Monday, November 30, 2009

......సం రక్షణ


‘………….గ్రామయాత్ర’


మొన్న ఆదివారం సాయంత్రం యేమీ తోచక రోడ్డుపక్కన నిలబడితే, అక్కడ ఓ కులం వాళ్ళు కట్టించుకున్న వెంకటేశ్వర స్వామి గుడి ముందు దాదాపు టాటా ఏస్ వాన్ అంత సైజులోనేవున్న ఒక వాన్ ఆగి వుంది.  


రోడ్డుమీద సైకిళ్ళపై వెళుతున్న నలుగురైదుగురు (తొమ్మిదో, పదో తరగతి) ఆడపిల్లలు(—నవ్వుతూ తుళ్ళుతూ వెళుతూండడం వారి వయసులో సహజం!) వాళ్ళ వ్యాఖ్యలు నా చెవిని పడ్డాయి.  


(వాళ్ళు చదువుతున్న స్కూలు లోని--వాళ్ళ సబ్జెక్ట్ లో బోధించే వాళ్ళ దగ్గరే--‘ట్యూషన్’ చెప్పించుకోడం ఈ రోజుల్లో తప్పనిసరి!)  


వ్యానుకోపక్కని మేస్తున్న గేదెని చూసి “యేమే! ఇవాళ ‘గేదెగ్రామ యాత్రేమోనే!’” అందో అమ్మాయి. 


మిగిలినవాళ్ళు గొల్లున నవ్వారు.  


ఇంకో అమ్మాయి, ఆ వ్యాను ముందున్న ఓ పందినీ, పిల్లల్నీ గమనించి, “కాదే! ‘పందిగ్రామ యాత్రనుకుంటా!’” అంది. ఇకవాళ్ళ నవ్వులకి కంట్రోలు వుంటుందా!  


కొన్ని సంస్థలు, నిర్వాహకులు మన హిందూ ఆచారవ్యవహారాలనీ, నమ్మకాల్నీ, సాంప్రదాయాల్నీ యెలా భ్రష్టుపట్టించి, కౄరమైన పరిహాసాలాడుతున్నాయో (రో) గమనించారా?  


(ఇది నా ‘క్యామెడీ చానెల్’ లో వ్రాద్దామనుకొన్నాను! కానీ నేనింకా పరిహసిస్తున్నాననుకొంటారేమోనని భయపడ్డాను!)





Monday, November 16, 2009

గో సంరక్షణ


'గోగ్రామయాత్ర'


మొన్నటి విజయదశమి పర్వదినాన, ఉత్తరభారతం లోని 'కురుక్షేత్ర' నుండి, 108 రోజులలో దాదాపు 20 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి 17 జనవరి 2010 న 'నాగపూర్' చేరుకొనేలా ఓ మహానుభావుడు ఓ యాత్ర బయలుదేరదీశాడట--"సత్యము, శివము, సుందరము" అనే లక్ష్యాలను ముందుంచుకొని, 'విశ్వమంగళ గో-గ్రామ యాత్ర' ప్రారంభించబడిందట.  


దీనికి సంకల్పం, గోకర్ణపీఠాధిపతి శ్రీ రామచంద్రపూరమఠం శంకరాచార్యులు పూజ్యశ్రీ రాఘవేశ్వర భారతీ మహాస్వామీజీ అట.  


లక్ష్యము :  


1. గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి.  
2. గో వంశ రక్షణ కొరకు కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టం చేయాలి.  
3. వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం కొరకు ప్రతి గ్రామం లో గోమాతను సం రక్షించి పోషించాలి.  
4. భారతదేశం లో గో సంరక్షణను కోరుతూ, గౌ. రాష్ట్రపతిగారికి ప్రపంచములోనే అతిపెద్ద సంతకాల సేకరణ ఉద్యమము ద్వారా 50 కోట్ల సంతకాలతో వినతి పత్రం సమర్పించాలి.  
5. సేంద్రియ ఎరువులతో చేస్తున్న వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి.  
6. పట్టణాలలో గో సంరక్షణ కేంద్రాలు, గ్రామాలలో గో ప్రేమీ కుటుంబాలను ప్రోత్సహించాలి.  


చక్కని, ఉదాత్తమైన ఆశయాలు.  


దీనికోసం, సంపూర్ణ భారతదేశం లోని 6 లక్షల గ్రామాలకి వెళ్ళి, కుల, మత, వయస్సు, లింగభేదము, పేదరిక, ఉద్యోగము, చదువు, నిరక్షరాస్యత మొదలైన భేదభావాలు కనపరచకుండా, (యాత్రని పూర్తి చెయ్యాలట).  


ఇంతకీ ఈ పేరుతో జరుగుతున్నదేమిటి?  


1. అసలు యాత్ర ఉత్తరభారతం లోనే జరుగుతూండగా, వివిధ రాష్ట్రాలకీ, "కురుక్షేత్రం లో తయారుచెయ్యబడ్డ 'శ్రీ కృష్ణుడి' విగ్రహాలు" పంపించారట.  


2. ఆయా రాష్ట్రాల్లో మళ్ళీ పధ్ధెనిమిది నించి నూట యెనిమిది 'రధాలని' (టాటా యేస్ వంటి వాహనాలని) వెనక తొట్లో శ్రీ కృష్ణ విగ్రహాలని వుంచి, ప్రతీ గ్రామంలో తిప్పడానికి, మండలాలవారీగా తారీఖులతో కార్యక్రమాలు ప్రకటించారు.  


3. ఆయా గ్రామాల్లో 'కట్టించబడిన' 'స్వాముల' గుళ్ళముందు ఆ రథాలని ఆయా తేదీల్లో నిలిపి, (కార్తీక మాస సందర్భం గా ఆ గుళ్ళకి వచ్చే) 'భక్తులని' చైతన్యవంతం చేస్తారట!  


మావూళ్ళో నేను చూసిన 'గోగ్రామయాత్ర' ఇలా జరిగింది.  


ఓ కులం వాళ్ళు కట్టించుకున్న 'శ్రీ వేంకటేశ్వర స్వామి' గుడి ముందు ఆ 'రథం' ఆగింది.  


అంతకుముందే ఆ గుడికి రోజూ వచ్చే 'భక్తుల్ని '--ఒకాయన మైకు లో హెచ్చరిస్తున్నాడు--'యెవరూ గుడికి ప్రదక్షిణాలు చెయ్యద్దు; గంటలు కొట్టద్దు; ధ్వజ స్థంభం ముందు దీపాలు వెలిగించద్దు--మనం ఇవాళ ఓ ప్రత్యేక సందర్భం లో ఇక్కడికి వచ్చాం! మేము చెప్పేవరకూ ఇవన్నీ యెవరూ చెయ్యద్దు--చేసినా ఫలితం వుండదు' అంటూ!  


ఇంకొకాయన మైక్ అందుకొని, 'గోవు' గురించి 'చాలా' చెప్పాడు--ఈ రోజుల్లో గోవులు లేవు--జెర్సీ ఆవులు వున్నా అవి పూజార్హం కాదు--మూపురం వున్న ఆవులే గోవులు--అలాంటి గోవుకోసం అన్వేషణ జరిపితే, ఇక్కడకి మూడు కిలోమీటర్ల దూరం లో ఒకే ఒక చోట ఆ గోవు దొరికింది--దాన్ని తోలుకు వస్తున్నారు ఇక్కడికి--అది వచ్చాక మన కార్యక్రమం ప్రారంభిద్దాం--(ఈ లోపల కురుక్షేత్రం నుంచి బయలుదేరిన యాత్ర, కృష్ణ విగ్రహాలు, మన జిల్లాలో యెవరు యెన్ని రథాలు పంపించారు--ఇలా చెప్పుకు పోతున్నాడు!)  


తరవాతేమయిందో, 'మీరందరూ ఒక్కొక్కళ్ళూ గుడిబయట వున్న వాను కి ప్రదక్షిణం చేసెయ్యండి--అందులో వున్న గోపాలుడు, శ్రీ కృష్ణ పరమాత్మ మిమ్మల్నీ, మీ గ్రామం లోని గోవుల్నీ అనుగ్రహిస్తాడు--తోసుకోకండి, అయిపోయాక లోపలకి వచ్చి, ప్రసాదాలు తీసుకుని మరీ వెళ్ళండీ అని చెప్పి, 'ఓం గోమాత్రే నమహ్' అంటూ చ్హాంట్ అందుకున్నాడు.  


వాన్ చుట్టూ ప్రదక్షిణాలు మొదలై, సగం మంది పూర్తి చేసి, గుళ్ళో ప్రసాదాలకోసం తోసుకుంటున్నారు.  


అంతలో వచ్చారు--(యవరూ? తాతా? అని అడగకండి!)--గోవునీ, గోవత్సాన్నీ తోలుకొంటూ ఇద్దరు మనుషులు--3 కిలోమీటర్ల దూరం నించీ!  


మిగిలిన సగం మంది భక్తులూ వెంటనే, వాన్ ని వదిలేసి, గోవుకి ప్రదక్షిణాలు చేసేస్తూంటే, ప్రసాదాలు తిన్నవాళ్ళు మళ్ళీ బయటికి వచ్చి ప్రదక్షిణాలు మొదలెట్టారు గోవు/వత్సం చుట్టూ!  


యెట్టకేలకు తతంగం పూర్తయి, అందరూ సద్దుమణిగారు--వాన్ వెళ్ళిపోయింది--ఇంకో గుడికో, గ్రామానికో!  


కొసమెరుపేమిటంటే--50 కోట్ల సంతకాల మాటెవరికీ ఙ్ఞాపకం లేదు; యెవరూ అడగలేదు, పెట్టలేదు!  


మహజరు రాష్ట్రపతికి అందుతుందా, ఆవిడ నవ్వుతారా--సీరియస్ గా తీసుకుంటారా, గోవు ప్రత్యేక ప్రాణి అవుతుందా, చట్టం చెయ్యబడుతుందా, '....కేంద్రాలూ', '.....కుటుంబాలూ యేర్పడతాయా?  


వీటన్నిటికీ సమాధానం--వెండితెరపై!