Wednesday, April 27, 2011

అంత్యక్రియలు అనే



హై డ్రామా

సత్యసాయి అంటే నాకు చాలా గౌరవం. 

ఇదివరకోసారి చెప్పాను....పెద్దవాళ్లెవరైనా.....65 యేళ్లు పైబడినవాళ్లు (ఇదే మన దేశం లో ఇప్పటి జీవన ప్రమాణం అనుకుంటా.) యెవరైనా, యేకులం, మతం వాళ్లయినా, ఆడైనా, మొగైనా, వాళ్ల పాదాలని అంటి "మీ ఆశీర్వాదం కావాలి" అని మ్రొక్కుతాను....'మీ ఆయుష్షులో కొంచెం నాకివ్వండి' అనో, 'నా ఆయుష్షులో కొంచెం తీసుకోండి' అనో కాదు.....'మీలాగా నాకు దీర్ఘాయుష్షు ని ప్రసాదిస్తూ ఆశీర్వదించండి' అని. యెందుకంటే వాళ్లు పసివాళ్లతో సమానం. దేవుడి తో సమానం. అలాగే.....సత్యసాయి అయినా, ఇంకెవరైనా. ఆయన్ని దర్శించుకొనే అవకాశాలు వచ్చినా, నేను యెగబడలేదు. 

ఆయన ఆ వయసులోనే ధర్మ కార్యాలు చెయ్యడం మొదలుపెట్టాడు. అంతకు ముందు నేనుకూడా చాలా మందిలాగానే, ఆయన ఓ దొంగ, మోసగాడు, ఇంద్రజాలికుడు అన్నవాణ్నే. ఆ సమయంలోనే ఆయన తాను దేవుణ్ని అని చెప్పుకోవడం మానేశాడు. అందుకనే ఆయనంటే గౌరవం కలిగింది. అది పెరిగింది. 

28 రోజులకి పైగా ఆయన మృత్యువుతో పోరాడటం, దేహ యాత్ర చాలించడం ఒకెత్తు. ఆయన చెప్పినట్టే--(సామాన్యుడికి యెలా అంత్యక్రియలు జరిపిస్తారో అలాగే నాకూ జరిపించండి!)--నిర్వహిస్తాం అని చెప్పిన ట్రస్టు వాళ్లు సర్వమత ప్రార్థనలూ వగైరా నిర్వహించడం బాగానే వుంది. 

కానీ, కుల, మతాచారాల ప్రకరం ఆ పార్థివ దేహాన్ని దహనం చెయ్యకుండా ఖననం చెయ్యడం యెందుకు? పద్మాసనంలో కూర్చోబెట్టాలి అనీ, పడుకోబెట్టే ఖననం చెయ్యాలి అనీ వాదనలెందుకు? (మృతదేహం లో ఒకసారి ‘రిగొర్ మోర్టిస్’ ప్రారంభం అయ్యాక, బిగిసిపోయిన ఆ అవయవాలని ఇష్టం వచ్చినట్టు వంచడం మానవమాత్రులకి సాధ్యమేనా?)

లైవ్ టీవీ కవరేజితో, పంచగవ్యాలతో సంప్రోక్షణా, దశదానాలూ చేయించి, ఆడవాళ్లు చూడకూడదు అంటూ తెరవేసేసి, రెండుగంటలపాటు ఆ తెరలు మాత్రమే చూపించడం యెందుకు? (టీవీ9 లాంటివాళ్లు మొత్తుకొని వుంటారు—కోట్ల విలువైన టీవీ సమయం ఒక్క ప్రకటన కూడా లేకుండా వృథా అయినందుకు!)

తెరలు తీయగానే, గవర్నరూ, ముఖ్యమంత్రీ, తరవాత అందరు నాయకులూ, నాయకమ్మన్యులూ యెగబడిపోయి, సమాధి మీద మట్టినో, విబూధినో జల్లెయ్యడం యేమిటి? (ఇంకా ఆడవాళ్లు యెగబడలేక పోయారు!)

సామాన్య ప్రజలకి ఫలానా టైమునించీ సమాధి దర్శనం మొదలవుతుంది అని ప్రకటించారు. 

ఈ లైవ్ వేషాలు లేకుండా, అసలు తతంగమంతా పూర్తయ్యాక, కావాలంటే ముందు వీఐపీలకీ, తరవాత సామాన్యులకీ సమాధి దర్శనం యేర్పాటు చేస్తే యెంత హుందాగా వుండేది?

సరే లెండి….యెవరి పాట్లు వాళ్లవి!

8 comments:

Anonymous said...

మీరు భలే ఉన్నారే? ట్రస్ట్ వాళ్ళేమైనా టీవీ వాళ్ళని రమ్మన్నారా? లైవ్ చూపించమన్నారా? లేదంటే, ఐపీఎల్ ప్రసార హక్కులు అమ్ముకున్నట్టు, ట్రస్ట్ వాళ్ళేమైనా ఖనన కార్యక్రమ ప్రసార హక్కులు అమ్ముకున్నారా?

Manjusha kotamraju said...

