Sunday, May 6, 2012

యజ్ఞమా? యాగమా?.........2



........యెవరికి లాభం? యెంత శాతం?

కృత యుగంలో, ఋగ్వేద కాలంలో "యజ్ఞాలు" జరిగేవి. అప్పటికింకా భూలోక, భువర్లోకాలు యేర్పడలేదు. స్వర్లోకమే వుండేది. దానికి అధిపతి ఇంద్రుడు. ఆయనకి అష్ట దిక్పాలకులూ తోడు. భూలోకం యేర్పడ్డానికి రిహార్సల్ గా, ప్రజాపతులూ, వారి పరివారమూ వుండేవి. అప్పుడే ఋషులు "యజ్ఞాలు" నిర్వహించేవారు. మునులు మౌనంగా తపస్సు చేసుకొనేవారు. 

ఇంద్రుడి ప్రీతి కోసం, ఋక్కులు పఠిస్తూ, హోమాలు చేసేవారు. అలా నూరు యజ్ఞాలు చేస్తే, "ఇంద్రపదవి" పొందచ్చు. అలా చేసినవాళ్లూ వున్నారు.....భంగపడినవాళ్లూ వున్నారు. 

ఈ యజ్ఞానికి "ఆధ్వర్యుడు" (నిర్వహింపచేసేవాడు) వుంటాడు. "ఋత్విక్కులు" ఋక్కులు చదువుతారు. "హోత"లు హోమాలు చేస్తారు. "ఉద్గాతలు" వంతలు. హవిస్సులని, స్వాహాదేవి ద్వారా, అగ్నికీ, అక్కడినుంచి ఇంద్రుడికీ చేర్చేవారు. లోకం సుభిక్షంగా వుండేది. (ఇందులో ఆధ్వర్యుడికి ప్రతిఫలాపేక్ష వుండేదికాదు--యే తొంభై యజ్ఞాలో చేసేవరకూ!)

ఇప్పటికీ, స్మార్తులు అగ్నిహోత్రం లేకుండా నిర్వహించే వ్రతాల్లోనూ గట్రా, మంటపం యేర్పరచి, ఇంద్ర, అష్టదిక్పాలకాది దేవతలని "సాంగం, సాయుధం...."గా ఆవాహన చేసి, స్థాపించి, పూజిస్తారు. 

కృతయుగం చివరిలో, లింగోద్భవం జరిగి, శ్రీమహా విష్ణువు యోగనిద్రలోంచి లేచి, నాభికమలంలోంచి బ్రహ్మ పుట్టి, సృష్టి కొనసాగించడానికి అనుమతులు తీసుకొని, అప్పుడు భూ, భువర్లోకాలు యేర్పడ్డాయి.

బ్రహ్మ సృష్టికి ఆటంకం కల్పిస్తూ, సోమకాసురుడు వేదాలని దాచేస్తే, మత్స్యావతారం యెత్తాడు విష్ణువు.

(కూర్మావతారం, క్షీరసాగర మథనాలూ, అమృతం పుట్టుకా వగైరాలు అందరికీ తెలిసినవే!)

ఆ తరవాత హిర్ణ్యాక్షుడు (వైకుంఠ ద్వారపాలకులు జయ విజయుల్లో ఒకడు) అప్పుడే యేర్పడిన భూమిని చాపచుట్టగా చుట్టేసి, సముద్రం క్రింద ముంచేస్తే, వరాహావతారం యెత్తి, భూమిని పైకి తేల్చినప్పుడు యేర్పడ్డాయి--భరత వర్షమూ, భరత ఖండమూ, మేరువూ, హిమాలయాలూ వగైరా.

(ఈ వ్యాసం పూర్తయ్యాక "అతిమూత్రుల" వ్యాఖ్యలదగ్గరకొస్తాను. ఓపిక పట్టండి.)

......మిగతా మరోసారి.

No comments: