Wednesday, October 24, 2012

పురాణేతిహాసాలూ.....2



.....పుక్కిటి పురాణాలూ

ఇంకా ఆయన, "భగవద్గీతలో మొదటి అధ్యాయంలోనే కృష్ణుని మాటలు చదివితే, ఓ సినిమాలో విలన్ 'వాళ్ల బ్రతుకుల మీద నాకు విరక్తి పుట్టింది.....వాళ్లని చంపెయ్యండ్రా....!' అనడం గుర్తుకొస్తుంది.

పైగా ధర్మ యుధ్ధంలో అలా చంపెయ్యాలట. మామూలుగా విలన్లలాంటివాళ్లు అలా యెవరినిబడితే వాళ్లని 'విరక్తి' కలిగిందికదా అని చంపించెయ్యకూడదట. ఇలా అంటారు వ్యాఖ్యాతలు!"

........ఇలా చెపుతూ వుంటారు.

నన్నడిగితే, ఇలాంటి పురాణాలు పుక్కిటపట్టినవాళ్లు--విష్ణుచిత్తుడు తనకి దొరికిన పాపకి సూడికుడుత్త నాచ్చియర్ అని పేరు పెట్టాడు అనీ, యశోద కృష్ణుణ్ణి 'తిరగలి' కి కట్టేసింది అని ఈనాడు 'అంతర్యామి' కాలమ్‌లో రాసెయ్యచ్చు! (పాపం ఆ ఆర్టిస్ట్ రోలు బొమ్మనే వేశాడు--అతనికి ఈ పుక్కిటి పురాణాలు తెలియవేమో!)

ఇంకా అంటే, వికీపీడియాలో మనకి 'తెలిసినవన్నీ' వ్రాసెయ్యచ్చు--నేటి తరానికి 'నెట్' లో కనపడేవే అక్షర సత్యాలు మరి--పాతాళం పైన తలాతలం వుంది అని వ్రాసినా, ఇంకేవేవో వ్రాసినా!

ఇంకోటి గుర్తొచ్చింది. ఈ మధ్య అమీష్ త్రిపాఠీ అనేవాడొకడు శివుడి మీద ఓ "పుస్తకత్రయం" వ్రాస్తానని ప్రకటించి, ఇప్పటికే ఓ రెండు పుస్తకాలు ప్రచురించేసి, బోళ్లు డబ్బులు చేసేసుకున్నాడు.

మొదటిది అదేదో '.........మెలూహా' అని. అందులో దక్షుడూ, సతి, వీరభద్రుడూ, నందీ, భృంగీ, నీలకంఠ ఇలా అందరూ వుంటారు. ఆయుర్వతి అని ఓ డాక్టరు వుంటుంది. బృహస్పతి మందర పర్వతమ్మీద సోమరసం తయారు చేస్తూ వుంటాడు. నాగజాతివాళ్లు ఆ పర్వతాన్ని నాశనం చేసి, బృహస్పతిని చంపేస్తారు దక్షుడూ వాళ్లకి సోమరసం అందకుండా! అయినా ఓ పెద్ద యుధ్ధం చేసేసి, శతృరాజుని బంధించేసి అయోధ్యకో యెక్కడికో తీసుకొచ్చేస్తాడు నీలకంఠ. ఈ నీలకంఠ యెప్పుడూ నందీ వాళ్లతో 'గంజాయి చిలుం' పీలుస్తూ వుంటాడు. 
  
ఇంక రెండో 'సీక్రెట్ ఆఫ్ ది నాగాస్' నవల్లో, అంతకు ముందు నవల్లోనే చెప్పినట్టు నాగజాతివాళ్లందరూ వికలాంగులనీ, కాళీ మాతా (నల్లగా వుండి యెప్పుడూ నాలుక బయటికి వేళ్లాడుతూ వుంటుందనేమో), ఆవిడ కొడుకులాంటి గణేషుడూ (యేనుగుతలా, చిన్న చేతులూ కాళ్లూ, బానపొట్టా వుంటాయికాబట్టి)--ఇలా నాగజాతికి చెందినవాళ్లనీ, మళ్లీ నీలకంఠ ఇంకెవరిమీదో యుధ్ధానికి వెళ్లడానికి రాముడు తిరిగిన ప్రదేశాలన్నీ చుడుతూ, మధ్యలో పరశురాముడనే దోపిడీ దొంగని ఓడించడం, గోదావరీ తీరందాకా ప్రయాణించడం--ఇలా నడుస్తుంది.

