Wednesday, August 12, 2015

దాన ధర్మాలు....

"అన్ని దానములలోకెల్ల....అన్నదానము గొప్ప"!

అవునండీ.....ఇది పెద్దలు చెప్పిన మాట. 

మరి ఓ తెల్లవాడన్నాట్ట....."చేపలు వండి వడ్డించడం కాదు--చేపలు పట్టుకోవడం నేర్పించు"....అని!

మరి యేది కరెక్టు? అంటే రెండూ కరెక్టే!

ఆకలితో వున్నవాడికి "అన్నదానం" చెయ్యాలి. అంతేగాని భూమి దున్నడం దగ్గర్నించీ నేర్పించడం మొదలెడితే, యెప్పటికి వాడి ఆకలి తీరేట్టు?

మరి, మూడుపూటలా వండి వడ్డించేసి, వాడికి ఆకలే తెలియకుండా ఛేస్తామంటే? అది అపాత్ర దానం. వాళ్లకి వళ్లు వంగేలాగ చెయ్యాలి.

అన్నదానం అంటే.....రంతిదేవుడూ, శిబి చక్రవర్తీ లాంటివాళ్లు చేసినవి! అంతేగానీ, ఇవాళ జరుగుతున్న నిత్యాన్నదానాలూ, నిరతాన్నదానాలూ వగైరాలు కాదు.

ఇదివరకు యేదైనా ఉత్సవాలో యేవో జరిగినప్పుడు, చివర్లో ఓరోజు పేదలకి అన్నదానం లేదా సంతర్పణ అని నిర్వహించేవారు. వచ్చినవాళ్లకి లేదనకుండా వడ్డించేవారు. 

ఇప్పుడో? ఆఖర్లో అన్నసమారాధన! భక్తుల అన్నప్రసాద స్వీకరణ!

ముందుగా ఆ చుట్టుప్రక్కలవాళ్లందరి దగ్గరా చందాలు దండడం, కిరాణా వాళ్ల దగ్గరా, బియ్యం కొట్ల వాళ్లదగ్గరా సరుకులూ, బియ్యం, కూరగాయల కొట్ల దగ్గర కూరలూ అన్నీ దండుకోవడం. ఆ రోజున ఇలా చందాలూ అవీ ఇచ్చినవాళ్లందరూ కుటుంబాలతో సహా వచ్చి మేసేసి వెళ్లడం!

ఇవీ ప్రస్తుత అన్నదానాలు. 

మొన్న ఒకాయన "అసలు ఊళ్లో కూలీలు దొరకడం లేదండీ" అని వాపోతుంటే, ఇంకొకాయన, "వారం లో యేడు రోజులూ ఫలానా వారం ఫలానా గుళ్లో, ఇంకో రోజు ఇంకో గుళ్లో.....ఇలా అన్నదానాలు చేస్తుంటే, కూలి డబ్బుల అవసరం యెవరికుందండీ"? అన్నాడు.

నిజంగా అంత ఆశ్చర్యకరంగానే వున్నట్టుంది పరిస్థితి!

యేంచేద్దాం?! పోనీయండి.

Wednesday, August 5, 2015

పత్రికలూ....కధనాలూ...

"జనం కంట...ఉల్లి మంట"

మొన్ననే నా "శాకాంబరాలూ....." టపాలో వ్రాశాను పేపర్లో కథనాల గురించి. 

ఇదిగో.....నిన్న (04-08-15) మా జిల్లా ఈనాడులో పై శీర్షికతో కథనం ప్రత్యక్షం!

దీంట్లో విచిత్రాలు గమనించండి.....!

".....కారణం మహారాష్ట్రలో కురిసిన వడగళ్ల వాన కారణంగా పంట చాలావరకూ దెబ్బతినడమే....." (వడగళ్ల వల్ల భూమిలో వుండే ఉల్లికి నష్టం వస్తుందా? వరదలైతే, నీళ్లు నిలబడిపోయి, పాయలు కుళ్లిపోతాయనుకోవచ్చు! పోనీ కోశాక అయినా విపరీత వర్షాలు వస్తే, సరుకు తడిసిపోయి పాడయిందనొచ్చు!)

"....ఈ వారం లో మరింత పెరిగే అవకాశాలున్నాయి అని వ్యాపార వర్గాలు అంటున్నాయి....."

"....హుబ్లీ, బెంగళూరు ప్రాంత ఉల్లి....తయారు కాలేదు....ఇంకా 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంది...."

(బెంగుళూరు "నగరం" ఉల్లిపంటకి ప్రసిధ్ధి అని వీరి కథనం. ఇప్పటికే ప్రతి రోజూ వర్షాలు కురుస్తున్నాయి కర్ణాటక అంతా. వచ్చే రెండు నెలలూ విపరీత వర్షాలు కురుస్తాయి! మరి అప్పటికి ఉల్లి పంట పూర్తిగా యెలా తయారు అవుతుందో?)

ఇంకా విచిత్రం--వీడెవడో కాంగ్రెస్ అభిమాని అయ్యుంటాడు-- 

"......ఏడేళ్ల కాలంగా ఉల్లి ధరను పరిశీలిస్తే, కిలో రూ. 6 ల నుంచి రూ. 7 ల మధ్యే వుండేది. అనంతరం ఏడాది కాలం లో ఇంతవరకు రూ. 12 లు తగ్గిన సందర్భం లేదు."

(వీడి "పరిశీలన" కి ఆధారాలేమిటో? గత యేడేళ్లుగా ఉల్లిపాయల మీద వచ్చిన కార్టూన్లు పరిశీలించినా, ఓ నాలుగేళ్ల క్రితం కిలో 120 దాకా యెగబడిందనీ, కేజ్రీవాల్ నెగ్గే ముందు కూడా 70 నుంచి 80 ఢిల్లీలోనే అమ్మిందనీ, గత సంవత్సరం, ముందు చూపుతో గవర్నమెంట్ దిగుమతులు చేసుకోబట్టి, కిలో 10 నుంచి 12 కే కట్టుబడి వుంది అనీ, పాత పేపర్లు తిరగేసినా స్పష్టం అయ్యేది వాడికి!)

ఇలాంటివండీ మన పేపర్ల పరిశీలనాత్మక కథనాలు!

Saturday, August 1, 2015

జాతీయ దుబారా....

"శాకాంబరాలు....."

జూన్ లో కాస్త వర్షాలు పడగానే, ఆకు కూరలూ, కాయగూరలూ కాస్త విరివిగా వచ్చి, రేట్లు తగ్గడం మొదలెడతాయి. ద్రవ్యోల్బణం తగ్గుతోంది అని సంతోషిస్తారు ప్రజలూ, ప్రభుత్వాలూ. 

వాటితోపాటే, అంచనాలు మొదలెడతారు పత్రికలవాళ్లు.....ఫలానాచోట ఉల్లిపంట తగ్గిపోయింది, ఇంకోచోట టమాటా పంట నాశనం అయ్యింది, వాటికి కొరత యేర్పడే అవకాశం, ధరలు పెరిగే అవకాశం......అంటూ రోజుకో కథనం వ్రాసేస్తారు. 

దాంతో, మళ్లీ కూరగాయల ధరలు పెరిగిపోతాయి. 

అలా జూలై గడిచేసరికి మొదలవుతాయి దేవుళ్లకీ, అమ్మవార్లకీ "శాకాంబర" అలంకారాలు! కనక దుర్గతో మొదలెట్టి, పుంతలోముసలమ్మలవరకూ ....... ఒక్కోళ్లకీ 200 కేజీలనుంచి 5 టన్నులవరకూ! పేపరు తెరిస్తే, అన్ని గుళ్లలోనూ ఆ అలంకారాల ఫోటోలే! ఇన్ని కేజీలూ, అన్ని టన్నులూ అని కథనాలే!

భీమవరం లో మావుళ్లమ్మకి మొన్న 5 టన్నులతో అలంకరించారు! ఇంకో విశేషం......వాటిలో కొన్ని వందలకేజీలు ఉల్లిపాయలు వుండడం!

ఓ ప్రక్క బజార్లో ఉల్లిపాయలు కేజీ 60 రూపాయలకి తక్కువ కాకుండా అమ్ముతుంటే, పేపర్లు కేజీ 40 అని వ్రాస్తే, ప్రభుత్వం 20 కే రైతుబజార్లలో అందిస్తాం అంటూ, ఫలానా జిల్లాకి 200 టన్నులు పంపించాం, ఇంకో జిల్లాకి 100 టన్నులు పంపించాం, యెక్కడా కొరత రానివ్వం--ధరలు పెరగనివ్వం--అంటూ మంత్రుల ప్రకటనలూ!

ఇంకో విచిత్రం యేమిటంటే......ఆ అలంకారాలకి ఆధ్వర్యం వహించేది...... కూరగాయల వర్తక సంఘాలే! (బజార్లో కేజీ కి ఒక్క రూపాయి కూడా తగ్గించరు గానీ, భక్తిపేరుతో టన్నులు "ఉచితంగా" తగలేస్తారు! దీంట్లో యేమైనా కుట్ర కోణం వుందేమో యెవరైనా పరిశోధిస్తే బాగుండును!)

ఇంక దీన్ని అరికట్టే మార్గం......? 

సామాన్య జనం తరఫున ఆ గుడుల ధర్మకర్తలూ, పూజార్లూ, అర్చకులకి నా విజ్ఞప్తి...... "సోదరులారా! అలా అలంకరించడం మా వల్లకాదు అని ప్రకటించండి. ఇంకా, అడ్డమైనవాళ్లూ, ఈ అలంకారం పేరుతో, కొన్ని గంటలపాటు, ఆ విగ్రహాల పీఠాలనీ, గర్భ గుడినీ ఇష్టం వచ్చినట్టు తొక్కడం ఆ దేవీ దేవతలని అపవిత్రం చెయ్యడమే" అని ప్రకటించండి. 

అప్పుడైనా ఈ వేలం వెర్రి కాస్త తగ్గి, సామాన్యులకి మేలు జరుగుతుందేమో......!

ఆలోచించండి.....

Friday, March 27, 2015

శ్రీరామ నవమి......



శ్రీరాముడూ, సీతాదేవీ.....తలంబ్రాలూ.....-3

ఇంతకీ "ఒంటిమిట్ట"లో సీతారామ కళ్యాణం శ్రీరామ నవమి నాడు కాదండోయ్! ఇవాళే అంకురారోపణ జరిగింది. రేపు ధ్వజారోహణం! పట్టువస్త్రాలు ఇవాళిచ్చేస్తే, వచ్చే "పౌర్ణమి నాడు" జరిగే కళ్యాణం లో వాటిని వుపయోగిస్తారట!!!

సరే.....ఇవన్నీ ఇలా వున్నా, మధ్యలో "పిడకలవేట" లా ఈ "తలంబ్రాల" గోలేమిటీ? దానికి "పరాకాష్టేమిటీ"? ....అంటే......

గత కొన్నేళ్లుగా, కళ్యాణం అయ్యాక తలంబ్రాలు "చిన్న పొట్లాల్లో" భక్తులకి అందిస్తున్నారు అని చెప్పుకున్నాం కదా? క్రితం యేడాది...."ఓ నెల ముందుగానే".....2 క్వింటాళ్ల (200 కిలోల) బియ్యాన్ని పొట్లాల్లో నింపేసి, "తలంబ్రాలు" సిధ్ధం చేసేశారు! ఇదో పరాకాష్ట.

అలాగే, కొన్నేళ్లుగా, తూర్పు గోదావరి జిల్లాలోని ఓ గ్రామం నుంచి...."కో(గో)టి తలంబ్రాలు" పేరుతో, కోటి ధాన్యం గింజలని, కొన్ని రోజులపాటు, కొన్ని వందలమంది, "గోళ్లతో" ఒలిచి, వాటిని కాలినడకన తీసుకెళ్లి, భద్రాచలం గుళ్లో అందిస్తున్నారు! (నిజంగా వాటిని యేం చేస్తున్నారో యెవరికీ తెలీదు.)

ఈ మధ్య ఆ గ్రామం లో ఓ మంచి ముహూర్తం పెట్టించి, పొలం "దున్నడం" మొదలెట్టి, మళ్లీ మంచి ముహూర్తం చూసి, "విత్తనాలు" జల్లి......అలా......చివరికి కాలినడకన.....మామూలే! ఇదో పరాకాష్ట!

ఈసారి, ఓ రెండు వారాలముందే, ఓ మూడు తట్టల్లో, 30 లక్షల గింజల్ని తీసుకెళ్లి అందించేశారు. మిగిలినవి ఇవాళ అక్కడకి చేరి వుంటాయి. ఇంకో విశేషం యేమిటంటే.....ఇంకొన్ని గింజల్ని "ఒంటిమిట్ట" కూడా పంపిస్తున్నారట!

వాళ్లని చూసి, ప గో జి వాళ్లు కూడా కొంతమంది మొదలెట్టారు!

ఇంకా, ఈ మధ్య భీమవరం లొ వుండే బెల్లంకొండ బిందుమాధవ రావు, ఆయన భార్య, బియ్యం గింజలు "ఒక్కోదాని" మీదా శ్రీరామ అని రంగు రంగుల్లో వ్రాసి, మళ్లీ వాటిని శ్రీరామ అనే "ఆకారం" లో పేర్చి, అందించి వచ్చారు. రెండు తట్టలు ఫోటో వేశారు పేపర్లో.....అంటే, ఓ 20 లక్షల గింజలు వుండొచ్చు! ఇదింకో పరాకాష్ట!

అసలు, "క్షుద్రమైన" గోళ్లతో వడ్లు ఒలిస్తే వచ్చే బియ్యం గింజలు "అతి పవిత్రం" యెలా అవుతాయో?

పైగా, భత్తులకి పొట్లాల్లో అందించే "తలంబ్రాలు" యెలా సద్వినియోగం అవుతున్నాయో యెవరికైనా తెలుసా? (ఇంకా కళ్యాణం మొదలెట్టక ముందే పొట్లాలు అందించేస్తారట!). వాటిని ఇళ్లకి తీసుకెళ్లి, పూజామందిరాల్లో పెట్టుకొని, ఓ యేడాదిపాటు పూజించే వాళ్లని కూడా వేళ్లమీద లెఖ్ఖపెట్టచ్చేమో!

మరి, "ఆహార ధాన్యాల వృధా" గురించి యెవరైనా ఆలోచిస్తున్నారా? "యె పి వా ఆ" అని నిర్లిప్తం గా వూరుకుంటున్నారా?

నిజమైన శ్రీరామ భక్తులందరినీ, "ఇవాళ" (సూర్యోదయాత్పూర్వమే అష్టమి వెళ్లిపోయింది. ఇవాళే నవమి!) తన "పుట్టినరోజు" సందర్భంగా, ఆయనే చల్లగా చూస్త్రాడు!

(ఇప్పటికి సమాప్తం)

Wednesday, March 25, 2015

శ్రీరామ నవమి


శ్రీరాముడూ, సీతాదేవీ.....తలంబ్రాలూ.....-2

మన తెలుగోళ్ల భద్రాచలాన్ని త్లంగాణోళ్లు పట్టుకుపోయారు. తప్పేముందీ? మనవాళ్లు రాముడి భక్తులూ, భద్రాచల భక్తులూ గానీ, అంధ్రోళ్లూ, త్లంగాణోళ్లూ కాదు కదా? కానీ, రేపు శ్రీరామనవమికి కేసీఆర్ తన ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలూ, మంచి ముత్యాలూ (హైద్రాబాద్ నుంచి) తీసుకెళ్లి "సమర్పిస్తాడే"?

మరి మన గతేమిటి?

అందుకే, మన ప్రభుత్వం మన రాష్ట్రం లో ఓ రామ క్షేత్రం లో పట్టు వస్త్రాలూ, "మంచి ముత్యాలూ" సమర్పించవద్దూ? అది యెక్కడ? యెప్పుడు? యెవరి చేత?

భద్రాచలం లో మన పండితులూ, వాళ్ల పుత్రులూ, శ్రీరామనవమి యెప్పుడు జరపాలీ, కళ్యాణం యెప్పుడు చేయాలీ, అసలు వాడెప్పుడు పుడతాడూ అంటూ లా పాయింట్లు తీసి, ప్రభుత్వ సెలవుదినాల్ని ముందుకీ, వెనక్కీ జరిపి, తమ పబ్బం గడుపుకోవడం అలవాటు చేసుకున్నారు.

ఓ రోజు తెల్లవారి అరగంటసేపు అష్టమి వుండి, తరువాత నవమి ప్రవేశిస్తే, స్మార్తులు ఆరోజే శ్రీరామ నవమి అన్నారు. ఠాఠ్! అలా వీల్లేదు....."అసలు అష్టమే ఆ రోజు వుండకూడదు".....అన్నారు వైష్ణవులు! సరే....ఆ మర్నాడు, సూర్యోదయాత్పూర్వమే నవమి వెళ్ళిపోయి, "దశమి" వచ్చేసిందే? అయినా సరే, ఆరోజు అష్టమి లేదు కాబట్టి, "నవమి వున్నా, లేకపోయినా, దశమే వున్నా", ఆరోజే రాముడు పుట్టాడు కాబట్టి, అదే శ్రీరామ నవమి, ఆరోజే భద్రాచలం కళ్యాణం అన్నారు!

అప్పటినించీ అలాగే చెల్లించుకుంటున్నారు. సరే! ఇంక ఈ బాధలన్నీ కేసీఆరే పడతాడు. కానీ, మన సంగతి యేమిటీ?

ప్రభుత్వం.....యెక్కడ, యెలా, యెప్పుడు, యెవరిచే........?

విజయనగరం జిల్లాలోని "రామతీర్థాలు" లో......అని డిమాండు చేశారు కొందరు! ఆహా....అధి "మధ్యలో" వుండాలికదా? పైగా......అన్ని జిల్లాలకీ అన్నీ అనే లెఖ్ఖల్లో....అపోజిషనోళ్ల ఫాక్షన్‌ జిల్లాలో వుంటే మరీ మంచిది కదా? అక్కడ "ఒంటిమిట్ట రామాలయం" వుంది కదా? అక్కడే జరిపించేద్దాము.....! అన్నాడట నాయకుడి అనుచరుడు! అదే ఖాయం అయ్యింది.అందునిమిత్తం, వెంటనే ఓ యాభై కోట్లో యెంతో పెట్టి, యెర్పాట్లు చేసేశారు. ఇంకా భవిష్యత్తులో కూడా, ఆ గుడిని అభివృధ్ధి చేస్తారట.

మరి మంచి ముత్యాల మాట రాలేదుగానీ, "పట్టు వస్త్రాలు" యెవరు ఇవ్వాలి? ముఖ్యమంత్రిగారు తాత అయ్యారు కాబట్టి, కుదరదు. ఇంక ఓ ఉప ముఖ్యమంత్రి గారి బంధువులు యెవరో పోయారని, ఆయనా కుదరడు. ఇవాళే తేల్చారు ....ఇంకో ఉప ముఖ్యమంత్రి పట్టువస్త్రాలని సమర్పిస్తాడు....28 వ తేదీని....అని!

(మిగతా.......మరోసారి)

Tuesday, March 24, 2015

శ్రీరామ నవమి


శ్రీరాముడూ, సీతాదేవీ.....తలంబ్రాలూ.....

"అదుగో భద్రాద్రీ.....గౌతమి అదుగో చూడండీ....రామదాసు నిర్మించిన ఆలయం...." అని పరవశించి పాడుకుంటూ శ్రీరామనవమి నాటి కళ్యాణానికి తరలిపోయేవారు తెలుగు జనాలు.

తానీషా, ప్రతీ సంవత్సరం తలంబ్రాల నిమిత్తం గోల్కొండ నుంచి మంచి ముత్యాలు పంపించేవాడట. (తరువాత వాటిని యెలా యేరేవారో, మళ్లీ భద్రంగా గోల్కొండ యెలా చేర్చేవారో తెలీదు గానీ, ఆ తరువాత యేడాది మళ్లీ అవే ముత్యాలని పంపించేవాడట!)

ప్రజా ప్రభుత్వాలు యేర్పడి, ఆంధ్ర రాష్ట్రం యేర్పడ్డాక, హైదరాబాదు సంస్థానం విలీనం అయ్యేవరకూ ఇది కొనసాగినట్టుగానే వుంది. విలీనం తరవాత, ఆంధ్ర ప్రదేశ్ యేర్పడే వరకూ ఈ ఆచారం కొనసాగినట్టు దాఖలాలు వున్నాయో లేదో నాకు తెలీదు.

ఆంధ్ర ప్రదేశ్ కి హైదరాబాదు రాజధాని అయ్యాక, మళ్లీ యెప్పుడో....తలంబ్రాలకి మంచి ముత్యాలూ, పట్టు వస్త్రాలూ ప్రభుత్వం తరఫున పంపించడం మొదలెట్టారు. (అప్పుడు కూడా అవి హైదరాబాదు యెలా తిరిగి వెళ్లేవో, తరువాత యేడాది వాటినే యెలా పంపించే్వారో....ఆ రాముడికే యెరుక!)

తరవాత తరవాత, అనేకసార్లు ఆలయం లో చోరీలూ, పునరుధ్ధరణలూ జరిగాక, క్రమ క్రమంగా తలంబ్రాల బియ్యాన్ని చిన్న చిన్న పొట్లాలు కట్టి, భక్తులకి అందజేయడం మొదలెట్టారు. 

ఇటీవల ఈ 'తలంబ్రాల' బాగోతం యెంత పరాకాష్ట కి చేరిందంటే......

(........మరోసారి)