Friday, August 6, 2010

భక్తీ, రక్తీ, విద్యా

గుడీ, బడీ, మధ్యలో మద్యం!?

ఈ మధ్య మన సర్వోన్నత న్యాయస్థానం "దేశ వ్యాప్తం గా, అనుమతిలేకుండా, రోడ్లు, పార్కులు లాంటి బహిరంగ ప్రదేశాల్లో నిర్మించిన 'ప్రార్థనా స్థలాలని' తొలగించడం/వేరే చోటుకు మార్చడం/క్రమబధ్ధీకరించడం పై తమ వైఖరిని స్పష్టం చేయాలి" అంటూ రాష్ట్ర ప్రభుత్వాలని ఆదేశించిందట. 

ఇందుకు నాలుగు వారాల సమయం ఇచ్చిందిట. (కేసు సెప్టెంబర్ 14 కి వాయిదా పడిందట)

ఇంతకు ముందే రాష్ట్రాలు ఈ వివరాలతో కూడిన అఫిడవిట్లు సమర్పించాయట--సుప్రీం వారికి.

వాటి ప్రకారం--తమిళనాడులో అత్యధికంగా 77,450 ప్రా. స్థ. లు బహిరంగ ప్రదేశాల్లో వున్నాయట. రాజస్థాన్ లో 58,253; గుజరాత్ లో 15 వేలూ ఇలా వున్నాయట.

అరుణాచల్ ప్రదేశ్ లో ఒక్కటీ లేదట!

మరి మన రాష్ట్రం యెన్ని అని చెప్పిందో సమాచారం లేదు--మనం యెలాగూ సరైన లెఖ్ఖలు ఇవ్వం కదా!

ఈ లెఖ్ఖకొస్తే--నరసాపురం నించి మార్టేరు వరకూ కేవలం 20 కిలో మీటర్ల దూరం లో, రోడ్డు కీ కాలవకీ మధ్య యెడమ వైపూ, రోడ్డుకి కుడివైపూ కనిపించే, చిన్నా చితకాతో సహా గుళ్ళూ అవీ లెఖపెడితే, 200 కి పైగా వస్తాయి. (ఇంకా ఆయా వూళ్లలో వాటిని లెఖ్ఖ పెట్టకుండానే!--ఇతర మతాలవి కలపకుండానే)

మరి ఈ లెఖ్ఖని, ఒక జిల్లాలోనే, లక్షకి పైగా వుంటాయేమో. 

రాష్ట్ర వ్యాప్తం గా యెన్నో!

వీటికి తోడు, నిర్మాణం లో వున్నవీ, పునరుధ్ధరణ క్రింద వున్నవీ, ప్రాచీనమై అలనా పాలనా లేనివీ కలిపితే, యెన్ని వుంటాయో వూహించుకోండి! 

(ఇంకా వీటిలో రోడ్డు ప్రక్కన వేపా, రావీ మొదలైన చెట్లక్రింద వుంచబడిన--నాగదేవతల, పసుపూ బొట్టూ పెట్టి వుంచబడిన రాళ్ల సంఖ్య పరిగణనలోకి తీసుకోలేదు!)

ఇక వీధికి కనీసం ఐదారు బడులు; కళా శాలలు; ఇతర విద్యాలయాలు వుంటున్నాయి.

'మద్యాంధ్రప్రదేశ్' అని యెంత వెక్కిరించుకున్నా, హిపోక్రసీ లేకుండా మాట్లాడుకుంటే, కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి చెల్లిస్తూ, లక్షల్లో మామూళ్లు ముట్టచెపుతూ, సరుకు కొనుక్కొంటూ, అమ్ముకుంటూ, పదో పరకో లక్షలు సంపాదించుకోవాలనుకొనే మద్య వ్యాపారులు తమ వ్యాపారాలు చేసుకోవాలి కదా?

మరి అడుక్కో గుడీ, బడీ వుంటే, గుడికీ బడికీ సమీపం లో షాపు వుండకూడదంటే--నివాస స్థలాల మధ్య యెలాగూ కుదరదు--వాళ్లు షాపులెక్కడ పెట్టుకోవాలి?

గుడుల విషయంలో--ఎండోమెంట్ వాళ్ల చేతుల్లో వున్న గుళ్లే లెఖ్ఖలోకొస్తాయిట. మరి బళ్లకి యే నిబంధన వుందో!

మరి మన ప్రభుత్వం యెన్ని తొలగిస్తుందో? యెన్ని మారుస్తుందో? యెన్ని మరేదో చేస్తుందో?

4 comments:

Praveen Mandangi said...

నరసాపురం-మార్టేరు రోడ్డు పక్కన కాలువ ఉంది కదా. డ్రైవర్ దేవుని గుడి వైపు తల తిప్పి స్టీరింగ్ నుంచి కాన్సెంట్రేషన్ డైవర్ట్ చేస్తే బస్సు లేదా లారీ కాలువలో పడిపోతుంది.

A K Sastry said...

డియర్ Praveen Sarma!

అందుకే వాళ్లు యేదో ఓ గుడితో వొప్పందానికి వచ్చి, బస్సు ఆపేస్తూ వుంటారు. వాళ్లు దిగి దర్శనం చేసుకొని, బొట్టు పెట్టుకొని మళ్లీ బస్ ఎక్కేలోపల, పళ్లెం లో కుంఖం తో ఓ కుర్రాడు బస్ లో యెక్కి, ప్రయాణీకుల దగ్గర కూడా వసూళ్లు చేస్తాడు.

ఇక మిగిలిన గుళ్ల దగ్గర, కుడి చెయ్యి మాత్రమే గుండెలకి హత్తుకుంటూ, మనస్సులోనే ప్రార్థిస్తారు!

(ఇంకా కాలవలో పడితే, బస్ లో యెవరో పాపాత్ములుండబట్టి గానీ, డ్రైవరుదీ, దేవుడిదీ కాదుగా తప్పు!)

ధన్యవాదాలు.

Praveen Mandangi said...

నేను పాలకొల్లు నుంచి విజయవాడ వెళ్లేటప్పుడు ట్రైన్ లో వెళ్లేవాడిని. మార్టేరు కెనాల్ రోడ్ పక్కన ప్రయాణించిన సందర్భాలు తక్కువే.

A K Sastry said...

డియర్ Praveen Sarma!

ఈ సారెప్పుడైనా బస్సులో వెళ్లి, "ప్రార్థనా స్థలాలని" అన్నిటినీ లెఖ్ఖించి, ప్రచురించండి!

ధన్యవాదాలు!