Thursday, January 14, 2010

మన తెలుగు


పండగలు


బాగుంది కదూ!  


మన సంస్కృతీ సాంప్రదాయలకల్లా మూలం--ముగ్గులూ, గొబ్బెమ్మలూ, గంగిరెద్దులూ, హరిదాసులూ, భోగిమంటలూ, గాలిపటాలూ, కోడిపందాలూ--ఇవే(ట)!  


(పై అన్నిటికీ పురాణాల్లోనో, సైన్సుపరంగానో యేదో ఒక కారణం చెప్పగలుగుతున్నారు అందరూ--ఒక్క గాలిపటాలకి తప్ప! మరి బలరామ కృష్ణులూ, కౌరవ పాండవులూ, రామ లక్ష్మణ భరత శతృఘ్నులు కూడా గాలిపటాలు యెగరేశారు అని యెక్కడా దాఖలాలు లేవు! బాల చంద్రుడుకూడా బొంగరాల ఆట ఆడాడుగానీ, పతంగులు యెగరెయ్యలేదు! యెందుకో?)  


పల్లెల్లో--పాపం రైతులు తమ రబీ పంటకి నీళ్ళందక, సగంచేను యెండిపోతుంటే, యే మురిక్కాలవకి అడ్డుకట్టకట్టి నీళ్ళు పెట్టుకుందామా అని వాటికి శ్రమిస్తూనే వున్నారు!  


రేషను కొట్లముందూ, గ్యాస్ కంపెనీలముందూ పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తూనే వున్నాయి! యెక్కడా ముగ్గులూ, గొబ్బిళ్ళూ మొదలైనవి కనపడటం లేదు!  


మామూలు రోజుకీ, పండగ రోజుకీ--యే ఒకళ్ళిద్దరు బలిసినవాళ్ళకో తప్ప--తేడా యేమీ తెలియడం లేదు!  


మరి, పెద్ద పల్లెటూళ్ళలో--కోడి పందాలూ, పక్కనే చీకులూ, బెల్టు దుకాణాలూ బాగానే దర్శనం ఇస్తున్నాయి--పోలీసులకి అధికారులచేత 'చూసీ చూడనట్టు ' పొండి--అని అదేశాలు ఇప్పించి, యధేచ్చగా పోటీలు పడుతున్న ఒకళ్ళో ఇద్దరో నాయకులతోపాటు అనేక మంది చోటా మోటా రాజకీయులూ, వాళ్ళ అనుచరులతోపాటు!  


పట్టణాల్లో, ముగ్గుల పోటీలూ, గొబ్బెమ్మల పోటీలూ, పతంగుల పోటీలూ, వంటల పోటీలూ, భక్తిపాటల, డాన్సుల పోటీలూ, టీవీల్లో రకరకాల 'షో'లని చూసి, అనుకరణలూ--ఇవీ జరుగుతున్నవి!  


నగరాల్లో అయితే, పూర్తిగా రాజకీయులు--తెలంగాణా హరిదాసుల్నీ, సర్కారు గంగిరెద్దుల్నీ, నిరసన డాన్సులూ అవీ--ఇవీ దృశ్యాలు!  


సెక్రటేరియట్ లో తక్కువక్లాసు వుద్యోగినులకి ముగ్గుల పోటీలు నిర్వహించారు!  


ఇక మన సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా యేమీ తక్కువ తినలేదు! శాయ శక్తులా ప్రత్నిస్తున్నాయి--మన సంస్కృతీ సాంప్రదాయాల్ని కాపాడటానికి!  


వచ్చే యేడాది అవి తమ కార్యాలయాల్ని ఆవుపేడతో అలికించి, ముగ్గులు పెట్టించి, గొబ్బెళ్ళు తట్టించి, పొంగళ్ళు పెట్టించి, ఆటపాటల్తో కార్యాలయాల్లోనే గడపమంటాయేమో తమ వుద్యోగుల్ని!  


(అలా అన్ని కార్యాలయాలూ చేస్తే, ఈ రైళ్ళలోనూ, బస్సులలోనూ రద్దీ తగ్గి, టిక్కెట్ చార్జీ దోపిడీలూ ఇవీ వుండకపోను!)  


ఇక వార్తల్లో, '.............ప్రజలందరూ సాంప్రదాయ బధ్ధం గా...........వగైరాలతో.........విశేష పూజలతో...........సాంస్కృత కార్యక్రమాలతో.......ఆనందం గా జరుపుకొన్నారు! ...........నాయకులు.........కూడా అందోత్సాహాలతో..........జరిపించారు!' ఇవీ 'స్టాండర్డ్' వాక్యాలు--ప్రతీ పండగకీ!  


ఇక యాంకర్లు మూడు రోజుల ముందునుంచీ, నాలుగురోజుల తరవాతదాకా, 'మీకు మా...........శుభాకాంక్షలు!' అంటారు ప్రతీ కార్యక్రమంలోనూ!  


తెలుగు సాంప్రదాయవాదులూ--మీకు జోహార్లు!



Monday, January 4, 2010

పోరాటం


ఒంటిచేత్తో!


చీకటిని తిట్టుకొంటూ కూర్చోవడం కన్నా యెంతచిన్నదైనా ఓ దీపాన్ని వెలిగించడం మంచిది అని నమ్మేవాణ్ణి!  


ఇక, అగ్గిపుల్ల గీసేవాళ్ళు చాలామంది వుంటారు--కానీ, దీపం కొడిగట్టకుండా అప్పుడప్పుడూ కాస్త చముఱు పోసేవాళ్ళూ, వత్తి పూర్తిగా కాలిపోతుంటే మరో వత్తి పేని దీపం కుంది లో వుంచేవాళ్ళూ కావాలి!  


మీరు అందులో ఒకరవుతారని ఆశించవచ్చా?

Saturday, January 2, 2010

మొరాయించిన డెస్క్ టాప్



'కుప్పకూలింది'  


20-12-2009 న నా తెలుగురాడికల్ లో టపా పబ్లిష్ చేశాక, టీవీలో వార్తలు చూస్తూ, సరదాగా 'సోలిటైర్' ఆడుతుండగా, హఠాత్తుగా నా సిస్టం (డెస్క్ టాప్) పూర్తిగా 'క్రాష్' అయిపోయింది!  


యెంత ప్రయత్నించినా మళ్ళీ బూట్ అవలేదు! ఇంకేం చెయ్యను!  


నేనుకూడా నిన్ననే వెళ్ళి (మార్గదర్శిలో చేరకుండానే) ఓ లాప్ టాప్ కొనుక్కున్నాను! మళ్ళీ ఆంతర్యాల లోకం లోకి జృంభిస్తున్నాను.  


ఇన్నాళ్ళూ నేను వ్రాయడం లేదేమిటి--అని ఆలోచిస్తున్న వాళ్ళకీ, హమ్మయ్య--పీడ విరగడయ్యింది--వ్రాయడం మానేశాడు--అని సంతోషించిన వాళ్ళెవరైనా వుంటే వాళ్ళకీ--నా క్షమాపణలు!


Sunday, December 20, 2009

బ్లాగులు


అంతరంగాలు


'ఇంటర్నెట్' ని 'అంతర్జాలం' అనీ, 'పోస్ట్'లని టపాలు అనీ అనువదించుకున్నాం--బాగానే వుంది గానీ, 'బ్లాగ్'లని యెవరూ అనువదించలేదెందుకో?  


బ్లాగులు వ్రాసేవాళ్ళందరూ (ఒకళ్ళిద్దరు తప్ప) తాము మనసా, వాచా నమ్మినవాటినే వ్రాస్తారు కాబట్టి, వీటిని 'అంతరంగాలు' లేదా 'ఆంతర్యాలు' అందామా?  


మరి అంతరంగాలు వ్రాసేవాళ్ళని యేమనాలి? 'అంతరంగ రచయితలు' అంటే బాగుండలేదు! 'ఆంతర్యులు' అంటే యెలా వుంది?  


సరే! ఇంతకీ యెందుకు మొదలుపెట్టానంటే, మన తెలుగు బ్లాగర్ల మీద నాక్కోపం వస్తోంది!  


యెంతోసేపు బుర్రని ఫోర్కుతో చుట్టూరా గుచ్చుకొని, మెదడు బయట పడేసి, చిందరవందర చేసి, దాంట్లో విలువైన ఆలోచనలని ప్రోదిచేసి, వ్రాసీ, తిరిగి వ్రాసీ, తప్పులు దిద్దుకొనీ, కాస్త ఆవేశం తగ్గించుకొనీ, మళ్ళీ మళ్ళీ వ్రాసీ, ఓ టపాని ప్రచురిస్తే, ఒకటో రెండో వ్యాఖ్యలు! 


అవీ అసలు విషయాన్ని పట్టించుకోకుండా, టపా మొదట్లో వ్రాసిన ఏ చిన్న విషయాన్నో పట్టుకొని, రాధ్ధాంతాలూ, కు విమర్శలూ, 'స్టాండర్డ్' వాగుళ్ళూ!


ఇదండీ--మన తెలుగు బ్లాగు ప్రపంచం!  


అసలు 'కాంట్రవర్సీ' లోకి ప్రవేశించడానికే భయపడుతున్నట్టున్నారు మన బ్లాగర్లు! మరి భయం యెందుకో తెలియదు!  


నేను మొదటినించీ, అన్ని బ్లాగులలోనూ, 'కాంట్రవర్షియల్' విషయాలనే వ్రాస్తున్నాను! 


వాటిని సంబంధిత ప్రభుత్వ శాఖలకీ, దేవస్థానాలకీ, చివరికి మా బ్యాంకు యాజమాన్యానికీ, 'లింకులు' పంపిస్తున్న స్నేహితులు యెందరో వున్నారు!  


మరి వ్యాఖ్యలు చేసేవాళ్ళు పూర్తిగా చదవరో, ఇంకేదైనా ప్రభావాలకి లోనవుతారో, అవగాహనా లోపమో--తెలియదు! 


అసలు కాంట్రవర్షియల్ విషయమ్మీద ఇప్పటివరకూ వచ్చిన వ్యాఖ్యలు--దాదాపు శూన్యం!  


ఒక్కొక్కసారి, నాలుగు గొంతుకలతో విరుచుకుపడే మలక్ పేట్ రౌడీ దగ్గరనించీ, మంచుపల్లకీ వంటివాళ్ళ దగ్గరనించీ, చక్కటి బ్లాగు నిర్మించుకున్న మంగేష్, వంశీ ఎం మాగంటి ల వరకూ, ఇదే నేను గమనించింది!


అఖిల ప్రపంచ తెలుగు బ్లాగరులారా! యేకం కండి! మీకు పోయేదేమీ లేదు! అనవసర భయాలు తప్ప!  


యెలా వుంది నా నినాదం?

Wednesday, December 9, 2009

పరీక్షలు


తెలుగు జూనియర్ లెక్చరర్లు


ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తారు--మిగిలిన సబ్జెక్ట్ ల తో పాటు తెలుగులో కూడా--వివిధ కళాశాలల్లో తెలుగులో జూనియర్ లెక్చరర్ల నియామకం కోసం.  


ఆ పరీక్షలో యెంతమంది సఫలీకృతులవున్నారో, యెంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయో, అందరికీ తెలుసు!  


ఈ పరీక్షలకి సిధ్ధమవుతున్న అభ్యర్థులకోసం ఈనాడు పత్రిక తన 'ప్రతిభ' శీర్షిక క్రింద చక్కని శిక్షణ ఇస్తున్నారు--డా. ద్వా. నా. శాస్త్రి గారి ద్వారా.  


మరి ప్రశ్న పత్రాలెవరు రచిస్తారోగానీ, వాటి సమాధానాలు వారికైనా తెలుసో లేదో తెలియదు.  


ఇక 'కృతార్థులైన' అభ్యర్థులు, జూనియర్ లెక్చరర్లు అయిపోతున్నారు!  


అదేమి విచిత్రమో, వారిలో కొంతమందిని చాలా సామన్యమైన విషయాల్లో ప్రశ్నించినా, సరియైన సమాధానాలు రావు! (మరి పిల్లలకి యేమి బోధిస్తారో!)  


ఉదాహరణకి, ఓ తెలుగు జూనియర్ లెక్చరర్ ని 'బాలగంగాధర తిలక్ గురించి మీ అభిప్రాయమేమిటి?' అనడిగితే, 'ఆ సారు నెత్తిమీద ముడిచుట్టుకొని వుంటాడు సార్--హోలిండియా మొత్తానికి గణేష్ పూజ స్టార్ట్ జేసింది ఆయనే సార్! మా గొప్ప సారు!' అంటాడు. (అడిగినవారి వుద్దేశ్యం--దేవరకొండ బాలగంగాధర తిలక్ గురించి)  


మరి ద్వా నా శాస్త్రిగారు యెంత నిర్దుష్టమైన శిక్షణ ఇస్తున్నారో చూడండి! 


మచ్చుకి తెలుగు, పేపర్ II కోసం కొన్ని ప్రశ్నలూ, వాటి సమాధానాలూ--  


1. 'స్టూపింగ్ టు రైజ్' కు తెలుగు అనువాదం? (ఇది ఓ కథా? కావ్యమా? గద్యమా? పద్యమా? వ్రాసినవారెవరు? యే భాషలో? యేదేశం వారు? యేకాలం వారు? అందులో వస్తువేమిటి?--ఇలాంటి ప్రశ్నలకి యెవరైనా--ద్వా నా శాస్త్రిగారు తప్ప--సమాధానం చెప్పగలిగితే, నా యెడమ చెవి కోసి ఇస్తాను!--యెందుకంటే, వినరానివి వినడం సగమైనా తగ్గుతుంది కదా!)  


సమాధానం : సంస్కర్త హృదయం (దీనికి కూడా పై ప్రశ్నలన్నీ 'డిట్టో'--నా చెవి తప్ప!--యెందుకంటే అప్పటికే అది కోసివేయబడి వుంటుంది కనుక!)  


2. అనేకార్థక కావ్యానికి వుదాహరణ? (ఇదేమి కావ్యమో--ఇలాంటివి యెన్ని వున్నాయో!)  


సమాధానం : 1. రాఘవపాండవీయం, 2. హరిశ్చంద్ర నలోపాఖ్యానం, 3. యాదవరాఘవ పాండవీయం, 4. అన్నీ--అనే మల్టిపుల్ చాయిస్ లో, 4 వది--అన్నీ అని!  


3. సి నా రె 'కర్పూర వసంతరాయలు' యెవరికి అంకితం ఇచ్చాడు? (సి నా రే యెవరు? '....వసంతరాయలెవడు?' అంకితం యెవరికి?)  


సమాధానం : మల్లంపల్లి సోమశేఖర శర్మ కి (ఈయనెవడు?)  


4. కైశికి, ఆరభటి...వీటిని అలంకారికులేమంటారు? (ఈ భయంకరమైన విషయాలేమిటో, అలంకారికులెవరో!)  


సమాధానం : వృత్తులు (చాకలి మంగలి లాంటివేమో!)  


5. ప్ర, పరా, సం, అవ....వీటిని యేమంటారు? (పర, పరాగ, సంపర్కం, అవబడునా--ఇలాంటివేమో!)  


సమాధానం : ఉపసర్గలు (అసలు సర్గలేమిటో, వాటికి ఉపసర్గలేమిటో!)  


నిజం చెపుతున్నాను--మా మేష్టార్లు మాకు అప్పుడప్పుడూ సరదాగా చెప్పిన విషయాల్నీ, పాఠాల్లో చెప్పిన విషయాల్నీ, నాకున్న పుస్తక పరిఙ్ఞాన్నీ వుపయోగించి, నాపుర్రెని 'ఫోర్కు'తో చుట్టూ గుచ్చుకొని, మెదడుని బయటికితీసి, చిందరవందర చేసినా--వారం వారం 'వారు' ఇస్తున్న ప్రశ్నల్లో ఓ ఇరవై శాతం కూడా సరిగ్గా జవాబు చెప్పలేకపోతున్నాను!  


మరి ఆ అభ్యర్థులనీ, వాళ్ళదగ్గర చదువుకునేవాళ్ళనీ--ఆ దేవుడైనా రక్షించగలడా అని!  


ద్వా నా శాస్త్రి గారూ--క్షమించండి!


Monday, November 30, 2009

......సం రక్షణ


‘………….గ్రామయాత్ర’


మొన్న ఆదివారం సాయంత్రం యేమీ తోచక రోడ్డుపక్కన నిలబడితే, అక్కడ ఓ కులం వాళ్ళు కట్టించుకున్న వెంకటేశ్వర స్వామి గుడి ముందు దాదాపు టాటా ఏస్ వాన్ అంత సైజులోనేవున్న ఒక వాన్ ఆగి వుంది.  


రోడ్డుమీద సైకిళ్ళపై వెళుతున్న నలుగురైదుగురు (తొమ్మిదో, పదో తరగతి) ఆడపిల్లలు(—నవ్వుతూ తుళ్ళుతూ వెళుతూండడం వారి వయసులో సహజం!) వాళ్ళ వ్యాఖ్యలు నా చెవిని పడ్డాయి.  


(వాళ్ళు చదువుతున్న స్కూలు లోని--వాళ్ళ సబ్జెక్ట్ లో బోధించే వాళ్ళ దగ్గరే--‘ట్యూషన్’ చెప్పించుకోడం ఈ రోజుల్లో తప్పనిసరి!)  


వ్యానుకోపక్కని మేస్తున్న గేదెని చూసి “యేమే! ఇవాళ ‘గేదెగ్రామ యాత్రేమోనే!’” అందో అమ్మాయి. 


మిగిలినవాళ్ళు గొల్లున నవ్వారు.  


ఇంకో అమ్మాయి, ఆ వ్యాను ముందున్న ఓ పందినీ, పిల్లల్నీ గమనించి, “కాదే! ‘పందిగ్రామ యాత్రనుకుంటా!’” అంది. ఇకవాళ్ళ నవ్వులకి కంట్రోలు వుంటుందా!  


కొన్ని సంస్థలు, నిర్వాహకులు మన హిందూ ఆచారవ్యవహారాలనీ, నమ్మకాల్నీ, సాంప్రదాయాల్నీ యెలా భ్రష్టుపట్టించి, కౄరమైన పరిహాసాలాడుతున్నాయో (రో) గమనించారా?  


(ఇది నా ‘క్యామెడీ చానెల్’ లో వ్రాద్దామనుకొన్నాను! కానీ నేనింకా పరిహసిస్తున్నాననుకొంటారేమోనని భయపడ్డాను!)





Monday, November 16, 2009

గో సంరక్షణ


'గోగ్రామయాత్ర'


మొన్నటి విజయదశమి పర్వదినాన, ఉత్తరభారతం లోని 'కురుక్షేత్ర' నుండి, 108 రోజులలో దాదాపు 20 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి 17 జనవరి 2010 న 'నాగపూర్' చేరుకొనేలా ఓ మహానుభావుడు ఓ యాత్ర బయలుదేరదీశాడట--"సత్యము, శివము, సుందరము" అనే లక్ష్యాలను ముందుంచుకొని, 'విశ్వమంగళ గో-గ్రామ యాత్ర' ప్రారంభించబడిందట.  


దీనికి సంకల్పం, గోకర్ణపీఠాధిపతి శ్రీ రామచంద్రపూరమఠం శంకరాచార్యులు పూజ్యశ్రీ రాఘవేశ్వర భారతీ మహాస్వామీజీ అట.  


లక్ష్యము :  


1. గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి.  
2. గో వంశ రక్షణ కొరకు కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టం చేయాలి.  
3. వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం కొరకు ప్రతి గ్రామం లో గోమాతను సం రక్షించి పోషించాలి.  
4. భారతదేశం లో గో సంరక్షణను కోరుతూ, గౌ. రాష్ట్రపతిగారికి ప్రపంచములోనే అతిపెద్ద సంతకాల సేకరణ ఉద్యమము ద్వారా 50 కోట్ల సంతకాలతో వినతి పత్రం సమర్పించాలి.  
5. సేంద్రియ ఎరువులతో చేస్తున్న వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి.  
6. పట్టణాలలో గో సంరక్షణ కేంద్రాలు, గ్రామాలలో గో ప్రేమీ కుటుంబాలను ప్రోత్సహించాలి.  


చక్కని, ఉదాత్తమైన ఆశయాలు.  


దీనికోసం, సంపూర్ణ భారతదేశం లోని 6 లక్షల గ్రామాలకి వెళ్ళి, కుల, మత, వయస్సు, లింగభేదము, పేదరిక, ఉద్యోగము, చదువు, నిరక్షరాస్యత మొదలైన భేదభావాలు కనపరచకుండా, (యాత్రని పూర్తి చెయ్యాలట).  


ఇంతకీ ఈ పేరుతో జరుగుతున్నదేమిటి?  


1. అసలు యాత్ర ఉత్తరభారతం లోనే జరుగుతూండగా, వివిధ రాష్ట్రాలకీ, "కురుక్షేత్రం లో తయారుచెయ్యబడ్డ 'శ్రీ కృష్ణుడి' విగ్రహాలు" పంపించారట.  


2. ఆయా రాష్ట్రాల్లో మళ్ళీ పధ్ధెనిమిది నించి నూట యెనిమిది 'రధాలని' (టాటా యేస్ వంటి వాహనాలని) వెనక తొట్లో శ్రీ కృష్ణ విగ్రహాలని వుంచి, ప్రతీ గ్రామంలో తిప్పడానికి, మండలాలవారీగా తారీఖులతో కార్యక్రమాలు ప్రకటించారు.  


3. ఆయా గ్రామాల్లో 'కట్టించబడిన' 'స్వాముల' గుళ్ళముందు ఆ రథాలని ఆయా తేదీల్లో నిలిపి, (కార్తీక మాస సందర్భం గా ఆ గుళ్ళకి వచ్చే) 'భక్తులని' చైతన్యవంతం చేస్తారట!  


మావూళ్ళో నేను చూసిన 'గోగ్రామయాత్ర' ఇలా జరిగింది.  


ఓ కులం వాళ్ళు కట్టించుకున్న 'శ్రీ వేంకటేశ్వర స్వామి' గుడి ముందు ఆ 'రథం' ఆగింది.  


అంతకుముందే ఆ గుడికి రోజూ వచ్చే 'భక్తుల్ని '--ఒకాయన మైకు లో హెచ్చరిస్తున్నాడు--'యెవరూ గుడికి ప్రదక్షిణాలు చెయ్యద్దు; గంటలు కొట్టద్దు; ధ్వజ స్థంభం ముందు దీపాలు వెలిగించద్దు--మనం ఇవాళ ఓ ప్రత్యేక సందర్భం లో ఇక్కడికి వచ్చాం! మేము చెప్పేవరకూ ఇవన్నీ యెవరూ చెయ్యద్దు--చేసినా ఫలితం వుండదు' అంటూ!  


ఇంకొకాయన మైక్ అందుకొని, 'గోవు' గురించి 'చాలా' చెప్పాడు--ఈ రోజుల్లో గోవులు లేవు--జెర్సీ ఆవులు వున్నా అవి పూజార్హం కాదు--మూపురం వున్న ఆవులే గోవులు--అలాంటి గోవుకోసం అన్వేషణ జరిపితే, ఇక్కడకి మూడు కిలోమీటర్ల దూరం లో ఒకే ఒక చోట ఆ గోవు దొరికింది--దాన్ని తోలుకు వస్తున్నారు ఇక్కడికి--అది వచ్చాక మన కార్యక్రమం ప్రారంభిద్దాం--(ఈ లోపల కురుక్షేత్రం నుంచి బయలుదేరిన యాత్ర, కృష్ణ విగ్రహాలు, మన జిల్లాలో యెవరు యెన్ని రథాలు పంపించారు--ఇలా చెప్పుకు పోతున్నాడు!)  


తరవాతేమయిందో, 'మీరందరూ ఒక్కొక్కళ్ళూ గుడిబయట వున్న వాను కి ప్రదక్షిణం చేసెయ్యండి--అందులో వున్న గోపాలుడు, శ్రీ కృష్ణ పరమాత్మ మిమ్మల్నీ, మీ గ్రామం లోని గోవుల్నీ అనుగ్రహిస్తాడు--తోసుకోకండి, అయిపోయాక లోపలకి వచ్చి, ప్రసాదాలు తీసుకుని మరీ వెళ్ళండీ అని చెప్పి, 'ఓం గోమాత్రే నమహ్' అంటూ చ్హాంట్ అందుకున్నాడు.  


వాన్ చుట్టూ ప్రదక్షిణాలు మొదలై, సగం మంది పూర్తి చేసి, గుళ్ళో ప్రసాదాలకోసం తోసుకుంటున్నారు.  


అంతలో వచ్చారు--(యవరూ? తాతా? అని అడగకండి!)--గోవునీ, గోవత్సాన్నీ తోలుకొంటూ ఇద్దరు మనుషులు--3 కిలోమీటర్ల దూరం నించీ!  


మిగిలిన సగం మంది భక్తులూ వెంటనే, వాన్ ని వదిలేసి, గోవుకి ప్రదక్షిణాలు చేసేస్తూంటే, ప్రసాదాలు తిన్నవాళ్ళు మళ్ళీ బయటికి వచ్చి ప్రదక్షిణాలు మొదలెట్టారు గోవు/వత్సం చుట్టూ!  


యెట్టకేలకు తతంగం పూర్తయి, అందరూ సద్దుమణిగారు--వాన్ వెళ్ళిపోయింది--ఇంకో గుడికో, గ్రామానికో!  


కొసమెరుపేమిటంటే--50 కోట్ల సంతకాల మాటెవరికీ ఙ్ఞాపకం లేదు; యెవరూ అడగలేదు, పెట్టలేదు!  


మహజరు రాష్ట్రపతికి అందుతుందా, ఆవిడ నవ్వుతారా--సీరియస్ గా తీసుకుంటారా, గోవు ప్రత్యేక ప్రాణి అవుతుందా, చట్టం చెయ్యబడుతుందా, '....కేంద్రాలూ', '.....కుటుంబాలూ యేర్పడతాయా?  


వీటన్నిటికీ సమాధానం--వెండితెరపై!