స్వామీజీలకి.....
21-10-2009--రాష్ట్ర అత్యున్నత పోలీసు అధికారి, డీ జీ పీ శ్రీ గిరీష్ కుమార్--ప్రకాశం జిల్లాలో చేవూరు వద్ద అయిదోనెంబరు జాతీయ రహదారిపై వున్న స్వామీజీ రామదూత పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశారట!
ఆయన తన చొక్కా వూడిపోతూండగా, మోకాళ్ళునేలకాంచి, ఆ స్వామీజీ పాదాలపై చేతులూ, తలా ఆనించిన ఫోటో పత్రికల్లో ప్రచురించబడింది!
ఆ స్వామితోపాటు, అభిషేక పూజల్లో ఇంకా కొంతమంది కూడా పాల్గొన్నారట! వాళ్ళందరికీ యేవో కారణాలుండవచ్చు--కానీ ఈ డీ జీ పీ కేం ఖర్మ రా బాబూ అనీ, అసలు ఈ రామదూత స్వామి యెవడూ? అనుకున్నాను!
ఆ మర్నాడు పేపర్లో, ఆ స్వామీజీ బండారం బయటపెట్టబడింది--కొంతమందిచే!
చేవూరులో రామదాసు అనే వ్యక్తి 'రామదూత స్వామి ' గా అవతరించి, సర్వే నెంబరు 883 లోని అటవీ భూమినీ, సర్వే నెంబరు 879 లోని చెరువు పోరంబోకు భూమినీ--దాదాపు 20 యెకరాలు ఆక్రమించి ఆశ్రమం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారట.
గతం లో ఆ ప్రాంతం లో భిక్షాటన చేసుకునే వ్యక్తి ఈ రోజు దొంగస్వామిగా మారి, ఏ సీ కార్లలో విహరిస్తున్నాడట.
14-7-2002న అప్పటి అటవీశాఖ మంత్రి ఆయ్యన్న పాత్రుడు ఈ దొంగ స్వామి భూ ఆక్రమణదారుడే అని ప్రకటించారట!
8-7-2004న రాష్ట్ర అసెంబ్లీలో అప్పటి చిన్న నీటిపారుదల శాఖ మంత్రి చంద్రశేఖర్ దొంగస్వామి భూఆక్రమణ నిజమేనని ప్రకటించారట.
భూమి తిరిగి స్వాధీనం చేసుకోనందుకు అప్పటి జిల్లా ఇన్ చార్జ్ మంత్రి డి శ్రీనివాస్ అధికారులపై మండిపడ్డారట కూడా!
వీటన్నిటికీ దోహదం చేసిన అయ్యేయస్, ఐపీయస్ అధికారులెవరో, రాజకీయ నాయకులెవరో, పారిశ్రామికవేత్తలెవరో, ఈ డీజీపీకి ఆయనమీద అంతభక్తి వుండడమెందుకో, దాన్ని ఆయన అలా సిగ్గువిడివి ప్రదర్శించడమెందుకో--యెవరైనా అడిగారా!
యెన్ని హేతువాద సంఘాలైనా, ఓపీడీఆర్లైనా, కమ్యూనిష్టులైనా--బుద్ధున్నవాళ్ళెవరైనా--ఈ మూర్ఖుల్నీ, వాళ్ళ మూర్ఖత్వాన్నీ పొగొట్టగలరని ఆశించగలమా?