Friday, March 27, 2015

శ్రీరామ నవమి......



శ్రీరాముడూ, సీతాదేవీ.....తలంబ్రాలూ.....-3

ఇంతకీ "ఒంటిమిట్ట"లో సీతారామ కళ్యాణం శ్రీరామ నవమి నాడు కాదండోయ్! ఇవాళే అంకురారోపణ జరిగింది. రేపు ధ్వజారోహణం! పట్టువస్త్రాలు ఇవాళిచ్చేస్తే, వచ్చే "పౌర్ణమి నాడు" జరిగే కళ్యాణం లో వాటిని వుపయోగిస్తారట!!!

సరే.....ఇవన్నీ ఇలా వున్నా, మధ్యలో "పిడకలవేట" లా ఈ "తలంబ్రాల" గోలేమిటీ? దానికి "పరాకాష్టేమిటీ"? ....అంటే......

గత కొన్నేళ్లుగా, కళ్యాణం అయ్యాక తలంబ్రాలు "చిన్న పొట్లాల్లో" భక్తులకి అందిస్తున్నారు అని చెప్పుకున్నాం కదా? క్రితం యేడాది...."ఓ నెల ముందుగానే".....2 క్వింటాళ్ల (200 కిలోల) బియ్యాన్ని పొట్లాల్లో నింపేసి, "తలంబ్రాలు" సిధ్ధం చేసేశారు! ఇదో పరాకాష్ట.

అలాగే, కొన్నేళ్లుగా, తూర్పు గోదావరి జిల్లాలోని ఓ గ్రామం నుంచి...."కో(గో)టి తలంబ్రాలు" పేరుతో, కోటి ధాన్యం గింజలని, కొన్ని రోజులపాటు, కొన్ని వందలమంది, "గోళ్లతో" ఒలిచి, వాటిని కాలినడకన తీసుకెళ్లి, భద్రాచలం గుళ్లో అందిస్తున్నారు! (నిజంగా వాటిని యేం చేస్తున్నారో యెవరికీ తెలీదు.)

ఈ మధ్య ఆ గ్రామం లో ఓ మంచి ముహూర్తం పెట్టించి, పొలం "దున్నడం" మొదలెట్టి, మళ్లీ మంచి ముహూర్తం చూసి, "విత్తనాలు" జల్లి......అలా......చివరికి కాలినడకన.....మామూలే! ఇదో పరాకాష్ట!

ఈసారి, ఓ రెండు వారాలముందే, ఓ మూడు తట్టల్లో, 30 లక్షల గింజల్ని తీసుకెళ్లి అందించేశారు. మిగిలినవి ఇవాళ అక్కడకి చేరి వుంటాయి. ఇంకో విశేషం యేమిటంటే.....ఇంకొన్ని గింజల్ని "ఒంటిమిట్ట" కూడా పంపిస్తున్నారట!

వాళ్లని చూసి, ప గో జి వాళ్లు కూడా కొంతమంది మొదలెట్టారు!

ఇంకా, ఈ మధ్య భీమవరం లొ వుండే బెల్లంకొండ బిందుమాధవ రావు, ఆయన భార్య, బియ్యం గింజలు "ఒక్కోదాని" మీదా శ్రీరామ అని రంగు రంగుల్లో వ్రాసి, మళ్లీ వాటిని శ్రీరామ అనే "ఆకారం" లో పేర్చి, అందించి వచ్చారు. రెండు తట్టలు ఫోటో వేశారు పేపర్లో.....అంటే, ఓ 20 లక్షల గింజలు వుండొచ్చు! ఇదింకో పరాకాష్ట!

అసలు, "క్షుద్రమైన" గోళ్లతో వడ్లు ఒలిస్తే వచ్చే బియ్యం గింజలు "అతి పవిత్రం" యెలా అవుతాయో?

పైగా, భత్తులకి పొట్లాల్లో అందించే "తలంబ్రాలు" యెలా సద్వినియోగం అవుతున్నాయో యెవరికైనా తెలుసా? (ఇంకా కళ్యాణం మొదలెట్టక ముందే పొట్లాలు అందించేస్తారట!). వాటిని ఇళ్లకి తీసుకెళ్లి, పూజామందిరాల్లో పెట్టుకొని, ఓ యేడాదిపాటు పూజించే వాళ్లని కూడా వేళ్లమీద లెఖ్ఖపెట్టచ్చేమో!

మరి, "ఆహార ధాన్యాల వృధా" గురించి యెవరైనా ఆలోచిస్తున్నారా? "యె పి వా ఆ" అని నిర్లిప్తం గా వూరుకుంటున్నారా?

నిజమైన శ్రీరామ భక్తులందరినీ, "ఇవాళ" (సూర్యోదయాత్పూర్వమే అష్టమి వెళ్లిపోయింది. ఇవాళే నవమి!) తన "పుట్టినరోజు" సందర్భంగా, ఆయనే చల్లగా చూస్త్రాడు!

(ఇప్పటికి సమాప్తం)

No comments: