Tuesday, April 13, 2010

చలన చిత్రాలు

'.....సిత్రాలు'

దాదాపు ఓ నలభై యేళ్ళ క్రితం, మన కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ 'కాలం మారింది' అనే ఓ సందేశాత్మక చిత్రానికి దర్శకత్వం వహించాడు. 

దాన్ని నిన్ననే (13-04-2010) ఈటీవీ వారు ప్రసారం చెయ్యడంతో మళ్ళీ చూశాను.

గాంధీ, నెహ్రూలకి కూడా 'విగ్రహాలు' పెట్టొద్దు--వారి బాటని అనుసరించడమే వారికి మనం ఇచ్చే నివాళి అని అర్ధం వచ్చేలా, హీరో (శోభన్ బాబు) చేత పాట పాడించారు!

నిజం గా అలాంటి చిత్రం చెయ్యడం తో ఆయన జీవితం ధన్యమయినట్టే! (ఆ సినిమాకి డబ్బులు రాలేదనుకోండి--అది వేరే విషయం)

అలాంటి సినిమాలు మరిన్ని తీస్తే, ఇప్పుడు కోట్లు వసూలు చెయ్యచ్చు.

యెందుకొచ్చిన శంకరాభరణాలూ, సాగర సంగమాలూ, సిరి వెన్నెలలూ!

'.....తపస్వి' గారూ! ప్రయత్నిస్తారా?

Friday, April 2, 2010

ఆ దేవుడు కూడా క్షమించని.......

కులాల ప్రసక్తి


త్రేతాయుగం లో జరిగినట్టు చెప్పబడుతున్న రామాయణం లో జాతుల ప్రసక్తి వుంది గాని, కులాల ప్రసక్తి అంతగా లేదు.

ముఖ్యం గా 'దైత్య ' (రాక్షస) జాతిని నిర్మూలించడానికే రామావతారం వచ్చింది.

(ఓ ముఫ్ఫయ్యేళ్ళక్రితం, ద్రవిడ కజగం స్థాపకుడు, పెరియార్ ఈ వీ రామస్వామి నాయకర్--రావణలీల జరిపించి, రాముణ్ణి వాహనం పై చెప్పులతోనూ, రాళ్ళతోను కొట్టిస్తూ, మదరాసు వీధుల్లో వూరేగించేవాడు! అప్పట్లో నిరసనలు లేవు. దేశవ్యాప్త నిరసనలు అసలే లేవు!)

ఆ కాలం లో బ్రాహ్మణులు పురోహితులుగా, యఙ్ఞాది కర్మలు చేయించేవాళ్ళుగా, చదువు చెప్పేవాళ్ళుగా, ప్రజల మంచికోసం ముహూర్తాలూ అవీ పెట్టేవాళ్ళుగానే వుండేవారు.

క్షత్రియులు, రాజ్య పాలన చేసేవారు. సైన్యం లో ముఖ్య పదవులు అధిష్టించేవారు.

వైశ్యులు వాణిజ్యం చేసి, వణిక్ ప్రముఖులుగానే వుండేవారు.

శూద్రులు పొలాల్లో పంటలు పండించడం చేసేవారు, యాదవులు పశుపోషణ చేసేవారు, మిగిలిన కులాలవాళ్ళు వాళ్ళ వాళ్ళ వృత్తులు చేసుకునే వారనే అనుకోవాలి.

గుహుడు, శబరి వంటివాళ్ళు ఆయనని దైవం గానే కొలిచారు!

ఆ యుగాంతానికి కొంచెం ముందు, 'శంబూక వథ ' జరిగింది. ఆ పంచముడు తపస్సు చేస్తున్నాడని కొందరు రాముడికి ఫిర్యాదు చెయ్యగానే, ససైన్యం గా వెళ్ళి, 'నీవు నీ ధర్మాన్ని అతిక్రమించావు. అందుకని నిన్ను వధించక తప్పడం లేదు.' అన్నాడంటారు.

(ఇది 'వాల్మీకం' లో వుంది అని కొంతమంది, లేదు ప్రక్షిప్తం అని కొంతమంది అంటారు.)

ద్వాపర యుగానికి వచ్చేసరికి, కుల వ్యవస్థ బలపడింది. క్షత్రియులే కాకుండా, యాదవులు, నాగులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు--మొదలైన వాళ్ళు కూడా రాజ్యపాలన సాగించారు.

సైన్యం లో అన్ని కులాలవాళ్ళూ వుండి, వాళ్ళ వృత్తుల్ని కొనసాగించేవారు!

ఇక కలియుగం లో, మనకి తెలిసిన చరిత్ర ప్రకారం దండయాత్ర చేసి, ఢిల్లీ సిం హాసనాన్ని ఆక్రమించుకున్న షేర్ షా సూరీ కాలం లో, మొదటిసారి 'శిస్తు వసూళ్ళ ' వ్యవస్థని ప్రవేశపెట్టి ఆర్థిక వ్యవస్థని క్రమబధ్ధీకరించాడు.

ఆ క్రమం లో, సామంత రాజులకి ఆ అధికారాలు దఖలు పడి, వాళ్ళు వసూలు చేసిన దాంట్లో పెద్ద మొత్తాలని ఢిల్లీ నవాబుకి చెల్లించేవారు.

రాజులు లేని వ్యవసాయ ప్రాంతాలూ, అరణ్య ప్రాంతాలూ, కొండ ప్రాంతాలకి సంబంధించి, అక్కడ వారసత్వం గా కొంత భూవసతి కలిగిన వాళ్ళు ఆ ప్రాంతాలపై తమకి వసూళ్ళ అధికారాన్ని ఇమ్మని నవాబుకి మహజరు సమర్పిస్తే, సరేనని ఆ ప్రాంతానికి అతణ్ణి అధికారిగా నియమించేవారు.

అలావచ్చినవే 'చౌధురి ' మొదలైన పదవులు. (చతుర్థ హారి--అంటే వసూలు చేసిన దాంట్లో నాలుగో వంతు హరించి, మూడు వంతులు నవాబుకి చెల్లించేవారు--అదే కాలక్రమం లో చౌధరి గా మారిందంటారు. ఇంగ్లీషువాళ్ళు కడప వర్ణక్రమం లో వుపయోగించినట్టు వ్రాయడం వల్ల, అది చౌధురి అయ్యింది!)

అదుగో--అక్కడ పడింది జమీందారీ, ఇనాందారీ, మొఖాసాదారీ, శిరస్థదారీ మొదలైన వ్యవస్థలకి.

స్వర్ణ యుగం గా పేరుపడ్డ గుప్తుల కాలం వచ్చేసరికి, ఆర్థిక వ్యవస్థ మరింత పకడ్బందీ గా నడిచి, అందరూ సుఖ సంతోషాలతో జీవించేవారు--పాలన బాగుండడం వల్ల. ఇందుకు ముఖ్య కారణం 'కౌటిల్యుడు '.

మొఘలాయి పాలన వచ్చేసరికి, ఆర్థిక వ్యవస్థ చక్కగా నడిచేది--కాని ఈ జమీందారులూ వాళ్ళూ చాలా బల పడ్డారు--నవాబు వాళ్ళకి పూర్తిగా మద్దతు ఇస్తూండటం తో.

(గోల్కొండ నవాబు క్రింద పని చేసిన అక్కన్న, మాదన్న లు అలాంటివారే. అందులో అక్కన్ననే తానీషా అనేవారు. ప్రజల అఙ్ఞానాన్ని డబ్బులుచేసుకోవడం కోసం, క్యామెడీ కోసం తొట్టి గ్యాంగుకి పాత్రలు కల్పించడానికి, శ్రీ రామ దాసు సినిమాలో చరిత్రనీ, వాస్తవాన్నీ వక్రీకరించారు!)

(అప్పుడే తిట్టడం మొదలెట్టెయ్యకండి--ఇంకా చదవండి! మళ్ళీ వ్రాస్తాగా!)

Thursday, April 1, 2010

ఆ దేవుడు కూడా క్షమించని.........

"రిజర్వేష కావేషాలు"

ఈ మధ్య అదేదో సినిమాలో హీరోనే కాకుండా ఐదారు పాత్రలు 'పింజారీ' అనే మాటని వాడాయట. 

'అదిగో! మా కులం పేరెత్తారు. ఆ సినిమా వాళ్ళు క్షమాపణలు చెప్పాలి--లేకపోతే సినిమా ఆడనివ్వం!' అన్నారట ఓ కులం వాళ్ళు.

పూర్వం 'థగ్గులూ' 'పిండారీలూ' మొదలైన జాతులవాళ్ళు వుండేవారట.  వీళ్ళు దేశద్రిమ్మరులు. వీళ్ళ ముఖ్య వృత్తి 'దోపిడీలు, దొంగతనాలు, హత్యలు'.  వీళ్ళకీ, చెంఘిజ్ ఖాన్ కీ భయపడే (చెంఘిజ్ ఖాన్ వీళ్ళ జాతివాడేమో నాకు తెలియదు) ఈ నాడు ప్రపంచవింతల్లో ఒకటైన చైనా మహా కుడ్యాన్ని నిర్మించారు అప్పటి పాలకులు. అంతేకాదు--అఫ్ఘనీస్థాన్, బెలూచీస్థాన్, పాకిస్థాన్, ఉత్తర భారతం లలో బలమైన కోటలు పాలకులు కట్టించుకున్నది కూడా వీళ్ళకి భయపడే!

థగ్గులని ఇంగ్లీషువాళ్ళు స్వీకరించి, 'థగ్' అనేమాటని వాళ్ళ భాషలో ప్రవేశపెట్టుకున్నారు.  మనవాళ్ళు పిండారీలని 'పింజారీలు' గా స్వీకరించారు.

ఈ మాటకీ, 'పొడుగు పింజ' పొట్టి పింజ' 'దూది పింజ' లకీ సంబంధం అంటగట్టి, దాన్ని ఓ కులానికి అన్వయించిన మేథావి యెవరో--వాడికి శిరసు వంచి పాదాభివందనం చెయ్యడం కాదు--తోలు వొలవాలి!

ఇక రిజర్వేషాల విషయానికొస్తే.........."సమాజం లో 'అణగారిన వర్గాలకి' (అణగద్రొక్కబడ్డకాదు--గమనించండి) కొంత వెసులుబాటు కల్పించి, నిర్ణీత సమయం లో వాళ్ళని పై వర్గాలతో సమం చెయ్యడం" అనే వుదాత్త ఆశయం తో మన పెద్దలు రాజ్యంగం ద్వారా కల్పించిన రక్షణ కవచాలు అవి.

ఈ ఆశయం కోసం, కొన్ని కులాలనీ, వర్గాలనీ గుర్తించింది ప్రభుత్వం.

అసలు కులాలు యెలా యేర్పడ్డాయి?

మనిషి అవలంబించే వృత్తుల్ని, వంశ పారంపర్యంగా కొనసాగించడం తో, అవి కులాలుగా స్థిర పడ్డాయి. 

మనువు చెప్పాడు, విష్ణువు ముఖం లోంచి ఓ కులం, భుజాల్లోంచి ఓ కులం, పొట్టలోంచి ఓ కులం, తొడల్లోంచి మరిన్ని కులాల వాళ్ళూ పుట్టారు--ఇవన్నీ 'ట్రాష్'!--"ప్రక్షిప్తాలు"--అంటే "ఇన్సర్టెడ్"!

శతాబ్దాలుగా ఈ కుల వ్యవస్థ మన దేశం లో వ్రేళ్ళూనుకోడానికి, 'ముందుబడిన కులాలతో' సమానం గా 'వెనుకబడ్డ కులాలకీ' బాధ్యత వుంది!

(అప్పుడే తిట్టడం మొదలెట్టెయ్యకండి--ఇంకా చదవండి! మళ్ళీ వ్రాస్తాగా!)

Monday, March 15, 2010

నా ఇంకో కొండె.....3

వెంకట 'మరణ'

వాళ్ళ రూమ్ ప్రక్కన వుండే ఫంక్షన్ హాళ్ళలో దాదాపు సంవత్సరమంతా యేదో ఫంక్షన్ జరుగుతూనే వుండేది--దాంట్లో మనవాడికీ, వాళ్ళ అన్నదమ్ముల అనుబంధానికీ ఉచిత భోజన పథకం అమలయ్యేది. (అదీ అడ్వాంటేజ్!)

మా ఇంకో స్నేహితుడు వరప్రసాద్, బీసెంటురోడ్డులో యేవో జాతరలు జరిగి, పేదవాళ్ళకి అన్న సంతర్పణలు జరుగుతుంటే, 'ఒరే! పందిరేసి, విస్తరేశారు.....ఇక మనదే ఆలస్యం!' అని మమ్మల్ని వేళాకోళమాడేవాడు............వాడి ముందు!

(దయచేసి వాణ్ణి హేళన చెయ్యడానికి ఈ టపాలు వ్రాస్తున్నాననుకోవద్దు! వాడు చిరునవ్వుతో అనుభవించిన కష్టాలని మీ చెవిన వేద్దామనే నా తపన.)

అలాంటి మా రమణ (వాళ్ళది ప్రకాశం జిల్లా), గోదావరి జిల్లాల్లోని ఓ పట్టణం లో వుండే కుటుంబం లో అమ్మాయిని పెళ్ళిచేసుకొన్నాడు!  వాళ్ళ అత్తవారిది కూడా పెద్ద కుటుంబం. ఆ వూళ్ళో మెయిన్ బజారులో ఓ వీధంతా రెండువైపులా వాళ్ళ షాపులే వుంటాయి. ఇంకో పేటలో ఒక వీధిలో రెండువైపులా వాళ్ళ ఇళ్ళే వరసగా వుంటాయి.

వాడి అదృష్టం ఆ అమ్మాయిరాకతో తిరిగింది. బాగా సంపాదించాడు. ఇంకో జిల్లా ముఖ్యపట్టణం లో రాజభవనం లాంటి ఇల్లు కట్టాడు. ఇద్దరు మగపిల్లల్నీ ఇంజనీర్లని చేశాడు. ఆడపిల్లకి అమెరికా సంబంధం చేశాడు! అందరూ చాలా సంతోషం గా వున్న సమయం లో.............

యాభయ్యారేళ్ళ వయసులో 'మహమ్మారి' బారిన పడ్డాడు......కొండనాలుకకి కేన్సరు వచ్చింది. రెండేళ్ళు బాధపడి, లక్షలు ఖర్చుపెట్టి, చివరకి యేడాది క్రితం పై లోకాలకి వెళ్ళిపోయాడు.

కాకతాళీయం గా వాడు పోవడానికి ఓ వారం ముందు నాకు ఫోన్ లో కలిసాడు. అప్పుడు వాడు వేసిన జోకు--"ఒరే! వక్కపొళ్ళు తినేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, మందుకొట్టేవాళ్ళు మన ఫ్రెండ్స్ అందరికీ రాని జబ్బు నాకొచ్చిందేమిట్రా?" అనడిగితే, నా సమాధానం "కేరేఝాట్ అనేవాళ్ళకి యేమీ రావు. నువ్వుకూడా కేరేఝాట్ అను............నా అంత్యక్రియలకి నువ్వు వద్దూగాని!' అని. "అంతమాటనకురా! నా టైము అయిపోయింది........అంతే! పైలోకాన్నించి వస్తాన్లే!" అన్నాడు.

ఇంకో చిన్న జోకు చెప్పి వాడి కథనం ముగిస్తాను.

వాడు ఓ నేమ్ బోర్డు వ్రాయించి పెట్టుకున్నాడు. యే వూరు వెళ్ళినా, ఇంటిముందు అది తగిలించేవాడు. దాని కొలతలు--వెడల్పు 3 అడుగులు, పొడవు 4 అడుగులు.

దానిమీద అందంగా తన పేరు, భార్యపేరు వ్రాసివుండేవి.

ఆ క్రింద, తన పిల్లల అందరివీ (అసలు పేర్లుకాదు) ముద్దుపేర్లు వ్రాసి వుండేవి! (వాళ్ళ ఫ్రెండ్స్ కి ఈ ఇంట్లో వాళ్ళు వుంటారని తెలియాలి కదురా! అనేవాడు. మరి ముద్దు పేర్లు యెందుకు? స్కూల్లో పేర్లు వ్రాయించవచ్చుకదా--అంటే--అక్కడే వుంది మజా! అని నవ్వేవాడు!)

ఓ రోజు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజరు వాళ్ళ ఇంటికి వచ్చాడు. (హనుమంతు అని, వాడింకా పెద్ద జోకర్!)

నేమ్ బోర్డు చూసి, "ఇంకా చాలా వ్రాయడం మరిచిపోయారు! వెంటనే వ్రాయించండి. 'పని మనిషి సావిత్రి, చాకలి మంగమ్మ, మంగలి ముఖలింగం.............' ఇలా......"

అదీ సంగతి!

Sunday, March 14, 2010

నా ఇంకో కొండె.....2

వెంకట 'మరణ '

అప్పట్లో, బ్యాంకుల్లో ఐదు రూపాయలు, రెండు రూపాయలు, ఒక రూపాయి కూడా తమ సేవింగ్స్ బ్యాంకు ఖాతాల్లోంచి డ్రా చేసుకోడానికి వచ్చేవారు జనం.

ఇక మా రమణ తన బ్యాంకులో డ్యూటీలో వుండగా, ఓ తమ్ముడు వచ్చేవాడట. 'నాకు ఓ కొత్త రబ్బరు (ఇరేజరు) కావాలన్నయ్యా' అంటే, ఓ విత్ డ్రాయల్ ఫారం తీసి, తన ఖాతాలోంచి ఓ ఇరవై పైసలకి వ్రాసి, ఆ డబ్బు తన తమ్ముడికిచ్చి పంపించేవాడట.

కాసేపటికి ఇంకో తమ్ముడు వచ్చి, 'నా పెన్నులో రీఫిల్ అయిపోయింది' అంటే, ఇంకో యాభై పైసలకి విత్ డ్రాయల్ వ్రాసేవాడట.

ఇంకో తమ్ముడు వచ్చి, 'లెఖ్ఖల పుస్తకం అయిపోయిందన్నయ్యా' అంటే, ఓ రూపాయి ఇరవై పైసలకి ఇంకో విత్ డ్రాయాల్ వ్రాసేవాడట.

కేషియర్ వీరాస్వామిగారు 'బుధ్ధి లేదా? ప్రతీరోజూ ఓ ఐదు రూపాయలు డ్రా చేసి జేబులో వుంచుకోవచ్చుకదా?' అని కోప్పడేవాడట.

వుత్తర భారతం నించి వచ్చిన ఓ ప్రొబేషనరీ ఆఫీసరు (తెలుగు రానివాడు) వాణ్ణి 'అన్నదమ్ముల అనుబంధం వచ్చింది' అని గేలిచేసేవాడు.

ఇవిలా వుండగా, బ్యాంకు వాళ్ళందరికీ కొత్త సినిమాలు రిలీజు అయ్యే ముందు మొదటిరోజు మొదటి ఆటకి టిక్కెట్లు ఇప్పించేవారు--ఆంధ్రా బ్యాంకులో ఖాతాలు వున్న ఫిలిం డిస్ట్రిబ్యూటర్లు.

మా రమణ సినిమా చూస్తూంటే, ఆహ్లాదకరమైన సన్నివేశం వచ్చినప్పుడు, ప్రక్కవాడి తొడమీద చరిచి, వ్రేళ్ళని దగ్గరకిలాక్కుంటూ చెయ్యి పైకిలాగి, 'హహ్హహ్హా' అని నవ్వేవాడు. వూహించండి మీ తొడని అలా లాగితే మీకెంత నెప్పెడుతుందో!

అందుకని మా రాంబాబు (వీడిని మా 'డైరెక్టరు' అనేవాళ్ళం. ఆక్కడక్కడా వచ్చిన మా బ్యాంకువాళ్ళ సీట్లని 'అడ్జస్ట్' చేసి, అందరినీ ఒకే వరుసలో కూచోబెట్టేవాడు) వాడికి ప్రత్యేకంగా తెలియనివాళ్ళ ప్రక్కన సీటు వచ్చేలా యేర్పాటు చేసేవాడు.

హైలైట్ యేమిటంటే, 'షోలే' సినిమా మొదటిరోజు మొదటి ఆట చూస్తున్నాం--అమితాభ్ 'ఆ తుపాకీ నాకందించండి' అని అడుగుతాడు సంజీవ్ కుమార్ని. అందించడు! తరువాత కాస్సేపటికి, ఓ పెద్ద గాలి వీచి, సంజీవ్ కప్పుకున్న వుత్తరీయం యెగిరి పడ్డాక, కనిపిస్తుంది--తనకి రెండు చేతులూ లేవు--అని!

వెంటనే మా రమణ 'అర్రే! చేతులు వెనక్కి పెట్టి కట్టేశాడ్రా!' అన్నాడు.

మా రాంబాబు 'నువ్విచ్చే రెండున్నర రూపాయలకోసం వాడి చేతులు నిజం గా నరికేస్తారన్నుకున్నావేంట్రా? బేవకూఫ్' అని వాణ్ణి తిట్టాడు. చుట్టూ జనాలందరు 'ఘొల్లు '!

.............మిగతా ఇంకోసారి.

నా ఇంకో కొండె.....

వెంకట 'మరణ'

మేము వుద్యోగాల్లో చేరిన కొత్తల్లో, విజయవాడ లో వుండే రోజుల్లో, మా స్నేహితుల్లో వెంకట రమణ అని వుండే వాడు. (చనువు పెరిగాక వాడినే 'మరణా' అని యేడిపించేవాళ్ళం).

వాళ్ళ తండ్రిగారు అప్పటికే రిటైర్ అయ్యారు. పెద్ద కుటుంబం--వాడితో పాటు యేడుగురు అన్నదమ్ములూ, ఇద్దరో ముగ్గురో అక్క చెల్లెళ్ళూ. వీడు రెండో వాడనుకుంటా. వాళ్ళన్నయ్యకో చిన్న వుద్యోగం.

మంచి సరదాగా వుండేవాడు. యెవరేమన్నా యేడిచేవాడు కాదు. తనమీద తనే జోక్స్ వేసుకొని నవ్వించి, నవ్వేవాడు.

వీడు ఆంధ్రా బ్యాంకులో పని చేసేవాడు. కొత్తల్లో వాణ్ణేడిపించడానికి 'యెలావుంది మీ 'అంధేరా' బ్యాంకు?" అనడిగితే, "అంధేరా అనకండి సార్! 'ఆంధ్రా బంకు' అనండి కావాలంటే!" అనేవాడు.

"సరే, మీ బంకు యెలావుంది" అంటే, "మాది బంకు అయితే, మీది కూడా బంకే కదా? మీ బంకు యెలా వుందో మా బంకూ అలాగే వుంది!" అని చంకలు గుద్దుకొనేవాడు!

కులానికి శూద్రులైనా, చక్కటి సంస్కారం వుండేది వాళ్ళ కుటుంబం లో అందరికీ. మా స్నేహితుల్లో యెవరైనా 'వెధవా' లాంటి తిట్లు తిట్టినా, బూతులు మాట్లాడినా, నవ్వుతూ 'బూతులు మాట్లాడకండిరా--తప్పు!' అనేవాడు. 

వాళ్ళ కుటుంబంలో యెవరికైనా ఇంకెవరిమీదైనా కోపం వస్తే, 'నీకివాళ బాగా ఆకలెయ్యా!' అనో, 'అమ్మ నిన్ను బాగా తిట్టా!' అనో, 'దారిలో నిన్ను చీమ కుట్టా!' అనో, 'సాయంత్రం దోమ నిన్ను బాగా కుట్టా!' అనో, ఇంకా బాగా కోపం వస్తే, 'దారిలో నీ కాలికి యెదురుదెబ్బ తగలా!' అనో తిట్టుకొనేవారట!

మొదట్లో, ఓ ఇంట్లో వీధి కొట్టుగది (7 X 5 అడుగులు) లో అద్దెకు చేరాడు--అద్దె నెలకి ఇరవై రూపాయలు! 

(ఆ యింటివాళ్ళు వెన్న వ్యాపారం చేసేవారు--అంతకు ముందు ఆ గదిని వెన్న డబ్బాలు వుంచడానికే వాడుకొనే వారు). 

దానికి కిటికీలుగానీ, వెంటిలేటర్లు గానీ వుండేవి కాదు. యేడడుగులు వెడల్పులోనే గోడ మధ్యలో ఆ గదికి ద్వారం. 

ద్వారానికి యెడం పక్క (దక్షిణం వేపు) ఓ ట్రంకు పెట్టె, దానిమిద ఓ గాలి దిండు, దుప్పటి వుండేవి. ఓ మూల చాప వుండేది. దానికి వ్యతిరేక దిశలో, వుత్తరం వైపు తన పుస్తకాల అట్ట పెట్టె! 

(వాడో పుస్తకాల పురుగు! ఇంకేమీ చదవడానికి లేకపోతే, డిక్షనరీ చదివేవాడు! అలాగే బ్యాంకు పరీక్షలు ప్యాసు అయ్యాడు మా అందరికన్నా ముందుగా!)

పగలైతే, గదిలో నిలువుగా చాప వేసుకొని,  అడ్డంగా పడమరవైపు తలపెట్టుకొని, గుమ్మం లోంచి కాళ్ళు బయట పెట్టుకొని పడుకొనేవాడు. రాత్రి, నిలువుగా దక్షిణ వుత్తరాలుగా పడుకొనేవాడు.

భోజనం తప్ప, టిఫిన్, టీ, కాఫీ, వక్కపొడి--ఇలాంటివన్నీ నిషిధ్ధం. మేము స్వేచ్చగా మా జీతాలు ఖర్చుపెట్టుకొని, పైవాటితో పాటు సిగరెట్లు, సినిమాలు కూడా అలవాటు చేసుకొని ఆనందిస్తుంటే, వాడు 'యెందుకురా చెడిపోతారు?' అని బాధపడేవాడు.

ఓ పదినెలలు వుద్యోగం చేసి, జీతం లో కొంత నిలువచేసుకోగలగ గానే, కొత్త 'రూమ్' (ఓ ఫర్నిచరు వర్క్ షాపు వాళ్ళ రేకుల షెడ్) లోకి మారి పోయాడు--నెలకి 50 రూపాయల అద్దెకి. ఆ షెడ్ లో ఒకగది, వసారా వుండేవి. 

ఆ గదికి వుండే అడ్వాంటేజ్ యేమిటంటే, ప్రఖ్యాత ఫంక్షన్ హాల్స్ రెండుమూడు వుండేవి చుట్టుపక్కల. (ఆ అడ్వాంటేజ్ యేమిటో తరవాత చెపుతాను.)

అప్పటికి అకడమిక్ ఇయర్ అయిపోయి, మళ్ళీ కొత్త ఇయర్ మొదలవగానే, వాళ్ళ తమ్ముళ్ళనందరినీ తనదగ్గరకి రప్పించేసుకొని, స్కూళ్ళలో చేర్పించేశాడు. (వాళ్ళ పెద్దతమ్ముడు అప్పటికే డిగ్రీ అయిపోయి, వుద్యోగ ప్రయత్నాల్లో వుండేవాడు.  తరవాత రైల్వే లో మంచి వుద్యోగం వచ్చింది--ఈ పాటికి యే జనరల్ మేనేజరో అయిపోయి వుంటాడు)

............తరువాయి మరోటపాలో!

   

Sunday, March 7, 2010

ఇంకో.......

వింతాభిషేకం

తూర్పుగోదావరి జిల్లాలోని అయినవిల్లి లోని సిధ్ధి వినాయక స్వామికి మొన్న లక్ష కలాలతో అభిషేకం నిర్వహించారట.

వ్యాసమహర్షి ఆఙ్ఞతో గణపతి మహాభారతాన్ని వేగం గా లిఖించినట్లు పురాణాల్లో వుందట--అందుకని!

మరి ఆయన రాసినది 'గంటం' తో ననుకుంటా!

ముందుగా స్వామికి గరికగడ్డి, నారికేళఫలాలతో మహారుద్రాభిషేకాన్ని నిర్వహించారట!

సరే, గరిక అయితే, విగ్రహం నెత్తిమీద వేసేస్తారనుకోవచ్చు--మరి కొబ్బరికాయలు యెలా అభిషేకిస్తారో?

ఆ తరవాత లక్ష పెన్నులను స్వామి పాదాల ముందు గుట్టగా పోసి, పూజలు చేశారట. ఈ కలాలతో పరీక్షల్లో వ్రాస్తే, తప్పకుండా ప్యాసు అవుతారట.

మరి అవి చెక్కకలాలా, వూట కలాలా, బంతి కలాలా--యెలాంటివో తెలియదు. వాటికి ఖర్చు యెంతయిందో తెలియదు. ఆ డబ్బు మాత్రం ప్రజలదే అయి వుంటుంది.

అక్కడి ప్రజా ప్రతినిథులు నలుగురో యెంతమందో ఆ పెన్నులని విద్యార్థులకి అందించారట--ఆ పెన్నులకోసం విద్యార్థులు రెండుకిలోమీటర్ల మేర బారులు తీరారట!

అదండీ సంగతి!