Monday, December 31, 2012

తెలుగుని........! - 3



తెలుగులోనే మాట్లాడదాం....

రెండోరోజు పొద్దున్న "నష్ట నివారణ" చర్యగాననుకుంటా--ఓలేటి పార్వతీశం గారిచేత ఒకళ్లిద్దరిని అడిగించి, యేర్పాట్లు చాలా బాగున్నాయి, మాకు యే కష్టం తోచకుండా "పిల్లలు" (స్వయం సేవకులు) మంచినీళ్లూ భోజనాల దగ్గరనుంచీ చక్కగా చూసుకుంటున్నారు--అంటూ చెప్పించారు. (మర్నాడు పేపర్లలో వచ్చింది--గట్టి బందోబస్తు యేర్పాటు చేసి, టోకెన్లు జారీ చేసి, అవి వున్నవాళ్లకే భోజనాలూ వగైరా అందించారని! మరి ముందే ఆ తెలివి యెందుకు లేకపోయిందో?)

ఇంకా "ప్రథాన వేదిక" కీ, దానిమీద రా నా ల తొంబకీ ఇచ్చిన ప్రాథాన్యం మిగిలిన వేదికలకి ఇవ్వలేదు అని తెలుస్తూనే వుంది. (వారు కొన్ని ప్రసారం చేశారేమో గానీ కరెంటు కోత పుణ్యమా అని కొన్ని నేను చూడలేకపోయీ వుండొచ్చు అనుకున్నాను).

సంతోషం కలిగించిన విషయం యేమిటంటే, మహామహుడు నేరెళ్ల వేణుమాధవ్, మొత్తం సమయం తానే తినెయ్యకుండా, ఆయన శిష్యులచేత ప్రదర్శన ఇప్పించడం!

అవధాన వేదిక మీద యేమి జరిగిందో, తెలీదు. సినీకళాకారుల ప్రదర్శనా, వాళ్లకి సన్మానాలూ బాగానే జరిగాయి అని పేపర్లో వచ్చింది. 

అనేకమంది "ఇవి గందరగోళ మహాసభలు" అనీ, ఆహ్వానితులకి ఆదరణలేదు అనీ, యెందుకు పిలిచారో, యెక్కడికి వెళ్లాలో, యెవరిని కలవాలో, పత్రాల సమర్పణ యెవరు యెక్కడ యెప్పుడు చెయ్యాలో తెలీదనీ, బోళ్లు దూరాల్లో వున్న ఇతర చోట్లకికూడా రవాణా సౌకర్యం యేర్పాటు చెయ్యలేదు అనీ, వసతి గురించి అంతా వట్టి మాటేననీ వాపోయారట--అనేకమంది ముఖ్యులు కూడా.

ఇంక మంత్రి పార్థసారథి, వంటకాలు వాసన వస్తున్నాయి అని ఫిర్యాదు వస్తే, రుచి చూసి, "సంబంధిత గుత్తేదారు మీద చర్య తీసుకుంటాం, తప్పులు తేలితే నగదు చెల్లింపులో కోత విధిస్తాము" అన్నారట. శాసన సభ్యుడు మల్లాది విష్ణు అయితే, తినలేక, పళ్లాన్ని విసిరేసి వూరుకున్నారట. కొంతమంది ప్రముఖులు, రాత్రి మిగిలిన చద్దన్నాన్ని పులిహోర చేసి పెట్టేస్తున్నారు అని బాధపడ్డారట! 

.........ఇంకొంత ఇంకోసారి.

Friday, December 28, 2012

తెలుగుని........! - 2



తెలుగులోనే మాట్లాడదాం....

ప్ర తె మ లు మొదలయ్యాయి. 

కార్య నిర్వాహకుల కష్టం యేమిటో తెలిసింది. అదెంత వృధా అయిందో కూడా తెలిసింది. 

మధ్యాహ్నం 12.00 గంటలకి మొదలవుతాయన్నారు. టీవీలో యెక్కడా అలికిడిలేదు.  విసుగొచ్చి కట్టేసి, మళ్లీ నాలుగింటికి పెడితే, మన దూర దర్శన్--సప్తగిరిలో కి కు రె రాసుకొచ్చిన ఉపన్యాసం చదువుతున్నాడు. ఆయన మాటలకీ, పెదాల కదలికకి సంబంధం లేదేమిటా అనుకుంటుంటే, అది ఇంకెవరి గొంతో అని తెలిసింది! 

అప్పటికే తెలుగుతల్లి విగ్రహానికి దండవేసి, నివాళులు అర్పించేసి, అదేదో యాత్రని జెండావూపి ప్రారంభించేశారనీ, వార్తల్లో దృశ్యాలు చూపించారు తరవాత.

ఇంక దేశాధ్యక్షులవారి ఉపన్యాసం--బెంగాలీ లోనో, ఇంగ్లీషులోనో వ్రాసిస్తే, చాలా కష్టం మీద సహస్రాబ్దాల, శతాబ్దాల తెలుగు చరిత్రని వల్లెవేయించారు.

తరవాత గవర్నరుగారు. పూర్తిగా తెలుగులోనే, తడువుకుంటూ సాగింది......చాంగుబళా అంటూ.

రాష్ట్రపతిగారు అదేదో కట్టబోయే సమావేశమందిరానికి మీటనొక్కి శంఖుస్థాపన చేశారు. (తీరా ఆ ఫలకం ఇంగ్లీషులోనే వుంది!)

తరవాత ప్రముఖులకి "సత్కారాలు"--అధ్యక్షులవారి చేతులమీదుగా--"అకారాదిగా పిలుస్తాను" అంటూ అక్కినేనిని పిలిచారు. తరవాత మాత్రం అకారాది పాటించలేదు!

అప్పటిదాకా వేలాదిమంది భోజనాలు చెయ్యకుండా వుండిపోయినట్టున్నారు. నిర్వాహకులేమో, అయ్యో......చెప్పినట్టు తెలుగురుచులన్నీ వండేశాముకాదు....వృధా అయిపోయేవి.....అని ఆనందిస్తున్నట్టున్నారు. తీరా ఒక్కసారి అందరూ భోజనాలకి వెళితే, రకరకాల వంటకాలు కాదుకదా, అసలు అన్నమే లేదట చాలా మందికి!

మళ్లీ సాయంత్రం యెప్పుడో సప్తగిరివారు ప్రత్యక్ష ప్రసారం పెట్టారు. స్త్రీవాద రచయిత్రి అనూరాధ కవిత దగ్గరనుంచి చూశాను. 

తరవాత ఇంకో ఛానెల్లో అనుకుంటా, గజల్ శ్రీనివాస్, తనకి 7 నిమిషాలే సమయం ఇచ్చారు అంటూ రెండో మూడో గజల్స్ పాడాడు--సహజంగానే అతనికి యెవరూ సాటిలేరు అనిపించుకున్నాడు. 

తరవాత, సాహితీ వేదికపై, "త్రిభువ విజయం"--మహామహుడు బేతవోలు రామబ్రహ్మం "ఇంద్రుడు"గా, ప్రముఖులందరూ "కవులు"గా--"ఇంద్రుణ్ని పొగడద్దు. 3 నిమిషాల్లో ఒక్కొక్కరూ ముగించండి" అనడంతో అలరించింది. ఓక్క శ్రీనాధుడు--"నాకు సీసాలంటే ఇష్టమని, ఇంద్రుడు అందరికీ కాళ్లదగ్గర సీసాలు పెట్టించారు" అనడం, అక్కణ్నించీ సరసోక్తులన్నీ "సురాపానాన్ని" తలపిస్తూ సాగడం కాస్త వెగటు పుట్టించింది. 

.........ఇంకొంత ఇంకోసారి.

Tuesday, December 25, 2012

తెలుగుని “వుధ్ధరించొద్దు”!



తెలుగులోనే మాట్లాడదాం....

ప్ర తె మ ల సందర్భంగా అనేకమంది ఒకటే గోల—తెలుగుని వుధ్ధరించండి—అంటూ!

అసలు వుధ్ధరించడం యెందుకు? వున్నచోట వుండనిస్తే నష్టమా?

నిర్వాహకులు “ఇన్నికోట్లడిగాం, ఇన్నే ఇచ్చారు, మరిన్ని ఇస్తే ఇంకా బాగుంటుంది” ఇలా అంటున్నారు.

