Tuesday, November 27, 2012

కార్తీక మాసం--"అతి" పవిత్రం



(అతి సర్వత్ర వర్జయేత్!)

2011-12 నూనెల సంవత్సరం (నవంబరు నుంచి మళ్లీ అక్టోబర్ వరకూ) లో మొత్తం "వంటనూనెల" దిగుమతులు 1 కోటీ 19 లక్షల టన్నులకి చేరాయట. ఈ విషయంలో గత "పదేళ్ల" రికార్డులు బ్రద్దలయ్యాయట. 

దేశంలో వాటి ఉత్పత్తి 7 లక్షల టన్నులు తగ్గగా, వినియోగం 8 లక్షల టన్నులు పెరిగి, మొత్తం లోటు 15 లక్షల టన్నులు పెరిగి, దిగుమతులుకూడా అంతమేర పెరిగాయట. 

రాష్ట్రం లో డెయిరీలు "ఆవుపాలు" కొనుగోలు రేటు 2 నుంచి 3 రూపాయలు తగ్గించారట--ఓ రెండు మూడు రోజులు. తరవాత అసలు కొనడమే మానేశారట! యెందుకంటే--పాల నిలవలు యెక్కువయ్యి, డిమాండు లేకపోవడం ట.

ఇంక కార్తీక మాసం పుణ్యమా అని, టీవీ నిండా, పేపర్ల నిండా యే గుళ్లలో యెన్నిదీపాలు వెలిగించారో ఆ వార్తలూ, దృశ్యాలే!

మచ్చుకి--మాజిల్లాలోనే--భీమవరం లో డిసెంబరు 12 న "లక్ష" దీపాలు వెలిగిస్తారట. దానికోసం కొందరు భారీ విరాళాలు ఇస్తూంటే, ఓ తొమ్మిదిమంది 9 నూనె డబ్బాలు విరాళంగా ఇచ్చారట.

బజార్లో వంకాయలూ, బీరకాయలూ సైతం కిలొ 45 దాకా పెరిగాయి. త్వరలో 50 కి చేరినా ఆశ్చర్యపడక్కర్లేదు. "మొన్నటి వార్షాలవల్ల సరుకు రావడంలేదు" అంటున్నారు దుకాణాలవాళ్లు. 

(అన్నట్టు, ఈ మాసంలో చాలా మంది చేపలూ, మాంసాలూ తినడం మానేసి, కూరగాయలే తింటారట. సోమవారాలు ఉపవాసాలు చేసేవాళ్లక్కూడా, చపాతీలకీ వాటికీ కూరగాయలే కావాలి. ఉప్పుడు పిళ్లూ, చప్పిడి పిళ్లూ తినే రోజులు కావు కదా! ఉప్పుడు పిండికి కూడా పప్పుల రేట్లు చుక్కల్లో వుంటున్నాయి.) 

యేలూరులో అయ్యప్ప స్వామిని "వెయ్యి కిలోల" కూరగాయలతో శాకాంబరుడిగా అలంకరించారట ఓ రోజు!

బియ్యం రేట్లు మళ్లీ పెరిగిపోతున్నాయి. సర్కారువారు యేవేవో పథకాలు వేస్తున్నారు--మిల్లర్లు ఇంకా బలిసేందుకు. రేట్లు ఇంకా పెరుగుతాయంటున్నారు.

యేలూరులోనే, శివాలయంలో 100 కిలోలతో "అన్నాభిషేకం" చేశారట!

దీపావళి రోజునా, కార్తీక మాసంలో రోజూనూ, తాటాకులతో "గుమ్మటాలు" చేసి, అందులో "ఉమ్మెత్త" కాయలని సగానికి కోసి, గింజలు తిసేసి, ముచిక భాగాన్ని ఆ గుమ్మటాల్లో గుచ్చి వాటిని చూరుకి వ్రాలాడదీసీ, పై భాగాలని ప్రమిదల్లా నేలమీదా పెట్టి, వాటిలో ఆవు నెయ్యో, ఆముదమో (అదికూడా వంటాముదం కాదు) పోసి, దూది వత్తులు వేసి వెలిగించేవారు. 

అదీ శ్రేష్టమైన పధ్ధతీ, వ్యవహారమూ! 

(అప్పుడు ఆవుపాలు కొనకపోవడమూ, నెయ్యి దొరకకపోవడమూ, వంట నూనెల దిగుమతులు పెరగడమూ వుండవు కదా?)

No comments: