయ్యాయి "యాగాలు". (ఆప్పుడుకూడా యజ్ఞాలు కొనసాగేవి--కొంతమంది చేత.) 

కృతయుగాంతంలో, సప్తర్షులూ ఆకాశంలో వుండిపోతే, వాళ్ల వారసులు భూమ్మీదకి వచ్చి, ప్రజోత్పత్తికి పాటుపడ్డారు. 

"స్వాయంభువ" మనువు వల్ల "బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర" కులాలు యేర్పడ్డాయి.

త్రేతాయుగం ప్రారంభంలో, "క్షత్రియుల" విజృంభణతో, మరోసారి పరశురామావతారం యెత్తి, 21 సార్లు భూమంతా తిరిగి, క్షత్రియుడు అనేవాడు లేకుండా నరికేశాడు. (ఒక్క దశరథుడే, గాజులు తొడుక్కొని, బ్రతికిపోయాడు!) 

తరవాత, రామావతారం. 

ఇక్కణ్నించీ అన్నీ ప్రాచుర్యంలో వున్న కథలే. ఆ కాలంలో, యజ్ఞాలూ, యాగాలూ కూడా జరిగేవి. 

విశ్వామిత్రుడు "యజ్ఞం" చేస్తుంటే, రాక్షసులు ఆటంకాలు కల్పిస్తున్నారనే రాముణ్ని తనతో పంపమన్నాడు.

మరి, దశరథుడు "పుత్రకామేష్టి" "యాగం" చేశాక కదా సంతానం పొందాడు?

యాగం అంటే, "ప్రతిఫలాపేక్ష" తో కూడింది. ఆశ్వమేధ, నరమేధ, రాజసూయ వగైరా యాగాలన్నీ అందుకే!

యాగానికి "యజమాని" (యాగం చేసేవాడు) వుంటాడు. (ఆయనకి భార్య వుండడం కూడా కంపల్సరీ--యెందుకో.....తరవాత.) "యూప స్థంభం" వుంటుంది. దానికి "బలిపశువు"ని కట్టేస్తారు. "ఋత్విక్కులు", ఆయన కోరికని తెలియజేస్తూ, యజమానిచేత "హోమం" చేయిస్తారు. ఆయన తరఫున "హోత"లు హోమం చేస్తారు. "ఉద్గాతలు" సహకరిస్తారు. 

"యజ్ఞానికి" శాలలు వుండవు. "యాగాలకి" వుంటాయి. యజ్ఞం బహిః ప్రదేశంలో నిర్వహించడం వల్లే, మారీచ సుబాహులు రక్త మాంసాలతో యజ్ఞ కుండాన్ని అపవిత్రం చేసి, అగ్నిని ఆర్పగలిగారు. 

యాగం తంతు యాగశాలలోనే జరుగుతుంది. ఒక్కో యాగానికీ ఒక్కో రకం శాలలూ, వేదికలూ యేర్పాటు చేస్తారు. 

యాగ ప్రక్రియ, స్థూలంగా, యజమానిని యాగ పశువులోకి ఆవాహన చేసి, ఆ పశువు ద్వారా యజమాని కోరిక నెరవేరేందుకు దోహదం చేసి, చివరికి ఆ పశువుని నవరంధ్రాలూ మూసి హత్యచేసి, ఖండఖండాలుగా నరికి, ప్రతీ అవయవానికి సంబంధించిన మంత్రాలతో అగ్నికి ఆహుతి చేయడంతో ముగుస్తుంది యాగం. అంటే, యజమానే అత్మార్పణ చేసుకున్న ఫలం సిధ్ధించి, "యజ్ఞ" పురుషుడు అగ్నిలోంచి ఆవిర్భవించి, యజమాని కోరికతీరేలా "ఫలం" అనుగ్రహించి వెళ్లిపోతాడు.  

త్రేతాయుగంలో శ్రీరాముడిగా అవతారం యెత్తి, పరశురాముడి అవతరానికి పరిసమాప్తి చేస్తాడు విష్ణువు. రావణవధ జరిగి, సీతని అడవిలో వదిలేశాక "అశ్వమేధ యాగం" చేశాడంటారు. (రావణ, కుంభకర్ణుల--జయ విజయుల రెండో జన్మ--వధ జరిపాడు విష్ణువు).  

ద్వాపర యుగంలో, ధర్మరాజు "రాజసూయ యాగం" చేశాడు. అప్పుడే శిశుపాల (జయ విజయుల్లో ఒకడు--మూడో జన్మ) వధ జరిగి, కురుపాండవుల మధ్య మచ్చరం రగిలి, కురుక్షేత్ర యుధ్ధానికి దారి తీసింది. ఇందులో "బలరామావతారం" పాత్ర చెప్పుకోతగ్గది. 

(మన సినిమావాళ్లు ఆయన్ని తీసేసి, కృష్ణావతారం ప్రవేశపెట్టారు! అలాగే విజయుడి మూడో జన్మ "దంతవక్తృడు" కథకి అంత ప్రాచుర్యం రాలేదు!)

......మిగతా మరోసారి.

Sunday, May 6, 2012

యజ్ఞమా? యాగమా?.........2



........యెవరికి లాభం? యెంత శాతం?

కృత యుగంలో, ఋగ్వేద కాలంలో "యజ్ఞాలు" జరిగేవి. అప్పటికింకా భూలోక, భువర్లోకాలు యేర్పడలేదు. స్వర్లోకమే వుండేది. దానికి అధిపతి ఇంద్రుడు. ఆయనకి అష్ట దిక్పాలకులూ తోడు. భూలోకం యేర్పడ్డానికి రిహార్సల్ గా, ప్రజాపతులూ, వారి పరివారమూ వుండేవి. అప్పుడే ఋషులు "యజ్ఞాలు" నిర్వహించేవారు. మునులు మౌనంగా తపస్సు చేసుకొనేవారు. 

ఇంద్రుడి ప్రీతి కోసం, ఋక్కులు పఠిస్తూ, హోమాలు చేసేవారు. అలా నూరు యజ్ఞాలు చేస్తే, "ఇంద్రపదవి" పొందచ్చు. అలా చేసినవాళ్లూ వున్నారు.....భంగపడినవాళ్లూ వున్నారు. 

ఈ యజ్ఞానికి "ఆధ్వర్యుడు" (నిర్వహింపచేసేవాడు) వుంటాడు. "ఋత్విక్కులు" ఋక్కులు చదువుతారు. "హోత"లు హోమాలు చేస్తారు. "ఉద్గాతలు" వంతలు. హవిస్సులని, స్వాహాదేవి ద్వారా, అగ్నికీ, అక్కడినుంచి ఇంద్రుడికీ చేర్చేవారు. లోకం సుభిక్షంగా వుండేది. (ఇందులో ఆధ్వర్యుడికి ప్రతిఫలాపేక్ష వుండేదికాదు--యే తొంభై యజ్ఞాలో చేసేవరకూ!)

ఇప్పటికీ, స్మార్తులు అగ్నిహోత్రం లేకుండా నిర్వహించే వ్రతాల్లోనూ గట్రా, మంటపం యేర్పరచి, ఇంద్ర, అష్టదిక్పాలకాది దేవతలని "సాంగం, సాయుధం...."గా ఆవాహన చేసి, స్థాపించి, పూజిస్తారు. 

కృతయుగం చివరిలో, లింగోద్భవం జరిగి, శ్రీమహా విష్ణువు యోగనిద్రలోంచి లేచి, నాభికమలంలోంచి బ్రహ్మ పుట్టి, సృష్టి కొనసాగించడానికి అనుమతులు తీసుకొని, అప్పుడు భూ, భువర్లోకాలు యేర్పడ్డాయి.

బ్రహ్మ సృష్టికి ఆటంకం కల్పిస్తూ, సోమకాసురుడు వేదాలని దాచేస్తే, మత్స్యావతారం యెత్తాడు విష్ణువు.

(కూర్మావతారం, క్షీరసాగర మథనాలూ, అమృతం పుట్టుకా వగైరాలు అందరికీ తెలిసినవే!)

ఆ తరవాత హిర్ణ్యాక్షుడు (వైకుంఠ ద్వారపాలకులు జయ విజయుల్లో ఒకడు) అప్పుడే యేర్పడిన భూమిని చాపచుట్టగా చుట్టేసి, సముద్రం క్రింద ముంచేస్తే, వరాహావతారం యెత్తి, భూమిని పైకి తేల్చినప్పుడు యేర్పడ్డాయి--భరత వర్షమూ, భరత ఖండమూ, మేరువూ, హిమాలయాలూ వగైరా.

(ఈ వ్యాసం పూర్తయ్యాక "అతిమూత్రుల" వ్యాఖ్యలదగ్గరకొస్తాను. ఓపిక పట్టండి.)

......మిగతా మరోసారి.

యజ్ఞమా? యాగమా?.........




........యెవరికి లాభం? యెంత శాతం?

"అతిరాత్ర ఉత్కృష్ట మహా సోమయాగం" శాలా దహనం తో పూర్తయ్యిందట. ఫలితమేమిటో అందరూ చూశారు. (అతిమూత్రం కూడా యెవరికీ రాలేదు అని కొక్కిరించారెవరో!) 

ఆరున్నర కోట్లు ఖర్చు పెట్టారట. దేవాదాయ శాఖవాళ్లు ఇవ్వము అంటే, ప్రభుత్వం వారు కామన్ గుడ్ ఫండ్ నుంచి ఓ 50 లక్షలు చదివించారట. (దానికి బాధ్యులెవరో మరి!) 6 లక్షలమందికి "అన్న (అపాత్ర) దానం" చేశారట. (ఆఖర్రోజున యెందుకో ఆపేశారట!). ఇంకా ఓ 70 లక్షల "లోటు" మిగిలిందట. (రావలసిన చందాలు ఇంకా వున్నాయనుకోండి.....ట). 

శాలాదహనం అయిన మరుక్షణం "కుంభ వృష్టి" కురుస్తుందన్నారుగా? అంటే, "ముందురోజే కురిసేసింది కదా?" అని జవాబు!

నిన్న (05-05-2012న) యాగ నిర్వాహకులు పీవీఆర్ కే ప్రసాద్ వగైరాలు, గవర్నరుగారిని దర్శించి, యాగం ప్రసాదాన్ని, విభూతిని ఆయనకి అందజేసి, "యజ్ఞ వైభవం" అనే ప్రత్యేక, విశిష్ట సంచికని ఆయనచే ఆవిష్కరింపచేశారట. ఆయన ఇంకా ఇలాంటివి చాలా జరగాలని అభిలషించారట. (ఈ గవర్నరుగారు, 'మళ్లీ' నియమింపబడినప్పటినుంచే భక్తీ వగైరాలు యెక్కువైపోయాయి. రోజూ పేపర్లో కనిపిస్తున్నాడు. ఉపయెన్నికలు అయిపోయాక రాష్ట్రం మొత్తం పర్యటిస్తాడట! మరి రాజకీయ అజెండా యేమైనా వుందేమో......అంటున్నారు. పాపం ఆయన పదవీకాలం ముగిసినప్పటినుంచీ, మళ్లీ ప్రమాణ స్వీకారం చేసేవరకూ మనది గరర్నరు లేని రాష్ట్రం అయిపోయింది!).

ఇంతకీ అది యజ్ఞమా? యాగమా? (ఆ రెండింటికీ తేడా వుందా?)

నాకున్న పరిజ్ఞానం మేరకు వ్రాస్తున్నాను. 

పెద్దలు యవరైనా నన్ను ఖండించదలుచుకున్నా, కొన్ని విషయాలు సరిదిద్దదలుచుకున్నా అందరికీ ఆహ్వానం.

......మిగతా మరోసారి.

Sunday, April 29, 2012

మంత్రాలూ........



.......చింతకాయలూ

మహానుభావుడు మా పేరి మేష్టారు యెద్దేవా చేసేవాళ్లని అనుకరిస్తూ, "మంతరాలకి సింతకాయలు రాల్తాయేటి?" అని ప్రశ్నించి, "మర్రాలవేటి? ఇంకామాట్టాడితే పళ్లు కూడా రాలతాయి!" అని జవాబిచ్చేవారు.

మరి ఇప్పటి కొత్త కొత్త మంత్రాలకీ, పూజా యజ్ఞ యాగాదులకీ యేమి రాలతాయో.

ఓ పెద్దాయన కాలేజీలో పాఠం చెపుతూండగా, ప్రక్కవూరినుంచి తెలిసున్నాయన ఆయనతో పనివుండి వచ్చాడట. మేష్టారు క్లాసు అయిపోతోంది, ఇప్పుడే వస్తాను అంటే అక్కడే ఓ చెట్టుక్రింద నిలుచున్నాడట. ఆ ప్రక్కనే రెండు గాడిదలు కూడా వున్నాయట. మేష్టారు బయటికి రాగానే, "మీ వూళ్లో గాడిదలు యెక్కువండీ" అన్నాట్ట ఆయన. దానికి మేష్టారు "మరేనండీ! వున్నవి చాలనట్టు ప్రక్క వూళ్లనుంచి కూడా వచ్చేస్తున్నాయి!" అని చురకేశాడట.

మొన్నటిదాకా శ్రీశైలం లో కన్నడ భక్తులూ, పూజారులూ సందడి చేశారు. అంతకు ముందు తిరుమలలోననుకుంటా, మరాఠా భక్తులూ, పూజారులూ. అరవ్వాళ్లు మన రాష్ట్రంలో తిరుప్పావై వగైరాలతో చేస్తున్న సందడి చూస్తూనే వున్నాము. ఇప్పుడు కేరళ నంబూద్రీల వంతు అనుకుంటా.

భద్రాచలం దగ్గర "అతి రాత్రం" నిర్వహిస్తున్నారు. ప్రవర్గ్యం; పిన్వనం; గరుడాకృతి చితికరణం; మండూక మార్జనం; సామోపస్థానం వగైరాలతో యాగం చేస్తూంటే, శనివారం రాత్రి కుంభవృష్టి కురిసిందని పేపర్లు వ్రాశాయి.

బాగుంది.

గత వారం రోజులుగా, అనంతపురం జిల్లా రాయదుర్గంలో మొత్తం 253 మిల్లీ లీటర్ల వర్షం కురిసిందట! (అంటే చదరపు అడుగుకి పావు లీటరు పైగా!). అక్కడ యే మహారాత్రాలూ యెవరూ నిర్వహించిన దాఖలు లేవు మరి.

గీతలో "యజ్ఞము వలన మేఘమూ, మేఘం వలన వర్షమూ, వర్షం వల్ల అన్నమూ పుడతాయి" అని చెప్పాడు. 

అసలు భారతంలో భగవద్ గీతే లేదు, తరవాత ప్రవేశపెట్టారు అనేవాళ్లూ వున్నారు.

యెవరి ఇష్టం వారిది! కదా......!

Monday, March 26, 2012

అధర్మం పెరిగిపోతూంది......




ఇంకా యెప్పుడు.....యెవరు అవతరిస్తారో!?

ఓ సినిమా సీను.....

హీరో డీయస్పీ--యూనిఫామ్ లో.....చొక్కా బొత్తాలు విప్పేసి, నడుం బెల్టూ, క్రాస్ బెల్టూ లూజుగా వేళ్లాడుతూ, నెత్తిమీద టోపీ లేకుండా, జుట్టు అలా అలా అలవోకగా యెగురుతూ, యెడం చేతిలో ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగర్ చేతిలో వుండే పెద్ద గన్నుని ఇష్టం వచ్చినట్టు వూపుతూ, డైలాగులేస్తూంటాడు. 

హీరో వెనుక ఓ నలుగురు పోలీసులు. సీన్లో ఓ జనరల్ స్టోర్.   వెనుక పెద్ద గోదాములో--పెద్ద పెద్ద బస్తాల్లో, అట్టపెట్టెల్లో "అక్రమ" సరుకులు నిల్వ చెయ్యబడి వున్నాయని అనుమానం. షాపు యజమాని ధైర్యంగానే జవాబిస్తూంటాడు. హీరో......

"ఆ! ఈ షాపూ, వెనక్కాల గోడవునూ నీవేనా? సరే. తనిఖీ చెయ్యాలి. తాళాలు తెరువమ్మా....!" 

యజమాని--"లేవు" 

"యెక్కడవున్నాయో తెలుసుగా?" 

"తెలీదు" 

తన గుప్పిడి మూసి, అతని ముఖానికి చాలా దగ్గరగా ఒక్కసారిగా చాపి, "ఇందులో వుంటాయి. బయటికి రప్పించనా?" 

"నాకు తెలీదు అని చెప్పానుగా?" 

"తెలీదంట్రా....పాపం. రప్పించేద్దామా?" పక్కనున్న కానిస్టేబుల్ తో. 

"ఆయ్! తప్పదనుకుంటానండి!" మీసాలెగరేస్తూ, వెకిలినవ్వుతో ఆ క్యామెడీ అర్టిస్ట్. 

వెనుకనుంచి యగమాని భార్యా, పిల్లలూ, ఇద్దరు ముగ్గురు ఇరుగూ పొరుగూ హడావిడిగా వచ్చి చూస్తూ వుంటారు. 

హీరో, పిడికిలితో అతని గడ్డం క్రింద బలంగా ఒక్క "డిష్యుం" అనేసరికి, అతను యెగిరి, షాపు సీలింగుకి బుర్ర తగులుతూ, ఓ రేక్ మీద భళ్లున పడి...... 

"బాబూ...బాబూ....ఆయన్నేమీ చెయ్యకండి....ఇవిగో తాళాలు" అంటూ వాళ్లావిడ. తలుపులు తెరవగానే, "ఆహా! అన్నిరకాల సిగరెట్లూ, గుట్కాలూ, పొగాకు వుత్పత్తులూ......ఓ రెండు కోట్లుంటాయా? వీటన్నింటినీ సీజ్ చేసి, తాళాలు వేసి, సీలు వెయ్యండ్రా! బాబూ, ఇంక నడుస్తావా? జీపెక్కు." అంటూ గెంటుకుంటూ ఆ యజమానిని పట్టుకుపోతాడు.

{సాధారణంగా, ఫిబ్రవరి 29 న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ బడ్జెట్, తరవాతి ఏప్రిల్ 1 నుంచీ అమల్లోకి వస్తుంది--సభ వొప్పుకుంటే. దానికోసం, డిసెంబరు నెలనుంచీ బుర్రోవాదులు క్రితం యేడాది బడ్జెట్ అంచనాలూ, వాటిని సవరించడం, పనిలో పనిగా వచ్చే బడ్జెట్లో యే రంగాన్ని యేవిధంగా బాదాలి.....వగైరాలతో సతమతమైపోతూంటారు. మంత్రిగారు ఫలానా రంగం నుంచి నాకు అదనంగా ఇన్నికోట్లు కావాలి......అంటే, వీళ్లు "అదెంతపని" అంటూ క్రొత్త క్రొత్త పధ్ధతులనీ, అవసరమైతే "లాటిన్" పేర్లనీ కనిపెట్టేసి, "పన్నులు" విధించేద్దామంటారు. (ఈ బడ్జెట్లూ, లెఖ్ఖలూ, పన్నులూ గురించి వ్రాస్తే, ఓ బృహద్గ్రంధం వ్రాయాలి). గత ఇరవై యేళ్లకి పైగా, ప్రతీ బడ్జెట్లోనూ, రకరకాల పన్నులతో బాధింపబడేవి......ఇంకేమిటి?.......పొగాకు వుత్పత్తులు--ముఖ్యంగా సిగరెట్లు! (వాటిని వుపయోగించేవాళ్లు వినియోగదారులు కాదు. వాటి వాడకం తగ్గించే నెపంతో వాళ్లని యెలాగైనా దోచుకోవచ్చు......అందరూ! యెవరూ అడగరు.) ఇంకేం! దోపిడిదారులకి ఓ సువర్ణావకాశం! జనవరి నుంచే సిగరెట్లు దొరకవు. దొరికినా క్రమంగా రేట్లు పెరిగిపోతూ వుంటాయి. కంపెనీవాళ్లేమి చేస్తారు? ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా వాళ్ల వుత్పత్తులన్నీ మార్కెట్ అయిపోవాలి! అమ్మకాలు పెరిగినట్టు చూపించుకోవాలి. స్టాక్ అంతా మార్కెట్లోకి తరలిస్తారు. అంత స్టాక్ వున్నా, బజార్లో అవి దొరకవు. మూడు నెలలతరవాత, పెరిగిన రేట్లతో అమ్ముకొని, "అక్రమ" లాభాలు గడిస్తారు.}       

ఓ చిన్న పట్టణంలో, నిజంగా జరిగిన సీను.......

రెవెన్యూ డివిజనల్ ఆఫీసరు మొన్న శనివారం (24-03-2012) రాత్రి, ఆ జనరల్ స్టొర్ పై ఆకస్మికంగా దాడి చేశారు--ఇతర సిబ్బందీ, పోలీసు అధికారుల సమన్వయంతో! భారీ నిల్వలు బయటపడ్డాయి. ముందు గోదాము తెరవమని వ్యాపారిని అడిగితే, తాళాలు లేవన్నాడట. 

"పంచనామా చేసి, తాళాలు పగులకొట్టి, సరుకు జప్తు చెయ్యమని ఆదేశించి, ఆయన వెళ్లిపోయారట. 

తీరా వాళ్లు ఆ పనికి వొడిగట్టకముందే, కుటుంబ సభ్యులు తాళాలు తీసి, సరుకుని వాళ్ల కళ్లముందరే, ఇంటి పైభాగానికి తరలించడం మొదలెట్టారట! 

ఆర్ ఐ ఆగ్రహం వ్యక్తం చెయ్యడంతో మళ్లీ వాటిని గోదాములోకి చేర్చారట. ఈలోగా కొందరు తోటి వ్యాపారస్తులు, సరుకు విలువని తక్కువగా చూపిస్తే వొప్పుకుంటామన్నారట. 

బాగా ప్రొద్దుపోవడంతో మల్లగుల్లాలు తేలకపోవడంతో, అందరూ అలిసిపోయిన స్థితిలో, అధికారులు చేతులెత్తెయ్యడంతో, వ్యాపారి మళ్లీ సరుకు తరలించేసుకున్నాడట

(తరవాత కేసు బుక్ చేశారో, విచారించడం మొదలెట్టారో లేదో పేపర్లలో రాలేదు!)

యదా యదాహి ధర్మస్య.......అభ్యుథ్థానమధర్మస్య......!


Tuesday, February 28, 2012

పోలీసుల యెంపికలు......



......విపరీత పోకడలు

రాజుని చూసిన కళ్లతో మొగుణ్ని చూస్తే మొత్తబుధ్ధేసిందట ఒకావిడకి. 