ఆ పేరుతో గత నెలరోజులుగా మండలాల్లోనూ, జిల్లాల్లోనూ, పట్టణాల్లోనూ, “తెలుగు భాషా—వర్థిల్లాలి, తెలుగు తల్లీ—జిందాబాద్” అంటూ ర్యాలీలూ అవీ చేసేసి, గొంతులు చించుకున్నారు.

తెలుగు సంస్కృతి వుట్టిపడేలా, హరిదాసుల వేషాలు వేయించీ, గంగిరెద్దుల వాళ్లా, కొమ్మదాసరులా, పిట్టలదొరలా వేషాలు వేయించీ, ముగ్గులు వేయించీ, గొబ్బిళ్లు పెట్టించీ, వంటలపోటీలు పెట్టించీ, బహుమతులిచ్చేసీ, యెప్పుడూ పట్టించుకోని రచయితలకీ, కవులకీ, కళాకారులకీ శాలువాలు కప్పేసీ, కేటాయింపులని “మమ” అనిపించేశారు.

ఆయనెవరో అన్నట్టు, “కాళ్ల చుట్టూ నేలని జీరాడే పంచెకట్టే” తెలుగుదనం అంటే, మరి తెలుగు గోచీపాతరాయుళ్లూ, అడ్డపంచెలవాళ్లూ తెలుగు వాళ్లు కాదేమో! కాయకష్టం చేసే వాడినుంచికాకుండా, పనీపాటాలేనివాడి నుంచి “తెలుగుదనాన్ని” నేర్చుకోవలసిరావడం అవమానం కాదా? అని ఆయన అడగడం సబబే అనిపిస్తుంది.   

ఇంక తిరపతిలో క్లైమాక్సే మిగిలింది.

ఇంక, ఈనాడు వాడైతే జనాల తలలకి రోకలి చుట్టేస్తున్నాడు.

ఇదివరకు యేమాత్రం కొరుకుడుపడని తెలుగు అనువాదపదాలని ప్రవేశపెట్టి, అధికారికంగా తెలుగు ని వృధ్ధిలోకి రాకుండా శాయశక్తులా పాటుపడ్డారు మన ప్రభుత్వం వారు. ఇప్పుడా కృషిని  ఈనాడు నెత్తికెత్తుకున్నట్టుంది.

హోం మంత్రి కి “అంతర్గత భద్రత మంత్రి” (గృహ మంత్రి అంటే నష్టమా?) అనీ, పబ్లిక్ సర్వీస్ కమీషన్—పీ ఎస్ సీ కి “ప్రజా సేవా సంఘం—ప్ర సే సం” (ఇది యేవిధమైన ప్రజాసేవా చేసే సంస్థ కాదు కదా?) అనీ, ఇంకా కొన్ని చిత్ర విచిత్రమైన మాటలని ప్రవేశపెట్టేస్తున్నారు. పోనీ, దాంతో సరిపెడుతున్నారా అంటే…….యెక్కడో జపాన్ లోని పార్టీలపేర్లని—డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ జపాన్ ని “జపాన్ జనస్వామ్య పక్షం—జ జ ప” అనీ, జపాన్ రెస్టొరేషన్ పార్టీ ని “జపాన్ పునరుధ్ధరణ పక్షం—జ పు ప” అనీ……ఇలా మొదలెట్టారు! ఇవన్నీ అంత అవసరమా?

కోర్టు ని “కోట్రు” అనీ, రోడ్డు ని “రోడ్రు” అని……ఇలా వ్యవహరించే మన తెలుగు సామాన్యులకి, “సర్వోన్నతన్యాయ స్థానం”, “రహదారి” (అసలు రహదారి అంటే, ఇంగ్లీషులో “థరో ఫేర్”. మరీ రోడ్డు అనకూడదు అనుకుంటే, బాట అంటే సరిపోతుంది!) అనీ వ్యవహరించమంటే భాషని వుధ్ధరించినట్టా?

“క్రిస్మస్" ని కూడా “కిసిమిశ్” అని తెలుగులో అనుకోవాలా? (కన్యాశుల్కంలో గురజాడ ఓపాత్ర చేత “కిసిమీశ్శెలవులు” అనిపించాడుమరి!) 

………ఇంకొంత మరోసారి.