Friday, April 4, 2014

కళ్యాణాలూ........


..............తలంబ్రాలూ

రేపెప్పుడో.....భద్రాచలం లో జరగబోయే శ్రీ సీతారామ కళ్యాణానికి, ఓ వారం పదిరోజుల క్రితమే, 200 క్వింటాళ్లో యెన్నో బియ్యం "తలంబ్రాలు"గా కలిపేశారు దేవస్థానం వారు. వాటిని సరాసరి చిన్న చిన్న పేకట్లలో పెట్టి, భక్తులకి ఆరోజున అందజేస్తారు. (ఇప్పుడు వుచితంగానే ఇస్తున్నారనుకుంటా). 

నిజానికి కళ్యాణం లో పోసే తలంబ్రలకీ వీటికీ సంబంధమేలేదు. 

ఇప్పుడు బజార్లో దొరుకుతున్న 25 కేజీల బస్తాలు 4 అయితే ఓ క్వింటాల్. 200 క్వింటాళ్లు అంటే, ఇలాంటివి 800 బస్తాలు!

ఇవి చాలనట్లు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలనుంచి వేరే వెరే తలంబ్రాల బియ్యం పట్టుకెళ్తారు భక్తులు.

జంగారెడ్డి గూడెం నుంచి, వడ్లు గోటితో వలిచి, కోటి బియ్యం గింజలు కాలినడకన భద్రాచలం తీసుకెళ్లి, అక్కడ "కలుపుతారట". వీటిని కో(గో)టి తలంబ్రాలు అంటున్నారు మీడియా వాళ్ళు. ఇలా గత 12 యేళ్లు గా చేస్తున్నారట! మరి అవి యెన్ని క్వింటాళ్లు అవుతాయో. 

అలాగే, తూ గో జి నుంచి ఇంకో బ్యాచ్ వాళ్లు, ఇంకో కోటి గింజలు తెస్తారనుకుంటా.

ఇంతకీ ఈ సోకాల్డ్ తలంబ్రాలు యేమవుతాయి? తెలీదు. 

యెందుకంటే, నిజంగా కళ్యాణం లో పోసిన తలంబ్రాలలో రాష్ట్ర ప్రభుత్వం వారం పంపించే ముత్యాలు కలుపుతారు. (అయిపోయాక, ముత్యాలు జాగ్రత్తగా వేరు చేసి, బియ్యాన్ని చెత్తలో కలిపేస్తారనుకుంటా).

మరి ఇన్ని క్వింటాళ్ల బియ్యం తలంబ్రాల పేరుతో వృథా చెయ్యడం యెందుకు? 

పోనీ అవి తీసుకెళ్లిన సోకాల్డ్ భక్తులు వాటిని యేమి చేస్తారో యెవరైనా ఓ సర్వే చేశారా? 

మహా అయితే, కొంతమంది పొట్లం పళంగా దేవుడి గూటిలో పెడతారు కొన్నాళ్లు. ఇంకొంతమంది యేదో ఒక గూట్లో పెడతారు. చాలా మంది దారిలోనే పడేస్తారు!

అలాంటి వాటికోసం కొన్ని కుటుంబాలకి కొన్నాళ్లకి సరిపోయే ఆహార ధాన్యాలని ఇలా వృథా చేయడం యెంతవరకు సమర్థనీయం?

ఆలోచించండి.

అందరికీ రాబోయే శ్రీరామనవమి శుభాకాంక్షలు.