(వాడు ఇవన్నీ శివపురాణంలోనూ, దేవీ పురాణంలోనూ వున్నాయని చెప్పినట్టుకూడా గుర్తు నాకు.)

నిజంగా శోచనీయమైన విషయం యేమిటంటే, మన భారతదేశంలోని పాఠకులు ఇంగ్లీషునవలలకోసం మొహంవాచిపోయి వున్నారో, లేక ఇవే అసలైన పురాణాలని భక్తి పురస్సరంగా కొని చదివేస్తున్నారో! మరి లేకపోతే అవి "ఇండియన్ బెస్ట్ సెల్లర్ లిస్ట్" లో "టాఫ్" లో వున్నాయంటే........!

పైగా మన అగ్రహీరో "ఆ నవలలని సినిమాలుగా తియ్యాలంటే దమ్ముండాలి, డబ్బులుండాలి గానీ, తీస్తే సూపర్ హిట్లు అవుతాయి" అన్నారట.

తెలుగు సినిమా ప్రేక్షకులూ పాతాళానికి కాస్త దగ్గరగానే వున్నారని వాళ్ల అంచనా అనుకోవచ్చు మనం.

(మళ్లీ మరోసారి)

Monday, October 22, 2012

పురాణేతిహాసాలూ.....



.....పుక్కిటి పురాణాలూ

"ఆఁ! ఇవన్నీ పుక్కిటిపురాణాలు....." అంటూ చప్పరించేసేవాళ్లెప్పుడూ వున్నారు. 

నాకు తెలిసిన ఓ పెద్దాయన భారతంలో "భగవద్గీత" మొత్తం "ప్రక్షిప్తం" అంటాడు. అలా అనడానికి అనేక సమర్థనలు చూపిస్తూ వుంటాడు. 

ఆయన వాదనలో--"భగవద్గీతలో "యదా యదాహి ధర్మస్య........." అనే శ్లోకం చెప్పాడుగదా?

మామూలుగా నారాయణుడు "దశావతారాలు" యెత్తాడంటారు. భాగవతంలో పోతన అయితే, ఇప్పటికి 21 అవతారాలు యెత్తాడనీ, 22వ అవతారంగా "కల్కి" వస్తాడనీ అంటాడు.

కృతయుగం కొన్ని లక్షల సంవత్సరాలు కదా? త్రేతా యుగం దానికి రెట్టింపు. ద్వాపర యుగం మూడురెట్లు, కలియుగం నాలుగు రెట్లు కదా?

మరి దశావతారాల్లోని మొదటి ఐదు అవతారాలూ కృతయుగంలోనే యెత్తేశాడు. ఆరోది పరశురామావతారం కూడా ఆ యుగంలోనే యెత్తి, దుష్ట శిక్షణ చేసేశాడు. త్రేతాయుగంలో ఒక్క రామావతారమే యెత్తాడు. ద్వాపరంలో బలరామావతారం ఒక్కటే! ఇంక కలియుగంలో ఇప్పటివరకూ బుధ్ధావతారం ఒక్కటే. 

భాగవతం ప్రకారం అయితే, యేకంగా 17 అవతారాలు కృతంలోనూ; ఒకటి త్రేతాలోనూ; రెండుమాత్రం ద్వాపరంలోనూ; ఇరవైఒకటోదైన బుధ్ధావతారం కలిలో ఇప్పటివరకూ యెత్తాడు. 

అంటే, పురాణాల్లో చెప్పినట్టు "ధర్మ దేవత" కృతయుగంలో నాలుగుపాదాలతోనూ, త్రేతాయుగంలో మూడూ, ద్వాపరంలో రెండూ, కలిలో ఓకే పాదంతో నడుస్తుందంటారుకదా? 

మరి అవతారాలు చూస్తే, "దుష్టులు" కృతయుగంలోనే యెక్కువ అనీ, మిగిలిన యుగాల్లో బాగా తగ్గుతూ వస్తున్నారనీ అనుకోవాలా?"

.......ఇలా ఇంకా చాలా వాదిస్తారు!

(మళ్లీ మరోసారి)

Friday, October 12, 2012

తెలుగు ని బ్రతికించాలా?



.........బ్రతకనివ్వాలా?

మళ్లీ "ప్రపంచ తెలుగు మహా" సభలకి యెన్ని కోట్లో కేటాయించారట! (ప్ర. తె. మ. అని నామకరణం కూడా చేసేశాడు ఈనాడు వాడు.)