ఆ సామెత ఈ సందర్భంలో సరిపోదుగానీ, ఇంకేమీ తోచలేదు నాకు.

రిపబ్లిక్ డే పెరేడ్ లో మన సైన్యాలూ, విద్యార్థులూ చేసే కవాతు చూస్తాము. యెంత చక్కగా వుంటుంది!

మరి మన "పోలీసులు" జిల్లా కేంద్రాల్లోనూ అక్కడా చేసే పెరేడ్, గౌరవ వందనాలూ చూస్తే......యే ఒక్కడి కాలూ ఇంకొకడి కాలితో; యే వొక్కడి చెయ్యీ ఇంకొకడి చేతితో; యే ఒక్కడి టోపీ ఇంకొకడి టోపీతో; యే వొక్కడి ఆయుధమూ ఇంకొకడి ఆయుధంతో; యే వొక్కడి చూపూ ఇంకొకడి చూపుతో.......యేమాత్రం యేకీభవించవు!

సాధారణంగా ఇలాంటివాటికి, వున్న సిబ్బందిలో మెరికల్లాంటివాళ్లనే యెంచుకుంటారు. మరి "మెరిక"లే ఇలా వుంటే, మిగిలినవాళ్లెలా వుంటారో వూహించుకోండి!

నేనైతే, ఇలాంటి వందనాలు స్వీకరించడానికి సిగ్గుపడతాను. పొరపాటున జరిగిపోయినా, మీడియావాళ్ల కాళ్లా వేళ్లా పడైనా, ఆ ఫోటోలు పేపర్లో రాకుండా చూసుకుంటాను, అవసరమైతే వాళ్లకేదైనా ముట్టచెప్పయినా సరే. అన్నట్టు మనకి కావలసిన పని చేయించుకోడానికి యేదైనా ఇస్తే అది లంచం అట. కానీ, యే పనైనా చెయ్యొద్దు అని ముట్టచెప్పేది లంచం కానే కాదుట. ఇదో కొత్త కోణం!

ఈ మాత్రానికి, పోలీసు రిక్రూట్ మెంట్ కి జరిగే తతంగాలు చూశారా? 

యే సంస్థ అయినా, తమకి ఫలానా పోస్టులో ఇన్ని ఖాళీలు వున్నాయి, అర్హతలు ఇవీ అంటూ ప్రకటన జారీచేసి, వాటికి దరఖాస్తు చేసుకొనే విధి విధానాలన్నీ, యేమాత్రం అసందిగ్ధతకి తావులేకుండా వ్యవహరిస్తాయి.

మనపోలీసు మాత్రం తన సొంత పంథా అనుసరిస్తుంది!

రాష్ట్రవ్యాప్తంగా, మహా వుంటే ఓ 100 సబిన్స్పెక్టర్ పోస్టులు ఖాళీగా వుంటాయి. లేదూ, ఓ వెయ్యి వున్నాయనుకుందాం. వాటికోసం "స్వయంగా" దరఖాస్తులందించాలని ప్రకటన యేమిటి?

పాపం నిరుద్యోగులు, అంతకు ముందు రోజే బయలుదేరి, యే అర్థరాత్రో, తెల్లవారుజామునో ఫలానా చోట క్యూలు కట్టడం మొదలెడతారు. తినీ, తినకా (చాలామంది తినడానికి డబ్బులు లేకా--తిరుగు ప్రయాణానికి మాత్రమే డబ్బులు దాచుకొని) రాత్రి వరకూ పడిగాపులు పడతారు రోజులతరబడీ!

మొన్నీమధ్య, జనవరిలో, మా ఏలూరు రేంజి పరిథిలో, ఓ నాలుగైదురోజులపాటు ఈ ప్రహసనం సా.....గి, ఓ 22,000 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారట. రోజుకి మూడు వేలో, నాలుగు వేలో.....ఒక్కోరోజు యే వెయ్యో.....ఇలాగ! 

ఓరోజు పత్రికలవాళ్లు గొడవచేసి, అభ్యర్థులకి కనీస సౌకర్యాలు లేవు, చాలా తక్కువ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు, ఈ సర్టిఫికెట్ లేదు, ఆ జెరాక్స్ లేదు అంటూ అభ్యర్థులని వేధిస్తున్నారు...అంటూ వార్తలు వ్రాస్తే, ఆ మర్నాడు ఇంకో కవుంటరు అదనంగా తెరిచి, అందరికీ కాస్త తాగునీరూ, నీడకోసం టెంట్లూ వగైరా కల్పించారట!

చివరాఖరికి, అభ్యర్థులందిరికీ మార్చి నెలలో, దేహధారుఢ్య పరీక్షలూ, 5 కి మీ పరుగూ, ఇతర (వ్రాత వగైరా) అర్హత పరీక్షలూ నిర్వహిస్తాము అని ప్రకటించారు!