నాకు కుడా ఖనన కార్యక్రమం ఇలాగ Live programme ఇవ్వటం నచ్చలెదు ,,,ఖనన కార్యక్రమం ఆడవాల్లు చూడకుడదు అని తెర కట్టారు ..మరి tv lo live చూపించారు ,,,ఒక్క చన్నెల్ అని కాదు అన్ని చాన్నెల్లు అంతె,,,ఎంతైన మనసు చలిస్తుంది ఇలాంటివి చూస్తె ,,,

Surya said...

hindus lo andaroo dahanam cheyyarandee. udaharanaki maa voollo khananam chestaru. Even my dad was buried when he expired. alage spiritual followers ni sadharananga dhyana mudralo unnatluga samadhi chestaru. ee vaadanalu prati event lonu undeve. kakapote ikkada person important kabatti annee bayataku vastunnayi.

astrojoyd said...

సాదు-సన్యాసులను ఖననం మాత్రమె చేయాలి..అది సాంప్రదాయం..ఇక రిగార్మోర్తిస్ అనేది కేవలం ౧౨-గంటలసేపు మాత్రమె ఉంటుంది.ఆ తర్వాతా కండరాలు మీరు వంచినట్టు వంగుతాయి.

A K Sastry said...

మొదటి వ్యాఖ్యాత అన్నోన్!

ఆ విషయాలేవీ నాకు తెలియదు కానీ, ట్రస్ట్ వాళ్ల అనుమతి లేకుండా ఇవన్నీ జరగవు కదా?

A K Sastry said...

డియర్ Manju!

యేకీభవించినందుకు సంతోషం. ధన్యవాదాలు.

అన్నట్టు, తెరలు వేశాక యే ఛానెల్ కెమెరాలనీ లోపలికి రానివ్వలేదు. అందుకే "ఆ కార్యక్రమాలు" లైవ్ లో రాలేదు.

(ఆడియో మాత్రం కొంచెం వినిపించాయి).

A K Sastry said...

డియర్ Surya!

నేను వ్రాసినది "జనరల్" ఆచారాల గురించి. దానికి కొన్ని మినహాయింపులు వున్నాయి. వుదాహరణకి, "శైవ" మతస్తులని అలా కూచోబెట్టే వుంచి, అలాగే మందిరం లో అంతిమ యాత్ర నిర్వహించి, ఖననం చేస్తారు. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం స్థాపకులు కాశీనాథుని నాగేశ్వర రావు పంతులు గారిని సరిగ్గా అలాగే చేశారు.

కొన్ని కుటుంబాల "ఆనవాయితీ" ప్రకారం, వాళ్ల పొలాల్లోనో, స్థలాల్లోనో ఖననం చేసి, తులసికోటలు కడతారు.

ఇంక, "స్పిరిట్యువల్ ఫాలోయర్స్" ని యెంతమందిని చూశారో కాస్త వివరిస్తే బాగుండేది.

నాకు తెలిసి, ముమ్మిడివరం బాలయోగినీ, జిల్లేళ్లమూడి అమ్మ నీ, భూశయనమే చేసి, దహనమే జరిపించారు.

దీంట్లో "వాదన" యేమి వుంది? ఆయన ముఖ్యుడు కాబట్టే ఇంకా శ్రధ్ధగా చేసి వుండవలసింది కదా?

నా తరవాత టపాలు కూడా చదవండి. ఇంకా మీకు వివరణలు కావాలంటే, ఇక్కడైనా సరే, నాకు మెయిల్ ఇచ్చిగానీ, పొందచ్చు. ఇంకో టపా వ్రాయమన్నా వ్రాస్తాను.

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ astrojoyd!

చాలా కాలానికి మీ వ్యాఖ్య! చాలా సంతోషం. ధన్యవాదాలు.

సాధు-సన్యాసులగురించి, ఆ సంప్రదాయం గురించీ, మీకు తెలిసినవి వ్రాస్తే ఇంకా సంతోషం.

రిగొర్ మోర్టిస్ గురించి నాది కేవలం బుక్ నాలెడ్జ్. డిటెక్టివ్ నవలల్లోనూ, ఇంగ్లీష్ ఫిక్షన్ లోనూ చదివినవి మాత్రమే. మీరు చెప్పినట్టు ఆ ప్రక్రియ 12 గంటల్లోనే పూర్తి అవుతూ వుండవచ్చు.

సైన్స్ ప్రకారం, ఆ ప్రక్రియ పూర్తి అయినా, దేహం "డికే" అవడం ప్రారంభించే వరకూ అవయవాలు వంగవు. ఆ డికే ని కొంతకాలం నిరోధించడానికి డాక్టర్లు కొన్ని మందులూ, కర్పూరం లాంటివి వాడతారు.

నా అనుభవంలో మాత్రం, 48 గంటల తరవాతా, 4 రోజుల తరవాతా కూడా చెడిపోకుండా, అలాగే బిగిసి వున్న దేహాలను చూశాను.

మీకు ఇక్కడ వ్రాయడానికేమైనా అభ్యంతరం వుంటే, మీకు ఆ నిజాలు వివరంగా కావాలంటే, నాకు మెయిల్ చెయ్యండి.

మరోసారి ధన్యవాదాలు.