యే సభలు చూసినా యేమున్నది గర్వకారణం? 

భాషోధ్ధరణకల్లా మూలం బొకేలిచ్చి, మాలలు--కొండొకచో గజమాలలు వేసి, శాలువాలు కప్పడం, జ్ఞాపికలు అందించడం, ఫోటోలు పత్రికల్లోనూ, వీడియోలు టీవీల్లోనూ వచ్చేలా చూసుకోవడం! నిజంగా అద్భుతమైన భాషా సేవ!

మరి తెలుగు భాష యెలా బ్రతికి బట్టకడుతుంది? 

గురజాడ 150 వ జయంతీ, నన్నయ 500 వ నో యెన్నోనో జయంతీ, శ్రీకృష్ణ దేవరాయల ఫలానా పట్టాభిషేకోత్సవం, ప్ర. తె. మ. లూ, తానా, తంతా లాంటి సభలూ "ఘనంగా" జరుపుకొంటేనా?

తెలుగు సినిమాలకి ఇంగ్లీషు పేర్లు పెట్టి, పాటల్లో ఇంగ్లీషూ, హిందీ, ఇతర దేశ భాషలే కాకుండా, ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్, జపనీస్ లాంటి భాషల్లోని పదాలు వుపయోగించడం వల్లనా?

"యెక్కడి తెలుగుతల్లి? యెవడికి తల్లి?" అనడిగేవాళ్ల వల్లనా?

ప్రాథమిక విద్య నుంచీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు బోధించడం వల్లనా?

పోటీ పరీక్షల్లో ప్రశ్నల్లో పేపరు ఇచ్చేవాళ్ల "పాండిత్యం" వెలిబుచ్చేలాంటి చర్యలవల్లనా?

రాష్ట్రంలో యెక్కడా యే పేరైనా ఇంగ్లీషులోనో, ఇతర భాషల్లోనో (తెలుగు కాకుండా) వ్రాయడం వల్లనా?

ప్రభుత్వ, కచేరీల, వ్యవహారాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలూ, దస్త్రాలూ (తెలుగులో తప్ప) నిర్వహించడం వల్లనా? 

ఇంకా ఇలాంటివన్నీనా?

మనం, మిగతా రాష్ట్రాలు మాతృభాష విషయంలో మనకన్నా చాలా ముందున్నాయి అంటామనుకోండి, ఇక మంత్రులూ, అధికార్లూ స్విట్జర్ లేండూ, దక్షిణ ఆఫ్రికా, మాచు పిచ్చూ లాంటి చోట్లకి, వాళ్లు వాళ్ల భాషల్ని యెలా కాపాడుకొంటున్నారో తెలుసుకోడానికి "స్టడీ" టూర్లకి వెళతామంటారు--మన మాజీ రాష్ట్రపతి ప్రపంచం మొత్తం, బంధు మిత్ర పరివారంగా "సౌహర్ద్ర" పర్యటనలు చేసేసినట్టు!

ఆ మధ్య ఓ లబ్ధ ప్రతిష్టుడైన సినీ గీత రచయితని మామూలుగా విలేఖరులు "తెలుగు భాషని బ్రతికించుకోడం గురించి యేమి చెపుతారు?" అనడిగితే, "అసలు తెలుగు యెక్కడుంది? దాన్ని బ్రతికించుకోడం యెందుకు? తత్సమాలూ, తద్భవాలూ లేకుండా తెలుగు మాట్లాడండి యెవరైనా?" అంటూ మండి పడ్డాడు. (ఆయన చాలామటుకు ఇంగ్లీషు పదాలతోనే పాటలు రాస్తున్నట్టున్నాడు! పైగా భుక్తి కోసమో, తప్పదనో పాటలు ఛస్తే వ్రాయను--నా ఆత్మ సంతృప్తి కోసమే వ్రాస్తాను అని మరీ ఢంకా బజాయించాడు.)

తెలుగు భాషకి వచ్చిన ముప్పు ఇంగ్లీషు నుంచిగానీ--సంస్కృతం నుంచో, కన్నడ, తమిళ, మలయాళీ, ఉర్దూ, పార్శీ, మరాఠీ, హిందీ వగైరా భాషల వల్లా కాదు కదా? మరి ఆయన "కవి హృదయం" యేమిటో?  

మరి ఇంతకీ.....బ్రతికించాలా......బ్రతకనివ్వాలా? ఆ చేసేది యెవరంటారు?