Sunday, April 29, 2012

మంత్రాలూ........



.......చింతకాయలూ

మహానుభావుడు మా పేరి మేష్టారు యెద్దేవా చేసేవాళ్లని అనుకరిస్తూ, "మంతరాలకి సింతకాయలు రాల్తాయేటి?" అని ప్రశ్నించి, "మర్రాలవేటి? ఇంకామాట్టాడితే పళ్లు కూడా రాలతాయి!" అని జవాబిచ్చేవారు.

మరి ఇప్పటి కొత్త కొత్త మంత్రాలకీ, పూజా యజ్ఞ యాగాదులకీ యేమి రాలతాయో.

ఓ పెద్దాయన కాలేజీలో పాఠం చెపుతూండగా, ప్రక్కవూరినుంచి తెలిసున్నాయన ఆయనతో పనివుండి వచ్చాడట. మేష్టారు క్లాసు అయిపోతోంది, ఇప్పుడే వస్తాను అంటే అక్కడే ఓ చెట్టుక్రింద నిలుచున్నాడట. ఆ ప్రక్కనే రెండు గాడిదలు కూడా వున్నాయట. మేష్టారు బయటికి రాగానే, "మీ వూళ్లో గాడిదలు యెక్కువండీ" అన్నాట్ట ఆయన. దానికి మేష్టారు "మరేనండీ! వున్నవి చాలనట్టు ప్రక్క వూళ్లనుంచి కూడా వచ్చేస్తున్నాయి!" అని చురకేశాడట.

మొన్నటిదాకా శ్రీశైలం లో కన్నడ భక్తులూ, పూజారులూ సందడి చేశారు. అంతకు ముందు తిరుమలలోననుకుంటా, మరాఠా భక్తులూ, పూజారులూ. అరవ్వాళ్లు మన రాష్ట్రంలో తిరుప్పావై వగైరాలతో చేస్తున్న సందడి చూస్తూనే వున్నాము. ఇప్పుడు కేరళ నంబూద్రీల వంతు అనుకుంటా.

భద్రాచలం దగ్గర "అతి రాత్రం" నిర్వహిస్తున్నారు. ప్రవర్గ్యం; పిన్వనం; గరుడాకృతి చితికరణం; మండూక మార్జనం; సామోపస్థానం వగైరాలతో యాగం చేస్తూంటే, శనివారం రాత్రి కుంభవృష్టి కురిసిందని పేపర్లు వ్రాశాయి.

బాగుంది.

గత వారం రోజులుగా, అనంతపురం జిల్లా రాయదుర్గంలో మొత్తం 253 మిల్లీ లీటర్ల వర్షం కురిసిందట! (అంటే చదరపు అడుగుకి పావు లీటరు పైగా!). అక్కడ యే మహారాత్రాలూ యెవరూ నిర్వహించిన దాఖలు లేవు మరి.

గీతలో "యజ్ఞము వలన మేఘమూ, మేఘం వలన వర్షమూ, వర్షం వల్ల అన్నమూ పుడతాయి" అని చెప్పాడు. 

అసలు భారతంలో భగవద్ గీతే లేదు, తరవాత ప్రవేశపెట్టారు అనేవాళ్లూ వున్నారు.

యెవరి ఇష్టం వారిది! కదా......!