Wednesday, March 30, 2011

మన తెలుగు



అంచనాలు

మన తెలుగులో అంచనాలకి కొన్ని మాటలున్నాయి--సుమారు; దాదాపు; రమారమి; ఇంచుమించు; బహుశా; బదా బదలుగా--ఇలా!

ఇవన్నీ "దాదాపు" ఒకే అర్థాన్ని సూచిస్తున్నా, చిన్న చిన్న తేడాలు వున్నాయి.

సుమారు--అంటే కొంత % అటో ఇటో వుండొచ్చు అని.

దాదాపు--అంటే, దగ్గర దగ్గర అంత వుండొచ్చు (అంత కంటే యెక్కువ యెట్టి పరిస్థితుల్లోనూ కాదు) అని.

రమారమి--అంటే, కొంచెం ఇటూ అటూగా అని.

ఇంచుమించు--అంటే, ఓ అంగుళం యెక్కువే వుండచ్చు అని.

బహుశా--అంటే, అనేక విధాలుగా చూసినా అని.

బదాబదలుగా--అంటే, దేనికి దాన్ని విడదీసి చూసినా అని.

ఇంకా ఇలాంటివి మీకు తోస్తే చెప్పండి.

ఇంతకీ మన "ఈనాడు" వారు ఈ మాటలని విచక్షణా రహితంగా వాడేస్తున్నారు!

అదీ సంగతి!

ఇవాళ "ఈనాడు" లో ఓ చిన్న వార్త--"....షాంపూకు మహేష్ ప్రచారం" అని!

భలే తెలుగు కదూ!

Monday, March 28, 2011

సూ ఋ సంస్థలు - 12



బంగ్లా ప్రయోగం 

మనం నెత్తికెత్తుకున్న సూ ఋ సంస్థల పితామహుడు మహమ్మద్ యూనస్, నోబెల్ అందుకునేంత యేమీ చెయ్యలేదు అని నేనంటే, చాలా మంది వొప్పుకోలేదు!

ఇప్పుడు, బంగ్లా ప్రభుత్వం ఆయన్ని గ్రామీణ బ్యాంకు నించి తొలగించి, ఆయన మీద దర్యాప్తులు మొదలుపెడితే, అందువల్ల "తాము ఇబ్బందులకు గురయ్యాము" అనీ, ఈ విషయంలో బంగ్లా ప్రభుత్వం "రాజీ" పడాలనీ, అమెరికా వొత్తిడి తెస్తోందట!

మొన్న మొన్నటిదాకా, మా సూ ఋ సంస్థలు ఇండియాలోలా కాదు--అక్కడ తగిన చట్టాలు చెయ్యాలి అంటూ వూదరగొడుతూనే వున్నాడు ఆయన. ఇప్పుడు మరి ఇదేమిటో?

అమెరికాకి నొప్పి యెందుకో? కాలమే చెప్పాలి. 

Friday, March 18, 2011

సిగ్గులేని సోనియా



'నికమ్మా' ప్రథాని

చాలా విషయాల్లో చూస్తున్నాముకదా—భారతీయులకి యేదైనా “అప్రాచ్యుడు” చెపితేనే నిజమని నమ్ముతారు!

అప్పుడు, గత లోక్ సభలో విశ్వాస తీర్మానం సందర్భంగా డబ్బు మూటలు చేతులు మారాయని మన మీడియా వీడియోలతో నిరూపించినా, ఆదికేశవులు నాయుడు, మంద జగన్నాథం లాంటివాళ్లు యెదురుగుండా కనిపిస్తున్నా, మళ్లీ యూపీయేకే పట్టం కట్టారు.

ఇప్పుడేమో, వికీలీక్స్ అనే అప్రాచ్యుడు చెపితే—అదుగో చూశారా—అదే నిజం అంటున్నారు.

పైగా, అధికారాంధులు అతి తెలివిగా, పాత లోక్ సభలో జరిగినవాటికి కొత్త లోక్ సభ “జవాబుదారీ కాదు” అనీ, “అది మరిచిపోయిన” వ్యవహారం అనీ, కిశోర్ చంద్ర దేవ్ కమిటీ “ఇంకా దర్యాప్తు జరగాలని” చెప్పినా, ఆ రిపోర్టు తో ఆ వ్యవహారం ముగిసింది అనీ, దానిమీద “ఏక్షన్” కూడా తీసుకొని, ముగ్గురి మీద “అవినీతి నిరోధక” కేసులు పెట్టేసి, చేతులు దులుపుకున్నామనీ, డబాయిస్తున్నారు!

(అసలు ఆ వెధవలని పోలీసు కస్టడీ కి ఇచ్చి వాళ్లు “తమ పధ్ధతిలో” వాళ్లని ప్రశ్నించి వుంటే, వాళ్లు “యెవరి తరఫున” డబ్బులు ఇచ్చారో బయటపడి వుండేది కాదా? అప్పుడు “వాళ్ళ మీద” పెట్టవలసిన కేసులు పెడితే సరిపోనుకదా? బాస్ ఆఙ్ఞ ప్రకారం హత్యలూ, దోపిడీలూ వాడి అనుచరులు చేసినా, బాస్ దే కదా నేరం?)

తరవాత జరిగిన యెన్నికల్లో తమ కూటమికి యెక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి, ఆ అరోపణలని జనం యెవరూ నమ్మలేదని నిరూపితం అయిపోయిందట! జనం నమ్మినా, నమ్మకపోయినా నేరం నేరమే! అవున కాదా?

మన "నికమ్మా" అయితే, “అశ్వథ్థామ హతః” లెవెల్లో, “నేను యెవరినీ కొనలేదు, యెవరినీ కొనమని చెప్పలేదు, నాకు డబ్బుల వ్యవహారం తో సంబంధం లేదు” అని ఘోషిస్తున్నాడు—ఢంకా బజాయించి మరీ!

అవినీతి “బురద” అయితే, ఈ లోక్ సభలూ, ప్రథానీ వగైరాలూ, ఎంపీలూ, ఎమ్మెల్యేలూ—అంతెంతుకు—ప్రతీ రాజకీయ నాయకుడూ, ప్రభుత్వాధికారీ—అందరూ "తామరాకులే" అని నమ్మెయ్యాలి జనం! గాలీ వానా ఒకేసారి వస్తే అసలు కథే వుండదుకదా!

యెంత బాగుందో మన ప్రజాస్వామ్యం!

జనం చెప్పులు తీసి యెప్పుడు చేతులతో పట్టుకుంటారో—వోట్లు అడగడానికి వస్తే “మచ్చపడ్డ” వెధవలకి యెలాంటి సత్కారాలు చేస్తారోనని—వేచి చూస్తున్నాను.

కొసమెరుపు : టేంక్ బండ్ నాశనమైనా, పార్లమెంటు దద్దరిల్లుతున్నా, ఇప్పుడు "సెజ్ లు రద్దు చెయ్యడానికి నిబంధనలు అడ్డు వస్తాయా?" అని ఆలోచిస్తున్నాడట మన ముఖ్యమంత్రి! (జగన్ మీద పిడకలవేటలో ప్రసిధ్ధుడు కదా మరి!)

సర్వేజనా సుఖినో భవంతు!

Tuesday, March 15, 2011

అంథేర్ నగరీ



అన్‌భుజ్ ప్రజా

రాజకీయ నిరసనలు తెలపడం ప్రజాస్వామ్యంలో తప్పులేదు! అంటాడు కోదండరామ్.

మరేం ఫర్వాలేదు—పడగొట్టినవాటితోపాటు, కొమరం భీం, సర్వాయి పాపడు, నాయకురాలు నాగమ్మ, కడెం అప్పన్న లాంటి వాళ్ల విగ్రహాలు కూడా పెట్టేస్తాం—అంటాడింకొకడు.

వుద్యమకారులు మారణాయుధాలు ధరించి వచ్చారనడం తప్పు—అంటాడొకడు.

రెండు నెలలు ముందుగానే ప్లాను వేశాం—యెలాగైనసరే ‘ఆ విగ్రహాలు ‘ కూలగొట్టాలని!—అంటాడింకొకడు.

గొలుసులూ, రాడ్లూ, హుక్కులూ అన్నీ ముందే తెచ్చుకొన్నారు—అని వొప్పుకుంటాడింకొకడు.

350 చెక్ పోస్టులు పెట్టి యెవరూ రాకుండా చేసినా, పదిలక్షలమందీ వచ్చేశారని ఆనందిస్తాడింకొకడు.

బీజేపీ వాళ్లు పూనుకున్నారు—తెరాస వాళ్లెవరూ లేరు అంటాడింకొకడు.

విద్యార్థులనీ, ఆ వెనక్కాల లాయర్లనీ చూసి కడుపునిండిపోయింది అంటాడింకొకడు.

రొచ్చుగుంట యేర్పడబోతోంది—కేసీఆర్, కోదండరాం యేర్పాటు చేస్తారట—చేపలు పట్టేద్దాం అని బీజేపీ వాళ్లు యెప్పుడో సిధ్ధమయ్యారు అంటాడు ఇంకొకడు.

కాంగ్రెస్ వాడు లోపాయకారీగా వీళ్లని అక్కడికి చేరుకోనిచ్చాడు అంటాడు ఇంకొకడు.

కేకే, యాష్కీ లకి భలే దేహశుధ్ధి చేసేశారు, ఇంకెవరూ దొరకలేదు అని అనందంతో వాపోతాడింకొకడు.

తి సు రా రె, లగడపాటి వగైరాలు, బొచ్చెలూ, రఘువీరలూ యేమంటున్నరో తెలీదు. 4 మిలియన్ మార్చ్ యేమైనా ప్లాన్ చేసి, హైదరాబాద్ టేంక్ బండ్ నేకాకుండా, మిగతా కూడా సర్వనాశనం చేద్దామని ఆలోచిస్తున్నారేమో తెలియదు.

అసలు కేసీఆర్ కి అసెంబ్లీ, సచివాలయాలనీ, కేటీఆర్ కి టేంక్ బండ్, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం వగైరాలనీ, కవితకి గోల్కొండకోట, కుతుబ్షాహీ సమాధులు, స్థానిక హోటళ్లూ, కోదండరాం కి యూనివర్సిటీలూ, కాలేజీలూ, లాయర్లకి కోర్టులూ—ఇలా రాసిచ్చేస్తే యే గొడవా వుండకపోనుకదా అంటాడింకో అమాయకుడు.

ఇలా యెన్నాళ్లు, పదండి సోనియా దగ్గరకి—అంటాడింకొకడు.

గన్ లోడ్ చేసి పెట్టాను—పైనుంచి పేల్చమని ఆర్డరు రావడమే తరవాయి—అంటాడు గవర్నరు.

మరేం ఫర్వాలేదు, మరోసారి అఖిలపక్షం అయ్యాక, యేకాభిప్రాయం వచ్చాక, అప్పుడు శ్రీకృష్ణ కమిటీ మీద నిర్ణయం చెయ్యచ్చు అని చిదంబరం.

విగ్రహాలు నిషేధించాలి, టేంక్ బండ్ తో పాటు అన్ని విగ్రహాలూ పడగొట్టేసి, హైదరాబాదుతోపాటు అన్ని చోట్లా, అన్ని విగ్రహాలనీ పడగొట్టెయ్యండి—తరవాత యెవరెవరికి యేయే రాష్ట్రం కావాలో పంచిపెట్టడానికి ఆలోచించచ్చు అని కొంతమందీ.

పోలీసులు చక్కటి ‘సమన్వయం’ పాటించారు, ఆందోళనకారులు చక్కటి ‘సం యమనం’ పాటించారు అని వొకడూ.

అరెస్టు చేసిన వాళ్లమీద క్రిమినల్ కేసులు పెట్టేస్తున్నారు—ఇదేమి ప్రజాస్వామ్యం? అని ఇంకోడూ.

ఇలా ఇలా అనేక గొంతులు వినిపిస్తున్నాయి నిద్ర లేచేటప్పటికి.

నేను ప్రస్తుతం వున్న ప్రదేశం లో ప్రజలు—హైదరాబాద్ నించి వచ్చారా? ఎన్‌టీఆర్ వుండేవాడుటకదా అక్కడ? స్వీట్లు యెక్కువ తింటారటకదా అక్కడ? బిరియానీ బాగుంటుందటకదా?—ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు తప్పితే, “తెలంగాణా, కేసీఆర్, కిరణ్ కుమార్"—లాంటి మాటలే వీళ్లకి తెలియదు!

సముద్రంలో కాకిరెట్ట మన ఆంధ్ర! దాన్ని యెన్ని ముక్కలు చేస్తే యెలావుంటుందో వూహించుకోండి.

సజీవ ముఖ చిత్రం చూడండి! తరవాత ఆలోచిద్దాం!

Thursday, February 24, 2011

ఆంగ్ల సంవత్సరాది - 6



......వచ్చిన 2011

5. కార్లూ, బైకులూ ఇంకెన్ని లక్షలు అమ్ముడుపోతాయి? వాటిని "ఆంఫిబియన్లో" అవేవోగా మార్చడానికి రీసెర్చ్ మొదలవుతుందా? కాస్త బాగా కనిపిస్తున్న కొన్ని "రోడ్లని" ఫోటోలూ, వీడియోలూ తీసుకొని, భద్రపరచుకుంటున్నారా--మీ వారసులకి "రోడ్లు అనీ....ఇదివరకు....ఇలా వుండేవన్నమాట...." అని చెప్పడానికి?

జ : గత యేడాదిగా, మారుతీయే లక్ష కార్లు అమ్మిందట. టాటా, హ్యుండై, షెవర్లే, ఫియెట్ వగైరాలు యెన్ని లక్షలు అమ్మారో! ఇక బైక్లు కూడా కొన్ని వందల లక్షలైనా అమ్ముడయ్యి వుంటాయికదా? అమెరికాలోలా కొత్తకారు కొన్నవాళ్లు పాతకార్లని "కన్‌డెమ్న్" చేయించరు. అవికూడా రోడ్లమీద తిరుగుతూనే వున్నాయి......నలభై యేళ్ల క్రితపు "ప్రీమియర్ పద్మినీ" లతో సహా!

వాటిని ప్రస్తుతానికి ఆంఫిబియన్లలా చెయ్యడం అనేది కుదరని పని. అందుకని, "ట్యూబ్ లెస్ టైర్లూ" "సెల్ఫ్ హీలింగ్ ట్యూబులూ" వగైరాలని మాత్రమే ప్రవేశ పెట్టారిప్పటివరకూ!

మన రోడ్ల స్థితిగురించి ఈ క్రింది టపా చదవండి.
  

నిన్న (23-02-2011) ప్రకటించిన రాష్ట్ర బడ్జెట్ లోకూడా రోడ్లకి ప్రత్యేక కేటాయింపులేమీ లేవు. 

అందుచేత, ఫోటోలూ, వీడియోలూ ఇంకా తీయించి పెట్టుకోకపోతే, ఇప్పటికైనా ఆ పని చెయ్యండి. లేకపోతే మీ వారసులు చాలా ఙ్ఞానాన్ని కోల్పోతారు!

అన్నట్టు, "బాగా లోతుగా" పడ్డ గోతులని, దీర్ఘచతుస్రాకారంగా కొంచెం వెడల్పు చేసి, వాటిలో పెద్ద నల్లకంకర రాళ్లని నింపి, దానిమీద తారుపోసేసి, వాటిపై యెండు వరిగడ్డి పరిచేస్తారు! ఆ ఫిల్లింగులు రోడ్డుకి కనీసం అంగుళమున్నర యెత్తులో వుంటాయి. ఆ గడ్డి పూర్తిగా తారునించి విడివడేసరికి, ఫిల్లింగులు రోడ్డు యెత్తుకి అణిగిపోతాయి అని థీరీ! (అప్పటివరకూ భారీ వాహనాలు కొంచెం సునాయాసంగానూ, చిన్న వాహనాలు బడాబడామంటూ యెగిరిపడుతూనూ ప్రయాణించవలసిందే!)

నల్లటి తారురోడ్డుమీద గడ్డితోకూడిన ఫిల్లింగుల ఫోటోలు కూడా తీసి జాగ్రత్తపెట్టుకోండి--మన రిపేరు విఙ్ఞానానికి తార్కాణంగా!

మరిచిపోవద్దు మరి. 

Wednesday, February 23, 2011

ఆంగ్ల సంవత్సరాది - 5 (తరువాయి-2)



ఇన్సులేటెడ్ వ్యాన్లు

టాటావాళ్లూ, ప్యాజ్జియో వగైరాలూ లారీలకన్నా చిన్నవైన పెద్ద వ్యాన్లూ, ఇంకా చిన్న పికప్ ట్రక్కులూ--టన్నులకొద్దీ బరువుని 100 కి మీ మించిన వేగంతో చక్కగా చేరవేయగలిగేవీ, మనరోడ్లని తట్టుకోగలిగేవీ--తయారు చేస్తున్నాయి.

నరసాపురం లాంటి చోటినుంచి సరుకుని హైదరాబాదులో దించేసి, అక్కడ మళ్లీ సరుకు యెక్కించుకొని, సాయంత్రానికల్లా బయలుదేరిన వూరు చేరగలుగుతున్నారు!

అలాంటి వ్యాన్లని "ఇన్సులేటెడ్ వ్యాన్లుగా" మారిస్తే? అద్భుతంగా వుండదూ?

ఇప్పటికే, చేపలూ వగైరా ఇలా రవాణా చేస్తున్నారు. 

అసలు, వ్యవసాయం, చిన్నతరహా పరిశ్రమలు, రహదారి, నీటిమార్గ రవాణాదారులు, హోల్సేల్ వ్యాపారస్థులు, రిటెయిల్ వ్యాపారస్తులు, గ్రామీణ వృత్తి పనివారు--ఇవీ నిర్వచించబడ్డ ప్రాథాన్యతా రంగం అంటే.

మొన్నీమధ్య రిజర్వ్ బ్యాంక్ మొత్తుకున్నట్టు, బ్యాంకులు తమ ఋణ రంగాన్ని మసిపూసి మారేడుకాయ చేస్తున్నాయి. తమ ప్రాథాన్యతా రంగ ఋణ కోటాలని మించే ఇస్తున్నామని ప్రజల మొహాన వెల్ల వేస్తున్నాయి. ముఖ్యంగా గత ఇరవై యేళ్లుగా యే బ్యాంకూ ప్రథాన్యతా రంగంలోని యెవరికీ ఒక్కటంటే ఒక్క క్రొత్త ఋణం మంజూరు చేసింది లేదు! వ్యవసాయం తో సహా, అన్నీ "రెన్యువల్సే" (అంటే సాలువారీ పునరుధ్ధరణలు!). నిజంగా అవి ఋణాలు మంజూరు చేసి వుంటే, ఈనాటి గ్రామీణ భారతం అమెరికాని తలదన్నేది!

ప్రభుత్వం, "గోదాములు నిర్మింపచెయ్యడం కంటే", ఈ చిన్న వ్యానులకి "ఇన్సులేటెడ్ బాడీ" కట్టించుకోడానికి బ్యాంకు ఋణాలు యేర్పాటు చెయ్యచ్చు. అది ప్రాథాన్యతా రంగంలోకి వస్తుంది. ఇంకా, బాడీ బిల్డింగ్ కి 100% ఫైనాన్స్ చెయ్యచ్చు బ్యాంకులు. నిజానికి మార్కెట్లలో సరుకులు కొని, వాటిని రవాణాచేసి, కొంచెం లాభానికి అమ్ముకునేవాళ్లెవరూ కోటీశ్వరులు కారు. అసలు దోచుకొనే "దళారులు" వేరు! వీళ్లు కాదు. వీళ్లకి వలసిన సహాయాలు అందిస్తే, ద్రవ్యోల్బణం వగైరా అనేక రుగ్మతలని అరికట్టవచ్చు!

వుదాహరణకి, గడ్డి అన్నారం లోనో యెక్కడో, టమాటాలు కేజీ పది పైసలకి కూడా కొనకపోతే, వాటిని పశువులకి మేపీ, రోడ్లప్రక్కన పారబోసీ వెనుదిరుగుతారు రైతులు. జిల్లాలలో, గ్రామాల్లో, అదేరోజుని కేజీ 4 రూపాయలకి తక్కువకి కొనలేరు! ఇలాంటి వ్యానులు వుంటే, ఆ వ్యాపారులు కేజీ పదిపైసలకే కొనేసి, వ్యానులు నింపుకొని, మధ్య్హ్నానికల్లా జిల్లా కేంద్రాలకీ, సాయంత్రానికల్లా గ్రామాలకీ చేరితే? అక్కడ కేజీ రూపాయికి అమ్మినా, వాళ్లకి ఇబ్బడి ముబ్బడి లాభాలూ, ప్రజలకి బోళ్లు వూరటా! ఇంకోరోజో, రెండురోజులో సరుకంతా అమ్ముడుకాకపోయినా, చెడిపోతుందన్న బాధలేదు!

గ్రామీణ భారతం అభివృధ్ధి చెందుతోంది--కానీ సరైన గణాంకాలు లేవు! మొన్నటిదాకా పూటకి ఠికాణాలేనివాళ్లు ఇప్పుడు మూడేసి, నాలుగేసి ట్రాక్టర్లకి యజమానులై (అవి థర్డ్ హేండ్ వో, ఫోర్థ్ హేండ్ వో అయినా సరే) మట్టీ, ఇసుకా, ఇతరాలూ రవాణా చేసి, బాగానే సంపాదించుకొంటున్నారు! ఇలాంటివాళ్లకి ఆర్థిక సహాయం చెయ్యడమే బ్యాంకుల కర్తవ్యం!
  
.......మరోసారి.

Sunday, February 20, 2011

ఆంగ్ల సంవత్సరాది - 5 (తరువాయి)



ఇన్సులేటెడ్ వ్యాన్లు

సింగపూర్ లాంటి దేశాల్లో, భవన నిర్మాణానికి ఇసుకా, కంకర, సిమెంటు కూడా ఇన్సులేటెడ్ (ఏ సీ-క్లోజ్డ్) వ్యానుల్లో మాత్రమే తరలిస్తారట--రోడ్డుమీద దుమ్ము యెక్కడా పడకుండా! పడితే తెలుసుగా, కొన్ని వందల డాలర్లలో జరిమానాలు.

మరిన్ని గోదాములు నిర్మించబడి, వుపయోగం లోకి వచ్చేవరకూ "ఆహార భద్రత" విషయంలో యేమీ చెయ్యలేమని కుండ బద్దలుకొట్టారట మన కేంద్ర మంత్రి.

వెనకటికి మన రాష్ట్ర ప్రభుత్వం వుల్లిపాయలు నిలువ చేయడానికి గోదాములు లేవంటే, అఘమేఘాలమీద బోళ్లన్ని కట్టించేసిందట. కానీ, వాటిల్లో "వుల్లిపాయలు పట్టేంత" అరలు మాత్రమే నిర్మించడంవల్లా, మరేమీ నిలువ చేయడానికి సదుపాయాలు లేకపోవడం వల్లా, ఇప్పుడు వుల్లిపాయల స్టాక్ లేకపోవడంవల్లా, అవన్ని ఖాళీగా శిధిలమైపోతున్నాయట!

మన ప్రభుత్వాల జబ్బేమిటో అందరికీ తెలుసు--మన రానాలూ, వాళ్లకి తందానా అనే బుర్రోవాదులూ!

నాలాంటివాళ్లు, మనకన్నా చిన్న చిన్న దేశాలవాళ్లు పదుల సంఖ్యలో పతకాలు సాధిస్తున్నారు, జపాన్, చైనా లాంటి దేశాలు వందల్లో సాధిస్తున్నాయి, ఇన్ని కోట్ల జనాభా వున్న మనదేశానిదేమి దౌర్భాగ్యం? అని విమర్శిస్తూంటే, కొన్నేళ్ల క్రిందట, "ప్రతీ జిల్లా కేంద్రం లోనూ ఓ స్టేడియం నిర్మిస్తాం" అని నిర్మింపచేసేశారు! 

నిర్మించాక, ఇన్నేళ్లలో, యేవో ఒకటో రెండో దేశవాళీ క్రీడా పోటీలు నిర్వహించారేమో. అవికూడా టిక్కెట్టు కొని చూసినవాళ్లు ఓ వెయ్యిమంది లోపు వుంటారేమో! ఓ టైములో బ్రహ్మానందరెడ్డి స్టేడియం ఓ వెలుగు వెలిగింది. ఇప్పుడు దానితోసహా అన్ని స్టేడియాలూ శిధిలమై, ఇటుకలూ, కాంక్రీటు అచ్చులూ దొంగిలించబడుతున్నాయి! వాటివల్ల క్రీడాభివృధ్ధి యేమి జరిగిందోగానీ, వాటి మేనేజర్లూ, కోచ్ లూ కొంత బాగుపడ్డారు. (రానాలూ, గుత్తేదారులూ మొ.వాళ్ల తరవాతే లెండి).

ఇప్పుడు, మళ్లీ, ప్రతీ మండల కేంద్రంలో "క్రీడా భవనాలు" నిర్మిస్తారట. ఇంక వాటివల్ల యేమి వొరుగుతుందో మరి!

మొన్నీమధ్యనే, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్లు గోదాముల నిర్మాణానికి టెండర్లు పిలవడం, కోటీశ్వరులు మాత్రమే ఆ నిబంధనలని ఆచరించగలరు కాబట్టి, వాళ్లే టెండర్లు వెయ్యడం జరిగింది. తరవాత, బుర్రోవాదులు--గోదాము నించీ "మీ స్వంత భూముల్లో", దగ్గరి "రైల్వే పాయింటు" వరకూ, "స్వంత ఖర్చుతో" రైల్వే లైను నిర్మించుకొనే సామర్ధ్యం వున్నవాళ్లే అర్హులు--అనడంతో, కాంగీ పార్టీ గుత్తేదార్లతోసహా అందరూ, "మమతాదీ తో మేము పెట్టుకోలేము" అని విరమించుకున్నారు! (అంటే, "ఆ మధ్యలో" సొంత భూముల్లేవుకాబట్టి అవి కొనుక్కున్నా, స్వంత ఖర్చుతో లైను వేయించుకున్నా, 'ఆవిడ ' అనుమతి ఇస్తుందని నమ్మకాల్లేవన్నమాట!)

ఎఫ్ సీ ఐ వాళ్ల నాటకాల గురించి చెప్పనే అఖ్ఖర్లేదు. వాళ్లు ధాన్యం కొనాలంటే, గోదాములు ఖాళీ వుండవు. మిల్లర్లు "బియ్యం యెగుమతికి అనుమతి ఇస్తేనే కొంటాం" అంటారు. జేపీ తో సహా కొంతమంది, "అమెరికాలో బియ్యం బోళ్లు రేటు పలుకుతోంది. మనం ఇప్పుడు యెగుమతి చేస్తే, అక్కడివాళ్లకి తక్కువరేటుకి దొరుకుతాయి, మనకి విదేశీ మారకద్రవ్యం, మిల్లర్లకి లాభాలూ, రైతులకి గిట్టుబాటు ధరా, ఎఫ్ సీ ఐ సమస్య తీరడం--ఇన్ని లాభాలు" అంటున్నారు. కానీ, ఈ అనుమతి ఇస్తే, "తనకు మాలిన ధర్మం" లాగా మనందరం మళ్లీ కిలో 50 రూపాయలకి కొనుక్కోవాలి అన్న మాట చెప్పడంలేదు!

అవీ మన "నిర్మాణాల" సంగతులు. 

సరే, పిడకలవేట మానేసి, ఇన్సులేటెడ్ వ్యాన్ల దగ్గరకి వద్దాం.

.......మరోసారి.