అంతకి ఓ పదిరోజుల ముందే, ఏ పీ పోలీసు కోడ్ ప్రకారం, "కానిస్టేబుళ్ల, ఎస్ ఐ ల" పరీక్షల్లో, శారీరక ధారుఢ్యం అర్హతకు 800 మీటర్లు దూరాన్ని 2 నిమిషాల 25 సెకన్ల నుంచి, 3 నిమిషాల 35 సెకండ్ల మధ్య లంఘిస్తే సరిపోతుందని వుందనీ, దాన్ని ఆ శాఖ 5 కీ మీ లకి పెంచడం దారుణమనీ హై కోర్టులో ఒకాయన రిట్ వేశాడట. 

ఇంకా, ఈ 5 కి మీ పరుగుల్లో, కనీసం ఒకళ్లయినా ప్రాణాలు కోల్పోవడం, ఇంకో ఇద్దరు ముగ్గురు చావు తప్పి కన్ను లొట్టపోయిన వార్తలు తరచూ మనం చూస్తూనే వున్నాము.  

అది అంత అవసరమా అని ప్రశ్నించుకొన్న బాసెవడూ లేడుట.

ఇంక మళ్లీ ఆ 22 వేల మందినీ, ఫలానారోజు పరీక్షలకి రమ్మని, ఆ యెండలో పొద్దుణ్నించీ చొక్కాలు విప్పేసి క్యూల్లో నిలబడమంటారు.....తరవాతెప్పుడో  యెత్తూ, బరువూ, చాతీ కొలతలు తీసుకోడానికి! మళ్లీ ఆ మర్నాడో యెప్పుడో, పరుగులు.....! ఆ తరవాతెప్పుడో రాత పరీక్ష. 

ఇంకా తరవాత, మౌఖిక పరీక్ష. ఇలా సా.....గుతూ వుంటుంది. 

ఆఖరికి యెప్పుడో ఓ వందమందిని యెన్నుకుంటే, అదీ ఓ రికార్డే!

ఇలాంటివాటినికూడా మానవహక్కుల కమీషన్ సువో మోటోగా విచారిస్తే బాగుండును!

Sunday, February 26, 2012

మర్మములలోని.......



......మర్మమేమి?

"మర్మం" అంటే....దాచబడినది--అంటే బహిర్గతం కానిది--అని. 

మరి మనుష్యులచే సృష్టించబడ్డ దేవుడు కూడా మనిషిలాగే వుంటాడుకదా? అందుకే ఆయనకీ "మర్మావయవాలు" వుంటాయి. 

సాధారణంగా, దేవుళ్ల విగ్రహాలు   "వస్త్రాలతో" వున్నట్టే చెక్కబడి వుంటాయి--యెక్కడో ఓ శివుడి విగ్రహాన్ని ఆయన కట్టుకున్న పంచె అనే వస్త్రంలోంచి ఆకారం తెలుస్తున్న ఆయన మర్మావయం కనిపిస్తున్నట్టు చెక్కారు తప్ప! 

మరి, దేవుళ్ల విగ్రహాలకి పట్టు వస్త్రాలూ, పీతాంబరాలూ కట్టడం, నగలూ, వస్తువులూ దిగెయ్యడం యెందుకు? 

ఆ వస్త్రాలని "శేష" వస్త్రాలంటూ "భక్తులకి" (డబ్బులు తీసుకొనో, వాళ్లు వీఐపీలు కాబట్టో) అనుగ్రహించడం యెందుకు? వేలం వెర్రిగా, దేవాలయాన్ని సందర్శించిన "గొప్పోళ్లకి" పూర్ణ కుంభ, మేళతాళ స్వాగతాలెందుకు? పోనీ, "విశేష" పూజలెందుకు? తరవాత, బస్తాలతో ప్రసాదాల సమర్పణ యెందుకు? వేద ఆశీర్వచనాలెందుకు? "పట్టు" వస్త్రాల బహూకరణలెందుకు? మళ్లీ యేదో "పుణ్య" తిథి వంకతో "నిజరూప దర్శనాలు" యెందుకు?

సాధారణంగా, మూలవిరాట్ యే రూపంలో వున్నా, వుత్సవ విగ్రహాలని మాత్రం జనసామాన్యానికి వూహకి అందేలా మానవరూప విగ్రహాలుగానే రూపొందిస్తారు. 

శ్రీగిరి (తిరుపతిని ఇలా అనడానికి సాహసించడం లేదుగానీ, తెలుగు పేరే అయిన శ్రీశైలాన్ని శ్రీగిరి అంటున్నారు మన పత్రికలవాళ్లు!) శ్రీపతికి కూడా, అలాగే పెరుమాళ్ రూపంలో వుత్సవ విగ్రహం, నిలబడి వున్నట్టుగా, వుంటుంది. 

యేవాహనం మీద అయినా అలాగే నిలబెట్టో, సిం హాసనంలో కూర్చున్నట్టో అలంకరించి వూరేగిస్తారు. బాగుంది. కానీ, హనుమంతుడు, గరుడుడు వాహనాలమీద మాత్రం, "కృత్రిమ" కాళ్లతో రెండు కాళ్లనీ వాళ్ల చేతులలో పెట్టి, వూరేగించడం యెందుకో?   

అమ్మవారికి బంగారు చీర కడతాననేవాడొకడు, గుడి మొత్తానికి బంగారంతో వెల్లవేస్తాననేవాడొకడు, మట్టీ ఇటుకలతో యేమిటి...ఛీ, ఛీ....బంగారంతోనే గుడి కడతానని కట్టినవాడొకడు........!

యేమిటో! వెర్రి ముదిరితే, తలకి రోకలి చుడితే తగ్గుతుందట. యెన్ని రోకళ్లు కావాలో! తలలకి చుట్టేవాళ్లెంతమంది వుండాలో!!!???

Wednesday, January 11, 2012

భక్తిలో కూడా కొత్తదనం కోసం.......



......వెంపర్లాడుతున్న వీ పీ లు

భక్తిలోనూ, దేవుళ్లలోనూ, పూజల్లోనూ పాత వాటితో విసుగొస్తోందనుకుంటా--యెప్పుడూ విననివి పుట్టుకొస్తున్నాయి. పేపర్లపుణ్యమా అని వ్యాపిస్తున్నాయి.

తలుపులమ్మ గుళ్లలో కూడా "తిరుప్పావై" పఠనాలేమిటి అని, మనకి "అరవ దాస్యం" యెందుకు అని ఇదివరకో టపా వ్రాశాను.

అదేదో సినిమాలో, బ్రహ్మానందానికి వీ పీ (వెరయిటీ పిచ్చోడు) అంటూ వెరయిటీ గా సన్మానం చేయిస్తాడు ఎల్ బీ శ్రీరామ్--చాపమీద కూచోపెట్టి, చిటికెలతో! అలా తయారవుతున్నారేమో మన "తెలుగు" భక్తులు అనిపిస్తూంది. 

ధనుర్మాసంలో, 27వ రోజు అదేదో "కూడారై" వుత్సవంట! అన్ని గుళ్లలోనూ చేసేస్తున్నారు. ఒకచోట 108 "గంగాళాల్లో" "కూడారై" వండి నైవేద్యం పెట్టారట. ఇంకో చోట కొన్ని వందల గంగాళాల్లో వండి, వాడిని "కూడారై" అనే తెలుగు అక్షరాల ఆకారంలో పేర్చి, ఇంకా కొన్ని వందల గంగాళాల్లో వివిధ ఆకృతుల్లో పేర్చి, నైవేద్యం పెట్టారట. (స్థానిక ఎమ్మెల్యే అక్కడ "తగిన" యేర్పాట్లు చేశాడట. రా నా లని ఇలాంటి చోట్లకి  రానివ్వకుండా, పవన్ కళ్యాణ్ చెప్పినట్టు, "పంచెలూడేలా" తంతే బాగుండును!) 

కూడారై అంటే, భక్తుడు పరమాత్మలో లీనమవడానికి చేసే ప్రయత్నం అంటాడొకడు. ఆ ప్రసాదాన్ని "అక్కార్ వడిశెల్" అన్నాడింకోడు! 

ఈ వుత్సవాల్లో "అవకతవకలు" జరిగాయని, ఏలూరులో ఓ గుళ్లో అర్చకులకి "ఛార్జ్ మెమో" లు ఇవ్వాలని నిర్ణయించారుటకూడా--ఆ కమిటీ వారు!

ఇంకా, అయ్యప్ప భక్తుల్లో, ఇదివరకెప్పుడూ వినని "వేట తుళ్లు" కార్యక్రమం; "మాలికా"నో, "మల్లికా"నో "పురోత్తమ" ప్రతిష్టాపనలు కూడా చేస్తున్నారట! ఆవిడెవరో, యెవరికి భార్యో, యెవరికి తల్లో తెలీదు! (యెర్ర బట్టల "అమ్మవారి దీక్ష" గురించి ఇంకో బ్లాగులో వ్రాశాను--చదివారా?)

కానివ్వండి! వెరయిటీకెప్పుడు ఆహ్వానమేగా మనం!